Wednesday, 12 November 2025

అర్జునుడి మనోవ్యథ

అర్జునుడు శ్రీకృష్ణుడి గురించి ఇంకా జెబుతున్నాడు.వాళ్ళ సాంగత్యము అవినాభావము కదా!శ్రీకృష్ణుడు నాకు అడుగడుగునా సాయపడ్డాడు.ఎన్నని చేప్పేది?ఏమని చెప్పేది?అతని సహాయము తోటేకదా నేను పాశుపతాస్త్రము సంపాదించుకోగలిగింది.దేవేంద్రుని ప్రక్కన అతని సింహాసనముపై కూర్చోగలిగాను అంటే ఆ మహానుభావుడి అనుగ్రహము ఉండబట్టే కదా!ఇంతేనా!కాలకేయులు,నివాతకవచులు,ఇంకెందరో రాక్షసులను సునాయాసంగా చంపగలిగాను అంటే శ్రీకృష్ణుడి మద్దతుతోనే కదా!గోగ్రహణ సమయంలో అయితేనేమి,కౌరవ వీరులైన కర్ణ,దుర్యోధనాదుల తలపాగాలు తెచ్చి ఉత్తరకు ఇచ్చే విషయంలోగాని,మిగిలిన అన్ని విషయాలలోనూ అతని ఆశీర్వాదము ఉండబట్టే కదా! అసలు ఇవవ్నీ ఒక ఎత్తు,కురుక్షేత్ర యుద్థమప్పుడు రథసారధిగా నాకు తోడుగా ఉండటం ఇంకో ఎత్తు!అసలు నేను వేసే బాణాలు శత్రువుల గుండెలు చీల్చేలోపే తన దృష్టితోనే వాళ్ళను నిర్వీర్యులను చేసేవాడు.అతడు అత్యుత్తమ రధసారథి కాబట్టే శత్రువులు సంథించే ఏ ఒక్క బాణం కూడా నా దరిదాపుల్లోకి వచ్చేది కాదు.యుద్ధమున సైంధవుడిని చంపే సమయంలో నా మాన ప్రాణాలను కాపాడింది ఆ మహనీయుడే కదా! అసలు అతనికి నేనంటే ఎంత ప్రేమ!దానిని అసలు వెల కట్టలేము.ఒకప్పుడు ఏమో సఖా అంటాడు.ఇంకో సారి మిత్రుడా అని సంబోధిస్తాడు.మరింకోసారి ఏమోయ్ బామ్మరిదీ అని కేక వేస్తాడు.ఎన్ని మంచి అనుభూతులు అతని సాంగత్యంలో!బంధుత్వాన్ని పాటిస్తాడు.దాతఅయి దానమిస్తాడు.మంత్రి అయి మంచి సలహాలు,ఆలోచనలు చెప్తాడు.ఒకసారి సరిసాటిలాగా ఆటలాడతాడు.ఇంకోసారి తమాషాలు,ఎకచకాలు పడతాడు.ఎక్కిరిస్తాడు.ఎగతాళి చేస్తాడు.గేలి చేస్తాడు.గౌరవము కాపాడుతాడు.నా పక్కపైనే పడుకుంటాడు.ఇద్దరిదీ ఒకే మంచం ఒకే కంచం లాగా కలసిపోయాము చిన్నతనం నుంచి.నేనేదైనా తప్పుచేస్తే తండ్రిలాగా క్షమిస్తాడు.సుద్దులు,బుద్ధులు చెబుతాడు.నాతోటే కలసి అన్నం తింటాడు.నాకు అతనితో గడిపిన ప్రతి క్షణం మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నది.

Tuesday, 11 November 2025

దుర్వాసుడు శాపం తృటిలో తప్పింది

అర్జనుడు కృష్ణుడి సహాయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు. అన్నా!నీకు గుర్తు ఉందా!మనము అప్పుడు వనవాసము చేస్తూ ఉన్నాము.దుర్యోధనుడు మనలను అవమానించేదానికి ఒక పథకం వేసాడు.దుర్వాస మహామునిని ప్రేరేపించి మన దగ్గరకు పంపాడు.అతడు తన శిష్యులు చాలా మందితో వచ్చాడు.అప్పటికే మన భోజనాలు అయిపోయి ఉన్నాయి.వాళ్ళకందరికీ భోజన సదుపాయాలు చేయమని అడిగాడు.మన దగ్గర అంత మందికి,అప్పటికప్పుడు భోజన సదుపాయం చేసేదానికి ఆహార వస్తువులు లేవని ఖచ్చితంగా తెలిసే అడిగాడు.ద్రౌపది సరే అనింది.దుర్వాసుడు సరే!మేమంతా స్నానంచేసి వచ్చేలోపల అంతా తయారు చేయండి.పెడతానని పెట్టకపోతే శపిస్తాను అని భయపెట్టాడు. అప్పుడు ద్రౌపదికి దిక్కుతోచలేదు.దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు కదా!ఆమె శ్రీకృష్ణుడిని ప్రార్థించింది.అప్పుడు ఆయన వచ్చి వంట పాత్రలలో అడుగున మిగిలిన ఒకటి రెండు మెతుకులు తిన్నాడు.వెంటనే ఆ పాత్రలు అన్నీ ఆహార పదార్థాలతో నిండి పోయాయి. దుర్వాసుడు తన శిష్యులు అందరితోటి వచ్చి భోజననానికి కూర్చున్నాడు.వాళ్ళు ఎంత తింటున్నా పదార్థాలు తరగకుండా ఉన్నాయి.అందరూ కడుపారా తిని,తృప్తిగా వెళ్ళారు.ఆ ముని శాపం నుండి మనలను అప్పుడు రక్షించింది ఆ మహానుభావుడే!అంటూ అర్జునుడు ధర్మరాజు శ్రీకృష్ణుని తలచుకున్నారు.

Saturday, 8 November 2025

శ్రీ కృష్ణుని నిర్యాణము

ధర్మరాజు ఈ దుశ్శకునాలకు భయపడుతూ ఉన్నాడు.అర్జునుడు ద్వారక నుండి వచ్చాడు.అతని ముఖం వాడిపోయి దీనంగా ఉంది.రాగానే అనినకాళ్ళపైన పడ్డాడు.ధర్మరాజుకు ఇంకా భయమేసింది ఏమైందోనని.పెద్దగా అడిగాడు. అర్జునా!ఏమైంది.మన తాతగారు,మేనమామ,మేనత్తలు బాగున్నారా?అక్రూరుడు,కృతవర్మ,ఉగ్రసేనుడు కుశలమే కదా?ప్రద్యుమ్నుడు,అనిరుద్ధుడు క్షేమమే కదా?శ్రీకృష్ణుడు క్షేమమే కదా!ఎందుకింత దిగులుగా ఉన్నావు? నీవు మానసికంగా చాలా ధృఢంగా ఉండేవాడివి.పంది కారణంగా ఘోరమయిన అడవిలో శివుడుతో పోరాడినప్పుడు కూడా తడబడలేదు.కాలకేయులను యుద్ధంలో సంహరించినప్పుడు కూడా ఆవగింజంత కూడా బెదరలేదు.కౌరవులను కాపాడేదానికి గంధర్వులతో పోరు సల్పినపుడు కూడా చలించలేదు.అట్లాంటి నీకళ్ళలో ఆనీరు ఏంది?ఎవరిచేతిలో అయినా ఓడిపోయావా?సాధు సజ్జనులను దూషించావా?వీరుల మధ్య అవమానముపాలు అయ్యావా?ఏమి జరిగిందో తొందరగా చెప్పు. ఆడిన మాట ఏమైనా తప్పావా?ఎక్కడ అయినా తప్పుడు సాక్ష్యం చెప్పావా?ఎవరైనా శరణార్థులు నీ దగ్గరికి వస్తే కాపాడకుండా వదిలివేసావా?కారణం ఏంది? అర్జునుడు ఆగని కన్నీరును తుడిచే దానికి విఫలయత్నం చేసాడు.గొప్ప నిధిని పోగొట్టుకునినట్లు మొహం గంటు పెట్టుకున్నాడు.జీరబోయిన గొంతుతో ఇలా చెప్పాడు. అన్నయ్యా!ఈ నోటితో ఏమని చెప్పేది.మనకు సారథి,మంత్రి,బావ,మిత్రుడు,బంధువు,ప్రభువు,గురువు,దేవుడు,సర్వమూ,సమస్తమూ అయిన శ్రీకృష్ణుడు మనలను అందరినీ ఏకాకులను చేసి,విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. మనకు ఎంత చేసాడు!మనకు ఆయన చేసిన సహాయాలు ఒకటా రెండా!సవాలక్ష!మత్స్య యంత్రము నా చేత కొట్టించి ద్రౌపది మనకు దక్కేలా చేసాడు.శ్రీకృష్ణుడి ఊతం లేకపోతే నేనొక్కడినే ఇంద్రుడిని ఎదిరించి ఖాండవ దహనము చేయగలిగేవాడినా?అతని అనుగ్రహము తోటే కదా మనము ఇంత మంది రాజులను జయించి ఇంతింత ధనము సంపాదించింది!మయుడు నిర్మించిన సభాభవనము మనకు అతని దయ వల్లనే కదా దక్కింది.మనము రాజసూయయాగము సంపూర్ణం చేసేదానికి ఆయనే కదా ఆయువు పట్టు! ఇంతెందుకు?దుష్టులు అయిన కౌరవులు ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభకు ఈడ్చి వస్త్రాపహరణం చేసినప్పుడు,ఆమె మానసంరక్షణ చేసింది అతనే కదా!ఆమెకు ధైర్యము చెప్పి,ప్రతిజ్ఞ చేసి,శత్రుసంహారం చేసేదానికి ఆయన అనుగ్రహమేకదాకారణం! ఇలా అర్జునుడు అన్నయ్య దగ్గర వాపోయాడు.

Thursday, 6 November 2025

ఎటు చూసినా దుర్నిమిత్తములు

ధర్మరాజుకు మనసు కుదురుగా అనిపించడం లేదు.అన్నీ చెడ్డ శకునాలు కనిపిస్తున్నాయి.మనసు కీడు శంకిస్తూ ఉన్నది.భీముడితో తన మనసులోని గుబులు బయటపెట్టుకుంటున్నాడు. భీమా!నారద మహర్షి వచ్చి వెళ్ళాడు కదా!అతను చెప్పినట్లు కాలం మారుతున్నట్లు అనిపిస్తుంది.పంటలు సరిగ్గా పండటం లేదు.రాబడి క్షీణిస్తున్నది.జనబాహుళ్యం కామక్రోధాలకు లోనవుతున్నారు.చాలా తేలికగా నోటి వెంట అసత్యాలు పలుకుతున్నారు.ఇతరులను మోసగించడం దినచర్యగా మారుతున్నది.ఎక్కువ మంది అధర్మ మార్గాన్నే ఎంచుకుంటున్నారు.కాగడా పెట్టి వెతికినా మోసములేని వ్యవహారము,కపటంలేని ప్రేమ,స్నేహము కనిపించడం లేదు.మొగుడూ పెళ్ళాలు కూడా అస్తమానమూ గొడవలు,కలహాలు పెట్టుకుంటున్నారు.కొడుకులను చూస్తే,ఏకంగా తండ్రులను చంపేదానికి ఉరుకుతున్నారు.శిష్యులు పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా గురువులనే దూషిస్తున్నారు.చదువు కున్నవారికి విచక్షణ,విశ్లేషణ ఉండాలి సహజంగా.కానీ అలా చదువుకున్నవారు కూడా న్యాయము విడిచి తప్పుదోవలో నడుస్తున్నారు.కాలం మరీ ఇంత విపరీతంగా మారుతుందని అసలు నేను ఊహించలేదు. మన వ్యవహారానికి వస్తే,అర్జునుడు ఇంకా ఇంటికి రాలేదు.ద్వారకకు పోయి ఏడు నెలలు కావస్తుంది.యాదవులు ఏమో చపలచిత్తులు.ఎప్పుడూ కోపతాపాలకు బానిసలు అయి ఉంటారు.ఇప్పుడు సవ్యంగా ఉన్నారో లేదో?శ్రీకృష్ణుడు సుఖ సంతోషాలతో ఉన్నాడో,లేడో?నాకు మనసు అంతా కకలావికలంగా ఉంది.మనసు స్థిమితంగా లేదు.ఇదీ అని కారణం ఏమీ లేదు. నాకు వ్యాకులతగా ఉంది.నాకు చాలా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి.ఒక కుక్క నాకు ఎదురుగా నిలబడి మోర ఎత్తి మొరుగుతున్నది.ఒక నక్క నోట మంటలు గ్రక్కుతూ,సూర్యుడికి అభిముఖంగా నిలుచుకుని విచారంగా ఊళ పెడుతున్నది.గద్దలు,కాకులు ...ఎప్పుడూ లేని విథంగా గుంపులు గుంపులుగా బారులు తీరి కనిపిస్తున్నాయి.గుర్రములు కంట నీరు పెడుతున్నాయి.ఏనుగులలో సహజంగా కనిపంచే మదము అసలు కానరావడం లేదు.పావురం శాంతికి చిహ్నం కదా!కానీ నా కళ్ళకు యమదూతలాగా కనిపిస్తున్నది.నిత్యము హోమాగ్ని ప్రజ్జ్వలనము అయే చోట అసలు మండటం లేదు.దిక్కులూ,మూలలూ పొగ నిండిపోతున్నది.సూర్యుడి తేజస్సు తగ్గింది.భూమి కంపిస్తూ ఉంది.గాలి సుడులు తిరుగుతూ దుమారం రేగి ఆకాశాన్ని కప్పి వేస్తున్నది.నీటిని వర్షించాల్సిన మేఘాలు రక్తాన్ని వర్షిస్తున్నాయి.ఎవరి స్థానంలో వారు ఉండాల్సిన గ్రహాలు పోట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది.అకాలంగా పిడుగులు పడుతున్నాయి.భూమి క్రింద నుండి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి.భూమి ఆకాశాల మధ్య భాగము అగ్నికీలలతో నిండినట్లు భయం కొలుపుతుంది.దూడలు పాలు తాగటం లేదు.పోనీ అవి వెళ్ళినా ఆవులు వాటికి పాలు ఇవ్వటం లేదు.ఆలయాల్లో ఉండాల్సిన విగ్రహాలు బయట తిరుగుతున్నాయి. భీమా!ఇదంతా నాభ్రమనా?లేక నిజంగా జరుగుతుందా?నాకేమీ పాలు పోవటం లేదు.మొత్తానికి చాలా అసంతృప్తిగా,అసహనంగా,అలజడిగా ఉంది. ఈ ఉత్పాతాలు అన్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది.భూదేవికి ఇంక శ్రీకృష్ణుడిని సేవించే భాగ్యము లేదేమో అనిపిస్తుంది.

Wednesday, 5 November 2025

ధృతరాష్ట్రుడు గాంధారి గతించుట

ఆ తరవాత నారదుడు తుంబురుడితో కలిసి ధర్మరాజు దగ్గరకు వచ్చాడు.ధర్మరాజు తన తమ్ముళ్ళతో ఎదురేగి అతనిని స్వాగతించాడు.అతనిని తగు రీతిన పూజించాడు. ధర్మరాజు నారదుడిని ఇలా అడిగాడు.ఓ నారద మునీంద్రా!నీవు త్రిలోక సంచారివి.త్రికాలజ్ఞుడివి.నీకు తెలియని దంటూ ఏమీ లేదు.నా తల్లిదండ్రులు అయిన ధృతరాష్ట్రుడు గాంథారి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు.వారు ఎక్కడకు పోయి ఉంటారో తెలిపేది. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు.ఓ రాజా!సర్వమూ ఈశ్వర జనితము,పరమేశ్వరమయము.భగవంతుడే మనుష్యులను కలుపుతూ ఉంటాడు.అలానే వేరుచేస్తూ ఉంటాడు.ఆయన లీలలు ఎవరికీ అర్థం కావు.దీనికి మనమెవ్వరమూ చింతించాల్సిన పనిలేదు.ఒకడిని కొండచిలువ మింగింది అనుకో!అతడు వేరే వాళ్ళను రక్షించగలడా?తనను తానే రక్షించుకోలేడు!అలాగే నిత్యమూ మోపలేని బాధలను అనుభవించే ఈ శరీరము వేరే వారిని ఎలా రక్షిస్తుంది?సకల చరాచర సృష్టిని ఒక మహాశక్తి తన చెప్పుచేతలలో పెట్టుకుని ఆడిస్తుంది.మనము ఆటబొమ్మలము,తోలు బొమ్మలము...అంతే! కానీ సగటు మానవుడు సదా మాయలో కప్పబడి ఉంటాడు కదా!కాబట్టి ఈశ్వరుని లీలా వినోదం అర్థం కాక,అర్థం చేసుకోలేక కష్టాలు పడుతుంటారు.అజ్ఞానములో పడి మన వారికి ఏమైందో,ఏమో అని పరితపిస్తూ ఉంటారు. ధర్మరాజా!అజ్ఞానపు సుడిగుండాలనుంచి బయటపడు.దిగులు,విచారము ప్రక్కన పెట్టు.కాలము చాలా శక్తివంతము అయినది.దానిని తప్పించడం ఎవరి వల్లా కాదు. ఇంక మీ వాళ్ళ గురించి చెబుతాను విను.ధృతరాష్ట్రుడు,గాంథారిలతో పాటు విదురుడుకూడా ఉన్నాడు.వారు ముగ్గురూ హిమాలయాలలోని దక్షిణభాగము వైపు వెళ్ళారు.అక్కడ ఒక తపోవనము చేరుకున్నారు.సప్తమహర్షుల సంతోషము కోసరము గంగానది అక్కడ ఏడు పాయలుగా చీలి,ప్రవహిస్తుంది.ధర్మరాజు ఆ పుణ్యతీర్థములో స్నానము చేసి,యధావిధి హోమములు చేసాడు.ఆ పుణ్యతీర్ధము జలమును తాగాడు.కర్మములను అన్నింటినీ వదిలి పెట్టాడు.నీరు,ఆహారము వదిలి పెట్టాడు.పర్ణశాలలోని ఉచితాసనము పై కూర్చుని,భగవంతుని ధ్యానములో పరిపూర్ణమై ఉన్నాడు.ఈ రోజు నుంచి ఏడురోజుల తరువాత యోగాగ్నికి శరీరాన్ని ఆహుతి ఇస్తాడు.గాంధారి కూడా భర్తతో పాటు అగ్ని ప్రవేశము చేస్తుంది.వారి మరణము తరువాత విదురుడు తీర్థయాత్రలకు వెళతాడు. ఈ విషయము చెప్పి నారదుడు,తుంబురుడితో కలసి స్వర్గలోకమునకు బయలుదేరాడు.

Tuesday, 4 November 2025

ధృతరాష్ట్రుడు గాంధారిల వానప్రస్థము

విదురుడు చెప్పిన మాటలు ధృతరాష్ట్రుడి బుర్రకు ఎక్కాయి.ముక్తి కావాలంటే రక్తి వదులుకోవాలి అనే సూక్ష్మం అర్థం అయింది. ధృతరాష్ట్రుడు రాజగృహము వదలి హిమవత్ ప్రాంతానికి బయలుదేరాడు.గాంథారి కూడా భర్త వెంట పయనమయింది.భర్తకోసము అస్వాభావికంగా అంథత్వము స్వీకరించిన మహా ఇల్లాలు.విదురుడు వారికి దారి చూపుతూ ముందుకు సాగాడు. ధర్మరాజు రోజూ ప్రాతఃకాలమున లేచి సంధ్యావందనము చేసుకుంటాడు.నిత్య హోమము పాటిస్తాడు.బ్రాహ్మణులకు దానములిస్తాడు.తరువాత పెద్దల దగ్గరకు వచ్చి నమస్కరిస్తాడు.వారి మంచి చెడ్డలు కనుక్కుంటాడు.అలా ఆరోజు కూడా దైనందిన కార్యక్రమాలు అన్నీ చూసుకుని ధృతరాష్ట్రుడి మందిరానికి వచ్చాడు.పెద్దమ్మ,పెద్దనాన్నలు కనిపించలేదు.సంజయుడు ఒక్కడే కూర్చుని ఉన్నాడు.అతనిని మందల అడిగాడు ఓ సంజయా!మా తల్లిదండ్రులు కనిపించడం లేదేమి?ఎక్కడకు పోయి ఉంటారు.మా తండ్రికి కళ్ళుకూడా కనిపించవు కదా!మా తల్లి ఏమో ఎప్పుడూ పుత్రశోకంతో దుఃఖిస్తూ ఉంటుంది.అయినా వాళ్ళు ఎక్కడికి పోగలరు?ఇంకెక్కడికి పోతారు?అసలు విదురుడు కూడా కనిపించడం లేదేంటి? ధృతరాష్ట్రుడికి తాను చేసిన తప్పులు అన్నీ అవలోకనం చేసుకున్నాడా?ఆ దిగులుతో భార్యతో కలిసి గంగలో దూకి ప్రాణత్యాగానికి పాల్పడ్డాడా? మా చిన్నతనంలోనే మానాన్న పోయాడు.అప్పటినుంచి వీరే మమ్ములను చేరదీసారు.మా ఆలనాపాలన అంతా వారే చూసారు. ఇంతకీ ఈ ముగ్గురూ ఎక్కడికి పోయుంటారు? సంజయుడికి కూడా దుఃఖముతో నోట మాట రావటం లేదు.సంజయుడే వాళ్ళను కాపాడుకుంటూ వస్తున్నాడు.కొంచెం సేపటికి చిన్నగా మాట్లాడటం మొదలు పెట్టాడు. హే రాజా!మామూలుగా మీ తండ్రి అన్ని విషయాలు నన్ను అడుగుతుంటాడు.ఆయనకు అన్ని వార్తలు చెబుతుంటాను.కానీ నిన్న రాత్రి ఎందుకో ఏమీ అడగలేదు.ఇప్పుడు వచ్చి చూస్తే ఎవరూ లేరు.ముగ్గురూ నా కళ్ళు గప్పి రాత్రిపూట వెళ్ళినట్లున్నారు.వారు ఏమని నిర్ణయించుకున్నారో,ఎక్కడికి పోయారో నాకు అవగతమవటంలేదు.

Saturday, 1 November 2025

విదురుడు సలహా ధృతరాష్ట్రుడికి

ధర్మరాజు దేశాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు.మనుమడు అయిన పరీక్షిత్తు ముద్దూ ముచ్చట్లు చూసి మురిసిపోతున్నాడు.ధృతరాష్ట్రుడు,గాంథారీలను గౌరవంగా,మర్యాదా,మన్ననలకు లోటురాకుండా అభిమానంగా చూసుకుంటూ ఉన్నాడు. విదురుడికి ధృతరాష్ట్రుడి పరిస్థితి దీనంగా అనిపించింది.ఉండబట్టలేక ఒకరోజు ధృతరాష్ట్రుడి దగ్గరకు పోయి హితవు చెప్పాడు. ఓ రాజా!నీవు కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నావు.ముసలితనము ఎప్పుడో పైన పడింది.అయినా నీలో దుగ్ధ చావలేదు.కాలము సమీపిస్తుంది అనే ధ్యాసే లేకుండా బ్రతుకుతున్నావు.ఏమైనా చూద్దామూ అంటేనా పుట్టు గ్రుడ్డివి.ఈ ముసలి మొప్పందాన ఏమి భోగాలు అనుభవించ గలవు?శూన్యం!నా అనే వాళ్ళు ఎవరూ మిగలలేదు.అందరూ యుద్ధంలో తుడిచి పెట్టుకుని పోయారు.మీ భార్యా భర్తలు ఇద్దరూ అంతు లేని దుఃఖంలో మునిగి ఉన్నారు. నీకొడుకులు దుష్టులు.పాండవులు ఉన్న ఇంటికి నిప్పు పెట్టారు.ద్రౌపదిని వస్త్రాపహరణకు గురిచేసి అవమానించింది నీ సు(కు)పుత్రులే.కుయుక్తులతో పాండవులను అడవులపాలు చేసారు.ఇంత దరిద్రంగా నీ బిడ్జలు వాళ్ళను సాథిస్తుంటే నీవు కిమ్మనకుండా కూర్చున్నావు అప్పుడు.ఇప్పుడు వాళ్ళ పంచనే పడి మీరు బ్రతకడం నాకు నచ్చటంలేదు.అది పద్థతి కూడా కాదు అనిపిస్తుంది. భీముడికి నోటి దురుసు ఎక్కువ.ఈ ముసలోళ్ళు మన నెత్తి మీద పడ్డారు.వాళ్ళ ముఖాన నాలుగు మెతుకులు కొట్టండి అని మాట్లాడుతున్నాడు.ఇన్ని అవమానాలు పడుతూ,వారి పంచనే ఉండి వాళ్ళు ఈసడించుకుంటూ పెట్టే పిండం కోసము ఎదురు చూస్తున్నావు పూటపూటకి.ఎందుకింత ఆశ?ఇంకా ఏమి సాథించాలని?ఏమి అనుభవించాలని?నీకు ఏమైనా ఇంకా బిడ్డలను కనాలని ఆశ ఉందా?మనుమల ముద్దుమాటలు వింటూ మురిసిపోగలవా?నీదంటూ ఏమి మిగలనప్పుడు దానధర్మాలు చేయగలవా?ఇంత వయసు వచ్చినా ఈ దేహము శాశ్వతము కాదనే నగ్న సత్యాన్ని ఇంకా తెలుసుకోలేకపోతే ఎలా? ఇంకన్నా ఈ శరీరం పైన మోహము వదులుకో.ఇల్లు విడిచి,ముని వృత్తిని అవలంబించు.మోక్ష ప్రాప్తి కోసం ఇకనైనా అడుగులు వెయ్యి.