Monday, 2 March 2026

ఉద్ధవుడి ప్రత్యుత్తరము

విదురుడు అన్ని ప్రశ్నలు ఒకదాని తరువాత ఇంకొకటి,శర పరంపర లాగా వేసాడు.కానీ ఉద్ధవుడి నోటి నుంచి మాట రావడం లేదు.ఎందుకంటే అతను కృష్ణుని పోగొట్టుకునిన దుఃఖం నుంచి ఇంకా బయట పడలేదు.పైగా విదురుడు వారి క్షేమ సమాచారం అడగడంతో ఇంకా పొంగి పొరలు పొరలుగా ఏడుపు ముంచుకొచ్చింది. శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుతో ఇలా అంటున్నాడు.ఓ రాజా!ఉద్ధవునికి శ్రీకృష్ణుని పైన అలవిమాలినంత ప్రేమ.అది తెలియని వారు ఎవరూ ఉండరు.ఉద్ధవుడికి ఒక రకంగా కృష్ణుడు అంటే పిచ్చి ప్రేమ అని చెప్పవచ్చు.ఎందుకంటే అతను ఏడు ఏండ్ల బాలుడుగా ఉన్నప్పుడు తన తోడి బాలురలో ఒకడిని కృష్ణునిగా భావించేవాడు.అతనికి సేవలు చేసేవాడు.వాళ్ళ అమ్మ అన్నానికి పిలిచినా చెవికెక్కించుకున్వాడు కాదు.అట్లాంటి ఉద్ధవుడు విదురునికి సమాథానం చెప్పక పోవడంలో ఆశ్చర్యము ఏ మాత్రమూ లేదు.ఎందుకంటే కృష్ణుని వియోగము తట్టుకోవడం అతనికి చేతకావటం లేదు. అయినా ఉద్ధవుడు చిన్నగా తమాయించుకున్నాడు.కానీ గొంతు దుఃఖముతో బొంగురుపోయింది.ఆ గద్గద స్వరంతోటే చెప్పడం ప్రారంభించాడు.అయ్యా!విదురా!నా నోటితో ఏమని చెప్పేది?లోకరక్షకుడు,లోకబాంథవుడు అయిన శ్రీకృష్ణుడు అస్తమించాడు.భూదేవి దురదృష్టము ఏమని వర్ణించాలి?యాదవులు,వారి రాజ్యము నాశనము అయింది.ధర్మము మట్టి కొట్టుకుని పోయింది.అధర్మము ఊడలు దిగి పటిష్టమయిపోయింది.దానిని పెకిలించేవారు ఇంకెవరూ లేరు.మంచీ,మర్యాదా,మన్ననలు దారి తప్పి ఎటు పోయాయో అర్థం కావడం లేదు. ధర్మరాజు రాజసూయయాగమపుడు శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇచ్చినపుడు లోకాలన్నీ అతని కీర్తినీ,ధర్మనిష్టనీ శ్లాఘించారు కదా!బ్రహ్మ సృష్టికి ఇతనే మూలపురుషుడు అని ఆకాశానికి ఎత్తారు కదా!దుష్టుల విషయంలో అతని కనుబొమలు కోపంతో ముడిపడితేనే భూదేవి భారం సగం తగ్గిపోతుంది కదా!నిర్మల స్వరూపుడు అయిన అతనిని ఏమరుపాటున కూడా ఎవరూ మరువలేరు.శ్రీకృష్ణుడు ఉగ్రసేనుడిని రాజుని చేసాడు.అతని క్రింద భృత్యుడుగా సంతోషంగా సేవలందించాడు.పూతన అతనిని చంపేదానికి వచ్చిన రాక్షసి.కానీ ఆమెకు యశోదా దేవికి కూడా దక్కని ఉన్నత స్థానం ఇచ్చాడు కదా!శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువే అవుతుంది.ఆయన లీలలు అమోఘం!