Wednesday, 4 March 2026
శ్రీకృష్ణుని లీలలు
విదురుడు శ్రీకృష్ణుని నిర్యాణము,యాదవుల నిర్యాణము తెలుసుకుని చాలా దుఃఖించాడు.కొంచెం సేపటికి తేరుకున్నాడు.ఉద్ధవుడిని ఇలా అడిగాడు.స్వామీ!మీరు కృష్ణుడు భక్తులకే కాకుండా క్రూరులగు రాక్షసులకు కూడా పరమపదము ఇచ్చాడు అని చెప్పారు.అది ఎంత మటుకు సమంజసము?అది తప్పు కదా!
దానికి ఉద్ధవుడు సమాథానం చెప్పనారంభించాడు.విదురా!ఆ రాక్షసులు అందరూ శ్రీకృష్ణుని ఎదిరించారు.నిజమే!కానీ అంత్యకాలంలో శ్రీబరిని చూస్తూ,హరీ!అని పిలుస్తూ ప్రాణాలు వదిలారు.కాబట్టి వాళ్ళకందరికీ కూడా మోక్షము లభించింది.అతని చేతుల్లో పోవడం వాళ్ళు చేసుకున్న పుణ్యం,అంతే!
నీకు నేను శ్రీకృష్ణుని పుట్టుక,చరిత్ర టూకీగా చెబుతాను విను.బ్రహ్మాది దేవతలు భూభారం తగ్గించమని శ్రీహరిని ప్రార్థించారు.సరే అని ఆయన దేవకీ వసుదేవులకు పుత్రుడుగా జన్మించాడు.దేవకీ వసుదేవుల అష్టమ గర్భాన తనను చంపేవాడు పుడతాడని తెలిసి కంసుడు తన సోదరి బావలను చెరలో పెట్టాడు.కృష్ణుడు చెరసాలలోనే పుట్టాడు.వసుదేవుడు బిడ్డను కాపాడుకునే ప్రయత్నంగా నందుడి ఇంట్లో అర్థరాత్రి వదలిపెట్టి వచ్చాడు.పదకొండు ఏళ్ళు వచ్చేదాకా కృష్ణుడు బలరాముడితో కలసి నందుని ఇంట్లో పెరిగాడు.ఆ సమయంలో అతను శ్రీహరి అని ఎవరికీ అనుమానం రాకుండా జాగరూకత పాటించాడు.తోటి గోపాలకులతో అడవికి వెళ్ళి ఆవులు మేపుకుంటూ సరదా సరదాగా బాల్యం గడిపాడు.వేణుగానం చేస్తూ అందరి మనసులు చూరగొన్నాడు.మథ్య మథ్యలో కంసుడు పంపే రాక్షసులను తనకు తగిన రీతిలో హతమారుస్తూ కాలం గడిపాడు.కాళింది మడుగులో నీటిని విషపూరితం చేస్తున్న కాళియ సర్పాన్ని అక్కడ నుంచి తరిమి వేసాడు.ఇంద్రుడు తనకు పూజలు చేయలేదని ఆగ్రహించి గోపాలకుల పైన రాళ్ళ వాన కురిపించాడు ఏడు రోజులు.అప్పుడు కృష్ణుడు గోవర్థన పర్వతాన్ని తన చిటికెన వ్రేలుపై నిలిపి ఊరి వారందరినీ దాని క్రింద ఉంచి రక్షించాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment