Saturday, 22 August 2026

జ్ఞాన భిక్ష కోరిన బ్రహ్మ

బ్రహ్మ ఆనందానికి అవథులు లేకుండా ఉన్నాయి.పరమాత్ముడి దర్శనంతో దశ,దిశ తిరిగిపోయిందని భలే సంతోషిస్తున్నాడు.భగవంతుడిని చూసిన ఆ క్షణం మళ్ళీ మళ్ళీ తలచుకుని,పులకరించిపోతున్నాడు.ఇంకా ఇలా పొగుతున్నాడు.కానీ అవన్నీ పచ్చి నిజాలే!అతిశయోక్తులు ఏమాత్రమూ కావు.హే పరంథామా!ఓ పరాత్పరా!నీ పాదపద్మములు సేవించే భాగ్యము కలగడం పెద్ద అదృష్టం!ఆ భాగ్యము కలిగితే,ఇంక భయానికి తావు లేదు.శోకానికి అవకాశం లేదు.ముక్తి మార్గానికి మనకు అనుమతి,ఆమోదము లభించినట్లే!స్వామీ!కొందరు మూర్ఖులు ఉంటారు.వారు నీ నామస్మరణ చేయకుండా సమస్త పాపాలనూ మూటగట్టుకుంటారు.తప్పు దారిలో పోతారు.ఇంద్రియ నిగ్రహము లేకుండా అమంగళ కార్యములు చేస్తారు.ఎంత సేపూ క్షుత్పిపాస దుఃఖము ...అంటే ఆకలి దప్పులతో బాధపడుతుంటారు.మానవుడు తను వేరు,ఆత్మ వేరు,ఆత్మ వేరు పరమాత్మ వేరు..।నేను నేనే...నువ్వు నువ్వే...అనుకునేటంత కాలమూ సంసారమనే సాగరాన్ని దాటలేడు.ఎక్కడికక్కడ మునకలు వేస్తుంటాడు.మనిషి యోగమార్గాన్ని ఆశ్రయిస్తే కానీ పరమపురుషుని పాదారవిందములు కానలేడు.నిష్కామ భక్తులకు భగవంతుడు ప్రసన్నుడు అయినట్టు దేవతలను కూడా కాడు.నీ నామ స్మరణతోటే మానవుడికి జన్మ జన్మల పాపాలు నాశనం అయిపోతాయి.మోక్షము పొందుతాడు. ఓ దేవ దేవా!కల్పాంతమున పద్మము నందు ఉద్భవించిన నేను నీ స్వరూపము కనుక్కోవాలని ఉబలాట పడ్డాను.ఎన్నో ఏళ్ళు తపస్సు చేసాను.చాలా యాగములు జేసాను.భలే దిగులు పడ్డాను.నీవు నా పైన దయ తలచి నాకు కనిపించావు.నా జన్మ ధన్యమయింది.నీవే నాకు దిక్కు,దిశ,దశ చూపించాలి.నీవు పంచభూత ప్రవర్తకమగు మాయకు చిక్కకుండా,నీ జఠరము నందు ముల్లోకాలనూ ఉంచావు.పాల కడలిలో శేషశయనుడివై యోగనిద్రలో గడిపావు.కొంత కాలానికి మేలుకున్నావు.నీ వాభి కమలము నుంచి ముల్లోకాలనూ సృజించావు.ఇదంతా ఏ జ్ఞానముతో చేసావో,ఆ జ్ఞానము నాకు ప్రసాదించు.నాకు సృష్టి నిర్మాణము చేయాలని సంకల్పము ఉంది.కానీ చేతకావడం లేదు.నీవు కరుణతో జ్ఞానభిక్ష చేసావంటే నేను కృతార్థుడను అవుతాను.

Saturday, 15 August 2026

బ్రహ్మకు జ్ఞానోదయము

బ్రహ్మ అతని నాభీ సరస్సున పుట్టిన పద్మము,జలము,వాయువు,ఆకాశము మటుకు చూడగలిగాడు.రజోగుణ యుక్తుడు అయిన బ్రహ్మకు సృష్టి చేసేదానికి సరి అయిన మార్గము తోచలేదు.పని చేయాలనే తపన,వ్యామోహము,అహంభావము,అశాంతి,ఇంద్రియభోగాల పట్ల అమితమయిన కోరికలు...ఇవి రజోగుణము ఉన్నవారి లక్షణాలు.కానీ ఎలాగో సర్వమునకు శ్రీహరి మూలాథారము అని తెలుసుకున్నాడు.ఆ దేవదేవుడితో మొర పెట్టుకున్నాడు.ఓ జగన్నాథా!ఓ దేవదేవా!నువ్వు ఒక్కటే సత్యమూ,నిత్యమూ.నీ స్వరూపమే నాకు జ్ఞాన మార్గము చూపించింది.నీ దివ్యరూపము చూడగలగడమే నా అజ్ఞానానికి చరమగీతం పాడింది.నాలో వివేకము,విజ్ఞత వికసించాయి.మంచి వాళ్ళనూ,సత్పురుషులనూ అనుగ్రహించేదానికి నీవు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటావు.దాని వలన ఎన్నో అవతారాలు ఎత్తి ఉంటావు,ఎత్తుతూ ఉంటావు.నీవు ఈ విషయంలో అలుపూ సొలుపూ,అనాసక్తత అసలు ప్రదర్శించవు.నీ రూపము చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించేలా మనసును ఊరిస్తున్నది.నీ స్వరూపము ముందర నేను చూడగలిగాను.నా జన్మ ధన్యమయినది.ఈ ప్రపంచాన్ని పుట్టించింది నీవే!నా రూపము భూతేంద్రియాత్మకము అనగా పంచభూతములు మరియు ఇంద్రియములచే కార్యరూపము దాల్చినది.కానీ నేను సదా నిన్ను సేవించుకుంటాను,నీ ఆశ్రయము కోరుకుంటాను.పనికిమాలిన తర్కములు చేసేవారికి నీ మహిమలు,నీ గొప్పదనం తెలియదు.కృతార్థులు అయిన మహాత్ములే నిన్ను సంపూర్ణంగా కనుగొనగలరు.ఎల్లప్పుడూ నీ పాదారవిందముల సేవలో మునిగి తేలుతూ ఉంటారు.నీ పాదకమలాలను ఎన్నటికీ విడనాడరు.

Thursday, 13 August 2026

శేషశయనుడు సాకారము

బ్రహ్మకు ఏమీ అర్థం కావటం లేదు.బుర్ర నిండా ప్రశ్నలే!అనుమానాలే!దానికి ఆరంభం...అంతం కనిపించడం లేదు.అసలు ఈ జలము ఎక్కడిది?ఈ జలములో ఈ పద్మము ఎలా పుట్టింది?ఈ పద్మం పైకి నేను ఎట్లా వచ్చాను?అసలు నా పుట్టుకకు కారణమేంది?నేను ఎవరు?నా పేరు ఏంది?అసలు ఈ పద్మనాళము యొక్క మూలము ఎక్కడుంది?ఈ అనుమానం మదిలో రేకెత్తగానే ఒకచోట కుదురుగా కూర్చోలేకపోయాడు.ముందు వెనక ఆలోచించకుండా సముద్రంలోకి దూకాడు.ఆ పద్మనాళము యొక్క మొదలు కనుక్కునేదానికి దానిని అనుసరించాడు.ఇలా ఒక రోజా?ఒక నెలా?ఒక సంవత్సరమా?కాదు,కాదు.ఏకంగా వేయి దివ్య సంవత్సరాలు వెతికాడు.అయినా ఫలితం దక్కిందా అంటే అదీ లేదు.భగవంతుడి మాయ వలన ఏమీ తెలియలేదు,తేలలేదు.గమ్మున వెనకకు తిరిగి వచ్చాడు.తను ఉద్భవించిన కమలము మధ్యలో ఉన్న పీఠము పైన కూర్చున్నాడు.అష్టాంగ యోగమున పవనమును బంథించి నూరేండ్లు సమాథిలో ఉన్నాడు.ఆ యోగశక్తి వలన తనకు జ్ఞానము కలిగినది.కానీ తన పుట్టుటకు కారణమయిన వాడు,తనలోనే వాడు అయిన శ్రీహరిని కనుక్కోలేక పోయాడు,కానలేకపోయైడు.ఇంక నిశ్చలమయిన భక్తి యోగమును ఆశ్రయించాడు.దాని మహిమ వలన శేషనాగు శయ్య పైన శయనించి ఉన్న శంఖచక్రధరుడైన పరమాత్మను తిలకించాడు.శ్రీహరి ఎలా కనిపించాడు?పీతాంబరములతో,బంగారు కిరీటంతో ధగధగమని వెలిగి పోతున్నాడు.ముత్యాల హారాలు,తులసీదామాలతో అలరారుతున్నాడు.ఆ పరాత్పరుడి దేహము అపరిచ్ఛన్నముగా,అనగా సంపూర్ణంగా ఉన్నది.ముల్లోకాలలో ఆ శరీర శోభకు సాటి లేదు.అతని శరీరకాంతులు ఎలా ఉన్నాయి అంటే వాటి వెలుగుల వలన ఆయన ధరించిన ఆభూషణములకు వన్నె వచ్చింది,వింత శోభ చేకూరింది.అతని పాదపద్మ యుగము,అనగా తామర పువ్వుల వలె సుకుమారంగా ఉండే పాదములు,భక్తుల కోర్కెలు తీర్చే కామధేనువు.అతనిని సరిగ్గా వర్ణింప గలిగే వారు ముల్లోకాలలో లేరు.అంతటి దివ్యమయిన,తేజోమయమయిన రూపము.అతనే సర్వేశ్వరుడు.ఆది అంతములు లేనివాడు.కర్త,కర్మ,క్రియ అన్నీ తానే అయిన జగదేక పూజ్యుడు.బ్రహ్మ జీవితం ధన్యమయింది ఆ పరాత్పరుడి దర్శనంతో!

Sunday, 2 August 2026

సృష్టికార్యమునకు సంకల్పము-బ్రహ్మ పుట్టుక

ప్రళయము వచ్చింది.జగత్తు మొత్తమూ జలమయము అయిపోయింది.ఆ జలము మధ్యలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్నాడు.చిచ్ఛక్తితో కూడి కపట నిద్రలో ఉన్నాడు.నిమీలితాక్షుడు వేయి తలలు గల శేషనాగుపై శయన ముద్రలో ఉన్నాడు.పక్కరోజు పరీక్ష ఉందంటేనే మనకు రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు.అట్లాంటిది జగన్నాటక సూత్రథారికి ఎలా పడుతుంది?అందుకనే కపట నిద్ర అని అన్నారు.అతడు యోగమాయకు దూరముగా వేయి యుగములు శయన నిద్రలో ఉన్నాడు.ఆ తరువాత సృష్టి కార్యమునకు సంకల్పము చేసుకున్నాడు.అంత వరకూ అన్ని లోకములూ అతనిలో అణగి ఉన్నాయి.మరలా వాటిని సృజించేదానికి సాథనము అయిన సూక్ష్మార్థమును గ్రహించాడు.అప్పుడు రజో గుణమును పుట్టించాడు.దాని వలన అతని నాభి యందు పద్మ నాళము పుట్టింది.దాని నుంచి పద్మము ఉద్భవించింది.ఆ పద్మము నుంచి చతుర్ముఖుడు అయిన బ్రహ్మ పుట్టాడు.ఆ బ్రహ్మకు అంతా కొత్తగా ఉంది.అతను ఆ తామర పువ్వు కర్ణిక పైన నిలుచుకున్నాడు.కర్ణిక అంటే తామర పువ్వు మధ్య భాగము.తన నాలుగు ముఖాలలో ఉండే కన్నులు విప్పి ఆకాశం చూసాడు.నలు దిక్కులనూ కలియ చూసాడు.ఆయనకు అంతా అయోమయంగా ఉంది.ఏమీ అర్థం కావడం లేదు.