Friday, 10 July 2026
విదురుడి అనుమానం
మైత్రేయుడు ఆదిపురుషుడు గురించి విదురుడికి చెప్పినదంతా శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు.ఇంకా ఇలా చెబుతున్నాడు.రాజా!మైత్రేయుడు చెప్పినదంతా విన్న తరువాత విదురుడి మనసులో తేనెతుట్టిలాగా అనుమానాలు రేకెత్తాయి.ఇంక ఉండబట్టలేకపోయాడు.అడిగేసాడు.ఓ మహామునీ!మీరే చెప్పారు కదా,భగవంతుడు అనే వాడు అగుణుడు అని.మరి అతను సృష్టి,స్థితి,లయ కార్యములు ఎట్లా చేయగలిగాడు?అసలు ఎట్లా సంభవమయ్యాయి?త్రిగుణాత్మకమయిన మాయతో కూడి లోకాలను సృజించాడు అంటే ఎట్లా కుదురుతుంది?అంతా ఆషామాషీ వ్యవహారము కాదు కదా!అనంత ప్రాణి కోటిలోని ప్రతి ప్రాణి యందు అతను నివసిస్తాడు అని అంటున్నావు కదా!ఆయనే ఉన్నప్పుడు,ఆయనే అంతా అయినప్పుడు....జీవికి కష్టము అనేది ఎట్లా సంభవిస్తున్నది.అలా జరుగకూడదు కదా!
మైత్రేయుడు చిరు నవ్వు నవ్వి ఇలా సమాథానం చెప్పాడు.విదురా!కుతర్క వాదాలు చేసి,ఆయన గొప్పదనము,ఆయన మాయను మానవ మాత్రులము మనము తెలుసుకోలేము.భగవంతుడు నిత్యుడు,అనంతుడు,నిత్య శోభనయుతుడు.అతనికి విపద్దశ అనేది లేదు.కొన్నిటిని అడుగ కూడదు.ఒప్పుకోవాల్సిందే!నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.చందమామ ఆకాశం లో ఉంటుంది.దాని ప్రతిబింబం మనకు నీటిలో కనిపిస్తుంది.నీళ్ళు కదులుతుంటే ఏమవుతుంది?చందమామ కూడా కదులుతున్నట్లు అనిపిస్తుంది కదా!నిజంగా ఆకాశంలో చందమామ కదలదు కదా!కదిలినట్లు కాదు కదా!అట్లాగే కర్మ బంథాలు జీవులకు మాత్రమే!ఆ మహామహునికి కాదు.జీవునికి ముఖ్యంగా అజ్ఞానం కారణం వలనే కర్మ బంథాలు కలుగుతున్నాయి.ఆ పరాత్పరుడి ఆశ్రయంలోకి వస్తే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది.ఎంత సేపూ ఏమి తినాలి,ఎప్పుడు తినాలి,ఎక్కడ తినాలి,ఎంత తినాలి?లాంటి యావల నుంచి బయటపడి శ్రీహరి చరణాలను నమ్ముకోవాలి.అప్పుడు కైవల్యంకు అర్హత సంపాదిస్తారు.
Subscribe to:
Posts (Atom)