Tuesday, 16 June 2026

విశ్వ నిర్మాణం వైపు అడుగులు

కాల మాయాంశ చిహ్నాలు కలిగి,మహదాద్యభిమానమును పొందిన దేవతలు విష్ణు కళలతో కూడినవారు అయి ఉంటారు.మహదాద్యభిమానము అంటే పంచ తత్త్వాలు,జ్ఞానేంద్రియాలు,కర్మేంద్రియాల సమ్మేళనం!అలాంటి మహదాది తత్త్వములు ఐక్యము ఒక్కటే ప్రపంచం కల్పించేదానికి సమర్థంకాదు కాబట్టి అవి శ్రీహరిని పార్ర్థించాయి.భగవంతుడికి అర్థం అయింది.ఆ మహదాది తత్త్వాలకు పరస్పరము ఐకమత్యము కుదరటం లేదు.అందుకే అవి సృష్టి కార్యం చేయడంలో విఫలమవుతున్నాయి అని.ఇంక ఆయనే నడుము బిగించాడు సృష్టి చేసేదానిక్.అతడు కాలవేగమున ఉద్రేకము పొందిన ప్రకృతితో కలిసి,ఇరవై ఏడు తత్త్వములయందు ప్రవేశించి,ఆ తత్త్వములకు విశ్వ నిర్మాణ నైపుణ్యం చూపుతూ,అన్యోన్య భావము కుదిరేటట్లు చూసాడు,చేసాడు.శ్రీహరి హిరణ్మయము,అదే బంగారు మయమైన ఛాయ,అయిన విరాట్ స్వరూపము పొంది ఉన్నాడు.కార్యరూపకలితమగు అతని గర్భము వేయి సంవత్సరములు జలమునందు ఉణ్ణింది.కార్యరూపకలితము అంటే తను అనుకున్న సృష్టి చేయడానికి సంకల్పము,కార్యాచరణ భగవంతుడు మొదలు పెట్టాడు.పరమాత్మకు స్థానమై ఆదిమావతారమగు ఆ దేవదేవుని గర్భమున భూతసమూహము తోడి ప్రపంచం ఉద్భవించింది.భూత సమూహము అంటే అన్ని రకాల జీవకోటి సమూహము,సమాహారము అని అర్థము.

Saturday, 13 June 2026

భగవంతునిచే పంచ భూత సృష్టి

భగవంతుడుచే ఇంద్రియములలో త్వక్కు చక్షుస్సు,శ్రోత్రము,జిహ్వ,ఘ్రాణము అను జ్ఞానేంద్రియములు ఉత్పన్నమయినవి.వాక్కు,పాణి,పాదము,పాయివు,ఉపస్థ అనే ఐదు కర్మేంద్కియములు ఉత్పన్నమయినవి.ఇవి తైజసాహంకారము వలన ఉత్పన్నమయ్యాయి. తామసాహంకారము వలన శబ్ద స్పర్శ రూప రస గంధములు పుట్టాయి.అందులో శబ్దము నిజగుణమైన శబ్దము వలన ఆకాశమును పుట్టించెను.గగనము స్పర్శ తన్మాత్రల వలన వాయువును పుట్టించెను.వాయువు నభోతలమున రూపతన్మాత్రము వలన లోకమునకే లోచనమయిన తేజస్సును ఉత్పాదించెను.తేజస్సు వాయువుతో గూడి రసతన్మాత్ర వలన జలమును పుట్టించెను.సలిలము తేజోయుక్తమయిన గంధ గుణము వలన పృథివిని పుట్టించెను.వీనిలో గగనమునకు శబ్దము,వాయువునకు శబ్ద స్పర్శలు,తేజస్సునకు శబ్ద స్పర్శరూపములు,జలమునకు శబ్ద స్పర్శ రూప రసములు,పృధివికి శబ్ద స్పర్శ రూప రస గంధములు గుణములై ఉండును.

Thursday, 23 April 2026

శ్రీకృష్ణుడు మైత్రేయుడికి జ్ఞాన ప్రబోధము

శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు విదురుడు మైత్రేయుడిని ఇలా అడిగాడు అని చెబుతున్నాడు.విదురుడి ప్రశ్నలకు మైత్రేయుడు సమాథానం చెప్పడం మొదలు పెట్టాడు.విదురా!నీవు భగవత్ భక్తుడివి.నీవు నన్ను ఈ ప్రశ్నలు అడగడం సముచితంగా ఉంది.నాకు సంతోషంగా కూడా ఉంది.శ్రీకృష్ణుడి నిర్యాణం సమయంలో నేను అతని దగ్గరే ఉన్నాను అని చెప్పాను కదా!అప్పుడు ఆ మహానుభావుడు నన్ను దగ్గరకు పిలిచి జ్ఞానము అంతటినీ ఉపదేశించాడు.ఆయన నాకు చెప్పినదంతా తు చ తప్పకుండా నీకు వివరిస్తాను.భక్తి శ్రద్ధలతో వినుము. భగవంతుడు సృష్టికి పూర్వము తన మాయా ప్రభావం చేత సమస్తమునూ లయమొందించాడు.అతను ఒక్కడే దివ్యమయిన తేజస్సుతో వెలుగ సాగెను.ఆ తరువాత కాలంలో తాను పురుషాకృతిలో ఉండి,ఆత్మాంశమున స్ఫురించిన శక్తిని నిలిపి,తన యుదరమునందణగియున్న విశ్వమును పుట్టించెను.మాయ వలన మహాతత్త్వమునందు సత్త్వగుణము,రజోగుణము మరియు తమోగుణకమయిన అహంకార తత్త్వము ఉత్పన్నమయింది.సాత్త్వికాహంకారము వలన మనస్సు,దేవతా గణము పుట్టినవి.

Wednesday, 22 April 2026

మైత్రేయుడి ముందు విదురుడి ప్రశ్నలు

మైత్రేయుడిని చూడగానే విదురుడు మహదానందపడిపోయాడు.వెంటనే ఆ మహర్షికి సాష్టాంగ ప్రణామాలు అర్పించాడు.చేతులు జోడించి శర సంథానం లాగ ప్రశ్నలు గుప్పించాడు.మునీంద్రా!లోకములో ప్రజలు కనిపించిందంతా కావాలనుకుంటారు.వారి ఆశలకు హద్దూ పద్దూ ఉండదు.ఆయా సుఖములకు హేతువులైన కర్మములు అన్నీ చేస్తారు.కానీ తగిన ఫలితం దక్కలేదని బాథ పడుతుంటారు.నిజానికి కర్మములు బంధకాలు కదా!దుఃఖ హేతువులు కూడా!అవి సౌఖ్యదాయకాలు కానేరవు.ఈ ప్రపంచం అంతా దుఃఖ భూయిష్టమయినది.ఎందుకంటే మానవుడు ఒకసారి ఈ సంసారమనే చట్రంలో ఇరుక్కున్నాడంటే,ఇంక బయట పడేమార్గమే ఉండదు.ఒక రకంగా చెప్పాలంటే వీరంతా మూఢులు లాగ,పశుప్రాయులు లాగా వ్యవహరిస్తున్నారు.బహుశ ఇలాంటి అజ్ఞానులను ఉద్ధరించి,సన్మార్గంలోకి తీసుకెళ్ళేదానికే మీలాంటి మహానుభావులు ఈ భూమి పైన సంచరిస్తుంటారు. ఈ మాయ ఉందే,ఇది త్రిగుణాత్మకమయినది.భగవంతుడే ఇదంతా నియామకం చేసింది.ఆ భగవంతుడు ఏయే కర్మములను ఆచరించాడు?భగవంతుడు అనేవాడు సామాన్యుడికి దారి చూపాలి కదా!అసలు ఓంకారంగా ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు?ఎట్లా త్రిభువనాలని పాలించాడు?యోగమాయ యందు ఎలా ఉన్నాడు?ఈ చరాచర సృష్టి కర్త బ్రహ్మాండమునందు ఏ లీలలు చేసాడు?బ్రహ్మాది రూపములను ఎట్లా పొందాడు?పరి పరి విథముల ఎలా క్రీడించాడు?దశావతారాలు ధరించి భూసురులను,గోవులను,సురాదులను,దీనులను ఎలా పరిరక్షించాడు?మానవుడికి ఏయే ప్రయోజనాలు తీర్చాడు?జనులకు కర్మ నామ రూప భేదములు ఎట్లా నిర్దేశించాడు?మానవ జన్మ మరణాది సకల దుఃఖములకు నిలయము.పాప కర్మముల వలన ప్రాప్తమయినది.ఈ సంసార బంధము అంత తేలికగా తెగదు.ఆ భగవంతుడి చరిత్ర వింటే గానీ మనం ముక్తి సాథించలేను.కాబట్టి ఆ దేవ దేవుడి గాథలు మీరు చెప్పారంటే,విని నేను తరిస్తాను.నా జీవితం ధన్యమయింది అని తృప్తి పడతాను.

Thursday, 16 April 2026

ఉద్థవుడి జీవిత పరమార్థము

శుక మహర్షి చెప్పేదంతా పరీక్షిత్తు విన్నాడు.అతని మనసులో మెదిలిన అనుమానాలను బయటపెట్టాడు.ఓ శుకమహర్షీ!యాదవ వంశంలో అతిరథులు,మహారథులు కాడా చాలా మంది ఉన్నారు కదా!వాళ్ళందరూ కూడా పరస్పర కలహాలతో ఒకళ్ళనొకళ్ళని కొట్టుకుని మరణించారు.శ్రీకృష్ణుడు కూడా నిర్యాణం చెందాడు కదా!ఇట్లా యాదవ కులంలో అందరూ చనిపోయినా ఈ ఉద్ధవుడు ఒక్కడు మటుకు ఎలా బ్రతికాడు? దానికి శుకమహర్షి ఇలా సమాథానం చెప్పాడు.శ్రీ మహా విష్ణువు యాదవ కులంలో ఎందుకు జన్మించాడంటావు?బ్రహ్మాది దేవతలు ప్రార్థించారనే కదా!ఈ భూభారం తగ్గించే దానికే కదా!వంశం మొత్తం నాశనమయితే జ్ఞాన తత్త్వము లోకంలో ఎట్లా నిలబడుతుంది?ఆ తత్త్వము లోకములో అందరికీ విశదంగా,వివరంగా చెప్పేవాళ్ళు ఒకరైనా,నిఖార్సు అయినవాళ్ళు ఉండాలి కదా!అందుకే శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని బ్రతికించి ఉంచాడు.తత్త్వ ప్రచారానికి అతడు ఒక్కడే యోగ్యుడని భావించాడు. ఇలా ఉద్ధవుడు వెళ్ళిపోయిన తరువాత విదురుడు మైత్రేయుడిని కలిసేదానికి బయలుదేరాడు.విదురుడు యమునా నదిని దాటాడు.కొన్ని రోజులు ప్రయాణం చేసాడు.పుణ్య క్షేత్రాలలో స్నానం చేసాడు.విష్ణు క్షేత్రాలను సందర్శించాడు.చిన్నగా గంగా నది దగ్గరకు చేరాడు.అక్కడ అతనికి ముని సత్తముడు అయిన మైత్రేయ మహర్షి కనిపించాడు.

Sunday, 12 April 2026

ఉద్ధవుని భక్తి ప్రపత్తులు

మైత్రేయుడు తీర్థయాత్రలు చేస్తూ శ్రీకృష్ణుడు ఉన్న చెట్టు మొదలు దగ్గరకు వచ్చాడు.అప్పుడు శ్రీకృష్ణుడు మైత్రేయుడు వింటుండగా ఉద్ధవుడితో ఇలా అన్నాడు.నాయనా!ఉద్ధవా!నీ పూర్వజన్మ వృత్తాంతం చెబుతా విను.నీవు నీ పూర్వజన్మలో వసుబ్రహ్మలు చేసిన సత్రయాగములో ఒక వసువుగా ఉన్నావు.నీ మనస్సులో ఏమీ కోరికలు లేవు నా పాదారవిందాలు సేవించుకోవాలనే తృష్ణ తప్ప.అందుకనే నేను ఎప్పుడూ నీ మనసులోనే నివసిస్తూ ఉంటాను.నీకు ఇంక మరో జన్మ లేదు.నీవు గొప్ప పుణ్యాత్ముడివి.ఇంకో సంగతి కూడా చెబుతా విను.పద్మకల్పము నందు నా నాభీ పద్మమునందు ఉద్భవించు బ్రహ్మకు నా మహత్త్వము నెరిగించు దివ్య జ్ఞానాన్ని నీకు ఇస్తాను.అలా ఆ జ్ఞానాన్ని నాకు ఆ కృష్ణ పరమాత్ముడు ఉపదేశించాడు.కాబట్టి ఆయన ఆనతి మేరకు నేను కల్పాంతము వరకూ ఉండవలసి వస్తుంది.నేను ఇప్పుడు బదరికాశ్రమమునకు పోవుచున్నాను. ఉద్ధవుడు చెప్పిన మాటలకు విదురుడు దిగులు పడ్డాడు.యాదవ వినాశనము అతనిని కలవర పరచింది.కానీ నిజయోగ సత్త్వమున శోకాన్ని విడనాడాడు.ఉద్ధవుడిని ప్రార్థించాడు.ఓ యాదవోత్తమా!శ్రీకృష్ణుడు నీకు పరతత్త్వము గురించి చెప్పాడు అన్నావు కదా!నాకు కూడా అది బోధించు.నన్ను కూడా కృతార్థుడిని చేయి.మీరు భగవద్భక్తులు,సుజనులు.మీరు మహనీయులు,పరోపకార పరాయణులు.నా మొర ఆలకించండి అని వేడుకున్నాడు. అప్పుడు ఉద్ధవుడు విదురుడితో ఇలా అన్నాడు.విదురా!మునిసత్తముడు,విష్ణు సమానుడు అయిన మైత్రేయుడు నీకు ఆ తత్త్వమును బోథిస్తాడు అని చెప్పి బదరీవనమునకు బయలుదేరాడు.

Wednesday, 1 April 2026

యాదవ వంశం అధోగతిపాలు

శ్రీకృష్ణుడు ద్వారకలో సుఖంగా ఉన్నాడు.కానీ యాదవులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు.పైత్యం పెరిగిపోతుంది.ఒకరోజు మహా మహా మునులు శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలని వచ్చారు.వారితో పెద్దా చిన్నా అనే గౌరవం లేకుండా ఎకసక్కెములు ఆడారు.దానితో మునులకు కోపం వచ్చి మీలో మీరే కొట్టుకుని నశిస్తారు అని శపించి పోతారు.ఆ తరువాత కొన్ని రోజులకు జాతర వచ్చింది.అందరూ ప్రభాస తీర్థమునకు పోయి స్నానాలు చేసారు.ఒళ్ళూ పాయా తెలీనంతగా మద్యపానం సేవించారు.ఆ తరువాత ఒకళ్ళనొకళ్ళు కలహించుకోని,పొడుచుకుని చచ్చిపోయారు.శ్రీకృష్ణుడు అప్పుడు ఒక చెట్టు మొదట్లో చేరగిలబడి కూర్చున్నాడు.ఉధ్ధవుడిని బదరీవనమునకు పొమ్మని చెప్పి తను ఇంకో తట్టు ఎటో వెళ్ళిపోయాడు.ఉద్ధవుడు ఉండబట్టలేక అతనిని ఎతుక్కుంటూ పోయి ఒక చెట్టు మొదట విశ్రాంతిగా పడుకున్న శ్రీకృష్ణుడిని చూసాడు. అంతలో వ్యాస మహర్షి శిష్యుడు అయిన మైత్రేయిడు తీర్థ యాత్రలు చేసుకుంటూ అక్కడకు వచ్చాడు.