bhaagavatham balpasandugaa
Friday, 13 February 2026
భాగవత మూలము
శ్రీహరి బ్రహ్మకు చెప్పాల్సిన సుద్దులు,బుద్ధులు చెప్పి అంతర్థానము అయిపోయడు.బ్రహ్మ ఆనందానికి అవథులు లేవు.భగవంతుడు చెప్పిన మాటలు మననం చేసుకుని,మనసులో నిక్షిప్తం చేసుకున్నాడు.సమస్త ప్రపంచాన్ని సృజించాడు.అతడు స్వలాభం చూసుకోలేదు.సకల లోక హితము కోరుకున్నాడు.దానికి తగిన విథంగానే ముందుకు అడుగులు వేసాడు.ఆయన సంకల్పం ధృఢమయినది.
ఇట్లా ఉంటే ఒకరోజు బ్రహ్మ దగ్గరకు నారదుడు వచ్చాడు.ఆయనకు ఆదుర్దా ఎక్కువ కదా!రావటం రావటం నాకు భగవంతుని మాయా విలాసాలగురించి చెప్పు అని తొందర చేసాడు.
బ్రహ్మ చిద్విలాసంగా,చిన్మయానందంతో భగవంతుడు వలన తెలుసుకున్న భాగవతాన్ని నారదునకు చెప్పాడు.నారదుడు ఆ తరువాత వ్యాసుడికి చెప్పాడు.వ్యాసుడు అటు పిమ్మట శుకుడికి బోధించాడు.ఆ వృత్తాంతము అంతా పరీక్షిత్తు కోరిక మేర శుకుడు చెప్పేదానికి ఒప్పుకున్నాడు.
శుకుడు పరీక్షిత్తుతో అంటున్నాడు.రాజా!నీవు నన్ను అడిగావు కదా,విరాట్పురుషుని వలన ఈ లోకాలన్నీ ఎలా ఏర్పడ్డాయి అని.వాటన్నిటికీ సమాథానము భాగవతములో ఉంది.అది నీకు నేను నేర్పిస్తాను.
అది సర్గము,విసర్గము,స్థానము,పోషణము,ఊతులు,మన్వంతరములు,ఈశానుచరితములు,నిరోథము,ముక్తి,ఆశ్రయము అను పది లక్షణములతో కలిసి ఉంటుంది.వీటిలో మొదటి తొమ్మిది లక్షణములు పదవ లక్షణమయిన ఆశ్రయము విశుద్థి కొరకే చెప్పబడినది.
అంటే మనము స్థిరమైన ఆనందం కోసరము భగవంతుడిని నమ్ముకోవడంలో పవిత్రముగా తయారుకావడము.
Thursday, 12 February 2026
శ్రీహరి గురించి శ్రీహరి
శ్రీహరి బ్రహ్మ మాటలు విన్నాడు.అతను తన్మయత్వంలో ముణిగిపోవడం గమనించాడు.చిద్విలాసంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.ఓ కమలగర్భా!నీవేమీ ఆందోళన చెందనవసరం లేదు.నా స్వరూప స్వభావాలు నీకు తెలుస్తాయి.అలాగే నా మహిమావతారకర్మములు అన్నీ కూడా తెలుసుకునే ప్రక్రియ,విజ్ఞానము నా అనుగ్రహం వలన నీకు లభిస్తుంది.
జాగ్రత్తగా విను.సృష్టికి పూర్వము నేను ఒక్కడినే కర్మ విహీనుడుగా ఉంటాను.కల్ప ప్రళయాంతరమున,ఆద్యంత విరహితమగు క్రియతో,పరిపూర్ణ నిత్య మహిమతో పరమాత్ముడునై ఉంటాను.
మహాభూతములు భౌతికములు అయిన ఘటపటాదులు యందు ప్రవేశించి ఉంటాయి కదా!అచ్ఛంగా అలానే నేను భూత భౌతికములు అయిన సర్వకార్యములయందు,సత్త్వాది రూపములయందు ప్రవేశించి ఉంటాను.భూత భౌతికములు కారణావస్థను పొంది నాయందు అభివ్యక్తములు అయి ఉండవు.సర్వ దేశములందునూ,సర్వకాలములందునూ ఏది బోధితము అయి ఉంటుందో అదే పరబ్రహ్మ స్వరూపము.ఇది నా తత్త్వము.తత్త్వాత్మకమయిన ఈ అర్థమును నీ మనసు నందు గ్రహించుకో!అలా అయినప్పుడు నీవు సృష్టి కర్మములు చేసేటప్పుడు మోహమునకు గురి కావు.గర్వానికి పోవు.సమన్వయం పాటిస్తావు.
ఇలా చెప్పి శ్రీహరి అంతర్ధానం అయిపోయాడు.
Monday, 9 February 2026
బ్రహ్మ భక్తి బహు బాగు
బ్రహ్మ తన నాలుగు శిరస్సులు వంచి శ్రీహరికి సాష్టాంగ నమస్కారాలు చేసాడు.శ్రీహరికి ఆ ఆత్మార్పణం నచ్చింది.సంతోషించాడు.
బ్రహ్మతో ఇలా అన్నాడు.కుమారా!వత్సా!కపటముగా కొంత మంది మునులు ఉంటారు.వాళ్ళు జీవితకాలం అంతా తపస్సు చేసినా నాకు సంతోషము కలుగదు.నీవు నిష్కపటుడివి.అందువల్ల నీ మనస్సు నన్ను ఆకర్షించింది.నీ యెడల నేను ప్రసన్న చిత్తంతో ఉన్నాను.అందుకే నా లోకము నీకు చూపించాను.నీ తపస్సు కొక్కదానికే మటుకు కాదు.తప అని నేను అన్న మాటను బట్టే కదా నీవు ఇంత ఘోర తపస్సు చేసావు.ఆ తపస్సు చేయడం వల్లనే నీకు మోహము నశించింది.నీకు నా మీద అంతులేని భక్తి కలిగింది.నాకు చాలా తృప్తిగా ఉంది నీ విషయంలో.నీకు ఏ వరము కావాలో కోరుకో!ఏమీ మొహమాటం లేదు.
శ్రీహరి మాటలకు బ్రహ్మ ఈ విథంగా జవాబు ఇచ్చాడు.హే దేవా!హే పరంథామా!ఈ సమస్త సృష్టిలో నీకు తెలియనిది అంటూ ఏమీ లేదు.ఎందుకంటే దీనికంతా కర్త,కర్మ,క్రియా నీవే గనుక.అలాంటిది నా మనసులో ఉండే కోరిక నీకు తెలియకుండా ఎలా ఉంటుంది?కానీ నీవు అడిగావు.కాబట్టి నేను చెప్తాను.
ఓ దేవా!నీ స్థూల సూక్ష్మ రూపములు అవ్యక్తములు కదా!నీవే బ్రహ్మాదిరూపములను ధరిస్తావు.ఈ జగత్తు ఉత్పత్తి ,స్థితి,లయ కార్యములను చేపడతావు.నీవు అమోఘ సంకల్పుడివి.రకరకాల విభూతులతో ఆటలాడుకుంటావు.నిన్ను పూర్తిగా తెలుసుకోవడం చాలా కష్టము.నీ మహిమలను తెలుసుకోవడం ఇంకా క్లిష్టం.వాటన్నిటినీ తెలుసుకోగలిగే జ్ఞానము,పరిజ్ఞానము నాకు ప్రసాదించు.
నీ ఆనతి మేర నేను సృష్టి చేస్తాను.కానీ నాకు తెలియకుండానే అహంకారానికి లోనవుతానేమో అని అనుమానంగా,భయంగా ఉంది.అందువలన ఎప్పుడూ అహంకారము అనేది నాకు కలుగకుండా చేయి స్వామీ!ఆ ఒక్క వరము ప్రసాదించి నన్ను ధన్యుడిని చేయి.
Monday, 2 February 2026
వైకుంఠ పురము వైభవోపేతము
బ్రహ్మదేవుడికి విష్ణువు కనిపించగానే మూడులోకాలు కనిపించినట్లు అయింది.అతనికి తత్ క్షణమ్ వైకుంఠ పురము కనిపించింది.అది దేదీప్యమానంగా,గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది.అంతే కాదు.ఆ విష్ణు విలాసము కేవల సత్త్వగుణమునకు ఆవాసము.అన్ని లోకాలకంటే ఉత్తమమయినది,ఉన్నతమయినది.దేవతలు నిరంతరము స్తుతిస్తూ ఉండే విష్ణు ఆవాసము.అది లోభము,మోహము,భయము అనే తుచ్ఛగుణాలు లేని ప్రదేశము.అది దివ్యమంగళ విలాస మహిమతో ఒప్పారుతున్నది.బ్రహ్మకు తన కళ్ళు చాలడం లేదు ఆ వైభవము చూసేదానికి.ఎంత చూసినా తనివి తీరడం లేదు.
అక్కడి చిలుకలు సదా న దైవం కేశవాత్పరం అని పలుకుతున్నాయి.గోరువంకలు కూడా ఎందులోనూ తీసిపోవడం లేదు.అవి సర్వం విష్ణుమయం జగత్ అని అంటున్నాయి.కోకిలలు ఏమాత్రం వెనకబడటం లేదు.అందులో వాటి గాత్రం సుమథురం కదా!అవి మంగళం మధుసూదన అని రాగయుక్తంగా పిలుపునిస్తున్నాయి.
ఆ నగర శోభ ఇంత అని చెప్పలేని విథంగా కాంతులు విరజిమ్ముతూ,శోభాయమానంగా,కన్నులకింపుగా కానవస్తుంది.
మనకు ఇక్కడ ఏమో వీథి సర్పంచ్ కూడా రాజు వెడలె రవితేజము లలరగ అన్న పంథాన ఉంటుంది కదా!అక్కడ ఏమో విష్ణువుకు,విష్ణు పార్శ్వచరులకు భేదము అస్సలు తెలియడం లేదు.
అందరూ శ్యామల దేహము కలిగి ఉన్నారు.అందరూ పీతాంబరాలు ధరించి ఉన్నారు.అందరి ముఖములు,కళ్ళు పద్మములలాగా అందముగా ఉన్నాయి.అందరూ రత్న ఖచిత ఆభరణాలు ధరించి ఉన్నారు.నిత్య యవ్వనంతో కళకళలాడుతున్నారు.
సునందుడు,నందుడు,అర్హణుడు,ప్రబలుడు,మిగిలిన పార్శ్వచరులు శ్రీహరిని కొలుచుకుంటూ ఉన్నారు.లక్ష్మీ దేవి శ్రీహరి పాదాలు ఒత్తుతూ ప్రసన్నంగా ఉంది.ఆ దేవదేవుడు కానరాగానే బ్రహ్మ ఆనందానికి అవథులు లేవు.శరీరము జలదరించింది.పులకరించింది.విష్ణు సాక్షాత్కారము అంటే మాటలు కాదు కదా!ఆనందబాష్పాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు.తన నాలుగు శిరస్సులతో శ్రీహరి పాదపద్మాలకు వినమ్రంగా ప్రణమిల్లాడు.
Sunday, 1 February 2026
బ్రహ్మ తపస్సు ఫలదాయకం
బ్రహ్మ పద్మములో నుంచి ఆవిర్భవించాడు కదా!చటుక్కున ఒకసారి ఆయనకు అనిపించింది.నేను కూర్చుని ఉన్న ఈ పద్మము మూలస్థానము ఏది?
అది తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువైంది.ఇంక ఉండబట్టలేక క్రిందికి పోయి చూడసాగాడు.ఎంత దూరము పోయినా మూలము కనిపించడం లేదు.ఆయనకు విసుగు వచ్చేసింది.ఏంది ఇదంతా అని.ఇది ఇంక అయ్యేపని కాదని తేల్చుకుని,తిరిగి వెనుకకు వచ్చేసాడు.తన ఆసనము అయిన పద్మములోకూర్చుని,సృష్టికార్యము సాగించాలని సంకల్పము చేసుకున్నాడు.కానీ ఏమీ అర్థం కాలేదు.ఏమీ తోచడం లేదు.
ఇంతలో అతనికి రెండు సార్లు తప అనే శబ్దము వినిపించింది.ఆ శబ్దము ఎక్కడనుంచి వచ్చింది?అసలు ఎవరు పలికారు?ఈ అనుమానాలతో నాలుగు దిక్కులకూ పోయి వెదికాడు.ఏమీ తెలియలేదు.
వెనకకు వచ్చి తన ఆసనముపైన కూర్చున్నాడు.ఆలోచించాడు.ఇంకా ఆలోచించాడు.తప అంటే ఏంది అర్థము? తపస్సు చేయమని కదా!ఎవరో దేవతా మూర్తి నన్ను తపస్సు చేయమని సలహా ఇస్తున్నాడు.కాదు,కాదు. ఆజ్ఞాపిస్తున్నాడు.కాబట్టి నేను తక్షణము తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు.
ఇంక ఏకాగ్ర చిత్తముతోటి వేయి దివ్య సంవత్సరములు ఘోర తపస్సు చేసాడు.అప్పుడు శ్రీమహా విష్ణువు కరుణించి,ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయినాడు.
Saturday, 31 January 2026
పరీక్షిత్తు శుకుని సంభాషణ
పరీక్షిత్తు శుక మహర్షిని ఇలా అడిగాడు.ఓ మునీశ్వరా!బ్రహ్మ నారదునికి భగవంతుడి దర్శనము ఎలా అయిందో ఎట్లా చెప్పాడు?సకల భూత సంసర్గము లేని ఆత్మకు సంసర్గము ఎలా కలిగింది?సంసర్గము అంటే కలయిక,సంపర్కం,సాంగత్యము అని అర్థము.
శుకుడు జవాబు చెప్పాడు.ఓ రాజా!భగవంతుడు బ్రహ్మకల్పమున బ్రహ్మకు భాగవతము ఉపదేశించాడు అని చెప్పాను కదా!ఆ విషయం నీకు వివరంగా చెబుతాను.నీ కు అన్నీ మంచిగా అర్థం అవుతాయి.
జ్ఞాన స్వరూపుడు అయిన జీవికి భగవంతుని మాయవలనే దేహసంబంధం కలుగుతుంది.ముక్తిని సంపాదించాలంటే జ్ఞానము అత్యవసరము.ఆ జ్ఞాన సముపార్జన కలగాలంటే భగవంతుని సేవలో తరించడమే ఏకైక మార్గము.అందుకే బ్రహ్మ చేసిన తపస్సుకు మెచ్చి శ్రీహరి కరుణించాడు.జీవుడికి భగవద్భక్తి వలనే మోక్షం సిద్ధిస్తుంది అని నొక్కి వక్కాణించాడు
దీనికి ఒక ఇతిహాసము కూడా జోడు అయి ఉంది.
Tuesday, 27 January 2026
ఇతర అవతారములు
భగవద్గీతలోని పదవ అధ్యాయము,విభూతి యోగములో దేవదేవుని రూపాలు అర్థం అవుతాయి.ఇక్కడ ఇంకొన్ని అవతారాలు తెలుసుకుందాము.
విష్ణువు పరాశరునికి పుత్రుడుగా జన్మించాడు.అతను వేదములను విభజించాడు.అందుకనే వేదవ్యాసుడనే నామము ఖాయమయినది.ఇద వ్యాసావతార కథ.
పాషాండ మతావలంబకులు అధర్మముగా ప్రవర్తిస్తూ ఉండినారు.రాక్షసంగా కార్యాలు చేస్తూ వచ్చారు.అప్పుడు శ్రీహరి బుద్ధావతారము ఎత్తి వారిని నశింపజేసాడు.ఇది బుద్ధావతార కథ.
ప్రజలు దైవ భక్తిని విడిచి పెట్టారు.యజ్ఞయాగాదుల ఊసే లేదు.నోరు తెరిస్తే అబద్థాలు చెప్పడానికి అలవాటు పడిపోయారు.పాషాండాలలాగా కఠినాత్ములు అయిపోయారు.అప్పుడు శ్రీమహా విష్ణువు కల్కి అవతారమెత్తాడు.అధర్మాన్ని వశింపజేసాడు.ధర్మ ప్రతిష్ఠాపన చేసాడు.ఇది కల్కి అవతార కథ.
ఇంతటితో బ్రహ్మ ఆపేస్తూ ఈ మాటలు అన్నాడు.నారదా!భగవంతుని లీలావతారములు ఒకటా!రెండా!అనంతము!ఏదో నాకు తెలిసినవి నీకు చెప్పాను.అన్నీ వివరంగా చెప్పే శక్తిమంతుడిని కాను.అతను మాయా వినోదుడు.అతనిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎవరి వల్లా కాదు.
ఈ విషయాలు అన్నీ పరీక్షిత్తు శుక మహర్షి ద్వారా తెలుసుకునినాడు.
Subscribe to:
Comments (Atom)