bhaagavatham balpasandugaa
Monday, 2 February 2026
వైకుంఠ పురము వైభవోపేతము
బ్రహ్మదేవుడికి విష్ణువు కనిపించగానే మూడులోకాలు కనిపించినట్లు అయింది.అతనికి తత్ క్షణమ్ వైకుంఠ పురము కనిపించింది.అది దేదీప్యమానంగా,గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది.అంతే కాదు.ఆ విష్ణు విలాసము కేవల సత్త్వగుణమునకు ఆవాసము.అన్ని లోకాలకంటే ఉత్తమమయినది,ఉన్నతమయినది.దేవతలు నిరంతరము స్తుతిస్తూ ఉండే విష్ణు ఆవాసము.అది లోభము,మోహము,భయము అనే తుచ్ఛగుణాలు లేని ప్రదేశము.అది దివ్యమంగళ విలాస మహిమతో ఒప్పారుతున్నది.బ్రహ్మకు తన కళ్ళు చాలడం లేదు ఆ వైభవము చూసేదానికి.ఎంత చూసినా తనివి తీరడం లేదు.
అక్కడి చిలుకలు సదా న దైవం కేశవాత్పరం అని పలుకుతున్నాయి.గోరువంకలు కూడా ఎందులోనూ తీసిపోవడం లేదు.అవి సర్వం విష్ణుమయం జగత్ అని అంటున్నాయి.కోకిలలు ఏమాత్రం వెనకబడటం లేదు.అందులో వాటి గాత్రం సుమథురం కదా!అవి మంగళం మధుసూదన అని రాగయుక్తంగా పిలుపునిస్తున్నాయి.
ఆ నగర శోభ ఇంత అని చెప్పలేని విథంగా కాంతులు విరజిమ్ముతూ,శోభాయమానంగా,కన్నులకింపుగా కానవస్తుంది.
మనకు ఇక్కడ ఏమో వీథి సర్పంచ్ కూడా రాజు వెడలె రవితేజము లలరగ అన్న పంథాన ఉంటుంది కదా!అక్కడ ఏమో విష్ణువుకు,విష్ణు పార్శ్వచరులకు భేదము అస్సలు తెలియడం లేదు.
అందరూ శ్యామల దేహము కలిగి ఉన్నారు.అందరూ పీతాంబరాలు ధరించి ఉన్నారు.అందరి ముఖములు,కళ్ళు పద్మములలాగా అందముగా ఉన్నాయి.అందరూ రత్న ఖచిత ఆభరణాలు ధరించి ఉన్నారు.నిత్య యవ్వనంతో కళకళలాడుతున్నారు.
సునందుడు,నందుడు,అర్హణుడు,ప్రబలుడు,మిగిలిన పార్శ్వచరులు శ్రీహరిని కొలుచుకుంటూ ఉన్నారు.లక్ష్మీ దేవి శ్రీహరి పాదాలు ఒత్తుతూ ప్రసన్నంగా ఉంది.ఆ దేవదేవుడు కానరాగానే బ్రహ్మ ఆనందానికి అవథులు లేవు.శరీరము జలదరించింది.పులకరించింది.విష్ణు సాక్షాత్కారము అంటే మాటలు కాదు కదా!ఆనందబాష్పాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు.తన నాలుగు శిరస్సులతో శ్రీహరి పాదపద్మాలకు వినమ్రంగా ప్రణమిల్లాడు.
Sunday, 1 February 2026
బ్రహ్మ తపస్సు ఫలదాయకం
బ్రహ్మ పద్మములో నుంచి ఆవిర్భవించాడు కదా!చటుక్కున ఒకసారి ఆయనకు అనిపించింది.నేను కూర్చుని ఉన్న ఈ పద్మము మూలస్థానము ఏది?
అది తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువైంది.ఇంక ఉండబట్టలేక క్రిందికి పోయి చూడసాగాడు.ఎంత దూరము పోయినా మూలము కనిపించడం లేదు.ఆయనకు విసుగు వచ్చేసింది.ఏంది ఇదంతా అని.ఇది ఇంక అయ్యేపని కాదని తేల్చుకుని,తిరిగి వెనుకకు వచ్చేసాడు.తన ఆసనము అయిన పద్మములోకూర్చుని,సృష్టికార్యము సాగించాలని సంకల్పము చేసుకున్నాడు.కానీ ఏమీ అర్థం కాలేదు.ఏమీ తోచడం లేదు.
ఇంతలో అతనికి రెండు సార్లు తప అనే శబ్దము వినిపించింది.ఆ శబ్దము ఎక్కడనుంచి వచ్చింది?అసలు ఎవరు పలికారు?ఈ అనుమానాలతో నాలుగు దిక్కులకూ పోయి వెదికాడు.ఏమీ తెలియలేదు.
వెనకకు వచ్చి తన ఆసనముపైన కూర్చున్నాడు.ఆలోచించాడు.ఇంకా ఆలోచించాడు.తప అంటే ఏంది అర్థము? తపస్సు చేయమని కదా!ఎవరో దేవతా మూర్తి నన్ను తపస్సు చేయమని సలహా ఇస్తున్నాడు.కాదు,కాదు. ఆజ్ఞాపిస్తున్నాడు.కాబట్టి నేను తక్షణము తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు.
ఇంక ఏకాగ్ర చిత్తముతోటి వేయి దివ్య సంవత్సరములు ఘోర తపస్సు చేసాడు.అప్పుడు శ్రీమహా విష్ణువు కరుణించి,ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయినాడు.
Saturday, 31 January 2026
పరీక్షిత్తు శుకుని సంభాషణ
పరీక్షిత్తు శుక మహర్షిని ఇలా అడిగాడు.ఓ మునీశ్వరా!బ్రహ్మ నారదునికి భగవంతుడి దర్శనము ఎలా అయిందో ఎట్లా చెప్పాడు?సకల భూత సంసర్గము లేని ఆత్మకు సంసర్గము ఎలా కలిగింది?సంసర్గము అంటే కలయిక,సంపర్కం,సాంగత్యము అని అర్థము.
శుకుడు జవాబు చెప్పాడు.ఓ రాజా!భగవంతుడు బ్రహ్మకల్పమున బ్రహ్మకు భాగవతము ఉపదేశించాడు అని చెప్పాను కదా!ఆ విషయం నీకు వివరంగా చెబుతాను.నీ కు అన్నీ మంచిగా అర్థం అవుతాయి.
జ్ఞాన స్వరూపుడు అయిన జీవికి భగవంతుని మాయవలనే దేహసంబంధం కలుగుతుంది.ముక్తిని సంపాదించాలంటే జ్ఞానము అత్యవసరము.ఆ జ్ఞాన సముపార్జన కలగాలంటే భగవంతుని సేవలో తరించడమే ఏకైక మార్గము.అందుకే బ్రహ్మ చేసిన తపస్సుకు మెచ్చి శ్రీహరి కరుణించాడు.జీవుడికి భగవద్భక్తి వలనే మోక్షం సిద్ధిస్తుంది అని నొక్కి వక్కాణించాడు
దీనికి ఒక ఇతిహాసము కూడా జోడు అయి ఉంది.
Tuesday, 27 January 2026
ఇతర అవతారములు
భగవద్గీతలోని పదవ అధ్యాయము,విభూతి యోగములో దేవదేవుని రూపాలు అర్థం అవుతాయి.ఇక్కడ ఇంకొన్ని అవతారాలు తెలుసుకుందాము.
విష్ణువు పరాశరునికి పుత్రుడుగా జన్మించాడు.అతను వేదములను విభజించాడు.అందుకనే వేదవ్యాసుడనే నామము ఖాయమయినది.ఇద వ్యాసావతార కథ.
పాషాండ మతావలంబకులు అధర్మముగా ప్రవర్తిస్తూ ఉండినారు.రాక్షసంగా కార్యాలు చేస్తూ వచ్చారు.అప్పుడు శ్రీహరి బుద్ధావతారము ఎత్తి వారిని నశింపజేసాడు.ఇది బుద్ధావతార కథ.
ప్రజలు దైవ భక్తిని విడిచి పెట్టారు.యజ్ఞయాగాదుల ఊసే లేదు.నోరు తెరిస్తే అబద్థాలు చెప్పడానికి అలవాటు పడిపోయారు.పాషాండాలలాగా కఠినాత్ములు అయిపోయారు.అప్పుడు శ్రీమహా విష్ణువు కల్కి అవతారమెత్తాడు.అధర్మాన్ని వశింపజేసాడు.ధర్మ ప్రతిష్ఠాపన చేసాడు.ఇది కల్కి అవతార కథ.
ఇంతటితో బ్రహ్మ ఆపేస్తూ ఈ మాటలు అన్నాడు.నారదా!భగవంతుని లీలావతారములు ఒకటా!రెండా!అనంతము!ఏదో నాకు తెలిసినవి నీకు చెప్పాను.అన్నీ వివరంగా చెప్పే శక్తిమంతుడిని కాను.అతను మాయా వినోదుడు.అతనిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎవరి వల్లా కాదు.
ఈ విషయాలు అన్నీ పరీక్షిత్తు శుక మహర్షి ద్వారా తెలుసుకునినాడు.
Monday, 26 January 2026
కృష్ణావతారము
రాక్షస అంశతో పుట్టిన రాజులు ధర్మం తప్పారు.ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ,భూమిని అనేక రకాలుగా బాధ పెట్టసాగారు.ఆ పాపుల బరువు,ఆ పాపపు బరువు భూదేవి మోయలేక పోయింది.శ్రీమహా విష్ణువును వేడుకొంది.అప్పుడు శ్రీహరి ఆమె భారం తగ్గించే దానికి నడుము బిగించాడు.ఆ దుష్ట రాజులను సంహరించేదానికి బలరాముడు,శ్రీకృష్ణుడు రూపాలతో అవతరించెను.
వసుదేవుని భార్యలలో రోహిణికి బలరాముడు పుత్రుడు.దేవకీదేవికి శ్రీకృష్ణుడు పుత్రుడు.శ్రీకృష్ణుడు పురిటిలో ఉండగానే పూతన అనే రాక్షసిని చంపాడు.మూడు నెలల వయసులో శకటాసురుని చంపాడు.పెంచిన తల్లి యశోద కృష్ణుని అల్లరి భరించలేక రోటికి కట్టింది.ఆ రోలును ఈడ్చుకుంటూ పోయి మద్ది చెట్లను నేలకొరిగేలా చేసాడు.
మట్టి తింటున్నావా అని గదమాయించిన యశోదకు తన నోటిలో ముల్లోకాలు,చరాచర జగత్తు అంతా చూపించాడు.త్రాగునీటిని కలుషితం చేస్తున్న కాళియ నాగుని మర్దించాడు.కార్చిచ్చును ఆపి గోపబాలురను సంరక్షించాడు.ఒకసారి నందుడు యమునానదిలో స్నానం చేస్తున్నాడు.అప్పుడు వరుణుడు అతనిని బంధించాడు.కృష్ణుడు నందుని బంధ విముక్తుడిని చేసాడు.
ఇంకొకసారి రాక్షస మాయవల్ల గుహలో గోపాలకులు చిక్కుకున్నారు.వాళ్ళందరినీ రక్షించి,ఆ రాక్షసుడిని దునుమాడాడు.
ఇంద్రుడు తనకు పూజలు చేయలేదని జడివానలు కురిపించాడు.అపుడు కృష్ణుడు గోవర్థన గిరిని ఎత్తి గోపాలకులను కాపాడాడు.దుష్టుడు కంసుడు మేనమామ అయినా తన తల్లిదండ్రులను చెరలో పెట్టాడని చంపాడు.
శంఖచూడుడు అనే రాక్షసుడు గోపికలను ఎత్తుకెళ్ళాడు.వాడికి గర్వభంగము చేసి వారిని విడిపించాడు.నరకుడు మొదలు చాలా మంది రాక్షసులను సంహరించాడు.దుష్టులైన రాజులను సంహరించి భూభారమును తగ్గించాడు.భగవద్గీతను మనకు అందించాడు.ధర్మం ప్రక్కన ఉన్న పాండవ పక్షానికి సహాయ సహకారాలు అందించి కురు వంశం నేలమట్టమయ్యేలా చేసాడు.
ఇది కృష్ణావతార కథ.
Wednesday, 21 January 2026
పరశురామ,రామావతార కథలు
హైహయవంశ రాజులు చెలరేగిపోయి లోకములను బాధించడం మొదలుపెట్టారు.వాళ్ళ అకృత్యాలకూ,కృూరత్వాలకూ అడ్డూ ఆపూ లేకుండాపోయాయి.
అప్పుడు విష్ణువు జమదగ్ని మహామునికి రాముడు అనే పేరుతో పుత్రుడుగా జన్మించాడు.పరశువును ధరించడం వలన పరశురాముడుగా ప్రసిద్ధికెక్కాడు.ఆ గండ్రగొడ్డలిని అతను శివుడునుంచి పొందాడు.
పరశురాముడు లోకకంటకులైన రాజులను ఇరవై ఒక్క సార్లు దాడి చేసి చంపాడు.ఆ సంహారాల అనంతరం వారి భూములను బ్రాహ్మణులకు ఇచ్చాడు.ఇది పరశురామావతారము.
శ్రీహరి దశరథునికి పుత్రునిగా జన్మించాడు. అతడు కోసల దేశ రాజు.శ్రీరాముడు అనే పేరుతో జన్మించాడు.భరత,లక్ష్మణ,శత్రుఘ్నులు అతని సోదరులు.శ్రీరాముడు శివధనుస్సును వించి జనక పుత్రిక అయిన సీతను వివాహము చేసుకున్నాడు.తండ్రి,పినతల్లి కోరిక మేర కానలకేగాడు.సీత,లక్ష్మణులు అతని వెంట వెళ్ళారు.ఆ అడవులలో క్రూరులైన రాక్షసులను చంపి,మునులకు అభయమిచ్చాడు.
ఖరదూషణులు రావణుని తమ్ముళ్ళు.వారి చెల్లెలు శూర్పణఖ రాముడుని మోహించి పెళ్ళి చేసుకోవాలనుకుంది.అప్పుడు ఆమె ముక్కుచెవులు లక్ష్మణుడు కోసివేస్తాడు.ఆ అవమానానికి ప్రతీకగా ఆమె సోదరులు పదునాలుగు వేలమంది రాక్షసులతో యుద్ధానికి వస్తారు రాముడు పైకి.రాముడు వారందరిని సంహారం చేస్తాడు.
సీతాన్వేషణలో భాగంగా సుగ్రీవుని మైత్రి అగ్ని సాక్షిగా కోరాడు.హనుమంతుడి సహాయంతో సీత జాడ కనుగొని,రావణ సంహారం చేసాడు.రావణుడి తమ్ముడు విభీషణుడిని లంకకు రాజును చేసాడు.
అయోధ్యకు సతీసమేతంగా వచ్చి రాజ్యానికి సుపరిపాలన అందించాడు.
ఇది శ్రీరామావతార కథ.
Sunday, 18 January 2026
వామన,హంస,మనువు,ధన్వంతరి అవతారములు
శ్రీహరి అదితి,కశ్యపులకు వామన రూపంలో జన్మించాడు.ఇంద్రుడికి తమ్ముడు అయినాడు.బలి చక్రవర్తి రాక్షస రాజు.అతనిని ఈ బ్రాహ్మణుడిగా వెళ్ళి మూడడుగులు దానం అడిగాడు.బలికి వచ్చింది శ్రీమహా విష్ణువే అని తెలుసు.కానీ ఒప్పుకున్నాడు.అంతలో వామనుడు ఇంతింతై వటుడింతై ముల్లోకాలనూ ఆక్రమించాడు.మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే తన శిరస్సు చూపిస్తాడు బలి చక్రవర్తి.రాక్షస గురువు చాలా వారిస్తాడు వద్దని,వచ్చింది ఆ పురుషోత్తముడని.కానీ బలి వినలేదు,వినిపించుకోలేదు.
భగవంతుడికే దానమిచ్చిన ఘనత బలి చక్రవర్తిది.వామనుడు అంతట తన మూడో అడుగు బలి తల పైన ఉంచి అధః పాతాళానికి అణగద్రొక్కాడు.ఇంద్రునికి స్వర్గాన్ని అప్పగించాడు.
ఇది వామన అవతారము.
బ్రహ్మ నారదుడితోటి హంస అవతారము గురించి చెబుతున్నాడు.ఓ నారదా!ఆ విశ్వ వ్యాపకుడు నా దైవభక్తి యోగానికి చాలా సంతోషించాడు.అప్పుడు హంస రూపము దాల్చాడు.హంస అయి ఆత్మ తత్త్వాన్ని వివరించే భాగవత పురాణాన్ని నాకు బోధించాడు.ఇది హంసావతార కథ.
ఆ దేవదేవుడు మనువుగా పుట్టాడు.గొప్ప తేజస్సుతో మెలిగాడు.అప్రతిహతమయిన చక్రాయుధాన్ని ధరించాడు.ఇక దుష్ట శిక్షణకు నడుము బిగించాడు.దుష్టులయిన రాజులనందరినీ దునుమాడుతూ శిష్టులను పాలించాడు.ఇది మనువు అవతారము.
ఆ చక్రథారి,ఆ మహావిష్ణువు ధన్వంతరిగా అవతరించాడు.ఆయుర్వేదమును నిర్మించాడు,కనుగొన్నాడు.ఆయన తన నామము స్మరిస్తేనే జనుల రోగములు నశింపచేసేవాడు.ఇది ధన్వంతరి అవతార సారము.
Subscribe to:
Comments (Atom)