Wednesday, 1 April 2026

యాదవ వంశం అధోగతిపాలు

శ్రీకృష్ణుడు ద్వారకలో సుఖంగా ఉన్నాడు.కానీ యాదవులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు.పైత్యం పెరిగిపోతుంది.ఒకరోజు మహా మహా మునులు శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలని వచ్చారు.వారితో పెద్దా చిన్నా అనే గౌరవం లేకుండా ఎకసక్కెములు ఆడారు.దానితో మునులకు కోపం వచ్చి మీలో మీరే కొట్టుకుని నశిస్తారు అని శపించి పోతారు.ఆ తరువాత కొన్ని రోజులకు జాతర వచ్చింది.అందరూ ప్రభాస తీర్థమునకు పోయి స్నానాలు చేసారు.ఒళ్ళూ పాయా తెలీనంతగా మద్యపానం సేవించారు.ఆ తరువాత ఒకళ్ళనొకళ్ళు కలహించుకోని,పొడుచుకుని చచ్చిపోయారు.శ్రీకృష్ణుడు అప్పుడు ఒక చెట్టు మొదట్లో చేరగిలబడి కూర్చున్నాడు.ఉధ్ధవుడిని బదరీవనమునకు పొమ్మని చెప్పి తను ఇంకో తట్టు ఎటో వెళ్ళిపోయాడు.ఉద్ధవుడు ఉండబట్టలేక అతనిని ఎతుక్కుంటూ పోయి ఒక చెట్టు మొదట విశ్రాంతిగా పడుకున్న శ్రీకృష్ణుడిని చూసాడు. అంతలో వ్యాస మహర్షి శిష్యుడు అయిన మైత్రేయిడు తీర్థ యాత్రలు చేసుకుంటూ అక్కడకు వచ్చాడు.

Saturday, 28 March 2026

శ్రీకృష్ణుడు శత్రు సంహారం ,మిత్ర సహకారం

శ్రీకృష్ణుడి లీలలు ఒకటా,రెండా?చెప్పుకుంటూ పోతుంటే వస్తూనే ఉంటాయి.మనం అలసి పోవాలి అంతే!శ్రీకృష్ణుడు నరకుడిని చంపిన తరువాత అతని చెరలో ఉన్న పదహారు వేల రాజకన్యలను విడిపించాడు.వారి ప్రార్థనపై వారందరినీ వివాహం చేసుకున్నాడు.కాలయవన,సాళ్వ,జరాసంథులు చతురంగబలాలతో వచ్చి మథురను చుట్టుముట్టాయి.వాళ్ళందరినీ సంహరించాడు.పాండవులు ఎప్పుడూ శ్రీకృష్ణుడిని నమ్ముకోని ఉన్నారు.వాళ్ళకు విజయం చేకూరేలా సహాయం చేసాడు.అలా కూడా శత్రు సంహారం అయింది.బలరాముడితో కలసి బాణుడు,శంబరుడు,మురుడు,పల్వలుడు మున్నగు రాక్షసులను చంపాడు.దంత వక్త్రుడు అనే రాక్షసుడిని యుద్ధంలో చంపాడు.అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగించి పాండవ నాశనంకు ఒడి కట్టాడు.అప్పుడు ఉత్తర గర్భంలో బిడ్డ బ్రతికి బట్ట కట్టేలా చేసాడు.పాండవుల వంశం నిలబెట్టి వారికి మహోపకారం చేసాడు.తరువాత కాలంలో ఆ బిడ్డ పరీక్షిత్తుగా గొప్ప పేరు తెచ్చుకునినాడు.శ్రీకృష్ణుడు లౌకిక,వైదిక మార్గములను నడుపుతూ నిస్సంగుడైనాడు.ద్వారకానగరంలో సుఖముగా కాలం గడిపాడు.

Monday, 23 March 2026

గోపికాలోలుని గొప్పదనం

శ్రీకృష్ణుడు తన వేణుగానంతో బృందావనంలో గోపికల మనసులు దోచుకున్నాడు.అంతేనా?వలువలూ దోచుకున్నాడు.వారికి మోక్షం కలిగించేదానికి.ఆ రాసక్రీడలలో రేపల్లె తడిసి ముద్దయి పోయింది.పెద్దా చిన్నా అనిలేకుండా ఆ మాథవుడు అందరినీ అలరించాడు.అందరి మనసులూ చూరగొన్నాడు.బలరాముడితో కలసి మధురా పట్టణానికి పయనమయ్యాడు.అక్కడ కంసుని సంహారం చేసాడు.తల్లిదండ్రులను చెరనుంచి విడిపించాడు.సాందీపునికి శిష్యుడు అయినాడు.వేదవేదాంగములను,అరువది నాలుగు విద్యలనూ గ్రహించాడు.ప్రభాస తీర్థమునకు పోయి సముద్రములో మునిగిపోయి మరణించిన గురుపుత్రుని బ్రతికించి తీసుకుని వచ్చాడు.అలా గురువుకు గురుదక్షిణ ఇచ్చాడు.ఎదిరించిన రాజులను అందరినీ తరిమి భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణిని వివాహము చేసుకున్నాడు.నగ్నజిత్తు అనే రాజు తన దగ్గర ఉన్న పొగరెక్కిన సప్త వృషభములను ఎవరు లొంగదీస్తారో వారికి తన కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తానన్నాడు.ఎవరికీ వల్లగాలేదు.అప్పుడు శ్రీకృష్ణుడు వాటిని లొంగదీసుకుని నాగ్నజితిని పెండ్లాడాడు.సత్యభామ కోరిక మేర దేవతలను ఓడించి పారిజాత వృక్షాన్ని భూమికి తీసుకుని వచ్చాడు.నరకాసురుడు భూదేవికి పుత్రుడు.లోక కంటకుడు అయిన అతనిని తన చక్రంతో సంహరించాడు.ఆ పైన అతని కొడుకుకు రాజ్యాభిషేకం చేసాడు.

Wednesday, 4 March 2026

శ్రీకృష్ణుని లీలలు

విదురుడు శ్రీకృష్ణుని నిర్యాణము,యాదవుల నిర్యాణము తెలుసుకుని చాలా దుఃఖించాడు.కొంచెం సేపటికి తేరుకున్నాడు.ఉద్ధవుడిని ఇలా అడిగాడు.స్వామీ!మీరు కృష్ణుడు భక్తులకే కాకుండా క్రూరులగు రాక్షసులకు కూడా పరమపదము ఇచ్చాడు అని చెప్పారు.అది ఎంత మటుకు సమంజసము?అది తప్పు కదా! దానికి ఉద్ధవుడు సమాథానం చెప్పనారంభించాడు.విదురా!ఆ రాక్షసులు అందరూ శ్రీకృష్ణుని ఎదిరించారు.నిజమే!కానీ అంత్యకాలంలో శ్రీబరిని చూస్తూ,హరీ!అని పిలుస్తూ ప్రాణాలు వదిలారు.కాబట్టి వాళ్ళకందరికీ కూడా మోక్షము లభించింది.అతని చేతుల్లో పోవడం వాళ్ళు చేసుకున్న పుణ్యం,అంతే! నీకు నేను శ్రీకృష్ణుని పుట్టుక,చరిత్ర టూకీగా చెబుతాను విను.బ్రహ్మాది దేవతలు భూభారం తగ్గించమని శ్రీహరిని ప్రార్థించారు.సరే అని ఆయన దేవకీ వసుదేవులకు పుత్రుడుగా జన్మించాడు.దేవకీ వసుదేవుల అష్టమ గర్భాన తనను చంపేవాడు పుడతాడని తెలిసి కంసుడు తన సోదరి బావలను చెరలో పెట్టాడు.కృష్ణుడు చెరసాలలోనే పుట్టాడు.వసుదేవుడు బిడ్డను కాపాడుకునే ప్రయత్నంగా నందుడి ఇంట్లో అర్థరాత్రి వదలిపెట్టి వచ్చాడు.పదకొండు ఏళ్ళు వచ్చేదాకా కృష్ణుడు బలరాముడితో కలసి నందుని ఇంట్లో పెరిగాడు.ఆ సమయంలో అతను శ్రీహరి అని ఎవరికీ అనుమానం రాకుండా జాగరూకత పాటించాడు.తోటి గోపాలకులతో అడవికి వెళ్ళి ఆవులు మేపుకుంటూ సరదా సరదాగా బాల్యం గడిపాడు.వేణుగానం చేస్తూ అందరి మనసులు చూరగొన్నాడు.మథ్య మథ్యలో కంసుడు పంపే రాక్షసులను తనకు తగిన రీతిలో హతమారుస్తూ కాలం గడిపాడు.కాళింది మడుగులో నీటిని విషపూరితం చేస్తున్న కాళియ సర్పాన్ని అక్కడ నుంచి తరిమి వేసాడు.ఇంద్రుడు తనకు పూజలు చేయలేదని ఆగ్రహించి గోపాలకుల పైన రాళ్ళ వాన కురిపించాడు ఏడు రోజులు.అప్పుడు కృష్ణుడు గోవర్థన పర్వతాన్ని తన చిటికెన వ్రేలుపై నిలిపి ఊరి వారందరినీ దాని క్రింద ఉంచి రక్షించాడు.

Monday, 2 March 2026

ఉద్ధవుడి ప్రత్యుత్తరము

విదురుడు అన్ని ప్రశ్నలు ఒకదాని తరువాత ఇంకొకటి,శర పరంపర లాగా వేసాడు.కానీ ఉద్ధవుడి నోటి నుంచి మాట రావడం లేదు.ఎందుకంటే అతను కృష్ణుని పోగొట్టుకునిన దుఃఖం నుంచి ఇంకా బయట పడలేదు.పైగా విదురుడు వారి క్షేమ సమాచారం అడగడంతో ఇంకా పొంగి పొరలు పొరలుగా ఏడుపు ముంచుకొచ్చింది. శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుతో ఇలా అంటున్నాడు.ఓ రాజా!ఉద్ధవునికి శ్రీకృష్ణుని పైన అలవిమాలినంత ప్రేమ.అది తెలియని వారు ఎవరూ ఉండరు.ఉద్ధవుడికి ఒక రకంగా కృష్ణుడు అంటే పిచ్చి ప్రేమ అని చెప్పవచ్చు.ఎందుకంటే అతను ఏడు ఏండ్ల బాలుడుగా ఉన్నప్పుడు తన తోడి బాలురలో ఒకడిని కృష్ణునిగా భావించేవాడు.అతనికి సేవలు చేసేవాడు.వాళ్ళ అమ్మ అన్నానికి పిలిచినా చెవికెక్కించుకున్వాడు కాదు.అట్లాంటి ఉద్ధవుడు విదురునికి సమాథానం చెప్పక పోవడంలో ఆశ్చర్యము ఏ మాత్రమూ లేదు.ఎందుకంటే కృష్ణుని వియోగము తట్టుకోవడం అతనికి చేతకావటం లేదు. అయినా ఉద్ధవుడు చిన్నగా తమాయించుకున్నాడు.కానీ గొంతు దుఃఖముతో బొంగురుపోయింది.ఆ గద్గద స్వరంతోటే చెప్పడం ప్రారంభించాడు.అయ్యా!విదురా!నా నోటితో ఏమని చెప్పేది?లోకరక్షకుడు,లోకబాంథవుడు అయిన శ్రీకృష్ణుడు అస్తమించాడు.భూదేవి దురదృష్టము ఏమని వర్ణించాలి?యాదవులు,వారి రాజ్యము నాశనము అయింది.ధర్మము మట్టి కొట్టుకుని పోయింది.అధర్మము ఊడలు దిగి పటిష్టమయిపోయింది.దానిని పెకిలించేవారు ఇంకెవరూ లేరు.మంచీ,మర్యాదా,మన్ననలు దారి తప్పి ఎటు పోయాయో అర్థం కావడం లేదు. ధర్మరాజు రాజసూయయాగమపుడు శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇచ్చినపుడు లోకాలన్నీ అతని కీర్తినీ,ధర్మనిష్టనీ శ్లాఘించారు కదా!బ్రహ్మ సృష్టికి ఇతనే మూలపురుషుడు అని ఆకాశానికి ఎత్తారు కదా!దుష్టుల విషయంలో అతని కనుబొమలు కోపంతో ముడిపడితేనే భూదేవి భారం సగం తగ్గిపోతుంది కదా!నిర్మల స్వరూపుడు అయిన అతనిని ఏమరుపాటున కూడా ఎవరూ మరువలేరు.శ్రీకృష్ణుడు ఉగ్రసేనుడిని రాజుని చేసాడు.అతని క్రింద భృత్యుడుగా సంతోషంగా సేవలందించాడు.పూతన అతనిని చంపేదానికి వచ్చిన రాక్షసి.కానీ ఆమెకు యశోదా దేవికి కూడా దక్కని ఉన్నత స్థానం ఇచ్చాడు కదా!శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువే అవుతుంది.ఆయన లీలలు అమోఘం!

Saturday, 28 February 2026

అయినవాళ్ళ యోగక్షేమాలు అడిగిన విదురుడు

ఉద్ధవుడిని చూడగానే విదురుడికి ప్రాణం లేచొచ్చినట్లయింది.వడివడిగా వెళ్ళి గట్టిగా కౌగలించుకున్నాడు.కుశల ప్రశ్నలు అడిగాడు.ఇంక నెమ్మదిగా మిగిలిన వారి కుశలం కనుక్కోవడం మొదలు పెట్టాడు.ఎవరికైనా తనా మనా ఉండడం సహజమే కదా! ఉద్ధవా!పుణ్యాత్ములు,శ్రీహరి భక్తులు,శత్రుమర్దనులు అయిన కుంతీ పుత్రులు క్షేమంగా ఉన్నారు కదా!బ్రహ్మ శ్రీహరిని ప్రార్థిస్తే అతడు బలరామ కృష్ణులు లాగా జన్మించారు కదా!వారిరువురూ క్షేమమే కదా!వసుదేవుడు,రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు,సాంబుడు,ఉగ్రసేనుడు,అక్రూరుడు,సాత్యకీ,దేవకీదేవి అందరూ కుశలమే గదా!వాసుదేవుడు,సంకర్షణుడు,అనిరుద్థుడు,చారుదేష్ణగాదులు సంతోషంగా ఉన్నారు కదా?శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిల సంతానం పదిమంది.వారిలో చారుదేష్ణ,సుదేష్ణ,చారుదేహ,చారుగుప్త అనువారు ముఖ్యులు.పాండవులూ అయిదుగురూ,కుంతీదేవి కుశలమే గదా?ధృతరాష్ట్రుడు క్షేమమే గదా?అతని కొడుకులు నవ్ను సభనుంచి తరిమివేయునపుడు నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా ఉండెను.అప్పుడు నాకు కలిగిన చిత్త క్షోభ అంతా ఇంతా కాదు.దానికి కారణమయిన అతడు తప్పకుండా నరకం ఊచలు లెక్కబెడతాడు. నీకు ఆశ్చర్యమనిపిస్తుందేమో?విదురుడు చాలా సౌమ్యుడు కదా!కోపతాపలకు అసలు చోటివ్వడు కదా!శాంతానికి మారు పేరు కదా!మరి ఇతనికి ఏంది?ఇంత కోపమేంది?ఇంత దుఃఖమేంది?అని.భగవంతుని మాయ వలన నాకు మోహము కలగకుండా ఉంటుందా?ఆ భగవంతుడే మానవరూపము దాల్చి ధర్మబద్ధులు అయిన పాండవుల పక్షాన నిలిచాడు.వాళ్ళకోసం రాయబారం చేసాడు.అప్పుడు దుష్ట దుర్యోధనాదులు ఏమి చేసారు?ఆ దేవతామూర్తిని పట్టి బంథించే దానికి ప్రయత్నం చేసారు.అతను తిరిగి వాళ్ళను ఏమీ చేయలేడని వారి థీమా.యుద్ధంలో వాళ్ళను నామరూపాలు లేకుండా చెయ్యాలనే ఆ సభలో శ్రీకృష్ణుడు వాళ్ళ ఆటలు సాగనిచ్చాడు.వాళ్ళ దుర్భాషలన్నిటినీ మౌనంగా భరించాడు.ఆ లీలా మానుష విగ్రహుడు,ఆ పరంథామ,ఆ శ్రీకృష్ణుడు తన అగ్రజుడు అయిన బలరాముడుతో కలిసి సంతోషంగా ఉన్నాడు కదా? విదురుడు శర పరంపరలాగా ప్రశ్నల పైన ప్రశ్నలు వేశాడు.

Wednesday, 25 February 2026

విదురుడికి అవమానము

విదురుడు ధృతరాష్ట్రుడికి హితము చెప్పడం దుర్యోధనుడికి అస్సలు నచ్చలేదు.కోపం నషాళానికి అంటింది.కర్ణుడు,శకుని,దుశ్శాసనుల వైపు చూస్తూ ఇలా అన్నాడు.విదురుడు దాసీ పుత్రుడు.ఇతనికి,ఇతని మాటలకు ఇంత ప్రాముఖ్యత, గౌరవము ఇవ్వాల్సిన పని లేదు.అసలు ఎవరు రానిచ్చారు అతనిని ఈ సమావేశానికి?మర్యాద నిలబెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు అవాకులు,చెవాకులు పేలుతున్నాడు.ఇతనిని ఉపేక్షించాల్సిన అవసరము మనకు ఏమాత్రమూ లేదు.ముందర వీడిని తరిమివేయండి అంటూ హుకుం జారీ చేసాడు. పెద్దా,చిన్నా అనే తారతమ్యము లేకుండా తండ్రి అంతటి వాడిని అలా అవమానకరంగా మాట్లాడటంతో విదురుడు నిర్ఘాంతపోయాడు.ఆ తరువాత కుమిలిపోయాడు.మనసుకు చాలా కష్టం వేసింది.సమాథానము చెప్పకుండా,మౌనంగా,కోపం దిగమింగుకుని,విల్లమ్ములను అక్కడే వదలి పెట్టేసి తీర్థ యాత్రకు వెళ్ళిపోయాడు. అతను పవిత్రములయిన విష్ణు క్షేత్రాలను సందర్శించాడు.గంగ మున్నగు పుణ్య నదులలో స్నానం చేసాడు.సిద్థాశ్రమాలను సందర్శించాడు.ఋషుల ఆశ్రమాలకు వెళ్ళాడు.కూరలు కాయలను నీటిని మటుకు ఆహారంగా స్వీకరిస్తూ అవధూత వేషము ధరించి తిరగసాగాడు. ఆ సమయంలోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది.కౌరవులు కొట్టుకుపోయారు,కాటికి పోయారు.విదురుడికి ఈ వార్త తను ప్రభాస తీర్థంలో ఉండేటప్పుడు తెలిసింది.ఎంతైనా అందరూ తన వాళ్ళే కదా!చాలా దుఃఖించాడు.ఇంక అక్కడ కుదురుగా ఉండ లేక పోయాడు.పోయి సరస్వతీ నదిలో స్నానము చేసాడు.పృథు,భార్గవాది తీర్థాలలో స్నానాలు చేసాడు.పవిత్రమయిన ప్రదేశాలు అన్నీ చూసుకుంటూ మత్స్య,కురు,జాంగల దేశాలు దాటాడు.యమునా నదీ తీరానికి చేరాడు.అక్కడ అతనికి ఉద్ధవుడు కనిపించాడు.ఉద్ధవుడు సకల సద్గుణశీలి.పరమ భాగవతోత్తముడు.