bhaagavatham balpasandugaa
Wednesday, 9 September 2026
కాల లక్షణము
మైత్రేయుడు కాల లక్షణము గురించి చెప్పడము మొదలు పెట్టాడు.విదురా!లేత సూర్యుని కిరణ సంగతమయి గగనస్థమగునది త్రస రేణువు.అంటే సూర్య కిరణాలు పడే దగ్గర ఆ వెలుగులో సూక్ష్మ ధూళి కణాలు చూస్తాము కదా!అవి అన్నమాట.దాని ఆరవ భాగము పరమాణువు ఉంటుంది.అదే సూక్ష్మ కాలము.సూర్య మండలము లోకము నందు పండ్రెండు రాశులలో చరించు కాలము మహా కాలము.రెండు పరమాణువులు కలిస్తే అణువు అవుతుంది.మూడు అణువులు ఒక త్రస రేణువు.మూడు త్రస రేణువులు ఒక్క తృటి.నూరు తృటులు ఒక వేధ.మూడు వేధములు ఒక లవము.మూడు లవములు ఒక నిమేషము.మూడు నిమేషములు ఒక క్షణము.అయిదు క్షణములు ఒక కాష్ఠ.పది కాష్ఠలు ఒక లఘువు.పదహైదు లఘువులు ఒక నాడి.రెండు నాడులు ఒక ముహూర్తము.ఆరు,ఏడు నాడులు మనుష్యులకు ఒక ప్రహరము.దీనినే యామము అని కూడా అంటారు.నాలుగు యామములు ఒక పగలు.నాలుగు యామములు రాత్రి.ఒక రాత్రి ఒక పగలు కలిస్తే ఒక దినము.పదహైదు దినములు ఒక పక్షము.శుక్ల పక్షము,కృష్ణ పక్షము అని రెండు పక్షములు ఉంటాయి.రెండు పక్షములు ఒక మాసము.ఒక మాసము పితృ దేవతలకు ఒక దినము.రెండు మాసములు ఒక ఋతువు.ఆరు మాసములు ఒక అయనము.ఉత్తరాయనము,దక్షినాయనము అని రెండు అయనములు ఉన్నాయి.రెండు అయనములు ఒక సంవత్సరము లేదా పన్నెండు మాసములు.ఒక సంవత్సరము దేవతలకు ఒక దినము.నూరు సంవత్సరములు మనుష్యుల ఆయుఃప్రమాణము.సూర్యుడు కాలాత్ముడు,విశ్వమయుడు.అతను నక్షత్ర గ్రహ మండలము నుండి పరమాణువు మొదలుకొని సంవత్సర కాలమానములోని చాలా మాసములలో కనుపిస్తుంటూ ఉంటాడు.ఆ మాసములు సౌరము,బార్హస్వత్యము,సావనము,చాంద్రము మరియు నాక్షత్రము అనునవి.కాల మానము సంవత్సరము,పరీవత్సరము,ఇడా వత్సరము,అనుత్సరము,వత్సరము అను భేదములు కలగి ఉంటుంది.సూర్యుడు ఈ వత్సర పంచక ప్రవర్తకుడు.ఆయన ఆయురాది వ్యయమున విషయాసక్తిని మళ్ళిస్కూ,కోరికలు కలవారికి యజ్ఞముల మూలమున స్వర్గాది ఫలములను చేకూరుస్తుంటాడు.
Wednesday, 2 September 2026
దేవ వర్గము సృష్టి
దేవ వర్గము ఎనిమిది రకాలుగా విభజన కాబడ్డది.అందులో విబుధులు,పితృ దేవతలు మరియు సురాదులు అని మూడు భేదములు;గంధర్వులు,అప్సరసలు ఒక తెగ;యక్షులు,రక్షసులు ఒక తెగ;భూత ప్రేత పిశాచములు ఒక విధము;సిద్ధులు,విద్యాధరులు,చారణలు ఒక తెగ;కిన్నర కింపురుషులు ఒక తెగ;ఇట్లా ఎనిమిది రకములుగా విభజన కావించబడినది.ఈ దేవ వర్గమును కూడా కలుపుకంటే మొత్తము సృష్టి పది రకములు.
కల్పాంతమున అమోఘ సంకల్పుడు అయిన శ్రీహరి రజో గుణముతో కూడి,తానే సృష్టి కర్త అగుచూ స్వస్వరూపమున విశ్వమును కల్పించాడు.అంతా ఆయన మాయే!ఇంకేమీ వేరే లేదు.దాని ప్రభావము వలన పూర్వాపర భావములు తెలియ కుండా గందర గోళం అనిపిస్తుంది.నిజానికి చెప్పాలంటే సుడి గుండం లో పడిన చెట్లు ఎట్లా తిరుగుతుంటాయో,అలా ఉంటుంది పరిస్థితి.ఈ కల్పములో ఉండే దేవతలు,అసురులు ప్రతి మన్వంతరములోనూ నామ రూపాలు కలిగి ఉంటారు.దేవ సృష్టి లోనే కౌమార సృష్టి అని ఇంకొకటి ఉంది.అది ప్రాకృత,వైకృత ఉభయాత్మకము అయి ఉంటుంది.అదే సనత్కుమారాది సృష్టి.వీరిలో దేవత్వమూ,మానుషత్వమూ రెండూ కలగలిపి ఉంటాయి.
Sunday, 30 August 2026
సృష్టి వివరణ…తొమ్మిది రకములు
సృష్టి అనేది తొమ్మిది విథములుగా ఉంది.వాటిలో ప్రాకృతములు,వైకృతములు ఉంటాయి.అవి కాల,ద్రవ్య,గుణ భేదములచే ప్రతిసంక్రమములు అవుతుంటాయి.మహతత్త్వము మొదటి సృష్టి.అది నారాయణ సకాశమున గుణవైషమ్యము పొందుతుంది.అంటే సత్త్వ రజస్తమో గుణాలు సృష్టికి పూర్వము సమతుల్యంగా ఉంటాయి.కానీ సృష్టి మొదలు అయిన తరువాత వాటిలో అసమానత ఏర్పడుతుంది.దానినే గుణ వైషమ్యము అని అంటారు.ద్రవ్య,జ్ఞాన,క్రియాత్మకమయిన అహంకార తత్త్వము రెండవ సృష్టి.శబ్ద,స్పర్శ,రూప,రసగంధములు అనే పంచభూతన్మాత్ర ద్రవ్యశక్తితో కూడిన పృథివి మున్నగు పంచభూతముల సృష్టి మూడవది.త్వక్కు,చక్షుస్సు,శ్రోత్రము,జిహ్వ,ఘ్రాణము అనే అయిదు జ్ఞానేంద్రియములు,వాక్ పాణి,పాద పయూపస్థములు అనే అయిదు కర్మేంద్రియములు నాలుగవ సృష్టి.పాయువు అనగా మలద్వారము,గుదము...శరీర విసర్జన కు సంబంధించినవి.ఉపస్థ అనగా జననేంద్రియములు...సంతానోత్పత్తికి వినియోగపడే ఇంద్రియములు.సాత్త్వికాహంకారమున పుట్టిన దేవతా గణము ఐదవ సృష్టి.అది మనోమయము అయి ఉంటుంది.జీవలోకమునకు అబుద్ధి వలన ఆవరణలను కలిగించు తామసము ఆరవ సృష్టి.పైన పేర్కొనబడిన ఆరూ భగవంతునికి విలాసార్థమయిన ప్రాకృత సృష్టులు.ఏడవ సృష్టి నుంచి వైకృత సృష్టులు ప్రారంభమవుతాయి.పూవులు లేకనే ఫలములను ఇచ్చు రావి మొదలగు వనస్పతి వృక్షములు,పుష్పించి ఫలించు ఆకులు గల చెట్లు,ఓషధులు,లతలు,వెదుళ్ళు,దుంపలు,మామిడి మున్నగు వృక్షములు ఏడవ సృష్టి.ఎనిమిదవ సృష్టి ఇరవై ఎనిమిది భేదములు గలది.జ్ఞాన శూన్యములై చీలిన గిట్టలు గల వృషభములు,గోవులు,దున్నలు,మేకలు,పందులు,ఒంటెలు మున్నగునివి;చీలని గిట్టలు గల గుర్రములు,గాడిదలు,శరభములు(ఎనిమిది కాళ్ళుగల అతి శక్తివంతమయిన పౌరాణిక మృగములు),చమరీ మృగములు లేదా జడల బర్రెలు;ఐదేసి గోళ్ళు గల కుక్క,నక్క,తోడేలు,పిల్లి,పులి,కుందేలు,సింహము,కోతి,ఏనుగు మున్నగునవి;మొసలి మున్నగు జలచరములు;గ్రద్ద,డేగ,నెమలి,హంస,చక్రవాకము,కాకి,గుడ్ల గూబ మున్నగు పక్షులు;వీటినన్నిటినీ తిర్యగ్గణంబులు అని అంటారు.అంటే జంతు పశు పక్ష్యాదులు.వీటికి వెన్నెముక అడ్జంగా ఉండి,నేలపైన అడ్డంగా నడుస్తాయి.
మానవుడు తొమ్మిదవ సృష్టి.అది రజోగుణ ప్రేరితము అయి,పనులు చేయుటకు తగ్గి దుఃఖమునందును సుఖము కోరుకుంటుంది.ఈ మూడు సృష్టులూ వైకృత సృష్టులు.
Friday, 28 August 2026
బ్రహ్మ సృజన
బ్రహ్మ శ్రీహరిని స్తుతించడము అంతా మైత్రేయుడు విదురుడికి చెప్పాడు.ఒక ముఖ్యమయిన విషయము చెబుతూ చెబుతూ మధ్యలో ఆపితే ఎలాఉంటుంది?ఉత్కంఠ తట్టుకోలేము కదా!విదురుడి పరిస్థితి కూడా అలానే ఉంది.ఉండబట్టలేక మైత్రేయుడిని అడుగుతున్నాడు.స్వామీ!శ్రీహరి బ్రహ్మను దీవించి అంతర్థానం అయ్యాడు అని చెప్పారు కదా!ఆ తరువాత బ్రహ్మ ఏమి చేసాడు?దేవ సంబంథమునను,మానవ సంబంథమునను ఈ సృష్టి ఎట్లా చేయగలిగాడు?నాకు వివరంగా చెప్పండి,స్వామీ!
విదురుడి మాటలకు ప్రసన్నుడు అయిన మైత్రేయుడు చెప్పడం ప్రారంభించాడు.పుండరీకాక్షుడు బ్రహ్మను దీవించాడు అని చెప్పాను కదా.ఆయన సూచన మేర బ్రహ్మ నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసాడు.ఆ తపోబలముతో తనకు నివాసము అయిన పద్మమును,వాయువును,జలమును కనుగొన్నాడు.తన తపశ్శక్తి వలన చేకూరిన విద్యాబలముతో వాయువును బంధించాడు.గగన వ్యాపి సగు జలమును కనుగొన్నాడు.శ్రీహరి నుంచి తన ధ్యానము,ధ్యాస మరల్చకుండా తదేకంగా మనసు నిలిపి గగన తలమున పద్మమును చూచి,ఆ పద్మకోశములో అణగియున్న లోకములను గమనించాడు.తనకు తానే తెలుసుకున్నాడు.ఏమని?ఈ బ్రహ్మాండ కోటి సృష్టికి శ్రీహరి తనను ఎంచుకున్నాడని.ఇంక జాగు చేయదలచుకోలేదు.ఆ పద్మములోనికి పోయి,అక్కడ ముల్లోకాలను చూసాడు.పదునాలుగు లోకాలను సృజించాడు.తదుపరి దేవతలను సృష్టించాడు.ఆ తరువాత మనుష్యులను సృష్టించాడు.పిదప తిర్యక్కులను సృజించాడు.తిర్యక్కులు అనగా పశుపక్ష్యాదులు అని అర్థము.తరువాత స్థావరములు సృష్టించాడు.స్థావరములు అనగా స్థిరముగా ఒకే చోట ఉండేవి...అనగా చెట్లు.
విదురుడికి ఇంకా ఇంకా చెప్పించుకోవాలని ఉంది.అందుకని ఇలా అడిగాడు.ఓ మైత్రేయ మహర్షీ!నీవు ఇప్పుడు చెప్పావు కదా,విష్ణుదేవుని మహిమ వల్లనే లోకములు అన్నీ ఏర్పడ్డాయి అని.ఆ మహిమాన్వితుడు అయిన విష్ణుమూర్తి గురించి చెప్పు.మైత్రేయుడు చెప్పాడు.విదురా!శ్రీహరి కాలానురూపము గైకొని తన్ను తాను ఇట్లా సృజించుకున్నాడు.అతడు సర్వలోకాలలో ఉంటాడు.తనలోనే సర్వ లోకాలూ ఉంటాయి.ఆయనను తప్పించుకోవడము ఎవరికీ కుదరదు.కావున ఈ విశ్వానికి అంతటికీ కర్త,కర్మ,క్రియ అతనే!ఈ విశ్వము అంతా అతని శరీరము నుండే వెలుపలకు వచ్చింది.అది అతని మాయ వల్లనే పుడుతుంది,పెరుగుతుంది,విలయము అవుతుంది.అంతా ఆయన ఇష్టమే!
Monday, 24 August 2026
శ్రీహరి సుముఖం
బ్రహ్మ స్తుతించడం చాలా బాగుంది.అది శ్రీహరికి కూడా నచ్చింది.హరి ముదమారగా ప్రసన్నుడయినాడు.బ్రహ్మతో ఇలా అన్నాడు.ఓయీ!సృష్టి కార్యము చేయలేకపోతున్నాను అని దిగులు పడవద్దు.దానికి కావలసిన జ్ఞానము కోసరము నియమ నిష్టలు పాటిస్తూ తపస్సు చేయుము.అపుడు నేను నీకు సాక్షాత్కారము అవుతాను.నేను ఇందుగలడందులేడని సందేహము వద్దు.నేను సర్వ వ్యాపకుడిని.సర్వాంతర్యామిని.సకల జీవులలో ఉండేది నేనే.ఇక్కడైతేనే ఉంటాను.అక్కడికి రాను.అట్లా ఏమీ లేదు.ఈ సృష్టిలోని అణువు అణువులో నేను ఉన్నాను.అది తెలుసుకొని,మసలుకో!కాబట్టి ఈ ప్రకృతి,చరాచర జగత్తును అంతా సేవించి,తరించు.అప్పుడు నీ దోషములు అన్నీ పటాపంచలు అవుతాయి.నీ మదిలో ఎప్పుడూ ఇదే ధ్యాస ఉండాలి.పరాత్పరుడు,పరంధాముడు అయిన శ్రీహరే భూతేంద్రియ గుణాత్ముడు,జగన్మయుడు అని అర్థం చేసుకో.నీవు పద్మ నాళ వివర మార్గమున వేలకు వేల మైళ్ళు నీటిలో వెదికావు కదా,నా కోసము!ఇదుగో!నీ ముందే ఉన్నాను.చూడు!నేను విలాసార్థము సగుణుడుని అయ్యాను,జగములను కల్పించానని తెలుసుకున్నావు.నన్ను స్తుతించావు.నాకు సంతోషము కలిగించావు.నాకు ఇష్టమై నిన్ను సృజించాను.నా లోపల నిశ్చల గతిని లోకములు అన్నీ ఉన్నాయి కదా!అహంకార మూల తత్త్వమును పొంది నీవు సృజన చేయి.ఇలా చెప్పి అలా అంతర్థానమయ్యాడు మన అయ్యవారు.
Saturday, 22 August 2026
జ్ఞాన భిక్ష కోరిన బ్రహ్మ
బ్రహ్మ ఆనందానికి అవథులు లేకుండా ఉన్నాయి.పరమాత్ముడి దర్శనంతో దశ,దిశ తిరిగిపోయిందని భలే సంతోషిస్తున్నాడు.భగవంతుడిని చూసిన ఆ క్షణం మళ్ళీ మళ్ళీ తలచుకుని,పులకరించిపోతున్నాడు.ఇంకా ఇలా పొగుతున్నాడు.కానీ అవన్నీ పచ్చి నిజాలే!అతిశయోక్తులు ఏమాత్రమూ కావు.హే పరంథామా!ఓ పరాత్పరా!నీ పాదపద్మములు సేవించే భాగ్యము కలగడం పెద్ద అదృష్టం!ఆ భాగ్యము కలిగితే,ఇంక భయానికి తావు లేదు.శోకానికి అవకాశం లేదు.ముక్తి మార్గానికి మనకు అనుమతి,ఆమోదము లభించినట్లే!స్వామీ!కొందరు మూర్ఖులు ఉంటారు.వారు నీ నామస్మరణ చేయకుండా సమస్త పాపాలనూ మూటగట్టుకుంటారు.తప్పు దారిలో పోతారు.ఇంద్రియ నిగ్రహము లేకుండా అమంగళ కార్యములు చేస్తారు.ఎంత సేపూ క్షుత్పిపాస దుఃఖము ...అంటే ఆకలి దప్పులతో బాధపడుతుంటారు.మానవుడు తను వేరు,ఆత్మ వేరు,ఆత్మ వేరు పరమాత్మ వేరు..।నేను నేనే...నువ్వు నువ్వే...అనుకునేటంత కాలమూ సంసారమనే సాగరాన్ని దాటలేడు.ఎక్కడికక్కడ మునకలు వేస్తుంటాడు.మనిషి యోగమార్గాన్ని ఆశ్రయిస్తే కానీ పరమపురుషుని పాదారవిందములు కానలేడు.నిష్కామ భక్తులకు భగవంతుడు ప్రసన్నుడు అయినట్టు దేవతలను కూడా కాడు.నీ నామ స్మరణతోటే మానవుడికి జన్మ జన్మల పాపాలు నాశనం అయిపోతాయి.మోక్షము పొందుతాడు.
ఓ దేవ దేవా!కల్పాంతమున పద్మము నందు ఉద్భవించిన నేను నీ స్వరూపము కనుక్కోవాలని ఉబలాట పడ్డాను.ఎన్నో ఏళ్ళు తపస్సు చేసాను.చాలా యాగములు జేసాను.భలే దిగులు పడ్డాను.నీవు నా పైన దయ తలచి నాకు కనిపించావు.నా జన్మ ధన్యమయింది.నీవే నాకు దిక్కు,దిశ,దశ చూపించాలి.నీవు పంచభూత ప్రవర్తకమగు మాయకు చిక్కకుండా,నీ జఠరము నందు ముల్లోకాలనూ ఉంచావు.పాల కడలిలో శేషశయనుడివై యోగనిద్రలో గడిపావు.కొంత కాలానికి మేలుకున్నావు.నీ వాభి కమలము నుంచి ముల్లోకాలనూ సృజించావు.ఇదంతా ఏ జ్ఞానముతో చేసావో,ఆ జ్ఞానము నాకు ప్రసాదించు.నాకు సృష్టి నిర్మాణము చేయాలని సంకల్పము ఉంది.కానీ చేతకావడం లేదు.నీవు కరుణతో జ్ఞానభిక్ష చేసావంటే నేను కృతార్థుడను అవుతాను.
Saturday, 15 August 2026
బ్రహ్మకు జ్ఞానోదయము
బ్రహ్మ అతని నాభీ సరస్సున పుట్టిన పద్మము,జలము,వాయువు,ఆకాశము మటుకు చూడగలిగాడు.రజోగుణ యుక్తుడు అయిన బ్రహ్మకు సృష్టి చేసేదానికి సరి అయిన మార్గము తోచలేదు.పని చేయాలనే తపన,వ్యామోహము,అహంభావము,అశాంతి,ఇంద్రియభోగాల పట్ల అమితమయిన కోరికలు...ఇవి రజోగుణము ఉన్నవారి లక్షణాలు.కానీ ఎలాగో సర్వమునకు శ్రీహరి మూలాథారము అని తెలుసుకున్నాడు.ఆ దేవదేవుడితో మొర పెట్టుకున్నాడు.ఓ జగన్నాథా!ఓ దేవదేవా!నువ్వు ఒక్కటే సత్యమూ,నిత్యమూ.నీ స్వరూపమే నాకు జ్ఞాన మార్గము చూపించింది.నీ దివ్యరూపము చూడగలగడమే నా అజ్ఞానానికి చరమగీతం పాడింది.నాలో వివేకము,విజ్ఞత వికసించాయి.మంచి వాళ్ళనూ,సత్పురుషులనూ అనుగ్రహించేదానికి నీవు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటావు.దాని వలన ఎన్నో అవతారాలు ఎత్తి ఉంటావు,ఎత్తుతూ ఉంటావు.నీవు ఈ విషయంలో అలుపూ సొలుపూ,అనాసక్తత అసలు ప్రదర్శించవు.నీ రూపము చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించేలా మనసును ఊరిస్తున్నది.నీ స్వరూపము ముందర నేను చూడగలిగాను.నా జన్మ ధన్యమయినది.ఈ ప్రపంచాన్ని పుట్టించింది నీవే!నా రూపము భూతేంద్రియాత్మకము అనగా పంచభూతములు మరియు ఇంద్రియములచే కార్యరూపము దాల్చినది.కానీ నేను సదా నిన్ను సేవించుకుంటాను,నీ ఆశ్రయము కోరుకుంటాను.పనికిమాలిన తర్కములు చేసేవారికి నీ మహిమలు,నీ గొప్పదనం తెలియదు.కృతార్థులు అయిన మహాత్ములే నిన్ను సంపూర్ణంగా కనుగొనగలరు.ఎల్లప్పుడూ నీ పాదారవిందముల సేవలో మునిగి తేలుతూ ఉంటారు.నీ పాదకమలాలను ఎన్నటికీ విడనాడరు.
Subscribe to:
Posts (Atom)