bhaagavatham balpasandugaa
Friday, 28 August 2026
బ్రహ్మ సృజన
బ్రహ్మ శ్రీహరిని స్తుతించడము అంతా మైత్రేయుడు విదురుడికి చెప్పాడు.ఒక ముఖ్యమయిన విషయము చెబుతూ చెబుతూ మధ్యలో ఆపితే ఎలాఉంటుంది?ఉత్కంఠ తట్టుకోలేము కదా!విదురుడి పరిస్థితి కూడా అలానే ఉంది.ఉండబట్టలేక మైత్రేయుడిని అడుగుతున్నాడు.స్వామీ!శ్రీహరి బ్రహ్మను దీవించి అంతర్థానం అయ్యాడు అని చెప్పారు కదా!ఆ తరువాత బ్రహ్మ ఏమి చేసాడు?దేవ సంబంథమునను,మానవ సంబంథమునను ఈ సృష్టి ఎట్లా చేయగలిగాడు?నాకు వివరంగా చెప్పండి,స్వామీ!
విదురుడి మాటలకు ప్రసన్నుడు అయిన మైత్రేయుడు చెప్పడం ప్రారంభించాడు.పుండరీకాక్షుడు బ్రహ్మను దీవించాడు అని చెప్పాను కదా.ఆయన సూచన మేర బ్రహ్మ నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసాడు.ఆ తపోబలముతో తనకు నివాసము అయిన పద్మమును,వాయువును,జలమును కనుగొన్నాడు.తన తపశ్శక్తి వలన చేకూరిన విద్యాబలముతో వాయువును బంధించాడు.గగన వ్యాపి సగు జలమును కనుగొన్నాడు.శ్రీహరి నుంచి తన ధ్యానము,ధ్యాస మరల్చకుండా తదేకంగా మనసు నిలిపి గగన తలమున పద్మమును చూచి,ఆ పద్మకోశములో అణగియున్న లోకములను గమనించాడు.తనకు తానే తెలుసుకున్నాడు.ఏమని?ఈ బ్రహ్మాండ కోటి సృష్టికి శ్రీహరి తనను ఎంచుకున్నాడని.ఇంక జాగు చేయదలచుకోలేదు.ఆ పద్మములోనికి పోయి,అక్కడ ముల్లోకాలను చూసాడు.పదునాలుగు లోకాలను సృజించాడు.తదుపరి దేవతలను సృష్టించాడు.ఆ తరువాత మనుష్యులను సృష్టించాడు.పిదప తిర్యక్కులను సృజించాడు.తిర్యక్కులు అనగా పశుపక్ష్యాదులు అని అర్థము.తరువాత స్థావరములు సృష్టించాడు.స్థావరములు అనగా స్థిరముగా ఒకే చోట ఉండేవి...అనగా చెట్లు.
విదురుడికి ఇంకా ఇంకా చెప్పించుకోవాలని ఉంది.అందుకని ఇలా అడిగాడు.ఓ మైత్రేయ మహర్షీ!నీవు ఇప్పుడు చెప్పావు కదా,విష్ణుదేవుని మహిమ వల్లనే లోకములు అన్నీ ఏర్పడ్డాయి అని.ఆ మహిమాన్వితుడు అయిన విష్ణుమూర్తి గురించి చెప్పు.మైత్రేయుడు చెప్పాడు.విదురా!శ్రీహరి కాలానురూపము గైకొని తన్ను తాను ఇట్లా సృజించుకున్నాడు.అతడు సర్వలోకాలలో ఉంటాడు.తనలోనే సర్వ లోకాలూ ఉంటాయి.ఆయనను తప్పించుకోవడము ఎవరికీ కుదరదు.కావున ఈ విశ్వానికి అంతటికీ కర్త,కర్మ,క్రియ అతనే!ఈ విశ్వము అంతా అతని శరీరము నుండే వెలుపలకు వచ్చింది.అది అతని మాయ వల్లనే పుడుతుంది,పెరుగుతుంది,విలయము అవుతుంది.అంతా ఆయన ఇష్టమే!
Monday, 24 August 2026
శ్రీహరి సుముఖం
బ్రహ్మ స్తుతించడం చాలా బాగుంది.అది శ్రీహరికి కూడా నచ్చింది.హరి ముదమారగా ప్రసన్నుడయినాడు.బ్రహ్మతో ఇలా అన్నాడు.ఓయీ!సృష్టి కార్యము చేయలేకపోతున్నాను అని దిగులు పడవద్దు.దానికి కావలసిన జ్ఞానము కోసరము నియమ నిష్టలు పాటిస్తూ తపస్సు చేయుము.అపుడు నేను నీకు సాక్షాత్కారము అవుతాను.నేను ఇందుగలడందులేడని సందేహము వద్దు.నేను సర్వ వ్యాపకుడిని.సర్వాంతర్యామిని.సకల జీవులలో ఉండేది నేనే.ఇక్కడైతేనే ఉంటాను.అక్కడికి రాను.అట్లా ఏమీ లేదు.ఈ సృష్టిలోని అణువు అణువులో నేను ఉన్నాను.అది తెలుసుకొని,మసలుకో!కాబట్టి ఈ ప్రకృతి,చరాచర జగత్తును అంతా సేవించి,తరించు.అప్పుడు నీ దోషములు అన్నీ పటాపంచలు అవుతాయి.నీ మదిలో ఎప్పుడూ ఇదే ధ్యాస ఉండాలి.పరాత్పరుడు,పరంధాముడు అయిన శ్రీహరే భూతేంద్రియ గుణాత్ముడు,జగన్మయుడు అని అర్థం చేసుకో.నీవు పద్మ నాళ వివర మార్గమున వేలకు వేల మైళ్ళు నీటిలో వెదికావు కదా,నా కోసము!ఇదుగో!నీ ముందే ఉన్నాను.చూడు!నేను విలాసార్థము సగుణుడుని అయ్యాను,జగములను కల్పించానని తెలుసుకున్నావు.నన్ను స్తుతించావు.నాకు సంతోషము కలిగించావు.నాకు ఇష్టమై నిన్ను సృజించాను.నా లోపల నిశ్చల గతిని లోకములు అన్నీ ఉన్నాయి కదా!అహంకార మూల తత్త్వమును పొంది నీవు సృజన చేయి.ఇలా చెప్పి అలా అంతర్థానమయ్యాడు మన అయ్యవారు.
Saturday, 22 August 2026
జ్ఞాన భిక్ష కోరిన బ్రహ్మ
బ్రహ్మ ఆనందానికి అవథులు లేకుండా ఉన్నాయి.పరమాత్ముడి దర్శనంతో దశ,దిశ తిరిగిపోయిందని భలే సంతోషిస్తున్నాడు.భగవంతుడిని చూసిన ఆ క్షణం మళ్ళీ మళ్ళీ తలచుకుని,పులకరించిపోతున్నాడు.ఇంకా ఇలా పొగుతున్నాడు.కానీ అవన్నీ పచ్చి నిజాలే!అతిశయోక్తులు ఏమాత్రమూ కావు.హే పరంథామా!ఓ పరాత్పరా!నీ పాదపద్మములు సేవించే భాగ్యము కలగడం పెద్ద అదృష్టం!ఆ భాగ్యము కలిగితే,ఇంక భయానికి తావు లేదు.శోకానికి అవకాశం లేదు.ముక్తి మార్గానికి మనకు అనుమతి,ఆమోదము లభించినట్లే!స్వామీ!కొందరు మూర్ఖులు ఉంటారు.వారు నీ నామస్మరణ చేయకుండా సమస్త పాపాలనూ మూటగట్టుకుంటారు.తప్పు దారిలో పోతారు.ఇంద్రియ నిగ్రహము లేకుండా అమంగళ కార్యములు చేస్తారు.ఎంత సేపూ క్షుత్పిపాస దుఃఖము ...అంటే ఆకలి దప్పులతో బాధపడుతుంటారు.మానవుడు తను వేరు,ఆత్మ వేరు,ఆత్మ వేరు పరమాత్మ వేరు..।నేను నేనే...నువ్వు నువ్వే...అనుకునేటంత కాలమూ సంసారమనే సాగరాన్ని దాటలేడు.ఎక్కడికక్కడ మునకలు వేస్తుంటాడు.మనిషి యోగమార్గాన్ని ఆశ్రయిస్తే కానీ పరమపురుషుని పాదారవిందములు కానలేడు.నిష్కామ భక్తులకు భగవంతుడు ప్రసన్నుడు అయినట్టు దేవతలను కూడా కాడు.నీ నామ స్మరణతోటే మానవుడికి జన్మ జన్మల పాపాలు నాశనం అయిపోతాయి.మోక్షము పొందుతాడు.
ఓ దేవ దేవా!కల్పాంతమున పద్మము నందు ఉద్భవించిన నేను నీ స్వరూపము కనుక్కోవాలని ఉబలాట పడ్డాను.ఎన్నో ఏళ్ళు తపస్సు చేసాను.చాలా యాగములు జేసాను.భలే దిగులు పడ్డాను.నీవు నా పైన దయ తలచి నాకు కనిపించావు.నా జన్మ ధన్యమయింది.నీవే నాకు దిక్కు,దిశ,దశ చూపించాలి.నీవు పంచభూత ప్రవర్తకమగు మాయకు చిక్కకుండా,నీ జఠరము నందు ముల్లోకాలనూ ఉంచావు.పాల కడలిలో శేషశయనుడివై యోగనిద్రలో గడిపావు.కొంత కాలానికి మేలుకున్నావు.నీ వాభి కమలము నుంచి ముల్లోకాలనూ సృజించావు.ఇదంతా ఏ జ్ఞానముతో చేసావో,ఆ జ్ఞానము నాకు ప్రసాదించు.నాకు సృష్టి నిర్మాణము చేయాలని సంకల్పము ఉంది.కానీ చేతకావడం లేదు.నీవు కరుణతో జ్ఞానభిక్ష చేసావంటే నేను కృతార్థుడను అవుతాను.
Saturday, 15 August 2026
బ్రహ్మకు జ్ఞానోదయము
బ్రహ్మ అతని నాభీ సరస్సున పుట్టిన పద్మము,జలము,వాయువు,ఆకాశము మటుకు చూడగలిగాడు.రజోగుణ యుక్తుడు అయిన బ్రహ్మకు సృష్టి చేసేదానికి సరి అయిన మార్గము తోచలేదు.పని చేయాలనే తపన,వ్యామోహము,అహంభావము,అశాంతి,ఇంద్రియభోగాల పట్ల అమితమయిన కోరికలు...ఇవి రజోగుణము ఉన్నవారి లక్షణాలు.కానీ ఎలాగో సర్వమునకు శ్రీహరి మూలాథారము అని తెలుసుకున్నాడు.ఆ దేవదేవుడితో మొర పెట్టుకున్నాడు.ఓ జగన్నాథా!ఓ దేవదేవా!నువ్వు ఒక్కటే సత్యమూ,నిత్యమూ.నీ స్వరూపమే నాకు జ్ఞాన మార్గము చూపించింది.నీ దివ్యరూపము చూడగలగడమే నా అజ్ఞానానికి చరమగీతం పాడింది.నాలో వివేకము,విజ్ఞత వికసించాయి.మంచి వాళ్ళనూ,సత్పురుషులనూ అనుగ్రహించేదానికి నీవు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటావు.దాని వలన ఎన్నో అవతారాలు ఎత్తి ఉంటావు,ఎత్తుతూ ఉంటావు.నీవు ఈ విషయంలో అలుపూ సొలుపూ,అనాసక్తత అసలు ప్రదర్శించవు.నీ రూపము చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించేలా మనసును ఊరిస్తున్నది.నీ స్వరూపము ముందర నేను చూడగలిగాను.నా జన్మ ధన్యమయినది.ఈ ప్రపంచాన్ని పుట్టించింది నీవే!నా రూపము భూతేంద్రియాత్మకము అనగా పంచభూతములు మరియు ఇంద్రియములచే కార్యరూపము దాల్చినది.కానీ నేను సదా నిన్ను సేవించుకుంటాను,నీ ఆశ్రయము కోరుకుంటాను.పనికిమాలిన తర్కములు చేసేవారికి నీ మహిమలు,నీ గొప్పదనం తెలియదు.కృతార్థులు అయిన మహాత్ములే నిన్ను సంపూర్ణంగా కనుగొనగలరు.ఎల్లప్పుడూ నీ పాదారవిందముల సేవలో మునిగి తేలుతూ ఉంటారు.నీ పాదకమలాలను ఎన్నటికీ విడనాడరు.
Thursday, 13 August 2026
శేషశయనుడు సాకారము
బ్రహ్మకు ఏమీ అర్థం కావటం లేదు.బుర్ర నిండా ప్రశ్నలే!అనుమానాలే!దానికి ఆరంభం...అంతం కనిపించడం లేదు.అసలు ఈ జలము ఎక్కడిది?ఈ జలములో ఈ పద్మము ఎలా పుట్టింది?ఈ పద్మం పైకి నేను ఎట్లా వచ్చాను?అసలు నా పుట్టుకకు కారణమేంది?నేను ఎవరు?నా పేరు ఏంది?అసలు ఈ పద్మనాళము యొక్క మూలము ఎక్కడుంది?ఈ అనుమానం మదిలో రేకెత్తగానే ఒకచోట కుదురుగా కూర్చోలేకపోయాడు.ముందు వెనక ఆలోచించకుండా సముద్రంలోకి దూకాడు.ఆ పద్మనాళము యొక్క మొదలు కనుక్కునేదానికి దానిని అనుసరించాడు.ఇలా ఒక రోజా?ఒక నెలా?ఒక సంవత్సరమా?కాదు,కాదు.ఏకంగా వేయి దివ్య సంవత్సరాలు వెతికాడు.అయినా ఫలితం దక్కిందా అంటే అదీ లేదు.భగవంతుడి మాయ వలన ఏమీ తెలియలేదు,తేలలేదు.గమ్మున వెనకకు తిరిగి వచ్చాడు.తను ఉద్భవించిన కమలము మధ్యలో ఉన్న పీఠము పైన కూర్చున్నాడు.అష్టాంగ యోగమున పవనమును బంథించి నూరేండ్లు సమాథిలో ఉన్నాడు.ఆ యోగశక్తి వలన తనకు జ్ఞానము కలిగినది.కానీ తన పుట్టుటకు కారణమయిన వాడు,తనలోనే వాడు అయిన శ్రీహరిని కనుక్కోలేక పోయాడు,కానలేకపోయైడు.ఇంక నిశ్చలమయిన భక్తి యోగమును ఆశ్రయించాడు.దాని మహిమ వలన శేషనాగు శయ్య పైన శయనించి ఉన్న శంఖచక్రధరుడైన పరమాత్మను తిలకించాడు.శ్రీహరి ఎలా కనిపించాడు?పీతాంబరములతో,బంగారు కిరీటంతో ధగధగమని వెలిగి పోతున్నాడు.ముత్యాల హారాలు,తులసీదామాలతో అలరారుతున్నాడు.ఆ పరాత్పరుడి దేహము అపరిచ్ఛన్నముగా,అనగా సంపూర్ణంగా ఉన్నది.ముల్లోకాలలో ఆ శరీర శోభకు సాటి లేదు.అతని శరీరకాంతులు ఎలా ఉన్నాయి అంటే వాటి వెలుగుల వలన ఆయన ధరించిన ఆభూషణములకు వన్నె వచ్చింది,వింత శోభ చేకూరింది.అతని పాదపద్మ యుగము,అనగా తామర పువ్వుల వలె సుకుమారంగా ఉండే పాదములు,భక్తుల కోర్కెలు తీర్చే కామధేనువు.అతనిని సరిగ్గా వర్ణింప గలిగే వారు ముల్లోకాలలో లేరు.అంతటి దివ్యమయిన,తేజోమయమయిన రూపము.అతనే సర్వేశ్వరుడు.ఆది అంతములు లేనివాడు.కర్త,కర్మ,క్రియ అన్నీ తానే అయిన జగదేక పూజ్యుడు.బ్రహ్మ జీవితం ధన్యమయింది ఆ పరాత్పరుడి దర్శనంతో!
Sunday, 2 August 2026
సృష్టికార్యమునకు సంకల్పము-బ్రహ్మ పుట్టుక
ప్రళయము వచ్చింది.జగత్తు మొత్తమూ జలమయము అయిపోయింది.ఆ జలము మధ్యలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్నాడు.చిచ్ఛక్తితో కూడి కపట నిద్రలో ఉన్నాడు.నిమీలితాక్షుడు వేయి తలలు గల శేషనాగుపై శయన ముద్రలో ఉన్నాడు.పక్కరోజు పరీక్ష ఉందంటేనే మనకు రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు.అట్లాంటిది జగన్నాటక సూత్రథారికి ఎలా పడుతుంది?అందుకనే కపట నిద్ర అని అన్నారు.అతడు యోగమాయకు దూరముగా వేయి యుగములు శయన నిద్రలో ఉన్నాడు.ఆ తరువాత సృష్టి కార్యమునకు సంకల్పము చేసుకున్నాడు.అంత వరకూ అన్ని లోకములూ అతనిలో అణగి ఉన్నాయి.మరలా వాటిని సృజించేదానికి సాథనము అయిన సూక్ష్మార్థమును గ్రహించాడు.అప్పుడు రజో గుణమును పుట్టించాడు.దాని వలన అతని నాభి యందు పద్మ నాళము పుట్టింది.దాని నుంచి పద్మము ఉద్భవించింది.ఆ పద్మము నుంచి చతుర్ముఖుడు అయిన బ్రహ్మ పుట్టాడు.ఆ బ్రహ్మకు అంతా కొత్తగా ఉంది.అతను ఆ తామర పువ్వు కర్ణిక పైన నిలుచుకున్నాడు.కర్ణిక అంటే తామర పువ్వు మధ్య భాగము.తన నాలుగు ముఖాలలో ఉండే కన్నులు విప్పి ఆకాశం చూసాడు.నలు దిక్కులనూ కలియ చూసాడు.ఆయనకు అంతా అయోమయంగా ఉంది.ఏమీ అర్థం కావడం లేదు.
Wednesday, 29 July 2026
భాగవతమునకు నాందీ ప్రస్తావన
విదురుడు మైత్రేయుడిని ఇంకా ఇలా అడిగాడు.స్వామీ!మీరు నాకు ఈ భూమికి క్రింద,మీద ఉండు లోకాల గురించి చెప్పాలి.అక్కడ స్థితి గతులు గురించి చెప్పాలి.అంతేనా?అలాగే దేవ,రాక్షస,గరుడ,గంధర్వ,నాగ,సిద్ధ సాధ్యులు,గగన చరుల గురించి చెప్పాలి.గర్భజ,అండజ,స్వేదజ పద్ధతుల గురించి వివరణ ఇవ్వాలి.సత్త్వరజస్తమోగుణములు ప్రధానముగా గల అవతారములు వివరించాలి.వాటి వలన ఏర్పడిన జగదుత్పత్తి స్థితి లయముల గూర్చి చెప్పాలి.వేదములు,బ్రాహ్మణాది వర్ణక్రమము తెలియచెప్పాలి.ఆశ్రమ ధర్మాలు,యోగమార్గాలు,జ్ఞానమార్గాలు,వాటికి సాథనాలు విశ్లేషించాలి.సాంఖ్య యోగములు,శాస్త్రములు,పాషండ ధర్మములు,జీవుల గుణ కర్మలు విపులంగా వివరించాలి.ధర్మము ,మోక్షము గురించి చర్చించుకోవాలి.పరస్పర విరోధము లేని సాథనములు,రాజనీతి,దండనీతి,పితృకర్మల విధానముల గురించి తెలియచెయ్యాలి.ఇంతే కాదు.ఇంకా చాలా తెలుసుకోవాలి.కాల చక్రమున నక్షత్రములు,గ్రహములు వసించు విథములు తెలుసుకోవాలి.తపోదానములు,వాని ఫలములు,ధర్మములు,ప్రజల కర్మములు గురించి తెలుపగోరుతాను.విలయ భేదములు,భక్తుల గురించి,జీవ బ్రహ్మములు ఐక్య సిద్థి,ఉపనిషత్తులు చెప్పే జ్ఞానము,శిష్య ప్రయోజనములు,విజ్ఞాన సాథనముల గురించి వివరం కావాలి.నా ఈ అనుమానాలు తీర్చారంటే మీకు యజ్ఞములు,దానములు చేసిన ఫలం దక్కుతుంది.వేదాధ్యయనము చేసిన పుణ్యం దక్కుతుంది.ఆర్తజనులను రక్షించిన పుణ్యము దక్కుతుంది.
ఈ విషయాలను శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు.శుకుడు ఇలా అన్నాడు.ఓ రాజా!మీ వంశమును ప్రజలు ఎప్పుడూ పొగుడుతుంటారు.శ్రీహరి కథలు ప్రతి దినము వింటుంటావు.ఆ కారణంగా మీ వంశము పవిత్రమయినది.మమూలు ప్రజానీకం అల్పమయిన సుఖమూ,అధికమయిన దుఃఖమూ అనుభవిస్తుంటుంది సహజంగా.వారి దుఃఖము పోగొట్టగలిగేది భాగవతము ఒక్కటే!అది నీకు చెబుతాను.
Subscribe to:
Posts (Atom)