Friday, 20 February 2026

ధృతరాష్ట్రుని సంకుచితము

శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పడం మొదలు పెట్టాడు.రాజా!ధృతరాష్ట్రుడికి చాలా మంది పిల్లలు పుట్టారు కదా!వారిని ధృతరాష్ట్రుడు బహు ప్రేమతో పెంచుకుంటూ ఉన్నాడు.ఇంతలో తన తమ్ముడు,పాండురాజు నిధనుడయినాడు.అప్పటికి అతని బిడ్డలు కూడా చిన్నవాళ్ళే.మాద్రి సతీసహగమనం చేయడంతో,కుంతీదేవి పిల్లల నందరినీ తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చింది.అందరూ కలిసి పెరగసాగారు.ఐక్యమత్యంతో కాదు.అసహనం,అసూయలతో. ముఖ్యంగా దుర్యోధనుడికి అతని తమ్ములకు పాండవుల పైన అసూయ కలిగింది.వారు జన్మతః కృూర స్వభావులు.కాబట్టి పాండవులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.ఒకసారి విషపు అన్నము పెట్టి చంపబోయారు.ఇంకొక సారి త్రాళ్ళతో కట్టి గంగానదిలో పడవేసారు.కొంచెం పెద్దయిన తరువాత ధర్మం తప్పి రాజ్యము నుండి వెడలగొట్టారు.ఇట్లా ఒకటా రెండా!చాలా సార్లు పాండవులను ఇబ్బందుల పాలు చేసారు.పాండవులు నిద్రించే సమయములో లక్క గృహానికి నిప్పు అంటించి పాండవులను తుదముట్టించాలని ప్రయత్నము చేసారు.దేవుని దయ వలన అది సఫలము కాలేదు. వాళ్ళ అకృత్యాలకు పరాకాష్ట వారు ద్రౌపదీ దేవిని ఏకవస్త్రగా ఉన్న సమయంలో కొప్పు పట్టిలాగుతూ సభలోకి ఈడ్చుకుని రావడం.వారి నాశనానికి ఇదే నాంది అయింది. ధృతరాష్ట్రుడికి కళ్ళులేని గ్రుడ్డితనమే కాదు,మానసికంగా కూడా అంథుడే.పుత్రప్రేమతో తన బిడ్డల తప్పులను సరిదిద్దలేదు కదా.కనీసం ఎత్తిచూపనైనా లేదు.వారి ప్రతి ఆగడం వెనుక అతని మౌనమయిన అర్థంగీకారము నిబిడీకృతమయి ఉన్నది.

Tuesday, 17 February 2026

తృతీయ స్కంధము…విదురుని యాత్ర

పరీక్షిత్తు మహారాజు ప్రాయోపవేశము చేసేదానికి సంసిద్ధుడు అయినాడు.అతనితో శుక మహర్షి ఇలా చెప్పాడు.పరీక్షిత్తు మహారాజా!పాండవులు యుద్ధము లో కౌరవులను ఓడించారు.ఆ రాజ్య సంపద స్వీకరించి,రాజ్యమును సుశ్యామలంగా పాలించుతూ ఉన్నారు.అప్పుడు విదురుడు తీర్థయాత్రకు బయలుదేరాడు. దారిలో ఒక వనములో అతనికి మహా తపశ్శాలి అయిన మైత్రేయ మహర్షి కానవచ్చాడు.విదురుడు నేరుగా ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి,ఆయన ఆశీస్సులు పొందాడు.చిన్నగా ఆయనతో తన మనసులో మాట బయట పెట్టాడు.మహాత్మా!నా కొక సందేహము కలిగినది.దయయుంచి నా సందేహము తీర్చవలెను అని ప్రార్థిస్తున్నాను. శ్రీకృష్ణుడు భగవంతుడు అని మన అందరికీ తెలుసు.పాండవులు మంచి వారు కావున వారికి సహాయము చెయ్యాలనుకున్నాడు.సహజమే!వారి రాయబారిగా దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు కదా.దుర్యోధనుడు ఎంత బ్రతిమిలాడినా వారి దగ్గర భుజించలేదు.కానీ మా ఇంటికి వచ్చి మా సేవలు అంది పుచ్చుకుని,మా ఇంట భోంచేసాడు.దీనికి కారణము ఏంది?నాకు తెలిపేది. పరీక్షిత్తుకు ఆదుర్దా ఎక్కువ అన్నిటినీ తెలుసుకోవాలని.శుకుడు చెప్పబోతుండగానే గబగబా ఇలా అడిగాడు.మహాత్మా!విదురుడు మైత్రేయుడిని ఇంకా ఏమేమి రహస్యాలు అడిగాడు?ఆ ముని వాటన్నిటికీ ఏమి సమాథానాలు తెప్పాడు?విదురుడు తీర్థ యాత్రలకు వెళ్ళాడు అన్నారు కదా!ఏ ఏ స్థలాలూ,ప్రదేశాలు చూసాడు?నాకు అన్నీ పూస గుచ్చినట్లుగా,వివరంగా,విపులంగా చెప్పాలి అని ప్రార్థించాడు.

Monday, 16 February 2026

సూతుడు,శౌనకుడు సంవాదము

శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు తేలిక అయిన భాషలో సర్గ విసర్గాదులు మరియు ఆశ్రయము గురించి వివరించాడు.ఇప్పుడు అంతా టూకీగా చెప్పాడు.ఇంక సవివరంగా చెబుతాను అని సెలవిచ్చాడు. ఈ విషయాన్ని సూతుడు శౌనకాది మునులకు తెలిపాడు.అప్పుడు శౌనకుడు సూత మహర్షిని అడిగాడు.ఓ మునిసత్తమా!భాగవతోత్తముడు అయిన విదురుడు తీర్థయాత్రలకు పోయాడన్నారు కదా.అక్కడ అన్ని పుణ్య క్షేత్రములు సందర్శించాడు కదా.అటు పిమ్మట తిరిగి వచ్చాడు అన్నారు.అప్పుడు మైత్రేయుని వలన ఆధ్యాత్మ బోథను పొందాడు అని ఉటంకించారు.ఆ విషయాలు అన్నీ వివరంగా తెలుసుకోవాలని మా అందరి మనసులూ ఉవ్విళ్ళూరుతున్నాయి.మా కోరిక మన్నించి అవన్నీ మాకు విశదీకరించేది. శౌనకుడి మాటలకు సూతుడు చిన్నగా మందహాసం చేసాడు.ఇలా అన్నాడు.శౌనకా!మీరు ఇప్పుడు నన్ను అడిగారు కదా!అచ్ఛం ఇలానే మునుపు పరీక్షిత్తు మహారాజు శుక మహర్షిని బ్రతిమలాడాడు.అప్పుడు ఎట్లయితే శుకుడు అతనికి చెప్పాడో,అచ్ఛం అలానే నేను కూడా ఆ వృత్తాంతము అంతా సవివరంగా మీకు చెబుతాను.

Sunday, 15 February 2026

ఆశ్రయము,సృష్టి

శుక మహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు.ఉత్పత్తి,స్థితి,లయము అనే మూడూ ఎక్కడ పుడుతూ వెల్లడి అవుతాయో అదే ఆశ్రయము.పరమాత్మ అన్నా అదే.బ్రహ్మ అన్నా అదే.ఆత్మ ఆధ్యాత్మికము,ఆధిదైవికము,ఆధిభౌతికము అని మూడు రకములు.ఆధ్యాత్మికము అనునది చక్షురాది గోళకములకు అంతర్వర్తియై ఉంటుంది.చక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుడే ఆధి దైవికము.చక్షురాద్యధిష్టానాభిమాన దేవతయై సూర్యాదితేజోవిగ్రహుడగుచూ,ఎవ్వనియందు ఈ రెండు విభాగములు కలుగుతాయో అతడు ఆధి భౌతికుడు.ఆ ఆధిభౌతికుడే విరాట్ పురుషుడు.ద్రష్ట,దృక్కు,దృశ్యము...ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఏమీ కానరాదు.కనిపించదు.ఈ మూడింటి గురించి ఎవ్వరికి క్షుణ్ణంగా తెలుసో,అతనే పరమాత్మ.అతనే సర్వాంతర్యామి.సర్వలోకాలకూ,ప్రాణులకూ ఆశ్రయము ఇచ్చిన దాత. ఆ జగద్రక్షకుడూ,జగద్వ్యాపకుడూ విలాసము కొరకు సృజింపదలచాడు.తనకు ఎక్కడ,ఎలా సుఖంగా ఉంటుందో పరికించాడు.ముందర జలమును సృజించాడు.అది మహా సముద్రము రూపములో నున్న జలరాశి అయింది.ఆ జలరాశిలో అతను శయనించాడు.జలములకు నారములు అని ఇంకో పేరు ఉంది.ఆ నారములు పరమాత్మ వాసస్థాన మగుటచే అతనికి నారాయణుడు అనే పేరు వచ్చింది. అతని సృజన కారణంగానే ప్రాణాదులు,పంచభూతములు,ఇంద్రియములు,మనస్సు,బుద్ధి ఉద్భవించాయి.ఇంతే కాదు.అతను ప్రజాపతులు,ఋషులు,పితృదేవతలు,సుర,సిద్థ,విద్యాధరులు,మున్నగువారిని కూడా సృజించాడు.పక్షి,మృగ,వృక్ష సంతతిని కూడా సృజించాడు. ఇంత చేసినా అతను వీటన్నిటికీ కర్తృత్వము వహించడు.అంతా తన మాయాకల్పితంగానే తోచేటట్లు చేస్తాడు.ఆ మహామహడు,సర్వవ్యాపి నిరవద్యుడు,నిరంజనుడు,పరుడు,పరాత్పరుడు,నిష్కళంకుడు,నిత్యుడు మరియు సత్యుడు.

Saturday, 14 February 2026

సర్గ,విసర్గాదుల వివరణ

పరీక్షిత్తు మహారాజుకు శుక మహర్షి వివరం తెలుపుతున్నాడు.రాజా!మహత్తు,అహంకారము,పంచ తన్మాత్రలు,పంచ భూతములు,పంచేంద్రియములు....వీటన్నిటినీ సర్గము అని అంటారు. బ్రహ్మ విరాట్పురుషుని వలన జనించాడు కదా!అతను చరాచర సృష్టిని చేయడం వినర్గమని అంటారు. ఈ ప్రపంచమును హింసించే రాజులు ఉంటరు కదా!వారిని సంహరించడం,ధర్మ సంస్థాపన చేయడం,ఆ శ్రీమహా విష్ణువు యొక్క విజయ పరంపర తెల్పడం స్థానము అని అంటారు. శ్రీహరి సర్వేశ్వరుడు,అనంతుడు కదా!అతను భక్తులను ఉద్థరించే ప్రక్రియను పోషణము అని అంటారు. ఊతలు అనగా కర్మవాసనలు. ఆది శేషువు పైన కొలువు అయిన శ్రీమన్నారాయణుడు అనుగ్రహ కటాక్షము వలన విభూతిని పొందిన లోకపాలకులు ఉంటారు కదా!వారు అందరూ ధర్మమును వివరించడాన్ని మన్వంతరము అని అంటారు. శ్రీహరి యొక్క అవతారాలు ఒకటీ రెండు కాదు కదా!కోకొల్లలు.ఆ అవతారాలను సవివరంగా చెప్పడం,అతని చరిత్రను విస్తారంగా ప్రబోథించడాన్ని ఈశానుచరితం అని అంటారు. సర్వాంతర్యామి,సర్వరక్షకుడు అయిన గోవిందుడు తన ఉపాధి శక్తులతో కూడి శేషతల్పముపై సుఖంగా శయనించి ఉంటాడు.అతను యోగనిద్రలో ఉంటాడు.ఆ సమయంలో సమస్త ప్రాణికోటి కూడా తమ తమ వ్యాపారలని మర్చిపోతుంటారు.ఆ అవస్థా విశేషములను అన్నిటినీ స్పష్టంగా,సవివరంగా తెలియజెప్పేదే నిరోధము.

Friday, 13 February 2026

భాగవత మూలము

శ్రీహరి బ్రహ్మకు చెప్పాల్సిన సుద్దులు,బుద్ధులు చెప్పి అంతర్థానము అయిపోయడు.బ్రహ్మ ఆనందానికి అవథులు లేవు.భగవంతుడు చెప్పిన మాటలు మననం చేసుకుని,మనసులో నిక్షిప్తం చేసుకున్నాడు.సమస్త ప్రపంచాన్ని సృజించాడు.అతడు స్వలాభం చూసుకోలేదు.సకల లోక హితము కోరుకున్నాడు.దానికి తగిన విథంగానే ముందుకు అడుగులు వేసాడు.ఆయన సంకల్పం ధృఢమయినది. ఇట్లా ఉంటే ఒకరోజు బ్రహ్మ దగ్గరకు నారదుడు వచ్చాడు.ఆయనకు ఆదుర్దా ఎక్కువ కదా!రావటం రావటం నాకు భగవంతుని మాయా విలాసాలగురించి చెప్పు అని తొందర చేసాడు. బ్రహ్మ చిద్విలాసంగా,చిన్మయానందంతో భగవంతుడు వలన తెలుసుకున్న భాగవతాన్ని నారదునకు చెప్పాడు.నారదుడు ఆ తరువాత వ్యాసుడికి చెప్పాడు.వ్యాసుడు అటు పిమ్మట శుకుడికి బోధించాడు.ఆ వృత్తాంతము అంతా పరీక్షిత్తు కోరిక మేర శుకుడు చెప్పేదానికి ఒప్పుకున్నాడు. శుకుడు పరీక్షిత్తుతో అంటున్నాడు.రాజా!నీవు నన్ను అడిగావు కదా,విరాట్పురుషుని వలన ఈ లోకాలన్నీ ఎలా ఏర్పడ్డాయి అని.వాటన్నిటికీ సమాథానము భాగవతములో ఉంది.అది నీకు నేను నేర్పిస్తాను. అది సర్గము,విసర్గము,స్థానము,పోషణము,ఊతులు,మన్వంతరములు,ఈశానుచరితములు,నిరోథము,ముక్తి,ఆశ్రయము అను పది లక్షణములతో కలిసి ఉంటుంది.వీటిలో మొదటి తొమ్మిది లక్షణములు పదవ లక్షణమయిన ఆశ్రయము విశుద్థి కొరకే చెప్పబడినది. అంటే మనము స్థిరమైన ఆనందం కోసరము భగవంతుడిని నమ్ముకోవడంలో పవిత్రముగా తయారుకావడము.

Thursday, 12 February 2026

శ్రీహరి గురించి శ్రీహరి

శ్రీహరి బ్రహ్మ మాటలు విన్నాడు.అతను తన్మయత్వంలో ముణిగిపోవడం గమనించాడు.చిద్విలాసంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.ఓ కమలగర్భా!నీవేమీ ఆందోళన చెందనవసరం లేదు.నా స్వరూప స్వభావాలు నీకు తెలుస్తాయి.అలాగే నా మహిమావతారకర్మములు అన్నీ కూడా తెలుసుకునే ప్రక్రియ,విజ్ఞానము నా అనుగ్రహం వలన నీకు లభిస్తుంది. జాగ్రత్తగా విను.సృష్టికి పూర్వము నేను ఒక్కడినే కర్మ విహీనుడుగా ఉంటాను.కల్ప ప్రళయాంతరమున,ఆద్యంత విరహితమగు క్రియతో,పరిపూర్ణ నిత్య మహిమతో పరమాత్ముడునై ఉంటాను. మహాభూతములు భౌతికములు అయిన ఘటపటాదులు యందు ప్రవేశించి ఉంటాయి కదా!అచ్ఛంగా అలానే నేను భూత భౌతికములు అయిన సర్వకార్యములయందు,సత్త్వాది రూపములయందు ప్రవేశించి ఉంటాను.భూత భౌతికములు కారణావస్థను పొంది నాయందు అభివ్యక్తములు అయి ఉండవు.సర్వ దేశములందునూ,సర్వకాలములందునూ ఏది బోధితము అయి ఉంటుందో అదే పరబ్రహ్మ స్వరూపము.ఇది నా తత్త్వము.తత్త్వాత్మకమయిన ఈ అర్థమును నీ మనసు నందు గ్రహించుకో!అలా అయినప్పుడు నీవు సృష్టి కర్మములు చేసేటప్పుడు మోహమునకు గురి కావు.గర్వానికి పోవు.సమన్వయం పాటిస్తావు. ఇలా చెప్పి శ్రీహరి అంతర్ధానం అయిపోయాడు.