Saturday, 15 August 2026

బ్రహ్మకు జ్ఞానోదయము

బ్రహ్మ అతని నాభీ సరస్సున పుట్టిన పద్మము,జలము,వాయువు,ఆకాశము మటుకు చూడగలిగాడు.రజోగుణ యుక్తుడు అయిన బ్రహ్మకు సృష్టి చేసేదానికి సరి అయిన మార్గము తోచలేదు.పని చేయాలనే తపన,వ్యామోహము,అహంభావము,అశాంతి,ఇంద్రియభోగాల పట్ల అమితమయిన కోరికలు...ఇవి రజోగుణము ఉన్నవారి లక్షణాలు.కానీ ఎలాగో సర్వమునకు శ్రీహరి మూలాథారము అని తెలుసుకున్నాడు.ఆ దేవదేవుడితో మొర పెట్టుకున్నాడు.ఓ జగన్నాథా!ఓ దేవదేవా!నువ్వు ఒక్కటే సత్యమూ,నిత్యమూ.నీ స్వరూపమే నాకు జ్ఞాన మార్గము చూపించింది.నీ దివ్యరూపము చూడగలగడమే నా అజ్ఞానానికి చరమగీతం పాడింది.నాలో వివేకము,విజ్ఞత వికసించాయి.మంచి వాళ్ళనూ,సత్పురుషులనూ అనుగ్రహించేదానికి నీవు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటావు.దాని వలన ఎన్నో అవతారాలు ఎత్తి ఉంటావు,ఎత్తుతూ ఉంటావు.నీవు ఈ విషయంలో అలుపూ సొలుపూ,అనాసక్తత అసలు ప్రదర్శించవు.నీ రూపము చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించేలా మనసును ఊరిస్తున్నది.నీ స్వరూపము ముందర నేను చూడగలిగాను.నా జన్మ ధన్యమయినది.ఈ ప్రపంచాన్ని పుట్టించింది నీవే!నా రూపము భూతేంద్రియాత్మకము అనగా పంచభూతములు మరియు ఇంద్రియములచే కార్యరూపము దాల్చినది.కానీ నేను సదా నిన్ను సేవించుకుంటాను,నీ ఆశ్రయము కోరుకుంటాను.పనికిమాలిన తర్కములు చేసేవారికి నీ మహిమలు,నీ గొప్పదనం తెలియదు.కృతార్థులు అయిన మహాత్ములే నిన్ను సంపూర్ణంగా కనుగొనగలరు.ఎల్లప్పుడూ నీ పాదారవిందముల సేవలో మునిగి తేలుతూ ఉంటారు.నీ పాదకమలాలను ఎన్నటికీ విడనాడరు.

No comments:

Post a Comment