Thursday, 13 August 2026
శేషశయనుడు సాకారము
బ్రహ్మకు ఏమీ అర్థం కావటం లేదు.బుర్ర నిండా ప్రశ్నలే!అనుమానాలే!దానికి ఆరంభం...అంతం కనిపించడం లేదు.అసలు ఈ జలము ఎక్కడిది?ఈ జలములో ఈ పద్మము ఎలా పుట్టింది?ఈ పద్మం పైకి నేను ఎట్లా వచ్చాను?అసలు నా పుట్టుకకు కారణమేంది?నేను ఎవరు?నా పేరు ఏంది?అసలు ఈ పద్మనాళము యొక్క మూలము ఎక్కడుంది?ఈ అనుమానం మదిలో రేకెత్తగానే ఒకచోట కుదురుగా కూర్చోలేకపోయాడు.ముందు వెనక ఆలోచించకుండా సముద్రంలోకి దూకాడు.ఆ పద్మనాళము యొక్క మొదలు కనుక్కునేదానికి దానిని అనుసరించాడు.ఇలా ఒక రోజా?ఒక నెలా?ఒక సంవత్సరమా?కాదు,కాదు.ఏకంగా వేయి దివ్య సంవత్సరాలు వెతికాడు.అయినా ఫలితం దక్కిందా అంటే అదీ లేదు.భగవంతుడి మాయ వలన ఏమీ తెలియలేదు,తేలలేదు.గమ్మున వెనకకు తిరిగి వచ్చాడు.తను ఉద్భవించిన కమలము మధ్యలో ఉన్న పీఠము పైన కూర్చున్నాడు.అష్టాంగ యోగమున పవనమును బంథించి నూరేండ్లు సమాథిలో ఉన్నాడు.ఆ యోగశక్తి వలన తనకు జ్ఞానము కలిగినది.కానీ తన పుట్టుటకు కారణమయిన వాడు,తనలోనే వాడు అయిన శ్రీహరిని కనుక్కోలేక పోయాడు,కానలేకపోయైడు.ఇంక నిశ్చలమయిన భక్తి యోగమును ఆశ్రయించాడు.దాని మహిమ వలన శేషనాగు శయ్య పైన శయనించి ఉన్న శంఖచక్రధరుడైన పరమాత్మను తిలకించాడు.శ్రీహరి ఎలా కనిపించాడు?పీతాంబరములతో,బంగారు కిరీటంతో ధగధగమని వెలిగి పోతున్నాడు.ముత్యాల హారాలు,తులసీదామాలతో అలరారుతున్నాడు.ఆ పరాత్పరుడి దేహము అపరిచ్ఛన్నముగా,అనగా సంపూర్ణంగా ఉన్నది.ముల్లోకాలలో ఆ శరీర శోభకు సాటి లేదు.అతని శరీరకాంతులు ఎలా ఉన్నాయి అంటే వాటి వెలుగుల వలన ఆయన ధరించిన ఆభూషణములకు వన్నె వచ్చింది,వింత శోభ చేకూరింది.అతని పాదపద్మ యుగము,అనగా తామర పువ్వుల వలె సుకుమారంగా ఉండే పాదములు,భక్తుల కోర్కెలు తీర్చే కామధేనువు.అతనిని సరిగ్గా వర్ణింప గలిగే వారు ముల్లోకాలలో లేరు.అంతటి దివ్యమయిన,తేజోమయమయిన రూపము.అతనే సర్వేశ్వరుడు.ఆది అంతములు లేనివాడు.కర్త,కర్మ,క్రియ అన్నీ తానే అయిన జగదేక పూజ్యుడు.బ్రహ్మ జీవితం ధన్యమయింది ఆ పరాత్పరుడి దర్శనంతో!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment