bhaagavatham balpasandugaa
Wednesday, 3 December 2025
పరీక్షిత్తు అంతర్ మథనం
శమీకుడి శిష్యుడు పరీక్షిత్తు దగ్గరకు వచ్చాడు.పరీక్షిత్తు శమీకుడి మెడలో చచ్చిన పాము వేసి వెళ్ళిపోయిన అనంతరం అక్కడ జరిగిన పరిణామాలు,శృంగి శాపం...అన్నీ వివరంగా చెప్పాడు.
పరీక్షిత్తు విషయం తెలుసుకుని ఖిన్నుడైనాడు.తనలో తాను ఇలా అనుకున్నాడు.అయ్యో!నేను వేటకు అడవికి ఎందుకు పోయాను?ఒళ్ళూ పాయా తెలియనంతగా ఎందుకు వేటాడాను?ఎంత దాహము అనిపించినా,ముని నీరు ఇవ్వలేదని వాని మెడలో చచ్చిన పామును ఎందుకు వేసాను?అంతగా విచక్షణ ఎందుకు కోల్పోయాను?ఆ మహర్షి సమాధిలో ఉన్నాడని కళ్ళకు కనిపిస్తున్నా,బుర్రకు ఎందుకు అర్థం కాలేదు?ఎందుకంత అర్థం పర్థం లేని పని చేసి నా గొంతు నేనే కోసుకున్నాను?
ఏది ఏమైనా దైవయోగాన్ని ఎవరూ తప్పించలేరు!ఇలా తనను తానే దూషించుకుంటూ,చాలా సేపు కుమిలి పోయాడు.అయింది అయిపోయింది.శాపం విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు.కానీ నా చేతుల్లో ఉండే పని నేను చేస్తాను అని నిర్ణయించుకున్నాడు.
ఈ లోపల నేను కామక్రోధాదులను జయించేదానికి ప్రయత్నించవచ్చు అనుకున్నాడు.తరువాత విరక్తుడై రాజ్యమును వదిలేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.తదుపరి గంగకు పోయి ప్రాయోపవేశమున ప్రాణాలు విడవాలి అనుకున్నాడు.ఇంక ఆ క్షణం నుంచి మనసులో ఆ దేవదేవుడు అయిన గోవిందుడినే నిలుపుకున్నాడు.మౌనవ్రతం ఆచరించాడు.గందరగోళం,తత్తరపాటు లేకుండా,ప్రశాంత మనస్కుడై,నిస్సంగుడుగా మారిపోయాడు.
శృంగి శాపం
ఈ పై వ్యవహారం అంతా దగ్గరలో ఉన్న ముని కుమారులు గమనించారు.శమీకుని కుమారుడు శృంగి.మునికుమారులు పరుగులు తీస్తూ వెళ్ళి శృంగికి జరిగినదంతా చెప్పారు.శృంగికి విపరీతమయిన కోపం వచ్చింది. ఔరా!ఈ రాజులు ఎలాంటి వారు?బలికి పెట్టిన మెతుకులు తిని బలిసిన కాకులు లాంటి వారు.ప్రజలను రక్షించేవారి లాగా ఎన్నుకోబడతారు.చివరకు బ్రాహ్మణులను ఇంత నీచంగా అవమానిస్తున్నారు!శ్రీకృష్ణుడు లేక పోవడంతో వీళ్ళందరికీ బాగా అలుసు అయిపోయింది.దండించేవారులేరనే అహం!దుర్జనులు,దురాత్ములు విజృంభించి సాధుజనులను ఇక్కట్లపాలు చేస్తున్నారు,తుస్కారంగా చూస్తున్నారు.
ఇలా అని,అనుకుని శృంగి నదికి పోయాడు.అక్కడ ఆచమనము చేసుకుని,ఇలా శపించాడు.నా తండ్రిపైన చచ్చిన పామును పడవేసి చేసిన రాజు హరిహరాదులు అడ్డు వచ్చినా సరే....ఈ రోజు నుండి ఏడవరోజున తక్షకుని విషము వలన మరణించుగాక!
శృంగి ఆశ్రమానికి వచ్చాడు.తన తండ్రి ఇంకా యోగనిష్టలో ఉన్నాడు.అతని పైన పాము వేలాడుతూ ఉంది.అది ఏమైనా తన తండ్రిని కాటేస్తుందేమో అని భీతి చెందాడు.దానిని తొలగించలేక పోయాడు.ఏడుస్తూ చుట్టు పక్కల ఉన్న మునులను గట్టిగా పిలవడం మొదలు పెట్టాడు.
ఈ గలభా గందరగోళానికి శమీకుడు సమాధి చాలించాడు.మెల్లగా రెండు కళ్ళూ తెరిచాడు.తన పైన వ్రేలాడుతున్న పామును తీసి ప్రక్కకు వేసాడు.శృంగి ఏడవటం చూసాడు.చిన్నగా అడిగాడు.శృంగీ!ఏమైంది?ఎందుకు ఏడుస్తున్నావు?నా పైకి ఈ చచ్చిన పాము ఎలా వచ్చింది?
దానికి కొంచెం స్థిమిత పడిన శృంగి చెప్పడం మొదలు పెట్టాడు.రాజు తన తండ్రి పైన చచ్చిన పామును వేయడం,అది తెలుసుకుని తను ఆ రాజును శపించడమూను.
శమీకుడు విషయం తెలుసుకుని చాలా చింతించాడు.ఎందుకు నాయనా!ఇలా చేసావు?ఎందుకు అంత తొందరపాటు నీకు?ఆ రాజు పరీక్షిత్తు మహారాజు.అతను తల్లి గర్భంలో ఉండగానే బ్రహ్మాస్త్రం వేడికి దగ్ధుడు అయినాడు.శ్రీకృష్ణుని కృపా కటాక్షం వలన తిరిగి బతికి బట్ట కట్టాడు.అతను ప్రజలను ఎంత బాగా పరిపాలిస్తున్నాడు!అంత మంచి రాజును శపించవచ్చా?అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేయవచ్చా?
నీకు ఈ విషయం తెలుసా అసలు?రాజ్యములో రాజు లేకపోతే బలవంతుడు బలహీనుడిని విచక్షణా రహితంగా బాధిస్తాడు.మనము కష్టపడి సంపాదించుకున్న సంపదకు రక్షణ ఉండదు.మన స్త్రీలకు అంతా కన్నా రక్షణ ఉండదు.జారులు,చోరులు పేట్రేగిపోతారు.అదుపూ ఆజ్ఞ ఉండవు.ప్రజలలో భయం,భక్తిలేక పరస్పరము కలహాలతో కాపురం చేస్తారు.వర్ణాశ్రమ ధర్మాలు నశించిపోతాయి.
నీకు అసలు అవగాహన ఏమైనా ఉందా?పరీక్షిత్తు భగవంతుడికి గొప్ప భక్తుడు.సుశ్రేష్టమయిన భరత వంశంలో పుట్టాడు.ఎన్నో అశ్వమేథ యాగాలు నిర్వహించిన మహనీయుడు.అతను రాక రాక మన ఆశ్రమానికి వస్తే ఆదరించడం,గౌరవించడం మన కనీస కర్తవ్యం.అట్లాంటిది అతనిని శపిస్తావా?ఇది నీకు సబబేనా?ఇది అసలు న్యాయమా?
ఇలా శమీకుడు పరిపరి విథాల విచారించసాగాడు.దానికితోడు శృంగికి శాపం ఇవ్వటం మటుకే వచ్చు,ఉపసంహరణ తెలియదు.శమీకుడు కూడా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు.రాజుకు ఈ వార్త తెలపడం తన కనీస ధర్మం అనుకున్నాడు.అందుకని వెంటనే ఒక శిష్యుడిని రాజు దగ్గరకు పంపాడు విషయం వివరించమని.
Monday, 1 December 2025
శమీకునికి అవమానం
ఒకరోజు పరీక్షిత్తు మహారాజు వేటకు వెళ్ళాడు.చాలా వన్య మృగాలను చంపాడు.అన్నింటిని చంపితే అలసిపోవడం సహజం కదా!అలసటతోపాటు బాగా దాహం వేసింది.దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది.మంచి నీళ్ళ కోసం అక్కడకు వెళ్ళాడు.ఆ ఆశ్రమము శమీక మహామునిది.ఆయన ఆ సమయంలో కళ్ళు రెండూ మూసుకుని యోగసమాధిలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు.
ఈయనకేమో దాహం అయిపోయా!మంచి నీళ్ళు కావాలని అడిగాడు ఆ మహర్షిని.భగవద్ధ్యానంలో ఉన్న ఆయనకు ఈయన పలుకులు వినపడలేదు.కాబట్టి జవాబు ఇవ్వలేదు,అలాగే మంచి నీరూ ఇవ్వలేదు.
ఎవరి పిచ్చి వారిదే అని అంటారు కదా!ఇక్కడ కూడా అదే జరిగింది.ఈయనకు ఏమో విపరీతమయిన దాహం!దానితో పాటు ముని ధ్యానంలో ఉన్నాడు కాబట్టి నీరు ఇవ్వలేదు అనే ఇంగితం లోపించింది.కోపంతో పళ్ళు కొరికాడు.ఏంది?ఈ ముని ఎంత సేపటికీ కళ్ళు తెరవడు?ఇక్కడ నేను దాహంతో,గొంతు పిడచ కట్టుకుని పోతూ అల్లాడుతుంటే?ఇంతోటి రాజును ఇక్కడ నిలుచుకుని దాహం దాహం అంటుంటే ఉలుకూ పలుకు లేదే?రాజు అనే కనీస గౌరవ మర్యాదలు లేవా?ఎంత గొప్ప ముని అయితే ఏమి?దాహం అంటే మంచి నీళ్ళివ్వబళ్ళేదా?
ఆ విచక్షణారహిత కోపంతో ఆ బ్రాహమణోత్తముడి మెడలో దగ్గరలో పడి ఉన్న చచ్చిన పామును వేసి తన నగరానికి వెళ్ళిపోయాడు.
Sunday, 30 November 2025
కలికి భయం వేసింది
పరీక్షిత్తు ఈ రకంగా ధర్మదేవతను,భూదేవిని అనునయించాడు.తన కరవాలాన్ని దూసాడు.దుర్మార్గుడు,దుష్టుడు,దురాత్ముడు అయిన కలిని సంహరించేదానికి పూనుకున్నాడు.కలికి భయం వేసింది.తన రాజు వేషం విడిచి పెట్టాడు.ఏకంగా పరీక్షిత్తు కాళ్ళపైన పడిపోయాడు.తనను రక్షించమని వేడుకున్నాడు.
అప్పుడు పరీక్షిత్తు కలిని లేపి ఇలా అన్నాడు.ఓయీ!భయపడవద్దు.నేను అర్జునుడి మనవడిని.ఓడిపోయినవారిని,భయపడి శరణుజొచ్చినవారిని చంపడం మా ఇంటా వంటా లేదు.ఇంకైనా బుద్ధి తెచ్చుకోని,పద్థతిగా వ్యవహరించు.నీవు పాపాత్ముడివి.నీలాంటి నీచులకు నా రాజ్యంలో చోటు లేదు.
అప్పుడు కలి చేతులు ముడుచుకుని అడిగాడు.రాజా!ఓ పరీక్షిత్తు మహారాజా!మీ రాజ్యంలో నాకు స్థానం లేదన్నారు.నేను ఇంక ఎక్కడ ఉండాలో మీరే నిర్ణయించండి.అప్పుడు పరీక్షిత్తు జవాబిచ్చాడు.ఓ కలీ!ఎక్కడ ప్రాణహింస జరుగుతుందో,స్త్రీకి గౌరవం,రక్షణ దక్కవో,ఎక్కడ జూదము,మద్యమూ నిరాటంకంగా కొనసాగుతాయో...ఆ ప్రదేశాలలో ఉండవచ్చు.ఇవే కాదు.ఇంకా అసత్యము,మదము,కామము,హింస,విరోధము కానవచ్చే ఐదు స్థలములలోకూడా ఉండవచ్చు.అంతేకానీ తోకఆడిచ్చి వేరే మంచి,పవిత్రమయిన ప్రదేశాలకు పోకూడదు.
ఇట్లా పరీక్షిత్తు కలిని నిగ్రహించాడు.
ధర్మదేవత పోగొట్టుకున్న తపము,శౌచము,దయ అనే మూడు పాదాలనూ తిరిగి ఇచ్చాడు.ఈ ప్రక్రియకు భూదేవి చాలా సంతోషించింది.పాప పంకిలంకాకుండా ఉంటేనే కదా ఆమె ప్రశాంతంగా,మనశ్శాంతిగా గాలి పీల్చుకో గలుగుతుంది.పాపభారము మోయటమంటే మాటలు కాదు కదా!ప్రత్యక్ష నరకం కదా!
తరువాత పరీక్షిత్తు హస్తినకు వచ్చి రాజ్య సుపరిపాలన చేసుకుంటూ ఉన్నాడు.బ్రాహ్మణ శాపం వలన తనకు తక్షకుని కాటు వలన మరణం సంభవిస్తుందని తెలుసుకున్నాడు.సర్వసంగ పరిత్యాగి అయ్యాడు.శుక మహర్షికి శిష్యుడు,భక్తుడు అయ్యాడు.విజ్ఞానము సంపాదించాడు.ప్రశాంతంగా గంగా తీరమున శరీరము విడిచాడు.
సూతుడు ఇలా చెప్పసాగాడు.కలి యుగములో పాపాలు చేసినా వాటి ఫలితము లభించదు.మంచి చేస్తాను,మంచి మార్గములో నడుస్తాను అని అనుకున్నా పుణ్యము చేకూరుతుంది.అందుకే పరీక్షిత్తు కలిని చంపకుండా వదలిపెట్టాడు.సత్ప్రవర్తన గలవారికి,మంచిగా ధైర్యము ఉండేవారికి కలిని చూసి భయపడేపని లేదు.
Saturday, 29 November 2025
ధర్మదేవత, పరీక్షిత్తు సంవాదము
పరీక్షిత్తు కలిపురుషుడిని మందలించాడు.ధర్మదేవత వైపు మళ్ళి ఇలా అన్నాడు.ఓ వృషభరాజమా!నేను కురువంశ రాజును.నా రాజ్యంలో నీవు దుఃఖించాల్సిన అవసరము లేదు.రాదు.నిన్ను విచక్షణారహితంగా తన్నిన దుర్మార్గపు రాజును ఇప్పుడే శిక్షిస్తాను.అతనిని చంపేస్తాను.నీవు ఒంటి కాలి మీద కాకుండా నాలుగు కాళ్ళ మీద నడిచేలా చేసే బాధ్యత నాది.
పరీక్షిత్తు గోమాత వంక తిరిగి ఇలా అనునయించాడు.అమ్మా!గోమాతా!నీవు శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత దిక్కులేని దానిని అయ్యాను అని చింతిస్తున్నావు.అలా దీనంగా కళ్ళలో నీరు కుక్కుకుని దుఃఖిస్తున్నావు.ఇంక నీకు ఆ అవసరము లేదు.నా బాణాలతోటి ఈ దుష్టుడిని ఇప్పుడే తుదముట్టిస్తాను.
పరీక్షిత్తు స్వాంతన వచనాలకు వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత సంతోషించింది.తన మోదమును ఇలా బయటపెట్టింది.ఓ పరీక్షిత్తు మహారాజా!నీకు మేలు కలుగు గాక!ఎందుకొంటే కృూరులను,దురాత్మలను శిక్షించి సాధువులను,మంచివారిని కాపాడే కురువంశంలో పుట్టావు.మీరంతా ఇంత మంచివాళ్ళు కాబట్టే అలనాడు శ్రీకృష్ణుడు మీకోసం రాయబారం కూడా చేశాడు.
మేము అసలు ఎవరికీ అపకారం చేసేవాళ్ళము కాదు.కానీ కాలగతి మారుతున్నది.దాని ప్రభావము వలన ఏది ఎలా జరుగుతుందో మనము చెప్పలేము.మనము కాలానికి ఎదురుపోలేము.దేనిని మార్చలేము.ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది.అంతా భగవంతుడి లీల,సంకల్పము.
ఆ మాటలకు పరీక్షిత్తు ఇలా సమాథానం చెప్పాడు.అయ్యా!నీవు ధర్మదేవతవు.కృతయుగములో నీకు తపస్సు,శౌచము,దయ మరియు సత్యము అనే నాలుగు పాదములు ఉండేవి.త్రేతాయుగము వచ్చేటప్పటికి ఒక పాదము తగ్గింది.ద్వాపర యుగము వచ్చేటప్పటికి రెండు పాదాలు పోయాయి.ఇంక కలియుగము మొదలు అయ్యేసరికి ఒక్క పాదమే మిగిలింది.
మీరు చెప్పింది నిజమే!శ్రీకృష్ణుడుఉన్నన్ని రోజులు మీకు హాయిగా ఉండింది.ఎలాంటి ఇబ్బందులు,కష్టాలు లేకుండా గడచిపోయింది.ఆ పరమాత్ముడి అవతారం ముగియగానే దుష్టులు చెలరేగుతారు,శాసిస్తారు అని భూదేవి దిగులు పడుతుంది.భీతి చెందుతున్నది.మీరు భయపడవద్దు.నేను దుష్టులను తుదముట్టించి,శిక్షించి మిమ్మలను కాపాడుతాను.
Friday, 28 November 2025
కలి పురుషుడు దాష్టీకం
పరీక్షిత్తు వృషభ రూపంలో ఉండే ధర్మదేవత,గోరూపంలో ఉండే భూమాత మాటలు వింటున్నాడు.
ఇంతలో అక్కడకు కలి పురుషుడు రాజు రూపంలో వచ్చాడు.యముడు లాగా భీతి చెందేలాగా దండహస్తుడు అయి ఉన్నాడు.దయ దాక్షిణ్యం ఇసుమంతైనా లేకుండా,విచక్షణా రహితంగా ఆ గోవు,వృషభాలను తన్నడం మొదలుపెట్టాడు.
పరీక్షిత్తు ఈ పరిణామం జీర్ణించుకోలేక పోయాడు.రధము పైన నిలుచుకుని,వింటిని సారించాడు.ఆ దుష్ట,ధూర్తుడుతో ఇలా అన్నాడు.ఓరీ నీచ దురాత్మా!వీటిని ఎందుకు తంతున్నావు?ఇవేమైనా నీకు శత్రువులా?నిన్నేమైనా వాటి కొమ్ములతో నిన్ను పొడిచాయా?నీ పైకి దూసుకుని వచ్చాయా?అట్లాంటి పనులు ఏమీ చేయలేదు కదా!ఈ భూభాగాం అంతా నా చెప్పుచేతలలో ఉంది.నేను సుపరిపాలన చేసే నా రాజ్యంలో ఇంత అన్యాయము జరగటం ఏంది?
రాజు వేషము అయితే గొప్పగా వేసి ఉన్నావు,కానీ చేసేది మాత్రం ఇలాంటి నీచ నికృష్టపు పనులా!
శ్రీకృష్ణుడు,అర్జునుడు లేరు కదా!అని ఏ ఎదవ పని చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా?భయం భక్తి లేవా?విచక్షణ,సంయమనం ఏ కోశానా లేవా?శిక్షింపరానివారిని శిక్షించేదానికి నడుము కట్టావా?అసలు నువ్వే శిక్షకు అర్హుడివి.
ఇలాంటి ఘాతుకం చూసి పరీక్షిత్తు చాలా బాధ పడ్డాడు.
బుడ్డోళ్లతో భేటీ బహు బాగు
నాలుగు రోజుల ముందు అయ్యప్పమాల వేసిన పూజకు వెళ్ళాను.మొదటి రెండు మూడు గంటలూ పూజ చూస్తూ గడిచి పోయింది.
నా ప్రక్కన ఒక ఆమె కూర్చుంది.వాళ్ళ మనవడు నా దగ్గరకు వచ్చాడు.నాలుగేళ్ళ వాడు.పేరు అడిగితే చెప్పాడు.భలే ముద్దుగా ఉన్నాడు.వాడు నేను నవ్వగానే భలే ఆశ్చర్యపోయాడు.vasco de gama మన భారతదేశాన్ని కనిపెట్టినప్పుడు కూడా అంత ఆనందించి ఉండడు అనిపించింది.అమ్మా!అమ్మమ్మకు పన్ను లేదు అంటూ అరిచాడు.discovery of the century లాగా గర్వంగా మొహం పెట్టాడు.రేయ్!ఒకటి కాదురా సగం పైన లేవు ఇక్కడ అని నవ్వాను.
ఇంక భోజనాలు మొదలు.పళ్ళెంలో లడ్డు పెట్టుకుని ఎక్కడ కూర్చోవాలా అని చూస్తూ చిన్నగా అడుగులు వేస్తున్నాను.ఒక నాలుగైదు ఏళ్ళపాప తన ప్రక్కన కూర్చోమని సైగ చేసింది.వాళ్ళ అమ్మనాన్నవాళ్ళు ఉంటారు కదా!అని తటపటాయించాను.ఎవరూ లేరా పాపా అని అడిగితే లేరు అనింది.ఏమి పేరు,ఏ బడి,ఎన్నో తరగతి అని అడిగాను.అన్నిటికీ ముచ్చటగా సమాథానం చెప్పింది.ఇంక తనకు ఊపు వచ్చింది.నాకు డాన్స్ వచ్చు తెలుసా అనింది.అవునా!చేసి చూపించు బుజ్జీ అంటే చేసింది.పాటలు పాడుతావా అంటే ఓ అంటూ మంచి సంస్కృత శ్లోకం స్పష్టంగా,రాగయుక్తంగా చెప్పింది.బొమ్మలు వేస్తావా తల్లీ అని అడిగాను .ఓ అంది.కానీ పేపరు,పెన్సిల్ లేదు అనింది.పరవాలేదులే నా అరచేతిలో చిన్న బొమ్మ నీ వేలుతో గీయి అని అన్నాను.సరే అని గీసింది.ఇప్పుడే వస్తాను అని పైకి పరుగెత్తుకుని పోయి,పేపరు పెన్సిలు తెచ్చింది.ఏమి వేసేది అని అడిగింది.నా బొమ్మ వేయి బుజ్జితల్లీ అని అన్నాను.ఎంత బాగా వేసింది అంటే నేను అంత అందగత్తెను అని నాకే ఇన్ని రోజులు తెలియలేదు.బంగారు తల్లికి ముద్దులు పెట్టాను.వడ్డీతో సహా నాకు అప్పుడే తీర్చేసింది.ఇట్లానే నేను అడుగుతుంటే తన బొమ్మ,నా ప్రక్కన ఉన్న ఇంకో అమ్మమ్మ బొమ్మ,వాళ్ళ బుజ్జి తమ్ముడు బొమ్మ,శివుడు,కుక్క,నత్తగుల్ల,రంగవల్లిలు వేసింది.నాకోసము నెంబర్లు ఒకటి నుంచి పది దాకా రాసింది.వంద దాకా రాయగలను కానీ స్థళం లేదు అని వంద రాసింది.వెయ్యి కూడా వచ్చు అనింది.ఎన్ని సున్నాలో డౌటు అనింది.ఒకటి రాసి మూడు సున్నాలు పెట్టాలి అమ్ము అంటే చకచకా పెట్టేసింది.ఇంగ్లీషు వచ్చు అని apple,ball,cat,dog,తన పేరు,తమ్ముడి పేరు రాసింది.ఇంక మా పిల్లలు బయలుదేరాతామంటే సరే తల్లీ పోయొస్తాను అని అన్నాను.నా కోసం ఫేర్ వెల్ డాన్స్గ్ చేసి బై చెప్పింది.నాకు మనసు అంతా హాయిగా అయింది.
రెండో రోజు ఫ్లైటులో నా ప్రక్కన ఒక బిడ్డతల్లి కూర్చుంది.వాళ్ళ పాపకు సంవత్సరము దాటింది.నడక వచ్చు.ఇంకా మాటలు రాలేదు.పలకరిస్తే పాలపళ్ళు అన్నీ చూపిస్తూ నవ్వేసింది.చేయి అందిస్తుంది.చిన్నగా నన్ను తాకుతుంది.కొంచొం సేపు గమ్ముగా తనని పట్టించుకోకపోతే వాళ్ళ అమ్మ ఒడిలోంచి దిగి నాదగ్గరకు వచ్చి కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసి నవ్వుతుంది.తనతో అసలు అలసట తెలియలేదు.
ఇలా బిడ్డలతో గడపడము నాకు అదృష్టము అనిపించింది.ఎందుకంటే వాళ్ళు కానీ,వాళ్ళ అమ్మా నాన్న కానీ నాకు తెలియదు.మళ్ళీ ఇంక అసలు వాళ్ళను కలవలేనేమో కూడా!
Subscribe to:
Comments (Atom)