Monday, 22 June 2026

ఆది పురుషుడు

ఆ ఆది పురుషుడు ఆధ్యాత్మిక,ఆధిదైవిక,ఆదిభౌతిక భేదములతో ప్రకాశించాడు.మహదాది తత్త్వముల తలపులను తెలుసుకున్నాడు.అతను వాటి వివిధ వృత్తి లాభమునకై తన చిచ్ఛక్తి చేత తదనుకూల సృష్టికి శ్రీకారం చుట్టాడు.అతని ముఖము నుండి వేదములు,బ్రాహ్మణులు ఉద్భవించారు.అతని బాహువులనుండి క్షత్రియులు పుట్టారు.అతని తొడలనుంచి వ్యవసాయము,గోరక్షణము,వర్తకము చేయువారు పుట్టారు.సేవాధర్మము కలిగిన వారు అతని పాదముల నుండి పుట్టారు.ఈ నాలుగు జాతులు వారి వారికి ఉద్దేశించబడిన కర్మలు చేసుకుంటారు.ఆ పరంథాముడిని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారు. నిజము చెప్పాలంటే ఆ పురుషోత్తముడి గురించి ఎవరికీ పూర్తిగా అవగాహన లేదు.ఆఖరుకు అతని నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మకూడా పూర్తిగా తెలుసుకోలేక తెల్ల మొహం వేస్తాడు.అట్లాంటిది మామూలు మానవులు సముద్రంలో నీటి బొట్టు మోయన కూడా అతనిని తెలుసుకొనలేరు.ఆ ఆది పురుషుడి నుంచి వచ్చిన వేదములు కూడా తమలో తాము విశ్లేషణలు,విమర్శలూ చేసుకుంటూ తర్జన భర్జన అవుతాయి తప్ప కూలంకషంగా ఆ దేవదేవుడి గురించి చెప్పజాలవు. ఇంతెందుకు?ఆఖరుకి ఆ పరమాత్మ అయినా తన శక్తి,బలాన్ని పూర్తిగా బేరీజు వేసుకోగలడో లేదో?మహదాదులు,అష్ట దిక్పాలకులు,బ్రహ్మ,శివునికి కూడా దోరకదేమో ఆ పురాణ పురుషుని పూర్తిగా వీక్షించడము,అర్థం చేసుకోవడము.

No comments:

Post a Comment