Saturday, 31 January 2026

పరీక్షిత్తు శుకుని సంభాషణ

పరీక్షిత్తు శుక మహర్షిని ఇలా అడిగాడు.ఓ మునీశ్వరా!బ్రహ్మ నారదునికి భగవంతుడి దర్శనము ఎలా అయిందో ఎట్లా చెప్పాడు?సకల భూత సంసర్గము లేని ఆత్మకు సంసర్గము ఎలా కలిగింది?సంసర్గము అంటే కలయిక,సంపర్కం,సాంగత్యము అని అర్థము. శుకుడు జవాబు చెప్పాడు.ఓ రాజా!భగవంతుడు బ్రహ్మకల్పమున బ్రహ్మకు భాగవతము ఉపదేశించాడు అని చెప్పాను కదా!ఆ విషయం నీకు వివరంగా చెబుతాను.నీ కు అన్నీ మంచిగా అర్థం అవుతాయి. జ్ఞాన స్వరూపుడు అయిన జీవికి భగవంతుని మాయవలనే దేహసంబంధం కలుగుతుంది.ముక్తిని సంపాదించాలంటే జ్ఞానము అత్యవసరము.ఆ జ్ఞాన సముపార్జన కలగాలంటే భగవంతుని సేవలో తరించడమే ఏకైక మార్గము.అందుకే బ్రహ్మ చేసిన తపస్సుకు మెచ్చి శ్రీహరి కరుణించాడు.జీవుడికి భగవద్భక్తి వలనే మోక్షం సిద్ధిస్తుంది అని నొక్కి వక్కాణించాడు దీనికి ఒక ఇతిహాసము కూడా జోడు అయి ఉంది.

Tuesday, 27 January 2026

ఇతర అవతారములు

భగవద్గీతలోని పదవ అధ్యాయము,విభూతి యోగములో దేవదేవుని రూపాలు అర్థం అవుతాయి.ఇక్కడ ఇంకొన్ని అవతారాలు తెలుసుకుందాము. విష్ణువు పరాశరునికి పుత్రుడుగా జన్మించాడు.అతను వేదములను విభజించాడు.అందుకనే వేదవ్యాసుడనే నామము ఖాయమయినది.ఇద వ్యాసావతార కథ. పాషాండ మతావలంబకులు అధర్మముగా ప్రవర్తిస్తూ ఉండినారు.రాక్షసంగా కార్యాలు చేస్తూ వచ్చారు.అప్పుడు శ్రీహరి బుద్ధావతారము ఎత్తి వారిని నశింపజేసాడు.ఇది బుద్ధావతార కథ. ప్రజలు దైవ భక్తిని విడిచి పెట్టారు.యజ్ఞయాగాదుల ఊసే లేదు.నోరు తెరిస్తే అబద్థాలు చెప్పడానికి అలవాటు పడిపోయారు.పాషాండాలలాగా కఠినాత్ములు అయిపోయారు.అప్పుడు శ్రీమహా విష్ణువు కల్కి అవతారమెత్తాడు.అధర్మాన్ని వశింపజేసాడు.ధర్మ ప్రతిష్ఠాపన చేసాడు.ఇది కల్కి అవతార కథ. ఇంతటితో బ్రహ్మ ఆపేస్తూ ఈ మాటలు అన్నాడు.నారదా!భగవంతుని లీలావతారములు ఒకటా!రెండా!అనంతము!ఏదో నాకు తెలిసినవి నీకు చెప్పాను.అన్నీ వివరంగా చెప్పే శక్తిమంతుడిని కాను.అతను మాయా వినోదుడు.అతనిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎవరి వల్లా కాదు. ఈ విషయాలు అన్నీ పరీక్షిత్తు శుక మహర్షి ద్వారా తెలుసుకునినాడు.

Monday, 26 January 2026

కృష్ణావతారము

రాక్షస అంశతో పుట్టిన రాజులు ధర్మం తప్పారు.ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ,భూమిని అనేక రకాలుగా బాధ పెట్టసాగారు.ఆ పాపుల బరువు,ఆ పాపపు బరువు భూదేవి మోయలేక పోయింది.శ్రీమహా విష్ణువును వేడుకొంది.అప్పుడు శ్రీహరి ఆమె భారం తగ్గించే దానికి నడుము బిగించాడు.ఆ దుష్ట రాజులను సంహరించేదానికి బలరాముడు,శ్రీకృష్ణుడు రూపాలతో అవతరించెను. వసుదేవుని భార్యలలో రోహిణికి బలరాముడు పుత్రుడు.దేవకీదేవికి శ్రీకృష్ణుడు పుత్రుడు.శ్రీకృష్ణుడు పురిటిలో ఉండగానే పూతన అనే రాక్షసిని చంపాడు.మూడు నెలల వయసులో శకటాసురుని చంపాడు.పెంచిన తల్లి యశోద కృష్ణుని అల్లరి భరించలేక రోటికి కట్టింది.ఆ రోలును ఈడ్చుకుంటూ పోయి మద్ది చెట్లను నేలకొరిగేలా చేసాడు. మట్టి తింటున్నావా అని గదమాయించిన యశోదకు తన నోటిలో ముల్లోకాలు,చరాచర జగత్తు అంతా చూపించాడు.త్రాగునీటిని కలుషితం చేస్తున్న కాళియ నాగుని మర్దించాడు.కార్చిచ్చును ఆపి గోపబాలురను సంరక్షించాడు.ఒకసారి నందుడు యమునానదిలో స్నానం చేస్తున్నాడు.అప్పుడు వరుణుడు అతనిని బంధించాడు.కృష్ణుడు నందుని బంధ విముక్తుడిని చేసాడు. ఇంకొకసారి రాక్షస మాయవల్ల గుహలో గోపాలకులు చిక్కుకున్నారు.వాళ్ళందరినీ రక్షించి,ఆ రాక్షసుడిని దునుమాడాడు. ఇంద్రుడు తనకు పూజలు చేయలేదని జడివానలు కురిపించాడు.అపుడు కృష్ణుడు గోవర్థన గిరిని ఎత్తి గోపాలకులను కాపాడాడు.దుష్టుడు కంసుడు మేనమామ అయినా తన తల్లిదండ్రులను చెరలో పెట్టాడని చంపాడు. శంఖచూడుడు అనే రాక్షసుడు గోపికలను ఎత్తుకెళ్ళాడు.వాడికి గర్వభంగము చేసి వారిని విడిపించాడు.నరకుడు మొదలు చాలా మంది రాక్షసులను సంహరించాడు.దుష్టులైన రాజులను సంహరించి భూభారమును తగ్గించాడు.భగవద్గీతను మనకు అందించాడు.ధర్మం ప్రక్కన ఉన్న పాండవ పక్షానికి సహాయ సహకారాలు అందించి కురు వంశం నేలమట్టమయ్యేలా చేసాడు. ఇది కృష్ణావతార కథ.

Wednesday, 21 January 2026

పరశురామ,రామావతార కథలు

హైహయవంశ రాజులు చెలరేగిపోయి లోకములను బాధించడం మొదలుపెట్టారు.వాళ్ళ అకృత్యాలకూ,కృూరత్వాలకూ అడ్డూ ఆపూ లేకుండాపోయాయి. అప్పుడు విష్ణువు జమదగ్ని మహామునికి రాముడు అనే పేరుతో పుత్రుడుగా జన్మించాడు.పరశువును ధరించడం వలన పరశురాముడుగా ప్రసిద్ధికెక్కాడు.ఆ గండ్రగొడ్డలిని అతను శివుడునుంచి పొందాడు. పరశురాముడు లోకకంటకులైన రాజులను ఇరవై ఒక్క సార్లు దాడి చేసి చంపాడు.ఆ సంహారాల అనంతరం వారి భూములను బ్రాహ్మణులకు ఇచ్చాడు.ఇది పరశురామావతారము. శ్రీహరి దశరథునికి పుత్రునిగా జన్మించాడు. అతడు కోసల దేశ రాజు.శ్రీరాముడు అనే పేరుతో జన్మించాడు.భరత,లక్ష్మణ,శత్రుఘ్నులు అతని సోదరులు.శ్రీరాముడు శివధనుస్సును వించి జనక పుత్రిక అయిన సీతను వివాహము చేసుకున్నాడు.తండ్రి,పినతల్లి కోరిక మేర కానలకేగాడు.సీత,లక్ష్మణులు అతని వెంట వెళ్ళారు.ఆ అడవులలో క్రూరులైన రాక్షసులను చంపి,మునులకు అభయమిచ్చాడు. ఖరదూషణులు రావణుని తమ్ముళ్ళు.వారి చెల్లెలు శూర్పణఖ రాముడుని మోహించి పెళ్ళి చేసుకోవాలనుకుంది.అప్పుడు ఆమె ముక్కుచెవులు లక్ష్మణుడు కోసివేస్తాడు.ఆ అవమానానికి ప్రతీకగా ఆమె సోదరులు పదునాలుగు వేలమంది రాక్షసులతో యుద్ధానికి వస్తారు రాముడు పైకి.రాముడు వారందరిని సంహారం చేస్తాడు. సీతాన్వేషణలో భాగంగా సుగ్రీవుని మైత్రి అగ్ని సాక్షిగా కోరాడు.హనుమంతుడి సహాయంతో సీత జాడ కనుగొని,రావణ సంహారం చేసాడు.రావణుడి తమ్ముడు విభీషణుడిని లంకకు రాజును చేసాడు. అయోధ్యకు సతీసమేతంగా వచ్చి రాజ్యానికి సుపరిపాలన అందించాడు. ఇది శ్రీరామావతార కథ.

Sunday, 18 January 2026

వామన,హంస,మనువు,ధన్వంతరి అవతారములు

శ్రీహరి అదితి,కశ్యపులకు వామన రూపంలో జన్మించాడు.ఇంద్రుడికి తమ్ముడు అయినాడు.బలి చక్రవర్తి రాక్షస రాజు.అతనిని ఈ బ్రాహ్మణుడిగా వెళ్ళి మూడడుగులు దానం అడిగాడు.బలికి వచ్చింది శ్రీమహా విష్ణువే అని తెలుసు.కానీ ఒప్పుకున్నాడు.అంతలో వామనుడు ఇంతింతై వటుడింతై ముల్లోకాలనూ ఆక్రమించాడు.మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే తన శిరస్సు చూపిస్తాడు బలి చక్రవర్తి.రాక్షస గురువు చాలా వారిస్తాడు వద్దని,వచ్చింది ఆ పురుషోత్తముడని.కానీ బలి వినలేదు,వినిపించుకోలేదు. భగవంతుడికే దానమిచ్చిన ఘనత బలి చక్రవర్తిది.వామనుడు అంతట తన మూడో అడుగు బలి తల పైన ఉంచి అధః పాతాళానికి అణగద్రొక్కాడు.ఇంద్రునికి స్వర్గాన్ని అప్పగించాడు. ఇది వామన అవతారము. బ్రహ్మ నారదుడితోటి హంస అవతారము గురించి చెబుతున్నాడు.ఓ నారదా!ఆ విశ్వ వ్యాపకుడు నా దైవభక్తి యోగానికి చాలా సంతోషించాడు.అప్పుడు హంస రూపము దాల్చాడు.హంస అయి ఆత్మ తత్త్వాన్ని వివరించే భాగవత పురాణాన్ని నాకు బోధించాడు.ఇది హంసావతార కథ. ఆ దేవదేవుడు మనువుగా పుట్టాడు.గొప్ప తేజస్సుతో మెలిగాడు.అప్రతిహతమయిన చక్రాయుధాన్ని ధరించాడు.ఇక దుష్ట శిక్షణకు నడుము బిగించాడు.దుష్టులయిన రాజులనందరినీ దునుమాడుతూ శిష్టులను పాలించాడు.ఇది మనువు అవతారము. ఆ చక్రథారి,ఆ మహావిష్ణువు ధన్వంతరిగా అవతరించాడు.ఆయుర్వేదమును నిర్మించాడు,కనుగొన్నాడు.ఆయన తన నామము స్మరిస్తేనే జనుల రోగములు నశింపచేసేవాడు.ఇది ధన్వంతరి అవతార సారము.

Friday, 9 January 2026

నృసింహావతార,ఆది మూలావతార కథ

పూర్వము హిరణ్య కశిపుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు.రాక్షస ప్రవృత్తి అంటే ఇంక క్రూరత్వము కరడు గట్టి ఉంటుంది కదా!అతడు గదను ఆయుధముగా చేసుకుని దేవతలను చాలా ఇక్కట్లపాలు చేసాడు.చాలా బాధలు పెట్టాడు.స్వర్గము ఛిందరవందరమయింది.ఎక్కడ చూసినా కల్లోలమూ,భీభత్సమే!అప్పుడు అసుర సంహారము కోసము శ్రీమహా విష్ణువు నృసింహ రూపం ధరించాడు. ఇల్లూ వాకిలీ కాకుండా గడప పైన కూర్చుని,పగలూ రాత్రి కాకుండా అసుర సంధ్య వేళలో,ఏ అస్త్ర శస్త్రాలు వాడకుండా తన గోళ్ళతో ఆ దుష్టుడిని చీల్చి చంపాడు.ఈ కార్యంతో ముల్లోకాలకూ మేలు చేసాడు.అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేలా చేసాడు.ఇది నృసింహావతార కథ. గజేంద్రుడు ఒకసారి నీటికోసరం మడుగులోకి దిగాడు.అప్పుడు ఒక మొసలి దాని కాలును నోట పట్టుకుంది.అప్పుడు ఆ గజేంద్రుడు ఆ మొసలి తో వేయి ఏండ్లు పోరాడాడు దాని పట్టు నుంచి విడిపించుకునేదానికి.కానీ తన శక్తి యుక్తులు చాలలేదు.అప్పుడు గజేంద్రుడు శ్రీహరిని శరణు కోరాడు.లావొక్కింతయు లేదు,ధైర్యము విలోలంబయ్యే.....అంటూ. అప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీలక్ష్మిని వదలి,వైకుంఠపురాన్ని వదలి,పై పంచే జారి పోతున్నా పట్టించుకోకుండా పరుగులు తీసాడు భక్తుడిని రక్షించేదానికి.తన విష్ణు చక్రంతో మొసలిని తుదముట్టించి గజేంద్రుడిని కాపాడాడు. ఇది శ్రీమహా విష్ణువు యొక్క ఆదిమూలావతారము.

Wednesday, 7 January 2026

మత్స్య,కూర్మావతారాలు

బ్రహ్మ చెబుతున్నాడు నారదుడికి.నారదా!వైవస్వత మనువు కాలంలో యుగము అంతము అయింది.అప్పుడు జలప్రళయము సంభవించింది.అప్పుడు విష్ణువు విచిత్రమయిన మత్స్యరూపము ధరించాడు.ఆ చేప రోజు రోజుకు పెరుగుతూ,చాలా స్వల్ప వ్యవథిలో బ్రహ్మాండంగా పెరిగింది.ఆ చేప సృష్టి అంతరించకుండా కాపాడింది.సృష్టికి ఆధారములు అయిన వస్తువులు,జీవరాశులులో నిండి,ఆ మనువు ఎక్కి ఉండే నావ మునిగి పోకుండా కాపాడింది. ఆ సమయంలో నానుంచి వేదాలను రాక్షసులు అపహరించి ఉన్నారు.దేవతల ప్రార్థన మేరకు ఆ వేదములును తిరిగి నాకు అప్పగించింది. ఇది మత్స్యావతార కథ. ఒకానొకప్పుడు దేవతలు,దానవులు అమృతము కోసము కష్టపడ్డారు.మంధర పర్వతాన్ని కవ్వములాగా చేసుకున్నారు.వాసుకిని కవ్వము చిలికేదానికి వాడే త్రాడు లాగా కట్టారు.పాల సముద్రాన్ని ఏక బిగిన చిలకటం మొదలుపెట్టారు చెరొక ప్రక్కన నిలబడి.కొంచెం సేపటికి ఆ పర్వతము మునిగి పోబోయింది.అప్పుడు భగవంతుడు కూర్మరూపంలో సముద్రం అడుగుకు వెళ్ళి,కవ్వము మునిగిపోకుండా తన వీపుపై పెట్టుకున్నాడు.ఆ పట్టు ఇచ్చాడు కాబట్టే దానవులు,దేవతలు అమృతము చిలకగలిగారు. ఇది కూర్మావతార కథ.

Tuesday, 6 January 2026

వృషభుడు,హయగ్రీవుడు

అగ్నీధ్రుడు అనేవాని పుత్రుడు నాభి.ఆ నాభి భార్య మేరుదేవి.ఆమెకు సుదేవి అనే పేరు కూడా వాడుకలో ఉంది.ఆ దంపతులకు వృషభుడు అనే కొడుకు పుట్టాడు.వృషభుడు ఎవరో కాదు!విష్ణువే ఆ పేరుతో వారికి పుట్టాడు. వృషభుడు శాంతమూర్తి.సర్వసంగ పరిత్యాగి.ఆయన పరమ హంస అయి మునులందరి ప్రశంసలు పొందాడు.ఇది వృషభావతార కథ. హయగ్రీవుడు బంగారు మేని ఛాయ గలవాడు.భగవదంశ సంభూతుడు.అతడు బ్రహ్మ ముఖమునుండి పుట్టాడు.అతను వేదాలలో దిట్ట.ఒకరకంగా చెప్పాలంటే వేదమయుడు.యజ్ఞ పురుషుడు.హయగ్రీవుడు ఎంతటి మహానుభావుడు అంటే అతని నాసిక నుండి వెలువడే ఉచ్ఛ్వాస నిశ్వాసముల వల్లనే వేదములు పుట్టాయి.ఇది హయగ్రీవావతార వృత్తాంతము.

Sunday, 4 January 2026

ధృవుడు,పృథుడు

ధృవుడు ఉత్తానపాదుడు అనే రాజుకు పుత్రుడు.అతను విష్ణువు అంశతో జన్మించాడు.అతని చిన్న వయసులో తండ్రి ఒళ్ళోకూర్చోబోయాడు.సవతి తల్లికి ఒప్పలేదు.తండ్రి తొడపై కూర్చుని,మురిపాలు పోవాలి అనే ఆ చిన్న బాలుడి కోర్కె తీరని కోరికే అయింది.ఆ సవతి తల్లి మాటలు ఆ చిన్నారి గుండెల్లో గునపాల్లా గ్రుచ్చుకున్నాయి.మానవుల ప్రేమలు సమంగా ఉండవు.భగవంతుడే సర్వకాల సర్వావస్థలయందు అందరినీ సమంగా ప్రేమిస్తాడు అని కన్న తల్లి చెప్పింది.ఎవరైతే తనను తననుగా ప్రేమిస్తారో,వారి ప్రేమ పొందితే చాలు అని తల్లి చెప్పిన మాటలు తలకెక్కాయి.అంతట తక్షణం ఆ పరమాత్ముడిని అన్వేషిస్తూ కానలకెళ్ళాడు. అడవిలో విష్ణువు కోసం ఘోర తపస్సు చేసాడు.ఆ భగవంతుడు అతనికి అత్యున్నతమయిన ధృవ స్థానం కల్పించాడు.భృగువు,మిగిలిన మునులు అతనిని స్తుతించారు.ధృవ మండలము సప్తర్షి మండలానికి పైభాగాన ఉంటుంది.ఇది ధృవావతార కథ. మునుపు వేనుడు అని ఒక రాజు ఉన్నాడు.భలే కృూరుడు.దుష్ట ప్రవర్తనకు తగినట్లుగా అతనికి బ్రాహ్మణ శాపం తగిలింది.దాని దెబ్బకు భాగ్యము అంతా పోయింది.ధనంతోటే పౌరుషము కూడా కనుమరుగు అవుతుంది కదా! పృథువు ఆ వేనుని పుత్రుడు.తండ్రి దుష్ట బుద్ధి ఇసుమంతకూడా అంటలేదు.అతను లోకములకు హితము కూర్చిన మహనీయుడు.ఇతను కూడా విష్ణు అంశతో పుట్టాడు.చక్రవర్తి అయ్యాడు.ఇతను భూమిని గోవుగా చేసాడు.సమస్త వస్తువులను పిదికాడు.పుత్రుడుగా తన ధర్మం నిర్వర్తించాడు.తండ్రికి ఉత్తమ గతి కల్పించాడు. ఇది పృథువు అవతార కథ.

Friday, 2 January 2026

సనకాదులు,నరనారాయణులు

బ్రహ్మ ఇలా చెప్పసాగాడు.నేను ఒకానొకప్పుడు కల్పాదినీ,లోకాలనూ సృజింపదలచాను.అందుకని తపస్సు చేయఢం మొదలుపెట్టాను.అప్పుడు నా నోటి నుండి సన అనే శబ్దము వెలువడింది.అందువల్ల సన అనే పేరుగల నలుగురు మానస పుత్రులు కలిగారు నాకు.వారే సనకుడు,సనందనుడు,సనత్కుమారుడు మరియు సనత్సుజాతుడు.పోయిన కల్పాంతంలో వారే ఆత్మతత్త్వాన్ని తిరిగి నెలకొల్పారు.వారు వేరుగా కనిపించినా నలుగురూ విష్ణువు అంశమే.ఇది అందరూ గ్రహించాలి. ఇదే సనకాదుల వృత్తాంతము. ఇక నరనారాయణుల గురించి చెబుతాను.మూర్తి అనునామె దక్షపుత్రిక.ఆమెకు,ధర్మునికి ఇద్దరు కుమారులు పుట్టారు.వారే నరనారాయణులు.వారిరువురూ మంచి గుణములు కలవారు.పరమ పావన మూర్తులు.వారు మునులు అయినారు.బదరీ వనంలో ఘోరమయిన తపస్సు చేయసాగారు.దేవేంద్రుడికి భయం పట్టుకుంది.వారి తపోబలం వలన తన పదవికి భంగం కలుగుతుందేమో అని.ఆయనకు తెలిసిన విద్య ఒక్కటే గదా!వారి తపస్సు భగ్నం చేసేదానికి అప్సరసలను రంగంలోకి దించాడు. ఆ అప్సరసలు దేవేంద్రుడి ఆజ్ఞ మేరకు తమ తమ శక్తియుక్తులు అన్నీ ప్రదర్శించారు.కానీ నరనారాయణులు చలించలేదు.మామూలు మునులు అయి ఉంటే ఎప్పుడో వాళ్ళను భస్మంచేసి ఉండేవాళ్ళు.కానీ వీరిరువురూ సత్త్వగుణసంపన్నులు.కాబట్టి కోపం తెచ్చుకోలేదు.శాంతి మార్గాన్నే ఎంచుకున్నారు. నారాయణుడు తన యూరువును చీల్చగా,అందుండి ఒక సౌందర్యవతి ఉద్భవించినది.ఆమె అతిలోక సుందరి.ఆమె కాలి గోటికి కూడా సరికాదు ఈ అప్సరసల అందచందాలు.వారు సిగ్గుతో తల వంచుకున్నారు.ఊరువు వలన ఉద్భవించినది కావున ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చినది.అప్సరసలు అవమానభారంతో వెనుతిరిగారు.ఇది నర నారాయణావతార వృత్తాంతము.

Thursday, 1 January 2026

కపిలుడు,దత్తాత్రేయుడు

కర్దమ ప్రజాపతికి,దేవహూతికి తొమ్మిది మంది సోదరీమణులతో కలిపి కపిలుడు జన్మించాడు.సాంఖ్య యోగము అనేది భగవంతుడు అయిన శ్రీహరిని పొందేదానికి అనువైన మార్గము.ఆ సాంఖ్య యోగాన్ని తన తల్లికి ఉపదేశించాడు.పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలి విశదీకరించాడు.ఆ పై ముక్తిని పొందే మార్గము బోధించాడు.ఇది కపిలావతార కథ. అత్రి మహాముని తపస్వులలోకి ఉత్తముడు.అతను పుత్రుడు కావాలని శ్రీహరిని ప్రార్థించాడు.ఆ భగవంతుడు నేను నీకు దత్తుడను అంటూ అత్రి మహామునికి కొడుకుగా పుట్టాడు.అతడే దత్తాత్రేయుడు.దత్తుడు అయిన శ్రీహరి అత్రి మహామునికి పుత్రుడు అయినాడు కాబట్టి ఆత్రేయుడు అయినాడు.హరికి దత్తాత్రేయ నామము కలిగే దానికి ఇదే కారణము. దత్తాత్రేయుడి పాద ధూళితో హైహయ వంశీయులు,యాదవులు పవిత్రులు అయినారు.వారందరూ ఐహిక సుఖాలను అనుభవించారు.అలాగే పరలోక సుఖాలనూ ఆస్వాదించారు.ఇది దత్తాత్రేయావతార కథ.