Monday, 26 January 2026

కృష్ణావతారము

రాక్షస అంశతో పుట్టిన రాజులు ధర్మం తప్పారు.ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ,భూమిని అనేక రకాలుగా బాధ పెట్టసాగారు.ఆ పాపుల బరువు,ఆ పాపపు బరువు భూదేవి మోయలేక పోయింది.శ్రీమహా విష్ణువును వేడుకొంది.అప్పుడు శ్రీహరి ఆమె భారం తగ్గించే దానికి నడుము బిగించాడు.ఆ దుష్ట రాజులను సంహరించేదానికి బలరాముడు,శ్రీకృష్ణుడు రూపాలతో అవతరించెను. వసుదేవుని భార్యలలో రోహిణికి బలరాముడు పుత్రుడు.దేవకీదేవికి శ్రీకృష్ణుడు పుత్రుడు.శ్రీకృష్ణుడు పురిటిలో ఉండగానే పూతన అనే రాక్షసిని చంపాడు.మూడు నెలల వయసులో శకటాసురుని చంపాడు.పెంచిన తల్లి యశోద కృష్ణుని అల్లరి భరించలేక రోటికి కట్టింది.ఆ రోలును ఈడ్చుకుంటూ పోయి మద్ది చెట్లను నేలకొరిగేలా చేసాడు. మట్టి తింటున్నావా అని గదమాయించిన యశోదకు తన నోటిలో ముల్లోకాలు,చరాచర జగత్తు అంతా చూపించాడు.త్రాగునీటిని కలుషితం చేస్తున్న కాళియ నాగుని మర్దించాడు.కార్చిచ్చును ఆపి గోపబాలురను సంరక్షించాడు.ఒకసారి నందుడు యమునానదిలో స్నానం చేస్తున్నాడు.అప్పుడు వరుణుడు అతనిని బంధించాడు.కృష్ణుడు నందుని బంధ విముక్తుడిని చేసాడు. ఇంకొకసారి రాక్షస మాయవల్ల గుహలో గోపాలకులు చిక్కుకున్నారు.వాళ్ళందరినీ రక్షించి,ఆ రాక్షసుడిని దునుమాడాడు. ఇంద్రుడు తనకు పూజలు చేయలేదని జడివానలు కురిపించాడు.అపుడు కృష్ణుడు గోవర్థన గిరిని ఎత్తి గోపాలకులను కాపాడాడు.దుష్టుడు కంసుడు మేనమామ అయినా తన తల్లిదండ్రులను చెరలో పెట్టాడని చంపాడు. శంఖచూడుడు అనే రాక్షసుడు గోపికలను ఎత్తుకెళ్ళాడు.వాడికి గర్వభంగము చేసి వారిని విడిపించాడు.నరకుడు మొదలు చాలా మంది రాక్షసులను సంహరించాడు.దుష్టులైన రాజులను సంహరించి భూభారమును తగ్గించాడు.భగవద్గీతను మనకు అందించాడు.ధర్మం ప్రక్కన ఉన్న పాండవ పక్షానికి సహాయ సహకారాలు అందించి కురు వంశం నేలమట్టమయ్యేలా చేసాడు. ఇది కృష్ణావతార కథ.

1 comment: