Sunday, 12 October 2025
నారదుడు అస్ఖలిత బ్రహ్మచారి
నారదుడు ఇంకా ఇలా కొనసాగించాడు ఆ మునికి చెప్పడము.
ఓ మునివర్యా!ఆ అశరీరవాణి మాటలు నన్ను చాలా సంతృప్తి పరచాయి.నాకు చాలా సంతోషం వేసింది.నేను వినమ్రతతో శిరసు వంచి ఆ అశరీర వాణికి దండ ప్రమాణాలు సమర్పించుకున్నాను.ఇంక అప్పటి నుండి కామక్రోథాలను వదలి పెట్టేశాను.ఆ భగవంతుని నామ జపంతోటే కాలము వెళ్ళ బుచ్చాను.అతని చరిత్రనే మననం చేసుకుంటూ ఉన్నాను.నిర్మల మయిన మనసుతో,ప్రశాంత చిత్తముతో నిరంతరమూ ఆ దేవదేవుడిని మనోఫలకం మీద ఉంచుకున్నాను.అతని మీదే బుద్ధి నిలిపి,ఏకాగ్ర చిత్తంతో కాలం గడపసాగాను.ఇంతలో నాకు మరణం సంభవించింది.నేను నా శరీరాన్ని వీడి శుద్ధ సత్త్వమయమైన భాగవత శరీరాన్ని పొందాను.అంతలో ప్రళయము సంభవించింది.
శ్రీమన్నారాయణుడు సముద్రము మథ్యలో శయనించి ఉన్నాడు.అతని నాభి నుండి వచ్చిన కమలంలో బ్రహ్మ కానవచ్చాడు.బ్రహ్మ విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించబోయాడు.అతని నిశ్వాసతో పాటే నేను కూడా అతనిలోకి వెళ్ళిపోయాను.ఇలా వేయి యుగములు గడచిపోయాయి.బ్రహ్మకు మెలకువ వచ్చింది.ఇంక సృష్టి కార్యము మొదలు పెట్టాడు.ఆ బ్రహ్మ వలన మరీచి,ఇంకా చాలా మంది మునులు,నేను కూడా పుట్టాము.
నేను అస్ఖలిత బ్రహ్మచారిని అయినాను.మహావిష్ణువు కృపాకటాక్షము నా మీద ప్రసరించడం వలన ముల్లోకాలూ సంచరిస్తుంటాను.నన్ను ఎవరూ ఆపరు.ఎవరి ప్రమేయం లేకుండానే సప్త స్వరాలు పలికే మహతి వీణ ఈశ్వరుడు యొక్క అనుగ్రహము వలన నాకు దక్కింది.ఇంక ఆ వీణను మీటుతూ నారాయణుని కథలను గానం చేయటమే నా వృత్తి,ప్రవృత్తి.
నేను ఈ గానం తన్మయత్వంతో చేస్తుంటే,నేను పిలిచినట్లుగా నా మనోఫలకం పైన ఆ భగవంతుడు కనిపిస్తాడు.నాకు విష్ణునామ సంకీర్తన వలన కలిగే మనశ్శాంతి,నాకు వేరే ఇంకేమి చేసినా దక్కదు.స్వయానా యముడుని నియంత్రించ గలిగే యోగము నేర్చుకుని ఉన్నా నాకు అంత మహదానందము దక్కదు.హే మునీంద్రా!ఇది స్వయానా నా అనుభవము.కాబట్టి నా ఈ రహస్యాన్ని నీకు చెబుతున్నాను.
ఆ మాటలు చెప్పి నారదుడు తన మహతి వీణను మీటుకుంటూ విష్ణు నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళి పోయాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment