Thursday, 23 October 2025
కుంతీదేవి ఆనంద పారవశ్యము
కుంతీదేవి ఆనందానికి అవథులు లేవు.శ్రీకృష్ణుని మనసారా స్తుతించింది.హే దేవా!నీవు అవ్యయుడవు.నీకు మించిన ప్రకృతి ఇంక వేరే ఏమీలేదు.నీకు ఇవే నా నమస్కారాలు.సభ ముందరకు రాకుండా,తెర వెనక ఉండి నాట్యము చేసే నటుడివి నీవు.ఎందుకంటావా?నీవు ఎప్పుడూ మాయా యవనికాంతరమున నిలిచి చిత్ర విచిత్రాలు ప్రదర్శిస్తూ ఉంటావు.నీ మహిమ మాలాంటి మామూలు మనుష్యులకు ఏమి అర్థమవుతుంది?ఎలా అర్థమవుతుంది?ఎంతని అర్థమవుతుంది?
నన్నూ,నా బిడ్డలనూ లక్క గృహములో అగ్నికి ఆహుతి కాకుండా కాపాడావు.మాకు ప్రాణ భిక్ష పెట్టావు.దుర్యోధనుడు కుటిల బుద్థితో భీముడికి విషం కలిపిన ఆహారము పెడితే,దాని నుంచి కాపాడావు.ద్రౌపదికి నిండు సభలో అవమానము జరిగినప్పుడు,ఆమెకు వలువలు ఇచ్చి,విలువలు పెంచి మానసంరక్షణ చేసావు.పాండవ కౌరవ యుద్ధములో మా వెంట ఉండి,నా పుత్రులు విజయ పతాకం ఎగుర వేసేలాగా చేసావు.ఇప్పుడు ఉత్తర గర్భమును కాపాడావు.
అలనాడు కంసుడు మీ అమ్మను బాథలు పెట్టాడు.ఆ ఇక్కట్లనుంచి మీ అమ్మను కాపాడుకునినట్లు,ఇప్పుడు కౌరవుల చేతిలో నేను కష్టాలు పడకుండా కాపాడావు.
నీ మత్స్య,కూర్మ,వరాహావతారాలు అన్నీ మామూలు మనుష్యులను మాయ చేసేదానికే కదా!నీవు జన్మ కర్మ రహితుడవు.నీకు చావు పుట్టుకలు లేవు.దేవకీ వసుదేవులు తమ సంతానంగా నీవు పుట్టాలని ఎంతో తపస్సు చేసారు.వాళ్ళ కోరిక తీర్చడం కొరకే నీవు యాదవ కులములో పుట్టావు.
సముద్రములో నావ బరువు ఎక్కువ అయితే ముణిగి పోతుంది.అలాగే పాపుల యొక్క పాప భారంతో బరువెక్కిన ఈ భూదేవిని ఉద్థరించేదానికే నీవు ఈ జన్మ ఎత్తావు.
ఇలా కుంతి తన ఆనందానిని,కృష్ణుని పైన తనకు ఉండే నమ్మకాన్నీ వ్యక్త పరచింది.ధర్మరాజు ,కుంతీ దేవి కోరికమేరకు కృష్ణుడు వాళ్ళ దగ్గర ఇంకొన్ని రోజులు ఉండేదానికి ఒప్పుకున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment