Saturday, 18 October 2025
భీముడి కోపం నషాళానికి!
ధర్మరాజు శాంతి కాముకుడు.కాబట్టి ద్రౌపది మాటలు అతనికి నచ్చాయి.నకులుడు,సహదేవుడు,సాత్యకి,శ్రీకృష్ణార్జునులకు కూడా నచ్చాయి.అందరూ సరే అన్నారు.కానీ భీముడికి భలే కోపం వచ్చింది.మొదటి సారి ద్రౌపది మాటలు నచ్చలేదు.
తన ఆక్రోశం ఇలా వెళ్ళగక్కాడు.ఈ ద్రౌపది ఒఠ్ఠి వెర్రిబాగులది.తన కొడుకులను పొట్టన పెట్టుకున్న దురాత్ముడిని విడిచి పెట్టమని చెబుతుంది.బుర్రుండి మాట్లాడుతుందా అసలు?బిడ్డలను చంపిన ఈ కర్కోటకుడు బ్రాహ్మణుడా?ఈ నీచుడిని వదలి పెట్టే మార్గమే లేదు.నరికి పోగులు పెట్టాల్సిందే!మీరు ఎవ్వరూ వీడిని చంపక పోతే,నేనే నా ఒకే ఒక్క పిడి గుద్దుతో వీడి తలను నుజ్జు నుజ్జు చేస్తాను.
ఇలా అంటూ భీముడు అశ్వత్థామ పైకి ఉరికాడు.ద్రౌపది అడ్డు పడింది.ఆమె శక్తి చాలదని తలచి శ్రీకృష్ణుడు తన నాలుగు భుజాలలో రెండు భుజాలతో భీముడిని ఆపాడు.ఇంకో రెండు భుజాలతో ద్రౌపదిని భీముడు అశ్వత్థామల మథ్య నుంచి ప్రక్కకు లాగాడు.
శ్రీకృష్ణుడు భీముడిని ఉద్దేశించి చిరునవ్వుతో ఇలా అన్నాడు.భీమా!నీవు అన్నది ముమ్మాటికీ నిజమే!ఈ నీచ నికృష్టుడిని శిక్షించాల్సిందే!కానీ బ్రాహ్మణో న హంతవ్యః అని వేద ధర్మము ఉంది కదా!అంటే బ్రాహ్మణుడిని చంపరాదు అని వేదాలు ఘోషిస్తున్నాయి.కాబట్టి అన్నిటినీ బేరీజు వేసుకుంటే వీడిని చంపకుండా వదలివేయటమే ఉత్తమము.చిన్నగా భీముడిని శాంతపరచారు.
అందరూ కలసి బాగా ఆలోచించారు.ద్రౌపది,భీముడు ఒప్పుకోవాలి.అర్జునుడి ప్రతిజ్ఞ భంగము కాకూడదు.ధర్మబద్థంగా ఉండాలి.వాళ్ళకు ఒక ఉపాయము తట్టింది.
అర్జునుడు అశ్వత్థామకు శిరోముండనం చేసాడు.అతని తలలో ఉండే చూడారత్నమును తీసేసుకున్నాడు.కట్లు విప్పి,అక్కడ నుంచి కుక్కను తరిమినట్లు తరిమేశాడు.
చివరకు గురుపుత్రుడు,బాలహంతకుడు అనే మాయని మచ్చతో,తేజో విహీనుడు అయి,మణిని కోల్పోయి,కళావిహీనంగా,సిగ్గుతో,పాపపు భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
పాండవులు,పాంచాలి తమ విగత పుత్రులను తలచుకుని రోదించారు.మృతులు అయిన బంథువులకందరికీ దహన సంస్కారాలు చేసారు.అందరూ వారి స్త్రీలను తోడు తీసుకుని శ్రీకృష్ణునితో కలసి గంగా తీరానికి పోయారు.మృతి చెందిన వారందరికీ తిలోదకాలు సమర్పించి,గంగలో స్నానాలు చేసారు.
శ్రీకృష్ణుడు పుత్రశోకముతో విలపిస్తున్న గాంథారి,ధృతరాష్ట్రుడు,కుంతీ దేవి,ద్రౌపది మున్నగువారిని మంచి మాటలతో శాంత బరచాడు.బంధు జన మరణము వలన కలిగిన దుఃఖము ఉపశమనము పొందేలా చేసాడు.
అలా శ్రీకృష్ణుడు యుద్థములో పాండవులచేత కౌరవులను చంపించాడు.విజయలక్ష్మి పాండవులను వరించేలా చేసాడు.ధర్మరాజుకు రాజ్యము చేకూరేలా చేసాడు.ఇంక నిశ్చింతగా ద్వారకా నగరానికి పోయేదానికి సమాయత్తమయ్యాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment