Monday, 2 February 2026
వైకుంఠ పురము వైభవోపేతము
బ్రహ్మదేవుడికి విష్ణువు కనిపించగానే మూడులోకాలు కనిపించినట్లు అయింది.అతనికి తత్ క్షణమ్ వైకుంఠ పురము కనిపించింది.అది దేదీప్యమానంగా,గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది.అంతే కాదు.ఆ విష్ణు విలాసము కేవల సత్త్వగుణమునకు ఆవాసము.అన్ని లోకాలకంటే ఉత్తమమయినది,ఉన్నతమయినది.దేవతలు నిరంతరము స్తుతిస్తూ ఉండే విష్ణు ఆవాసము.అది లోభము,మోహము,భయము అనే తుచ్ఛగుణాలు లేని ప్రదేశము.అది దివ్యమంగళ విలాస మహిమతో ఒప్పారుతున్నది.బ్రహ్మకు తన కళ్ళు చాలడం లేదు ఆ వైభవము చూసేదానికి.ఎంత చూసినా తనివి తీరడం లేదు.
అక్కడి చిలుకలు సదా న దైవం కేశవాత్పరం అని పలుకుతున్నాయి.గోరువంకలు కూడా ఎందులోనూ తీసిపోవడం లేదు.అవి సర్వం విష్ణుమయం జగత్ అని అంటున్నాయి.కోకిలలు ఏమాత్రం వెనకబడటం లేదు.అందులో వాటి గాత్రం సుమథురం కదా!అవి మంగళం మధుసూదన అని రాగయుక్తంగా పిలుపునిస్తున్నాయి.
ఆ నగర శోభ ఇంత అని చెప్పలేని విథంగా కాంతులు విరజిమ్ముతూ,శోభాయమానంగా,కన్నులకింపుగా కానవస్తుంది.
మనకు ఇక్కడ ఏమో వీథి సర్పంచ్ కూడా రాజు వెడలె రవితేజము లలరగ అన్న పంథాన ఉంటుంది కదా!అక్కడ ఏమో విష్ణువుకు,విష్ణు పార్శ్వచరులకు భేదము అస్సలు తెలియడం లేదు.
అందరూ శ్యామల దేహము కలిగి ఉన్నారు.అందరూ పీతాంబరాలు ధరించి ఉన్నారు.అందరి ముఖములు,కళ్ళు పద్మములలాగా అందముగా ఉన్నాయి.అందరూ రత్న ఖచిత ఆభరణాలు ధరించి ఉన్నారు.నిత్య యవ్వనంతో కళకళలాడుతున్నారు.
సునందుడు,నందుడు,అర్హణుడు,ప్రబలుడు,మిగిలిన పార్శ్వచరులు శ్రీహరిని కొలుచుకుంటూ ఉన్నారు.లక్ష్మీ దేవి శ్రీహరి పాదాలు ఒత్తుతూ ప్రసన్నంగా ఉంది.ఆ దేవదేవుడు కానరాగానే బ్రహ్మ ఆనందానికి అవథులు లేవు.శరీరము జలదరించింది.పులకరించింది.విష్ణు సాక్షాత్కారము అంటే మాటలు కాదు కదా!ఆనందబాష్పాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు.తన నాలుగు శిరస్సులతో శ్రీహరి పాదపద్మాలకు వినమ్రంగా ప్రణమిల్లాడు.
Sunday, 1 February 2026
బ్రహ్మ తపస్సు ఫలదాయకం
బ్రహ్మ పద్మములో నుంచి ఆవిర్భవించాడు కదా!చటుక్కున ఒకసారి ఆయనకు అనిపించింది.నేను కూర్చుని ఉన్న ఈ పద్మము మూలస్థానము ఏది?
అది తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువైంది.ఇంక ఉండబట్టలేక క్రిందికి పోయి చూడసాగాడు.ఎంత దూరము పోయినా మూలము కనిపించడం లేదు.ఆయనకు విసుగు వచ్చేసింది.ఏంది ఇదంతా అని.ఇది ఇంక అయ్యేపని కాదని తేల్చుకుని,తిరిగి వెనుకకు వచ్చేసాడు.తన ఆసనము అయిన పద్మములోకూర్చుని,సృష్టికార్యము సాగించాలని సంకల్పము చేసుకున్నాడు.కానీ ఏమీ అర్థం కాలేదు.ఏమీ తోచడం లేదు.
ఇంతలో అతనికి రెండు సార్లు తప అనే శబ్దము వినిపించింది.ఆ శబ్దము ఎక్కడనుంచి వచ్చింది?అసలు ఎవరు పలికారు?ఈ అనుమానాలతో నాలుగు దిక్కులకూ పోయి వెదికాడు.ఏమీ తెలియలేదు.
వెనకకు వచ్చి తన ఆసనముపైన కూర్చున్నాడు.ఆలోచించాడు.ఇంకా ఆలోచించాడు.తప అంటే ఏంది అర్థము? తపస్సు చేయమని కదా!ఎవరో దేవతా మూర్తి నన్ను తపస్సు చేయమని సలహా ఇస్తున్నాడు.కాదు,కాదు. ఆజ్ఞాపిస్తున్నాడు.కాబట్టి నేను తక్షణము తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు.
ఇంక ఏకాగ్ర చిత్తముతోటి వేయి దివ్య సంవత్సరములు ఘోర తపస్సు చేసాడు.అప్పుడు శ్రీమహా విష్ణువు కరుణించి,ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయినాడు.
Subscribe to:
Comments (Atom)