Sunday, 15 February 2026

ఆశ్రయము,సృష్టి

శుక మహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు.ఉత్పత్తి,స్థితి,లయము అనే మూడూ ఎక్కడ పుడుతూ వెల్లడి అవుతాయో అదే ఆశ్రయము.పరమాత్మ అన్నా అదే.బ్రహ్మ అన్నా అదే.ఆత్మ ఆధ్యాత్మికము,ఆధిదైవికము,ఆధిభౌతికము అని మూడు రకములు.ఆధ్యాత్మికము అనునది చక్షురాది గోళకములకు అంతర్వర్తియై ఉంటుంది.చక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుడే ఆధి దైవికము.చక్షురాద్యధిష్టానాభిమాన దేవతయై సూర్యాదితేజోవిగ్రహుడగుచూ,ఎవ్వనియందు ఈ రెండు విభాగములు కలుగుతాయో అతడు ఆధి భౌతికుడు.ఆ ఆధిభౌతికుడే విరాట్ పురుషుడు.ద్రష్ట,దృక్కు,దృశ్యము...ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఏమీ కానరాదు.కనిపించదు.ఈ మూడింటి గురించి ఎవ్వరికి క్షుణ్ణంగా తెలుసో,అతనే పరమాత్మ.అతనే సర్వాంతర్యామి.సర్వలోకాలకూ,ప్రాణులకూ ఆశ్రయము ఇచ్చిన దాత. ఆ జగద్రక్షకుడూ,జగద్వ్యాపకుడూ విలాసము కొరకు సృజింపదలచాడు.తనకు ఎక్కడ,ఎలా సుఖంగా ఉంటుందో పరికించాడు.ముందర జలమును సృజించాడు.అది మహా సముద్రము రూపములో నున్న జలరాశి అయింది.ఆ జలరాశిలో అతను శయనించాడు.జలములకు నారములు అని ఇంకో పేరు ఉంది.ఆ నారములు పరమాత్మ వాసస్థాన మగుటచే అతనికి నారాయణుడు అనే పేరు వచ్చింది. అతని సృజన కారణంగానే ప్రాణాదులు,పంచభూతములు,ఇంద్రియములు,మనస్సు,బుద్ధి ఉద్భవించాయి.ఇంతే కాదు.అతను ప్రజాపతులు,ఋషులు,పితృదేవతలు,సుర,సిద్థ,విద్యాధరులు,మున్నగువారిని కూడా సృజించాడు.పక్షి,మృగ,వృక్ష సంతతిని కూడా సృజించాడు. ఇంత చేసినా అతను వీటన్నిటికీ కర్తృత్వము వహించడు.అంతా తన మాయాకల్పితంగానే తోచేటట్లు చేస్తాడు.ఆ మహామహడు,సర్వవ్యాపి నిరవద్యుడు,నిరంజనుడు,పరుడు,పరాత్పరుడు,నిష్కళంకుడు,నిత్యుడు మరియు సత్యుడు.

No comments:

Post a Comment