Thursday, 16 April 2026

ఉద్థవుడి జీవిత పరమార్థము

శుక మహర్షి చెప్పేదంతా పరీక్షిత్తు విన్నాడు.అతని మనసులో మెదిలిన అనుమానాలను బయటపెట్టాడు.ఓ శుకమహర్షీ!యాదవ వంశంలో అతిరథులు,మహారథులు కాడా చాలా మంది ఉన్నారు కదా!వాళ్ళందరూ కూడా పరస్పర కలహాలతో ఒకళ్ళనొకళ్ళని కొట్టుకుని మరణించారు.శ్రీకృష్ణుడు కూడా నిర్యాణం చెందాడు కదా!ఇట్లా యాదవ కులంలో అందరూ చనిపోయినా ఈ ఉద్ధవుడు ఒక్కడు మటుకు ఎలా బ్రతికాడు? దానికి శుకమహర్షి ఇలా సమాథానం చెప్పాడు.శ్రీ మహా విష్ణువు యాదవ కులంలో ఎందుకు జన్మించాడంటావు?బ్రహ్మాది దేవతలు ప్రార్థించారనే కదా!ఈ భూభారం తగ్గించే దానికే కదా!వంశం మొత్తం నాశనమయితే జ్ఞాన తత్త్వము లోకంలో ఎట్లా నిలబడుతుంది?ఆ తత్త్వము లోకములో అందరికీ విశదంగా,వివరంగా చెప్పేవాళ్ళు ఒకరైనా,నిఖార్సు అయినవాళ్ళు ఉండాలి కదా!అందుకే శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని బ్రతికించి ఉంచాడు.తత్త్వ ప్రచారానికి అతడు ఒక్కడే యోగ్యుడని భావించాడు. ఇలా ఉద్ధవుడు వెళ్ళిపోయిన తరువాత విదురుడు మైత్రేయుడిని కలిసేదానికి బయలుదేరాడు.విదురుడు యమునా నదిని దాటాడు.కొన్ని రోజులు ప్రయాణం చేసాడు.పుణ్య క్షేత్రాలలో స్నానం చేసాడు.విష్ణు క్షేత్రాలను సందర్శించాడు.చిన్నగా గంగా నది దగ్గరకు చేరాడు.అక్కడ అతనికి ముని సత్తముడు అయిన మైత్రేయ మహర్షి కనిపించాడు.

No comments:

Post a Comment