Wednesday, 17 September 2025

నారాయణుని నామ మహిమ

కలి దోషములు అన్నీ నారాయణుని కీర్తన వలననే నశిస్తాయి.అందుకే ఉత్తములు ఆయనను నిత్యమూ స్తుతిస్తూ ఉంటారు.విష్ణునామ సంకీర్తన అనేది దావానలంలాంటిది.దాని సెగకు,పొగకూ,మంటలకు కీకారణ్యాలు లాంటి పాపాల పుట్టలు చిటెకలో భస్మమయిపోతాయి.సూర్యుని కిరణాలతో చీకటి ఎలా పటాపంచలు అవుతుంది?అచ్చం అలాగే నారాయణుని స్మరిస్తే కామము,క్రోధము,లోభము,మోహము,మదము,మాత్సర్యము అనేవి కంటికి కనిపించకుండా మాయమయిపోతాయి.నరహరి బలరాముడుతో కలసి ఎన్నేసి గొప్ప పనులు చేసాడు.మానవాళి అంతా అచ్చెరువు అయేలా చేసాడు కదా!ఆ మహానుభావుని చరిత్ర వినాలని మాకంతా కుతూహలముగా ఉంది.మా చెవులకు ఉండే తుప్పు అంతా పోయేలా ఆ మహావిష్ణువు కథలు వినాలని ఉంది.ఈ భవసాగరము ఈదాలంటే సామాన్య మానవుడికి వల్ల కాదు.ఎవరిదైనా ఆపన్నహస్తంకావాలి.కలి దోషములు పోగొట్టుకోవాలనే తపనలో మేమందరమూ ఉన్నాము.మా అదృష్టం కొద్దీ నీవు మాకు కనిపించావు.శ్రీకృష్ణుడు ధర్మస్థాపనకు పెట్టనికోట.అతడు ఇప్పుడు పరమపదించాడు.ఇంక ఈ లోకంలో ధర్మాన్ని నిలిపేదెవరు?

No comments:

Post a Comment