Thursday, 25 September 2025

శుక మహర్షి గొప్పదనం

శౌనకాది మహా మునులు సూతుడు చెప్పిన మాటలు విన్నారు.వాళ్ళందరూ ముక్త కంఠంతో ఇలా అడిగారు. ఓ సూత మునీంద్రా!అసలు దీనికి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి?ఈ భాగవతాన్ని రచించమని ఏయుగంలో ఎవ్వరు అడిగారు?ఎక్కడ అడిగారు?ఎందుకు అడిగారు? శుక మహర్షి వ్యాసుని కొడుకు.అతడు మాయా మోహాన్ని అతిక్రమించిన వాడు.స్వపర భేదం లేకుండా సమస్తాన్ని సమానంగా చూడగలుగుతాడు.చూస్తాడు.పరబ్రహ్మను కనుగొన్నాడు.ఎప్పుడూ ఏకాంతవాసం కోరుకుంటాడు.అతడికి అందరూ సమానమే!ఎంతలా అంటే స్త్రీ పురుష విచక్షణ కూడా కనబరచడు.అసలు లేదు.దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది.అది ఇలా సాగుతుంది. ఒకరోజు శుక మహర్షి దిగంబరంగా దారిలో వెళుతున్నాడు.ఆ ప్రక్కనే దేవతా స్త్రీలు వివస్త్రలయి జలక్రీడలు ఆడుకుంటూ ఉన్నారు.వారు ఈయనని చూడగానే అలాగే బయటకి వచ్చి ఆయనను పిలుస్తూ ఆయన వెనక వెళ్ళారు.శుక మహర్షి వారిని గమనించకుండా,తన దారిన తాను వెళ్ళిపోయాడు.ఇంకొంత దూరంలో వ్యాస మహర్షి వస్తూ వాళ్ళకి కనిపించాడు.వాళ్ళందరూ సిగ్గు పడిపోయి,మెలికలు తిరుగుతూ,గబగబా వస్త్రాలు ధరించారు. వ్యాసుడికి అర్థంకాలేదు.తన కొడుకు వెనక వివస్త్రలయి పరిగెత్తారు.వార్థక్యంలో ఉన్న తనను చూసి వారందరూ సిగ్గు పడుతున్నారు.ఉండ బట్టలేక అడిగేసాడు.ఓ దేవతా యువతులారా!నా కుమారుడు యువకుడు.యవ్వనంలో ఉన్నాడు.అందులోనూ బట్టలు లేకుండా వెళుతున్నాడు.మీరు ఏమో సిగ్గు విడిచి,వస్త్రములు ఒంటి పైన లేక పోయినా,అతనిని పిలుస్తూ,అతని వెంట పడ్డారు.నా విషయానికి వస్తే,నేను ముసలి వాడను.జవసత్త్వాలు ఉడిగిన వాడిని.దానికి తోడు శుభ్రంగా,మర్యాదపూర్వకంగా బట్టలు ధరించాను.ఎందుకు నన్ను చూడగానే మీరందరూ సిగ్గు పడ్డారు?ఎందుకు వస్త్రములను ధరించారు? దానికి ఆ యువతులు ఇలా జవాబు చెప్పారు.ఓ మహర్షీ!నీ కుమారుడు అన్నిటికీ అతీతుడు.అతనికి స్వపర భేదం లేదు,స్త్రీ పురుష భేదం అసలే లేదు.అతడు నిర్వికల్పుడు.అతను నిశ్చలమయిన మనసు కలవాడు.నీకు,అతనికి పోటీ ఏంది?నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అట్లాంటి శుక యోగి కురు జాంగల దేశాలను ఎందుకు ప్రవేశించాడు?హస్తినాపురానికి ఎందుకు వెళ్ళాడు?పరీక్షిత్తు మహారాజుకు ఎందుకు భాగవతం చెప్పాడు?భాగవతము అంటే కాకమ్మ పిచుకమ్మ కథ కాదు కదా!అది పూర్తిగా చె ప్పాలంటే చాలా కాలం పడుతుంది కదా!శుక మహర్షి ఎక్కడా,ఎప్పుడూ,ఎక్కువ సేపు ఉండడు. ఆఖరికి మనము ఇండ్లలో ఆవుకు పాలు పితికినంత సేపు కూడా ఉండలేడు.అట్లాంటి ఆయన ఎంతో కాలము ఒకే చోట ఉండి,ఎట్లా భాగవతము చెప్పాడు?అసలు పరీక్షిత్తు మహారాజుకు ఏమైంది? ఆయనకు విరక్తి ఎందుకు కలిగింది?అసలు గంగ నడుమ ఉండే దానికి కారణం ఏంది? స్వామీ!మా మనసుల నిండా ప్రశ్నలే!వాటన్నిటికీ మాకందరికీ సమాథానం కావాలి.కాబట్టి దయచేసి మా విన్నపాలు మన్నించి,మాకు అన్నీ వివరణగా చెప్పండి.

No comments:

Post a Comment