Tuesday, 23 September 2025

భగవంతుని అవతారాలు ఇంకొన్ని

దేవతలు,దానవులు ఒకసారి పాలసముద్రాన్ని అమృతం కోసరము చిలికారు.అప్పుడు శ్రీహరి కూర్మరూపంలో మంథర పర్వతాన్ని తన వీపు పైన నిలిపి ఉంచాడు.ఈ కూర్మరూపము పదకొండవ అవతారము.పాల సముద్రాన్ని మథించిన తరువాత ధన్వంతరి అయి అమృత కలశం ను తీసుకుని వచ్చాడు.భగవంతుని పండ్రెండవ అవతారము ధన్వంతరి అవతారము.అమృతాన్ని దేవతలకు,దానవులకు సమముగా పంచాలి అని అన్నారు. అప్పుడు మోహినీ రూపంలో దానవుల కళ్ళు గప్పి మోసం చేసి అమృతం అంతా దేవతలకు పంచి పెట్టాడు.ఈ మోహినీ రూపమే ఆయన పదమూడవ అవతారము.ఆ తరువాత కాలంలో హిరణ్య కశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు.ప్రహ్లాదుడు,హరి భక్తుడు అతని కొడుకు.ప్రహ్లాదుడిని రక్షించేదానికి నరసింహావతారము ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరించాడు తన గోళ్ళు,కోరలతో!ఈ నరసింహావతారమే ఆయన పదునాల్గవ అవతారము.బలి చక్రవర్తిని మూడడుగుల స్థలం అడిగాడు వామనావతారములో వచ్చి.ఆయన ఒప్పుకోగానే,ఇంతింతై వటుడింతై మూడు లోకాలనూ ఆక్రమించాడు.ఈ వామనావతారమే పదహైదవ అవతారము.జమదగ్నికి భార్గవరాముడుగా పుట్టడం ఆయన పదహారవ అవతారము.ఈ అవతారములో క్రోధమూర్తిగా ఉంటూ బ్రాహ్మణులకు ద్రోహము తలపెట్టిన క్షత్రియులను తుద ముట్టించాడు.పదహేడవ అవతారములో బాదరాయణుడిగా పుట్టాడు.ఈ అవతారములో కలసిపోయి ఉన్న వేదాలను విభజించాడు.పదునెనిమిదవ అవతారములో శ్రీరాముడిగా జన్మించాడు.ఈ అవతారములో దశరథుడికి పుత్రుడు అయ్యాడు.సముద్రమును దాటి రాక్షస రాజు అయిన రావణాసురుడుని హతమార్చాడు.మునులను కాపాడాడు.పందొమ్మిదో అవతారములో శ్రీకృష్ణుడు,బలరాముడుగా పుట్టాడు.ఈ జన్మలో దుష్టులు అయిన రాక్షసులను,రాజులను తుద ముట్టించారు.అలా భూభారాన్ని తగ్గించారు.కలియుగములో బుద్ధుడి అవతారము ఎత్తుతాడు.మధ్య గయా ప్రదేశమున పుడతాడు.యుగసంధి సమయములో రాజులు చోరప్రాయులు అవుతారు.అప్పుడు విష్ణుయశుడు అనే బ్రాహ్మణునికి కల్కిరూపంతో పుట్టి జనులను ఉద్ధరిస్తాడు. ఇలా భగవంతుడి లీలల గురించి తెలిపే గ్రంథమే భాగవతము.

No comments:

Post a Comment