Monday, 29 September 2025
వ్యాసుడి పుట్టుక…వేదముల విభజన
సూతుడికి భలే సంతోషంఅయింది,శౌనకాది మునులు అట్లా అడిగేటప్పటికి.ఊపూ ఉత్సాహంతో చెప్పడం మొదలు పెట్టాడు.మూడవ ద్వాపర యుగము ముగిసింది.ఉపరిచర వసువుల వలన వాసవి పుట్టింది.ఆమెకు సత్యవతి అని ఇంకో పేరు కూడా ఉంది.ఆమె యందు పరాశర మునికి వ్యాసుడు పుట్టాడు.వ్యాసుడు విష్ణువు అంశతో పుట్టాడు.అతను మహా జ్ఞాని.అతను బదరికాశ్రమములో ఉండేవాడు.ఒకరోజు దగ్గరలోనే ఉండే సరస్వతీ నదీ తీరంలో స్నానపానాదులు ముగించుకుని వచ్చాడు.ప్రశాంతంగా ఎవరూలేని ఏకాంత ప్రదేశంలో,సూర్యోదయ సమయంలో యుగధర్మాల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు.
అతని మనసుకి ఇలా అనిపించింది.లోకంలో మానవులకు ఆయుష్షు తక్కువ.బలహీనంగా ఉంటారు.జవసత్త్వాలు తొందరగా నశిస్తాయి.దాని కారణంగా ధైర్యము ఉండదు.కాబట్టి సర్వ మానవకోటికి హితవుగా ఏమైనా చేయాలని కంకణం కట్టుకున్నాడు.
అతడు నలుగురు హోతలచేత అనుష్టింపదగినవి,ప్రజలకు మంచి చేసే యజ్ఞాలు నిరంతరం చేయించాలనుకున్నాడు.నాలుగు వేదాలు అన్నీ కలగాపులగం అయిపోయి ఉన్నాయి.వాటిని మంచిగా నాలుగు వేదాలుగా విభజించాడు.అవి ఋగ్వేదము,సామవేదము,యజుర్వేదము మరియు అధర్వణ వేదము.విభజించడంతో ఊరుకోలేదు.అతను ఓపికగా ఋగ్వేదాన్ని పైలునకు,సామవేదం జైమినికి,యజుర్వేదం వైశంపాయునికి అధర్వణ వేదం సుమంతునికి బోధించాడు.తాను చెప్పిన పురాణాలు,ఇతిహాసాలను రోమహర్షణ మహామునికి బోధించాడు.రోమహర్షణుడు ఇంకెవరోకాదు,స్వయానా సూతుడి తండ్రి.పైలుడు,జైమిని,వైశంపాయనుడు,సుమంతుడు వాళ్ళకు చెప్పబడిన వేదాలను విభజించి వారి వారి శిష్యులకు చెప్పారు.ఈ రకంగా వేదాలను చిన్న చిన్న భాగాలు చేసారు.కాలక్రమేణా ఆ వేదాలు అజ్ఞానుల నోళ్ళలో కూడా పడ్డాయి.వ్యాస మహర్షి ఈ విషయం గమనించాడు.అందుకని పామరులకు,స్త్రీలకు,మందబుద్ధి గల వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా మహాభారతం రచించాడు.మహా భారతానికి పంచమ వేదము అనే పేరు కూడా వచ్చింది.ఇంత చేసినా వ్యాసుడికి వ్యాకులత పోలేదు.ఏదో అసంతృప్తి.ఇంకేదో దిగులు,విచారమూ పట్టుకున్నాయి.మనసును లాగేసే ఈ కలత,కలవరపాటుకు కారణం ఏంది అని సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఆలోచించటం మొదలుపెట్టాడు.అప్పుడు తోచింది.ఏమని అంటే ...శ్రీహరికి,యోగులకు,మునులకు ఇష్టము అయిన భాగవతము చెప్పాలనే ఆలోచన ఇన్ని రోజులు రాక పోవటమే అని.నా దిగులు,విచారం,మనోవ్యాకులతకు కారణం ఖచ్చితంగా ఇదే అని నిర్ధారణకు వచ్చాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment