Thursday, 18 September 2025
సూతుడి పలుకులు
సూతమహర్షిని శౌనకాది మునులు అలా కోరారు.అప్పుడు ఆయన శుకయోగికి,నరనారాయణులకు,సరస్వతీదేవికి,వ్యాస మహర్షికి నమస్కరించాడు. శుకయోగి అంతటినీ,అందరినీ సమానంగా చూసేవాడు.సమస్త కర్మలను విడనాడి,సన్న్యాసి అయిన వాడు.సూతమహర్షి ఇలా అన్నాడు.మునీంద్రులారా!హరిభక్తి మానవులకు పరమధర్మము.ఆ హరి భక్తి ఎలాంటి ఆటంకాలు,అవరోధాలు లేకుండా సాగాలి.ఎందుకు,ఏమిటి,ఎలా,ఎక్కడ,ఎప్పుడు అని కారణాలు,సాకులు లేకుండా నిర్హేతుకంగా,నిరాటంకంగా సర్వకాల సర్వావస్థలయందు కొనసాగాలి.అది ఒక యోగము,యాగము,యజ్ఞము కావాలి.అప్పుడు మనకు వైరాగ్యము,విజ్ఞానము,విజ్ఞత ప్రాప్తిస్తాయి.నారాయణుని గురించి కథలు,విషయాలు చెప్పని ధర్మాలకు అర్థం,పరమార్థం ఉండదు.వాటి వల్ల లాభం లేదు.సారం లేని చెరకు పిప్పిలాంటివి అలాంటి ధర్మాలు.జ్ఞానము,వైరాగ్యముతో కలిసిన భక్తియోగమే మానవుడికి పరమాత్మను చూపిస్తుంది.నిశ్చలమయిన మనసుతో,నిరంతరం గోవిందుని వినినా,వర్ణించినా,ధ్యానించినా ముక్తి,మోక్షం లభిస్తాయి.మనకు భగవంతుడి మీద శ్రద్ధ,ఆసక్తి ఉండాలి.మోక్షానికి తలుపులు తెరిచే భగవంతుడి కథలు వినాలనే ఆసక్తి మెండుగా ఉండాలి.ఇలా చేస్తే పుణ్య తీర్థాలలో స్నానం చేస్తే,పెద్దలకు సేవ చేస్తే వచ్చే పుణ్యము దక్కుతుంది.శ్రీకృష్ణుని కథల యందు ఆసక్తి ఉండే వారికి ఇంకేదీ రుచించదు.తేనెను జుర్రుకున్నట్లు జుర్రుకోవాలి అనిపిస్తుంది.చెవులలో అమృతము పోసినట్లు ఉంటుంది కృష్ణలీలలు వింటుంటే.శ్రీకృష్ణుడు తన కథలు వినేవారి మనసులలో నిలిచి ఉంటాడు.వారికి ఎప్పుడూ శుభములు చేకూరేలా చేస్తుంటాడు.ఎలాంటి చెడూ జరగకుండా చూసుకుంటాడు.అశుభములు నశిస్తే నిశ్చలమయిన భక్తి కలుగుతుంది.మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది.మనసు రజోగుణము,తమోగుణముల వలన కలిగే కామక్రోథమదలోభాలకు బలికాదు.సత్త్వగుణము పెంపొందుతుంది.దాని వలన ప్రసన్న మనస్కుడు అవుతాడు.ప్రసన్నంగా ఉండేవాడు ముక్తసంగుడు అవుతాడు.ముక్తసంగుడు అంటే అహం లేనివాడు.ప్రాపంచిక విషయాలకు అతీతంగా ఉండేవాడు.భవబంథాలకు దూరంగా ఉండేవాడు.అంతా నాదీ,నేనే అనే అజ్ఞానం నుంచి బయట పడినవాడు.కాబట్టి భగవంతుడు యొక్క తత్త్వం,జ్ఞానం తెలుసుకుంటాడు.అహంకారము నశిస్తుంది.అహంకారము నశిస్తే అనుమానాలు,గిలులు పోతాయి.దాని ప్రభావంగా కర్మలు నశిస్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment