Monday, 22 December 2025
వరాహ,సుయజ్ఞ అవతారములు
ఒకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు.అతి క్రూరుడు.ఒకసారి భూమిని చాపలా చుట్టేసి,తీసుకుని పోతున్నాడు.అప్పుడు శ్రీమహా విష్ణువు యజ్ఞ వరాహ రూపము దాల్చాడు.ఆ రాక్షసుడిని ఎదిరించాడు.సముద్ర మధ్యంలో తన వాడి కోరలతో పొడిచి చంపాడు.ఇది భగవంతుని వరాహావతారము.
అకూతి స్వాయంభువు మనువు కుమార్తె.ఆమెకు ప్రజాపతికి సుయజ్ఞుడు అనే కుమారుడు కలిగాడు.సుయజ్ఞుడి భార్య దక్షిణ.వారికి సుయములు అనే పేరుగల అమరులు చాలామంది పుట్టారు.సుయజ్ఞుడు ఇంద్ర పదవిని అలంకరించాడు.ఉపేంద్రుడు లాగా కష్టాలు తొలగించి ప్రజలను కాపాడాడు.మనువుకు చాలా సంతోషమయింది తన మనవడి గొప్పదనంచూసి.అతను తన మనవడు గొప్ప పుణ్యాత్ముడని కొనియాడాడు.సుయజ్ఞుడు సాక్షాత్తు భగవంతుడే అని నమ్మి కొనియాడాడు.అందువలన సుయజ్ఞుడు,జ్ఞాననిథి,అవతారమూర్తి అయ్యాడు.ఇది సుయజ్ఞ అవాతార కథ.
Sunday, 21 December 2025
బ్రహ్మ నారదుల సంవాదము
ఒకప్పుడు నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరకు పోయాడు.బ్రహ్మను స్తుతించడం మొదలు పెట్టాడు.తండ్రీ!నీవు చతుర్ముఖుడవు.వేల్పులలో మొదటివాడవ.ునాలుగు వేదాలు నీ నాలుగు ముఖాలనుండే వెలువడ్డాయి.భారతీదేవి నీ ఇల్లాలు.నీవు జ్ఞానివి.నీకు తెలియనిదంటూ ఏమీ లేదు.నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.వాటిని నీవు తీరుస్తావని ఆశగా నీ దగ్గరకు వచ్చాను.
ఈ సర్వ సృష్టిని ఎవరు ప్రారంభించారు?దీనికి ఆథారము ఏంది?కారణాలు ఏంది?దీనికంతటికీ నీవే కారణం అని నేను అనుకుంటున్నాను.నిజమేకదా!లేక నీకంటే ఘనుడు,పరాత్పరుజు ఇంక వేరే ఎవరైనా ఉన్నారా?
నీవు సృష్టి కర్తవు కదా!ఏమి లాభంకోరి ఇదంతా సృష్టించావు?ఈ ప్రాణికోటి అంతా ఎక్కడ పుజుతున్నది?ఎక్కజ లయమవుతున్నది?నీవు చాలా ఉచ్ఛమయిన పదవిలో ఉన్నావు కదా!నీవే చాలా గొప్పవాడివి.అట్లాంటిది,నీవు ఇంకెవరి గురించి తపస్సు చేసావు?నా ఈ ఆనుమానాలు అన్నీ నాకు అర్థం అయేరీతిలో చెప్పేది.
Friday, 19 December 2025
బ్రహ్మ జవాబు
బ్రహ్మ నారదుడు అడిగిన ప్రశ్నలు అన్నీ ఓపికగా విన్నాడు.ఇలా జవాబు చెప్పాడు.
నాయనా!నారద!ఈ విశ్వాన్ని పాలించే,నియంత్రించేటంతటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు.శ్రీహరి నాకంటే చాలా గొప్పవాడు.అతని ఆదేశాల ప్రకారమే మేమంతా నడుచుకుంటాము.మేమంతా ఎవరెవరు అని కదా నీ అనుమానం.చెబుతాను విను.సూర్యుడు,చంద్రుడు,గ్రహములు,నక్షత్రములు..।ఇంతెందుకు?ఈ విశ్వంలోని అణువణువు అతని ఆథీనంలో ఉంది.అతని ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది.ఆ అందరిలో నేనూ ఒకడిని,అంతే!అతని నియామకంలోనే నేను సృష్టిని నడుపుతున్నాను.నేను నిమిత్తమాత్రుడిని.
ఇది తెలుసుకోలేనివారు నేనే లోకేశ్వరుడిని అనుకుంటున్నారు.నాకు నవ్వు వస్తుంది.సృష్టి,స్థితి,లయకారకుడు ఆ విశ్వాత్మే!ఆ నారాయణుడికి నేను ఎప్పుడూ నమస్కరిస్తాను.
నీకు ఈ విషయం తెలుసా?నిజానికి భగవంతుడు నిర్గుణుడు.ఈ విశ్వాన్ని అంతా సృజించేదానికిగానూ సగుణుడు అవుతున్నాడు.అంటే అతని కోసం కాదు,మనకోసం ఆయన ఈ అవతారాలు ఎత్తుతున్నాడు.
అతను విశ్వేశ్వరుడు.విశ్వాత్మకుడు.విశ్వమయుడు.అందరికీ ప్రభువు.ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నాడు.అతనికి జనన మరణాలు లేవు.ఈ విశ్వమంతా ఆయనలో నిక్షిప్తమయి ఉంది.విశ్వమంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు.అంటే సూక్ష్మం లో సూక్ష్మం కానీ విశ్వవ్యాపకం.
అతని లీలలు ఒకటా రెండా?కోకొల్లలు.అతని లీలావతారములు అనంతములు.కానీ నాకు తెలిసిన కొన్ని,ముఖ్యమయినవి నీకు తెలియపరుస్తాను.
Tuesday, 16 December 2025
పరీక్షిత్తు అనుమానాలు
పరీక్షిత్తు మహారాజు శుకయోగి చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు.ఆయన మస్తిష్కంలో సవాలక్ష సందేహాలు.అవి అన్నీ శుకయోగి దగ్గర తీర్చుకోవాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా ప్రశ్నలు సంథించడం మొదలు పెట్టాడు.
పరీక్షిత్తుకు ఇప్పుడు మృత్యువు అంటే భయం పోయింది.ధర్మార్థకామాలను విడిచేపెట్టేయాలని నిర్ణయించుకునినాడు.ఆ సర్వ్యాంతర్యామి అయిన పురుషోత్తముడి పైనే మనసు నిలపాలని ప్రతిజ్ఞ పూనాడు.ఇంక హరి లీలావిలాసాలను విని తరించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.శుక యోగిని ఉద్దేశించి ఇలా అన్నాడు.ఓ మునిపుంగవా!నీవు చెప్పిన విషయాలు,బోధన వలన నా అనుమానాలు,శంకలు మటుమాయమయినాయి.ఇంకొక్క విషయం అడుగుతాను.ఏమీ అనుకోవద్దు.అసలు విష్ణువు ఈ విశ్వాన్ని ఎలా సృజించాడు?అసలు ఎట్లా రక్షిస్తాడు?ఇంకెట్లా సంహారం చేస్తాడు?అలా చేయలేదంటే కారణం ఏమై ఉంటుంది?ఏమైనా లోపమా!ఇవన్నీ సవివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను,మీ దగ్గర.
శుకుడు పరీక్షిత్తు జిజ్ఞాసను సరిగ్గా అర్థం చేసుకున్నాడు.మనము అయితే...ఇదేందిరా బాబూ!ఒకటి చెబితే వంద అడుగుతున్నాడు అని విసుక్కుంటాము.కానీ ఆయన ఓపికగా చెప్పడం మొదలు పెట్టాడు.
ఓ రాజా!ఈ విషయాలపై అనుమానాలు నీకే కాదు.ఇంతకు ముందు చాలా మంది మహనీయులకు కూడా వచ్చాయి.మొట్టమొదటిసారి నారదుడు బ్రహ్మను అడిగాడు.బ్రహ్మ అంతకు ముందు ఈ విషయాలను విష్ణు దేవుడి దగ్గర తెలుసుకుని ఉన్నాడు.కాబట్టి నారదుడికి చెప్పాడు.నేను నారదుని దగ్గర తెలుసుకున్నాను.నాకు తెలిసినదంతా నీకు ఎరుక పరుస్తాను.
Monday, 15 December 2025
భక్తి మార్గము ఉత్తమము
పూర్వము బ్రహ్మ దేవుడు అన్నీ ఒకటికి పది సార్లు పరీక్షించాడు.ఏమని?మోక్షము దక్కాలంటే భక్తి మార్గము తప్ప ఇంక వేరే మార్గము ఇంకేదీ లేదని.ఇలా నిశ్చయానికి వచ్చాడు.వచ్చిన వెంటనే నిర్వికారుడు అయ్యాడు.చంచలత్వాన్ని వీడాడు.స్థిరమయిన మనసుతో శ్రీహరిని ఆరాధించాడు.భగవంతుడు సర్వవ్యాపకుడు కదా!సర్వభూతాలలోనూ ఆవరించి ఉన్నాడు కదా!ఆ సర్వేశ్వరుడిని ఆరాధించడం,కీర్తించడం మొదలు పెట్టాడు.హరి నామస్మరణ,లేకపోతే హరి కథలను వింటూ తరించాడు.
మనకు సహజమయిన ఆరాటం,తపన,యావ,చంచలత్వం...వీటన్నిటినీ వదలి పెట్టాడు.మొదట మనము అంతా విష్ణుమయము,విష్ణులీల అని అర్థం చేసుకోవాలి.సర్వ సంగ పరిత్యాగి కావాలి.అప్పుడే మోక్షము లభిస్తుంది.
శుకుడు పరీక్షిత్తుకు ఇంకా ఇలా చెబుతున్నాడు.ఓ రాజా!విష్ణు కీర్తనలు వినని వాడి చెవులు కొండ బిలముల లెక్క!శంఖ చక్ర గదాపాణి పై పద్యములు చదువని జిహ్వ కప్ప నాలుకతో సమానము.ఆ లక్ష్మీకాంతుడు,లక్ష్మీవల్లభుని చూడని కళ్ళు నెమలి పింఛములోని కళ్ళతో సమానం.అంటే ఆకార పుష్ఠి,నైవేద్య నష్ఠి అన్నమాట!
కమలనాభుడు,కమలాక్షుడిని పూజింపని చేతులు...ఉన్నా ఒకటే...లేకున్నా ఒకటే!శుద్ధ దండగ!విష్ణువు పాదపద్మాలపై ఉన్న తులసీ దళం వాసన చూడనేరని ముక్కు పంది ముక్కుతో సమానం.గోవిందుడు,గరుడ గమనుని చెంతకు పోలేని పాదములు మోడైన చెట్లుతో సమానము.నారాయణుని నామ సంకీర్తనకు కరగని మనసు చలనము లేని ఒక బండరాయి.శ్రీమహా విష్ణువు కథలకు పులకించని శరీరము ఒక మొద్దు.మాధవుడు,మథుసూదనుడికి మ్రొక్కని వాని తలపైన ఉండేది కిరీటంకాదు,ఒఠ్ఠి కట్టెల మోపు.ఆ నారాయణుడి సేవకి ఉపయోగ పడని సంపద అడవి గాచిన వెన్నెల.ఆ బ్రహ్మాండ నాయకుడిని సేవించలేనివాడు జీవించి ఉన్నా జీవం లేని వాడే.ఆ ఆపద మ్రొక్కులవాడి పాదపద్మాలను చూడలేని వాడి బ్రతుకు పత్తికాయలోని పురుగుతో సమానము.
Friday, 12 December 2025
ధారణ అంటే?
శుక యోగి పరీక్షిత్తుకు ధారణాబలము ఉంటే ఏమైనా సాథించ వచ్చు అని చెప్పాడు.అది వినగానే పరీక్షిత్తు అడిగాడు.స్వామీ!ధారణ అంటే ఏంది?దాని స్వరూప,స్వభావాలు ఎలా ఉంటాయి?అది మనం ఏమి చేస్తే లభ్యం అవుతుంది?
పరీక్షిత్తు సంథించిన ప్రశ్నలకు శుక మహర్షి ఇలా జవాబు ఇచ్చాడు.రాజా!ధారణ ప్రక్రియ అంతా నీకు సావథానంగా వివరిస్తాను.ముందుగా మనలో ఉన్న వాయువును బంధించాలి.తరువాత,చంచలము,బలవత్తరములు అయిన ఇంద్రియాలను నిగ్రహించాలి.సర్వ సంగములను మనస్పూర్తిగా పరిత్యజించాలి.
అటు పిమ్మట విరాట్ స్వరూపుడు అయిన శ్రీహరిని మన మనసులలో నిలబెట్టుకోవాలి.ఎందుకంటే ఆయన సర్వవ్యాపకుడు,భూత,భవిష్యద్వర్తమానాలను గ్రహించి ప్రవర్తించగలవాడు.ఇలా చేయగలిగితే మనకు సమస్తము మన గుప్పిటలోకి వస్తుంది.ముందర సముద్రంలోని నీళ్ళతో ఊహించికుంటే ఒక చుక్క కంటే తక్కువ మన అస్థిత్వం.ఆ భగవంతుడు లీలామానుష విగ్రహుడు.ఈ సమస్త విశ్వం అతని చెప్పు చేతలలో నడుస్తుంది.దానిలో అనుమానం కించిత్ కూడా లేదు.
సద్యో ముక్కి,క్రమ ముక్తి అని రెండు రకాలు ఉన్నాయి.సంసారము నందు ప్రవేశించిన వారికి తపము,యోగము అనే ముక్తి మార్గాలు ఉన్నాయి.కానీ ఆ రెండింటిలోనూ భక్తి మార్గము కంటే సులభమయిన మార్గము ఇంకొకటి లేదు అని ఆ భగవంతుడే నొక్కి వక్కాణించాడు.
సద్యో ముక్తి అంటే మన జీవిత కాలంలోనే ముక్తిని పొందడం.ఇది జ్ఞానంతో భవబంధాలనుండి పూర్తిగా బయటపడగలిగితేనే సిద్ధిస్తుంది.
కర్మ ముక్తి అంటే అంచెలంచెల మోక్షం.ఇది మరణం తరువాత లభిస్తుంది.
Thursday, 11 December 2025
ఖట్వాంగుడు
శుకుడు పరీక్షిత్తుకు ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు.మీకు తెలుసు కదా మా తండ్రి వ్యాసుడు అని.అతను ద్వాపర యుగములోనే బ్రహత్వమును సిద్ధింపజేసే భాగవతామును రచించాడు.నాకు చెప్పాడు ఆ పూర్వాపరాలు అన్నీను.నాకు ఉత్తమ చరిత్రలు, రచనలు చదవాలనే తపన ఉంది.కాబట్టి నేను శ్రద్ధాసక్తులతో భాగవతాన్ని పఠించాను.
నీ విషయానికి వస్తే,నీవు కూడా హరిభక్తుడివి.ఎల్లప్పుడూ ఆ విష్ణువు ధ్యానంలోనే నిమగ్నమయి ఉంటావు.భాగవతము విషయానికి వస్తే ఆ గ్రంథము విష్ణువు గురించి వివరిస్తుంది.అలాగే విష్ణు భక్తుల గురించి కూడా సవివరంగా చెబుతుంది.మోక్షము కావాలి అని కోరుకునే వారికి భాగవతము వలన తప్పక కైవల్యం దక్కుతుంది.కాబట్టి ఇప్పుడు నేను నీకు ఆ భాగవతము చెబుతాను.
పూర్వము ఖట్వాంగుడు అనే రాజు ఉండేవాడు.అతను మహాపరాక్రమశాలి.సప్త ద్వీపాలనూ పాలిస్తుండేవాడు.దేవతలు రాక్షసులతో యుద్థంలో గెలనలేక పోతూ ఉండేవారు.అప్పుడు దేవేంద్రుడు ఖట్వాంగుడి సహాయము కోరాడు.అప్పుడు ఆ ధీశాలి రాక్షసులను ఓడించాడు.దేవతలు అందరూ సంతోషించారు.వారు రాజును ఏదైనా వరము కోరుకో,తీరుస్తాము అని మాట ఇచ్చారు.ఖట్వాంగుడు తనకు ఇంక ఎంత ఆయుస్సు మిగిలి ఉందో చెప్పమన్నాడు.వాళ్ళు లెక్కలు చూసి,ఇంక ఒక్క క్షణం మటుకే మిగిలి ఉంది అని ఉటంకించారు.
రాజు తత్తర పాటు పడలేదు.ప్రశాంతంగా,వెంటనే రాజ్యానికి వచ్చాడు.సర్వ సంగ పరిత్యాగి అయ్యాడు.గోవింద నామం జపిస్తూ,ధ్యానిస్తూ చివరి రెండు ఘడియలలోనే ముక్తిని పొందాడు.
ఓ రాజా!నేను నీకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నానో అర్థం అవుతుందా?మనసా,వాచా,కర్మణా శ్రీహరిని ఒక్క క్షణం ధ్యానించినా ముక్తి లభిస్తుంది.అలాంటిది నీకు వారం రోజులు గడువు ఉంది.కాబట్టి సమయాభావం అని భయపడవద్దు.ఈ వారం రోజులూ హాయిగా శ్రీహరిని స్తుతించు.అతని చరిత్రలు విను.నీకు తప్పకుండా ముక్తి లభిస్తుంది.
మనసు పాదరసంలాగా చంచలమయినది.దానిని బుద్ధిబలంతో నివారించు.నీ మనోఫలకం పైన ఆ భగవంతుడిని ప్రతిష్టించుకో!రజోగుణము,తమోగుణములను ఆమడ దూరంలో ఉంచు.దరి చేర నివ్వవద్దు.ధారణాబలంతో హరిధ్యానం చేస్తే ముమ్మాటికీ నీకు ముక్తి లభిస్తుంది.
Monday, 8 December 2025
ద్వితీయ స్కందము…శుకుడు బోధ
సూత మహర్షి నైమిశారణ్యంలో సత్రయాగము చేస్తున్న శౌనకాది మునులతో ఇలా చెబుతున్నాడు.
శుక మహాముని పరీక్షిత్తు సంకల్పాన్ని చూసి సంతోషించాడు.శుకుడు పరీక్షిత్తుని ఉద్దేశించి ఇలా అన్నాడు.ఓ రాజా!నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమయినది.ఆత్మవేత్తలు శ్లాఘిస్తారు.ఆత్మ తత్త్వము అనేది తల పండిన వారికి కూడా ఆషా మాషీ వ్యవహారము కాదు.అలాంటిది గృహస్తులు దానిపై జిజ్ఞాస పెంచుకుని అర్థం చేసుకోవడం చాలా కష్టము.ఏందుకంటే ఒక గృహస్తు మాములుగా తన పరివారం,తన పరిజనం గురించి మటుకే ఆలోచిస్తాడు.ఇంతకు మించి అనవసరం అనుకుంటాడు.ఇంకోటి,సమయం కూడా ఉండదు కాబట్టి సమయం వృథా అనుకుంటాడు.చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష లాగా సతతం నా బిడ్డలు,నా బంథువులు,నా మిత్రులు,నా భోగభాగ్యాలు....ఇలా ఎప్పుడూ నా,,,నా....నా...అనే జంఝాటం తప్ప ఇంకోదాని గురించి మనసు పోదు,ఆసక్తి ఉండదు.ఇలా తనకు తానే ఒక గూడు కట్టుకుని,బావిలో కప్ప చందాన...ఇదే నా బ్రతుకు,ఇదే నా ప్రపంచం...ఇదే నా కైవల్యం అనుకుంటాడు.
ఇలాంటి వారికి సాంఖ్య యోగమే ఉత్తమము.సాంఖ్య యోగాన్ని గ్రహించగలిగితే,భగవంతుడు అయిన శ్రీకృష్ణుడిని ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండగలరు.
Sunday, 7 December 2025
శుక మహర్షి ఆగమనం
అక్కడ ఉండే మునులు,ఋషులు అందరూ పరీక్షిత్తు మహారాజుతో ఇలా అన్నారు.హే రాజా!నీ చరిత్ర అంతా విచిత్రంగా సాగింది.మీ తాతలు తపస్సులు చేసారు.రాజ సింహాసనము,రాజ భోగాలకంటే విష్ణుపథం కోరుకున్నారు.విష్ణువు సాంగత్యం కోరుకున్నారు.నీవు కూడా నీ పూర్వీకులలాగే భగవద్ సాన్నిధ్యాన్ని పొందాలనుకుంటున్నావు.
నీవు రజోరహితమయిన ఉత్తమలోకాలను చేరుకునేదాక,మేము అందరమూ ఎక్కడకూ వెళ్ళము.ఇక్కడే ఉంటాము.నీవు చెప్పే మంచి వాక్యాలను వింటూ,నీ ప్రభవము,ప్రభావము ఆస్వాదిస్తూ ఉంటాము.
వారి మాటలకు పరీక్షిత్తు ఇలా సమాథానం చెప్పాడు.ఓ యోగివర్యులారా!ఓ మహామునులారా!నా జీవితానికి ఇంక ఏడు రోజుల వ్యనథి మటుకే ఉంది.ఇది చాలా తక్కువ సమయం.ఈ సమయంలోపలే నేను సంసార బంథాలనుంచి విడివడేలా చేసి,ముక్తి పొందే మార్గం సూచించండి.మీరందరూ హేమాహేమీలు.పరతత్త్వం బోధించడంలో సిద్థ హస్తులు.మీకు దయాగుణం ఎక్కువ!మీకు తెలియని విషయాలు అంటూ ఏమీ ఉండవు.
పరీక్షిత్తు వారిని జ్ఞానబోథ చేయమని బ్రతిమలాడే సమయంలో అక్కడకు శుక మహర్షి వచ్చాడు.ఆయన దిగంబరుడు.అతని నుదుటిపైన ముంగురులు కమలముపై తుమ్మెదలు మూగినట్లు వ్రేలాడుతున్నాయి.అతను అవధూత.అతనకి ఎలాంటి కోపతాపాలు,కోరికలు,క్షణికావేశాలు లేవు.నిర్మల మనస్కుడు.అతను ఎవరినించీ ఏమీ ఆశించడు.ఎవరి తోడు నీడ కోరుకోడు.తన పాటికి తాను తిరుగుతూ ఆ సమయానికి దొరికిన దానితో తృప్తి పడుతుంటాడు.
అతనిని చూడగానే అక్కడ ఉన్న మునులు అందరూ గౌరవభావంతో లేచి నిల్చుకున్నారు.పరీక్షిత్తు అయితే ఆయనకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేసాడు.సాదరంగా అతిథి మర్యాదలు చేసాడు.ఇలా విన్నవించుకున్నాడు.ఓ మునిసత్తమా!మంచి సమయానికి వచ్చారు.శ్రీకృష్ణుడు,ఆ భగవంతుడు,మా తాతలను సర్వదా వెంట ఉండి రక్షించాడు.వాళ్ళకు రాజ్యం సంపాదించి ఇచ్చాడు.మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మాస్త్ర ప్రభావం నుంచి నా ప్రాణాలు కాపాడాడు.ఇప్పుడు ఆయన లేడు.నేను ఒకరకంగా అనాథను అయ్యాను.నన్ను రక్షించేవారే లేరు.త్వరలోనే దేహాన్ని త్యజిస్తున్నాను.
నీవు పాలు పిదికినంత సేపుకంటే ఎక్కువ సమయం ఎక్కడా నిలవవు.అలాంటిది,ఈ రోజు నీ దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం.నా జన్మ ధన్యమయింది.నాకు ముక్తి మార్గం తెలిపే దానికి నీకంటే ఘనాపాటి ఇంకొకరు లేరు. నాకు నీవే దిక్కు.ఇది నా ప్రార్థన అని పరీక్షిత్తు ముకుళిత హస్తాలతో శుక మహర్షిని ప్రార్థించాడు.
Saturday, 6 December 2025
పరీక్షిత్తు ప్రాయోపవేశము
పరీక్షిత్తు గంగాతీరమున ప్రాయోపవేశమునకు సిద్థంగా ఉన్నాడు అని అందరికీ తెలిసింది.అత్రి,విశ్వామిత్రుడు,మైత్రేయుడు,భృగువు,వసిష్ఠుడు,పరాశరుడు,చ్యవనుడు,భరద్వాజుడు,పరశురాముడు,దేవలుడు,గౌతముడు,కశ్యపుడు,కణ్వుడు,అగస్త్యుడు,వ్యాసుడు,పర్వతుడు,నారదుడు మున్నగు మహామునులు తమ తమ శిష్య,ప్రశిష్య గణంతో అక్కడకు చేరుకున్నారు.
రాజు అందరినీ సాదరంగా ఆహ్వానించాడు.సముచితంగా సత్కరించాడు.తన వృత్తాంతము అంతా చెప్పాడు.ముక్తాయింపుగా ఇలా అన్నాడు.ఓ మహామునులారా!ఉరగ విషాగ్నికి నా శరీరాన్ని అర్పించేదానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను.ఇది భగవద్ సంకల్పము,కాబట్టి తప్పదు.నాకు ఈ జన్మకు ఇంకేమీ కోరికలు లేవు.నా మరు జన్మలో హరి పాద పద్మ సేవ కలిగేలా మీరందరూ నన్ను ఆశీర్వదించండి.మీరందరూ కూడా ఈ ఏడు రోజులూ భగవంతుని కీర్తించండి.నాకు ముక్తి కలిగేలా సహాయం చేయండి అని ముకుళిత హస్తాలతో వారందరినీ ప్రార్థించాడు.
పరీక్షిత్తు గంగ దక్షిణపు ఒడ్డున దర్భాసనముపై ఉత్తరాభి ముఖుడై కూర్చున్నాడు.తన కుమారుడు అయిన జనమేజయుని రప్పించాడు.అతనికి రాజ్యాన్ని అప్పగించాడు.
ఇంక తనదేమీ లేదని ప్రాయోపవిష్ఠుడయినాడు.దేవతలు అందరూ అతనిని మెచ్చుకున్నారు.దివి నుండి పూలవర్షము కురిపించారు.దుందుభులను మ్రోగించారు.జయ జయ నాదాలు చేసారు.
Wednesday, 3 December 2025
పరీక్షిత్తు అంతర్ మథనం
శమీకుడి శిష్యుడు పరీక్షిత్తు దగ్గరకు వచ్చాడు.పరీక్షిత్తు శమీకుడి మెడలో చచ్చిన పాము వేసి వెళ్ళిపోయిన అనంతరం అక్కడ జరిగిన పరిణామాలు,శృంగి శాపం...అన్నీ వివరంగా చెప్పాడు.
పరీక్షిత్తు విషయం తెలుసుకుని ఖిన్నుడైనాడు.తనలో తాను ఇలా అనుకున్నాడు.అయ్యో!నేను వేటకు అడవికి ఎందుకు పోయాను?ఒళ్ళూ పాయా తెలియనంతగా ఎందుకు వేటాడాను?ఎంత దాహము అనిపించినా,ముని నీరు ఇవ్వలేదని వాని మెడలో చచ్చిన పామును ఎందుకు వేసాను?అంతగా విచక్షణ ఎందుకు కోల్పోయాను?ఆ మహర్షి సమాధిలో ఉన్నాడని కళ్ళకు కనిపిస్తున్నా,బుర్రకు ఎందుకు అర్థం కాలేదు?ఎందుకంత అర్థం పర్థం లేని పని చేసి నా గొంతు నేనే కోసుకున్నాను?
ఏది ఏమైనా దైవయోగాన్ని ఎవరూ తప్పించలేరు!ఇలా తనను తానే దూషించుకుంటూ,చాలా సేపు కుమిలి పోయాడు.అయింది అయిపోయింది.శాపం విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు.కానీ నా చేతుల్లో ఉండే పని నేను చేస్తాను అని నిర్ణయించుకున్నాడు.
ఈ లోపల నేను కామక్రోధాదులను జయించేదానికి ప్రయత్నించవచ్చు అనుకున్నాడు.తరువాత విరక్తుడై రాజ్యమును వదిలేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.తదుపరి గంగకు పోయి ప్రాయోపవేశమున ప్రాణాలు విడవాలి అనుకున్నాడు.ఇంక ఆ క్షణం నుంచి మనసులో ఆ దేవదేవుడు అయిన గోవిందుడినే నిలుపుకున్నాడు.మౌనవ్రతం ఆచరించాడు.గందరగోళం,తత్తరపాటు లేకుండా,ప్రశాంత మనస్కుడై,నిస్సంగుడుగా మారిపోయాడు.
శృంగి శాపం
ఈ పై వ్యవహారం అంతా దగ్గరలో ఉన్న ముని కుమారులు గమనించారు.శమీకుని కుమారుడు శృంగి.మునికుమారులు పరుగులు తీస్తూ వెళ్ళి శృంగికి జరిగినదంతా చెప్పారు.శృంగికి విపరీతమయిన కోపం వచ్చింది. ఔరా!ఈ రాజులు ఎలాంటి వారు?బలికి పెట్టిన మెతుకులు తిని బలిసిన కాకులు లాంటి వారు.ప్రజలను రక్షించేవారి లాగా ఎన్నుకోబడతారు.చివరకు బ్రాహ్మణులను ఇంత నీచంగా అవమానిస్తున్నారు!శ్రీకృష్ణుడు లేక పోవడంతో వీళ్ళందరికీ బాగా అలుసు అయిపోయింది.దండించేవారులేరనే అహం!దుర్జనులు,దురాత్ములు విజృంభించి సాధుజనులను ఇక్కట్లపాలు చేస్తున్నారు,తుస్కారంగా చూస్తున్నారు.
ఇలా అని,అనుకుని శృంగి నదికి పోయాడు.అక్కడ ఆచమనము చేసుకుని,ఇలా శపించాడు.నా తండ్రిపైన చచ్చిన పామును పడవేసి చేసిన రాజు హరిహరాదులు అడ్డు వచ్చినా సరే....ఈ రోజు నుండి ఏడవరోజున తక్షకుని విషము వలన మరణించుగాక!
శృంగి ఆశ్రమానికి వచ్చాడు.తన తండ్రి ఇంకా యోగనిష్టలో ఉన్నాడు.అతని పైన పాము వేలాడుతూ ఉంది.అది ఏమైనా తన తండ్రిని కాటేస్తుందేమో అని భీతి చెందాడు.దానిని తొలగించలేక పోయాడు.ఏడుస్తూ చుట్టు పక్కల ఉన్న మునులను గట్టిగా పిలవడం మొదలు పెట్టాడు.
ఈ గలభా గందరగోళానికి శమీకుడు సమాధి చాలించాడు.మెల్లగా రెండు కళ్ళూ తెరిచాడు.తన పైన వ్రేలాడుతున్న పామును తీసి ప్రక్కకు వేసాడు.శృంగి ఏడవటం చూసాడు.చిన్నగా అడిగాడు.శృంగీ!ఏమైంది?ఎందుకు ఏడుస్తున్నావు?నా పైకి ఈ చచ్చిన పాము ఎలా వచ్చింది?
దానికి కొంచెం స్థిమిత పడిన శృంగి చెప్పడం మొదలు పెట్టాడు.రాజు తన తండ్రి పైన చచ్చిన పామును వేయడం,అది తెలుసుకుని తను ఆ రాజును శపించడమూను.
శమీకుడు విషయం తెలుసుకుని చాలా చింతించాడు.ఎందుకు నాయనా!ఇలా చేసావు?ఎందుకు అంత తొందరపాటు నీకు?ఆ రాజు పరీక్షిత్తు మహారాజు.అతను తల్లి గర్భంలో ఉండగానే బ్రహ్మాస్త్రం వేడికి దగ్ధుడు అయినాడు.శ్రీకృష్ణుని కృపా కటాక్షం వలన తిరిగి బతికి బట్ట కట్టాడు.అతను ప్రజలను ఎంత బాగా పరిపాలిస్తున్నాడు!అంత మంచి రాజును శపించవచ్చా?అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేయవచ్చా?
నీకు ఈ విషయం తెలుసా అసలు?రాజ్యములో రాజు లేకపోతే బలవంతుడు బలహీనుడిని విచక్షణా రహితంగా బాధిస్తాడు.మనము కష్టపడి సంపాదించుకున్న సంపదకు రక్షణ ఉండదు.మన స్త్రీలకు అంతా కన్నా రక్షణ ఉండదు.జారులు,చోరులు పేట్రేగిపోతారు.అదుపూ ఆజ్ఞ ఉండవు.ప్రజలలో భయం,భక్తిలేక పరస్పరము కలహాలతో కాపురం చేస్తారు.వర్ణాశ్రమ ధర్మాలు నశించిపోతాయి.
నీకు అసలు అవగాహన ఏమైనా ఉందా?పరీక్షిత్తు భగవంతుడికి గొప్ప భక్తుడు.సుశ్రేష్టమయిన భరత వంశంలో పుట్టాడు.ఎన్నో అశ్వమేథ యాగాలు నిర్వహించిన మహనీయుడు.అతను రాక రాక మన ఆశ్రమానికి వస్తే ఆదరించడం,గౌరవించడం మన కనీస కర్తవ్యం.అట్లాంటిది అతనిని శపిస్తావా?ఇది నీకు సబబేనా?ఇది అసలు న్యాయమా?
ఇలా శమీకుడు పరిపరి విథాల విచారించసాగాడు.దానికితోడు శృంగికి శాపం ఇవ్వటం మటుకే వచ్చు,ఉపసంహరణ తెలియదు.శమీకుడు కూడా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు.రాజుకు ఈ వార్త తెలపడం తన కనీస ధర్మం అనుకున్నాడు.అందుకని వెంటనే ఒక శిష్యుడిని రాజు దగ్గరకు పంపాడు విషయం వివరించమని.
Monday, 1 December 2025
శమీకునికి అవమానం
ఒకరోజు పరీక్షిత్తు మహారాజు వేటకు వెళ్ళాడు.చాలా వన్య మృగాలను చంపాడు.అన్నింటిని చంపితే అలసిపోవడం సహజం కదా!అలసటతోపాటు బాగా దాహం వేసింది.దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది.మంచి నీళ్ళ కోసం అక్కడకు వెళ్ళాడు.ఆ ఆశ్రమము శమీక మహామునిది.ఆయన ఆ సమయంలో కళ్ళు రెండూ మూసుకుని యోగసమాధిలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు.
ఈయనకేమో దాహం అయిపోయా!మంచి నీళ్ళు కావాలని అడిగాడు ఆ మహర్షిని.భగవద్ధ్యానంలో ఉన్న ఆయనకు ఈయన పలుకులు వినపడలేదు.కాబట్టి జవాబు ఇవ్వలేదు,అలాగే మంచి నీరూ ఇవ్వలేదు.
ఎవరి పిచ్చి వారిదే అని అంటారు కదా!ఇక్కడ కూడా అదే జరిగింది.ఈయనకు ఏమో విపరీతమయిన దాహం!దానితో పాటు ముని ధ్యానంలో ఉన్నాడు కాబట్టి నీరు ఇవ్వలేదు అనే ఇంగితం లోపించింది.కోపంతో పళ్ళు కొరికాడు.ఏంది?ఈ ముని ఎంత సేపటికీ కళ్ళు తెరవడు?ఇక్కడ నేను దాహంతో,గొంతు పిడచ కట్టుకుని పోతూ అల్లాడుతుంటే?ఇంతోటి రాజును ఇక్కడ నిలుచుకుని దాహం దాహం అంటుంటే ఉలుకూ పలుకు లేదే?రాజు అనే కనీస గౌరవ మర్యాదలు లేవా?ఎంత గొప్ప ముని అయితే ఏమి?దాహం అంటే మంచి నీళ్ళివ్వబళ్ళేదా?
ఆ విచక్షణారహిత కోపంతో ఆ బ్రాహమణోత్తముడి మెడలో దగ్గరలో పడి ఉన్న చచ్చిన పామును వేసి తన నగరానికి వెళ్ళిపోయాడు.
Subscribe to:
Comments (Atom)