Monday, 2 March 2026

ఉద్ధవుడి ప్రత్యుత్తరము

విదురుడు అన్ని ప్రశ్నలు ఒకదాని తరువాత ఇంకొకటి,శర పరంపర లాగా వేసాడు.కానీ ఉద్ధవుడి నోటి నుంచి మాట రావడం లేదు.ఎందుకంటే అతను కృష్ణుని పోగొట్టుకునిన దుఃఖం నుంచి ఇంకా బయట పడలేదు.పైగా విదురుడు వారి క్షేమ సమాచారం అడగడంతో ఇంకా పొంగి పొరలు పొరలుగా ఏడుపు ముంచుకొచ్చింది. శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుతో ఇలా అంటున్నాడు.ఓ రాజా!ఉద్ధవునికి శ్రీకృష్ణుని పైన అలవిమాలినంత ప్రేమ.అది తెలియని వారు ఎవరూ ఉండరు.ఉద్ధవుడికి ఒక రకంగా కృష్ణుడు అంటే పిచ్చి ప్రేమ అని చెప్పవచ్చు.ఎందుకంటే అతను ఏడు ఏండ్ల బాలుడుగా ఉన్నప్పుడు తన తోడి బాలురలో ఒకడిని కృష్ణునిగా భావించేవాడు.అతనికి సేవలు చేసేవాడు.వాళ్ళ అమ్మ అన్నానికి పిలిచినా చెవికెక్కించుకున్వాడు కాదు.అట్లాంటి ఉద్ధవుడు విదురునికి సమాథానం చెప్పక పోవడంలో ఆశ్చర్యము ఏ మాత్రమూ లేదు.ఎందుకంటే కృష్ణుని వియోగము తట్టుకోవడం అతనికి చేతకావటం లేదు. అయినా ఉద్ధవుడు చిన్నగా తమాయించుకున్నాడు.కానీ గొంతు దుఃఖముతో బొంగురుపోయింది.ఆ గద్గద స్వరంతోటే చెప్పడం ప్రారంభించాడు.అయ్యా!విదురా!నా నోటితో ఏమని చెప్పేది?లోకరక్షకుడు,లోకబాంథవుడు అయిన శ్రీకృష్ణుడు అస్తమించాడు.భూదేవి దురదృష్టము ఏమని వర్ణించాలి?యాదవులు,వారి రాజ్యము నాశనము అయింది.ధర్మము మట్టి కొట్టుకుని పోయింది.అధర్మము ఊడలు దిగి పటిష్టమయిపోయింది.దానిని పెకిలించేవారు ఇంకెవరూ లేరు.మంచీ,మర్యాదా,మన్ననలు దారి తప్పి ఎటు పోయాయో అర్థం కావడం లేదు. ధర్మరాజు రాజసూయయాగమపుడు శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇచ్చినపుడు లోకాలన్నీ అతని కీర్తినీ,ధర్మనిష్టనీ శ్లాఘించారు కదా!బ్రహ్మ సృష్టికి ఇతనే మూలపురుషుడు అని ఆకాశానికి ఎత్తారు కదా!దుష్టుల విషయంలో అతని కనుబొమలు కోపంతో ముడిపడితేనే భూదేవి భారం సగం తగ్గిపోతుంది కదా!నిర్మల స్వరూపుడు అయిన అతనిని ఏమరుపాటున కూడా ఎవరూ మరువలేరు.శ్రీకృష్ణుడు ఉగ్రసేనుడిని రాజుని చేసాడు.అతని క్రింద భృత్యుడుగా సంతోషంగా సేవలందించాడు.పూతన అతనిని చంపేదానికి వచ్చిన రాక్షసి.కానీ ఆమెకు యశోదా దేవికి కూడా దక్కని ఉన్నత స్థానం ఇచ్చాడు కదా!శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువే అవుతుంది.ఆయన లీలలు అమోఘం!

Saturday, 28 February 2026

అయినవాళ్ళ యోగక్షేమాలు అడిగిన విదురుడు

ఉద్ధవుడిని చూడగానే విదురుడికి ప్రాణం లేచొచ్చినట్లయింది.వడివడిగా వెళ్ళి గట్టిగా కౌగలించుకున్నాడు.కుశల ప్రశ్నలు అడిగాడు.ఇంక నెమ్మదిగా మిగిలిన వారి కుశలం కనుక్కోవడం మొదలు పెట్టాడు.ఎవరికైనా తనా మనా ఉండడం సహజమే కదా! ఉద్ధవా!పుణ్యాత్ములు,శ్రీహరి భక్తులు,శత్రుమర్దనులు అయిన కుంతీ పుత్రులు క్షేమంగా ఉన్నారు కదా!బ్రహ్మ శ్రీహరిని ప్రార్థిస్తే అతడు బలరామ కృష్ణులు లాగా జన్మించారు కదా!వారిరువురూ క్షేమమే కదా!వసుదేవుడు,రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు,సాంబుడు,ఉగ్రసేనుడు,అక్రూరుడు,సాత్యకీ,దేవకీదేవి అందరూ కుశలమే గదా!వాసుదేవుడు,సంకర్షణుడు,అనిరుద్థుడు,చారుదేష్ణగాదులు సంతోషంగా ఉన్నారు కదా?శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిల సంతానం పదిమంది.వారిలో చారుదేష్ణ,సుదేష్ణ,చారుదేహ,చారుగుప్త అనువారు ముఖ్యులు.పాండవులూ అయిదుగురూ,కుంతీదేవి కుశలమే గదా?ధృతరాష్ట్రుడు క్షేమమే గదా?అతని కొడుకులు నవ్ను సభనుంచి తరిమివేయునపుడు నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా ఉండెను.అప్పుడు నాకు కలిగిన చిత్త క్షోభ అంతా ఇంతా కాదు.దానికి కారణమయిన అతడు తప్పకుండా నరకం ఊచలు లెక్కబెడతాడు. నీకు ఆశ్చర్యమనిపిస్తుందేమో?విదురుడు చాలా సౌమ్యుడు కదా!కోపతాపలకు అసలు చోటివ్వడు కదా!శాంతానికి మారు పేరు కదా!మరి ఇతనికి ఏంది?ఇంత కోపమేంది?ఇంత దుఃఖమేంది?అని.భగవంతుని మాయ వలన నాకు మోహము కలగకుండా ఉంటుందా?ఆ భగవంతుడే మానవరూపము దాల్చి ధర్మబద్ధులు అయిన పాండవుల పక్షాన నిలిచాడు.వాళ్ళకోసం రాయబారం చేసాడు.అప్పుడు దుష్ట దుర్యోధనాదులు ఏమి చేసారు?ఆ దేవతామూర్తిని పట్టి బంథించే దానికి ప్రయత్నం చేసారు.అతను తిరిగి వాళ్ళను ఏమీ చేయలేడని వారి థీమా.యుద్ధంలో వాళ్ళను నామరూపాలు లేకుండా చెయ్యాలనే ఆ సభలో శ్రీకృష్ణుడు వాళ్ళ ఆటలు సాగనిచ్చాడు.వాళ్ళ దుర్భాషలన్నిటినీ మౌనంగా భరించాడు.ఆ లీలా మానుష విగ్రహుడు,ఆ పరంథామ,ఆ శ్రీకృష్ణుడు తన అగ్రజుడు అయిన బలరాముడుతో కలిసి సంతోషంగా ఉన్నాడు కదా? విదురుడు శర పరంపరలాగా ప్రశ్నల పైన ప్రశ్నలు వేశాడు.

Wednesday, 25 February 2026

విదురుడికి అవమానము

విదురుడు ధృతరాష్ట్రుడికి హితము చెప్పడం దుర్యోధనుడికి అస్సలు నచ్చలేదు.కోపం నషాళానికి అంటింది.కర్ణుడు,శకుని,దుశ్శాసనుల వైపు చూస్తూ ఇలా అన్నాడు.విదురుడు దాసీ పుత్రుడు.ఇతనికి,ఇతని మాటలకు ఇంత ప్రాముఖ్యత, గౌరవము ఇవ్వాల్సిన పని లేదు.అసలు ఎవరు రానిచ్చారు అతనిని ఈ సమావేశానికి?మర్యాద నిలబెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు అవాకులు,చెవాకులు పేలుతున్నాడు.ఇతనిని ఉపేక్షించాల్సిన అవసరము మనకు ఏమాత్రమూ లేదు.ముందర వీడిని తరిమివేయండి అంటూ హుకుం జారీ చేసాడు. పెద్దా,చిన్నా అనే తారతమ్యము లేకుండా తండ్రి అంతటి వాడిని అలా అవమానకరంగా మాట్లాడటంతో విదురుడు నిర్ఘాంతపోయాడు.ఆ తరువాత కుమిలిపోయాడు.మనసుకు చాలా కష్టం వేసింది.సమాథానము చెప్పకుండా,మౌనంగా,కోపం దిగమింగుకుని,విల్లమ్ములను అక్కడే వదలి పెట్టేసి తీర్థ యాత్రకు వెళ్ళిపోయాడు. అతను పవిత్రములయిన విష్ణు క్షేత్రాలను సందర్శించాడు.గంగ మున్నగు పుణ్య నదులలో స్నానం చేసాడు.సిద్థాశ్రమాలను సందర్శించాడు.ఋషుల ఆశ్రమాలకు వెళ్ళాడు.కూరలు కాయలను నీటిని మటుకు ఆహారంగా స్వీకరిస్తూ అవధూత వేషము ధరించి తిరగసాగాడు. ఆ సమయంలోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది.కౌరవులు కొట్టుకుపోయారు,కాటికి పోయారు.విదురుడికి ఈ వార్త తను ప్రభాస తీర్థంలో ఉండేటప్పుడు తెలిసింది.ఎంతైనా అందరూ తన వాళ్ళే కదా!చాలా దుఃఖించాడు.ఇంక అక్కడ కుదురుగా ఉండ లేక పోయాడు.పోయి సరస్వతీ నదిలో స్నానము చేసాడు.పృథు,భార్గవాది తీర్థాలలో స్నానాలు చేసాడు.పవిత్రమయిన ప్రదేశాలు అన్నీ చూసుకుంటూ మత్స్య,కురు,జాంగల దేశాలు దాటాడు.యమునా నదీ తీరానికి చేరాడు.అక్కడ అతనికి ఉద్ధవుడు కనిపించాడు.ఉద్ధవుడు సకల సద్గుణశీలి.పరమ భాగవతోత్తముడు.

Tuesday, 24 February 2026

దుర్యోధనుడి దుష్ట బుద్ధి—విదురుడు వివరణ

తండ్రికేమో పక్షపాతము,సంకుచిత స్వభావము.కొడుకేమో దుందుడుకు,దుష్ట బుద్ధి.ఇంక వాళ్ళను ఎవరైనా పట్టగలరా? దుర్యోధనుడు మాయా జూదములో పాండవులను అడవులకు పంపాడు.రాజ్యాన్ని అపహరించాడు.ధర్మం కోసరము పాండవులు అరణ్య వాసము,అజ్ఞాత వాసము చేసి వచ్చి రాజ్యము అడిగినా ససేమిరా అన్నాడు.ఇంక పాండవులకు పాలుపోలేదు.శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు.శ్రీకృష్ణుడు సరే అని వారి తరఫున రాయబారానికి వెళ్ళాడు.ధృతరాష్ట్రునికి కృష్ణుడు శత విథాలా చెప్పిచూసాడు.మాత్సర్యము వద్దు,తగదు.కౌరవులు,పాండవులు...ఇద్దరూ నీకు సమానమే!తమ్ముడి బిడ్డలకు అన్యాయము చేయవద్దు.రాజ్యము ఇద్దరికీ సమానంగా పంచి పెట్టు అని సలహా ఇచ్చాడు. ఇలా అసలు విషయం ముందరకు జరగడం లేదని కృష్ణుడు గ్రహించాడు.విదురుడిని పిలిపించాడు. విదురుడు విషయం అర్థం చేసుకున్నాడు.ధృతరాష్ట్రునికి హితవు చెప్పాడు. కౌరవరాజా!ధృతరాష్ట్రా!పాండురాజు ఎవరో కాదు.నీ సొంత తమ్ముడు.అతని బిడ్డలను కాపాడడం నీ ధర్మము.అది న్యాయ సమ్మతము కూడానూ.నీవు అలా చేసావంటే నీ వంశము వృద్ధి చెందుతుంది.మీరందరూ సకల సుఖాలూ,సమస్త భోగాలూ అనుభవించగలరు.ఇద్దరూ కలిసి కట్టుగా ఉంటే శత్రు రాజులు మీ వైపు కన్నెత్తి చూసేదానికి కూడా భయపడతారు.శ్రీకృష్ణుడు తన మాటకు మీరు విలువ ఇచ్చారని సంతోషిస్తాడు.మీకు మేలు చేస్తాడు. అట్లా కాదంటే కౌరవులు భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తుంది నాకు,తలచుకుంటేనే! అటు చూస్తే ఏమో,భీముడు కాలు త్రొక్కిన పాములాగ కస్సుమని కాటేసేదానికి సిద్థంగా ఉన్నాడు.నేను ఈ విషయం చాలా సార్లు మొత్తుకున్నాను.నీ కొడుకులకు అతని వల్లే గండం!నీ వాళ్ళందరూ అతని చేతిలో పిట్టల్లాగ రాలిపోతారు.ఇది ఖాయం! నువ్వు ఇంకా అమాయకంగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది.నాకేమి?నా కొడుకులు వీరులు,శూరులు,విక్రమార్కులు అని భ్రమిస్తున్నట్లున్నావు.నీ కొడుకుల శౌర్యము,భీష్మ,ద్రోణ,కృపాచార్యుల అండ దండలు ఉన్నాయని విర్రవీగుతున్నావేమో?కర్ణుడి ఆర్భాటాలు,ప్రగల్భాలూ నిజమని మురిసి పోతున్నావేమో?ఇక్కడ ఎంత మంది దిగ్గజాలు ఉన్నా,ఆ తట్టు శ్రీకృష్ణుడు ఉన్నాడు.ఒక్కడు చాలు ఒంటి చేత్తో పాండవులను విజయమార్గంలో నడిపించేదానికి.ఈ నిజాన్ని కలలో కూడా నువ్వు మరవవద్దు. కాబట్టి మర్యాదగా పాండవులకు దక్కాల్సిన రాజ్యం వారికి ఇచ్చేయి.అట్లా చేస్తే నీ సంతానమూ,నీ బంథుజనము ప్రాణాలతో ఊపిరి తీసుకుంటారు.అట్లా కాకుండా లోభి,కంటకుడు,దుష్టుడు అయిన సుయోధనుడి మాటలు వింటే ఇంక ఇంతే సంగతులు,చిత్తగించవలెను అవుతుంది.ఒకరి మూర్ఖపు పట్టుదల కోసరము వంశాన్ని నాశనం చేసుకుంటావో,సుయోధనుని మాట ప్రక్కన పెడతావో,నీవే తేల్చుకో!

Friday, 20 February 2026

ధృతరాష్ట్రుని సంకుచితము

శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పడం మొదలు పెట్టాడు.రాజా!ధృతరాష్ట్రుడికి చాలా మంది పిల్లలు పుట్టారు కదా!వారిని ధృతరాష్ట్రుడు బహు ప్రేమతో పెంచుకుంటూ ఉన్నాడు.ఇంతలో తన తమ్ముడు,పాండురాజు నిధనుడయినాడు.అప్పటికి అతని బిడ్డలు కూడా చిన్నవాళ్ళే.మాద్రి సతీసహగమనం చేయడంతో,కుంతీదేవి పిల్లల నందరినీ తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చింది.అందరూ కలిసి పెరగసాగారు.ఐక్యమత్యంతో కాదు.అసహనం,అసూయలతో. ముఖ్యంగా దుర్యోధనుడికి అతని తమ్ములకు పాండవుల పైన అసూయ కలిగింది.వారు జన్మతః కృూర స్వభావులు.కాబట్టి పాండవులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.ఒకసారి విషపు అన్నము పెట్టి చంపబోయారు.ఇంకొక సారి త్రాళ్ళతో కట్టి గంగానదిలో పడవేసారు.కొంచెం పెద్దయిన తరువాత ధర్మం తప్పి రాజ్యము నుండి వెడలగొట్టారు.ఇట్లా ఒకటా రెండా!చాలా సార్లు పాండవులను ఇబ్బందుల పాలు చేసారు.పాండవులు నిద్రించే సమయములో లక్క గృహానికి నిప్పు అంటించి పాండవులను తుదముట్టించాలని ప్రయత్నము చేసారు.దేవుని దయ వలన అది సఫలము కాలేదు. వాళ్ళ అకృత్యాలకు పరాకాష్ట వారు ద్రౌపదీ దేవిని ఏకవస్త్రగా ఉన్న సమయంలో కొప్పు పట్టిలాగుతూ సభలోకి ఈడ్చుకుని రావడం.వారి నాశనానికి ఇదే నాంది అయింది. ధృతరాష్ట్రుడికి కళ్ళులేని గ్రుడ్డితనమే కాదు,మానసికంగా కూడా అంథుడే.పుత్రప్రేమతో తన బిడ్డల తప్పులను సరిదిద్దలేదు కదా.కనీసం ఎత్తిచూపనైనా లేదు.వారి ప్రతి ఆగడం వెనుక అతని మౌనమయిన అర్థంగీకారము నిబిడీకృతమయి ఉన్నది.

Tuesday, 17 February 2026

తృతీయ స్కంధము…విదురుని యాత్ర

పరీక్షిత్తు మహారాజు ప్రాయోపవేశము చేసేదానికి సంసిద్ధుడు అయినాడు.అతనితో శుక మహర్షి ఇలా చెప్పాడు.పరీక్షిత్తు మహారాజా!పాండవులు యుద్ధము లో కౌరవులను ఓడించారు.ఆ రాజ్య సంపద స్వీకరించి,రాజ్యమును సుశ్యామలంగా పాలించుతూ ఉన్నారు.అప్పుడు విదురుడు తీర్థయాత్రకు బయలుదేరాడు. దారిలో ఒక వనములో అతనికి మహా తపశ్శాలి అయిన మైత్రేయ మహర్షి కానవచ్చాడు.విదురుడు నేరుగా ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి,ఆయన ఆశీస్సులు పొందాడు.చిన్నగా ఆయనతో తన మనసులో మాట బయట పెట్టాడు.మహాత్మా!నా కొక సందేహము కలిగినది.దయయుంచి నా సందేహము తీర్చవలెను అని ప్రార్థిస్తున్నాను. శ్రీకృష్ణుడు భగవంతుడు అని మన అందరికీ తెలుసు.పాండవులు మంచి వారు కావున వారికి సహాయము చెయ్యాలనుకున్నాడు.సహజమే!వారి రాయబారిగా దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు కదా.దుర్యోధనుడు ఎంత బ్రతిమిలాడినా వారి దగ్గర భుజించలేదు.కానీ మా ఇంటికి వచ్చి మా సేవలు అంది పుచ్చుకుని,మా ఇంట భోంచేసాడు.దీనికి కారణము ఏంది?నాకు తెలిపేది. పరీక్షిత్తుకు ఆదుర్దా ఎక్కువ అన్నిటినీ తెలుసుకోవాలని.శుకుడు చెప్పబోతుండగానే గబగబా ఇలా అడిగాడు.మహాత్మా!విదురుడు మైత్రేయుడిని ఇంకా ఏమేమి రహస్యాలు అడిగాడు?ఆ ముని వాటన్నిటికీ ఏమి సమాథానాలు తెప్పాడు?విదురుడు తీర్థ యాత్రలకు వెళ్ళాడు అన్నారు కదా!ఏ ఏ స్థలాలూ,ప్రదేశాలు చూసాడు?నాకు అన్నీ పూస గుచ్చినట్లుగా,వివరంగా,విపులంగా చెప్పాలి అని ప్రార్థించాడు.

Monday, 16 February 2026

సూతుడు,శౌనకుడు సంవాదము

శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు తేలిక అయిన భాషలో సర్గ విసర్గాదులు మరియు ఆశ్రయము గురించి వివరించాడు.ఇప్పుడు అంతా టూకీగా చెప్పాడు.ఇంక సవివరంగా చెబుతాను అని సెలవిచ్చాడు. ఈ విషయాన్ని సూతుడు శౌనకాది మునులకు తెలిపాడు.అప్పుడు శౌనకుడు సూత మహర్షిని అడిగాడు.ఓ మునిసత్తమా!భాగవతోత్తముడు అయిన విదురుడు తీర్థయాత్రలకు పోయాడన్నారు కదా.అక్కడ అన్ని పుణ్య క్షేత్రములు సందర్శించాడు కదా.అటు పిమ్మట తిరిగి వచ్చాడు అన్నారు.అప్పుడు మైత్రేయుని వలన ఆధ్యాత్మ బోథను పొందాడు అని ఉటంకించారు.ఆ విషయాలు అన్నీ వివరంగా తెలుసుకోవాలని మా అందరి మనసులూ ఉవ్విళ్ళూరుతున్నాయి.మా కోరిక మన్నించి అవన్నీ మాకు విశదీకరించేది. శౌనకుడి మాటలకు సూతుడు చిన్నగా మందహాసం చేసాడు.ఇలా అన్నాడు.శౌనకా!మీరు ఇప్పుడు నన్ను అడిగారు కదా!అచ్ఛం ఇలానే మునుపు పరీక్షిత్తు మహారాజు శుక మహర్షిని బ్రతిమలాడాడు.అప్పుడు ఎట్లయితే శుకుడు అతనికి చెప్పాడో,అచ్ఛం అలానే నేను కూడా ఆ వృత్తాంతము అంతా సవివరంగా మీకు చెబుతాను.

Sunday, 15 February 2026

ఆశ్రయము,సృష్టి

శుక మహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు.ఉత్పత్తి,స్థితి,లయము అనే మూడూ ఎక్కడ పుడుతూ వెల్లడి అవుతాయో అదే ఆశ్రయము.పరమాత్మ అన్నా అదే.బ్రహ్మ అన్నా అదే.ఆత్మ ఆధ్యాత్మికము,ఆధిదైవికము,ఆధిభౌతికము అని మూడు రకములు.ఆధ్యాత్మికము అనునది చక్షురాది గోళకములకు అంతర్వర్తియై ఉంటుంది.చక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుడే ఆధి దైవికము.చక్షురాద్యధిష్టానాభిమాన దేవతయై సూర్యాదితేజోవిగ్రహుడగుచూ,ఎవ్వనియందు ఈ రెండు విభాగములు కలుగుతాయో అతడు ఆధి భౌతికుడు.ఆ ఆధిభౌతికుడే విరాట్ పురుషుడు.ద్రష్ట,దృక్కు,దృశ్యము...ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఏమీ కానరాదు.కనిపించదు.ఈ మూడింటి గురించి ఎవ్వరికి క్షుణ్ణంగా తెలుసో,అతనే పరమాత్మ.అతనే సర్వాంతర్యామి.సర్వలోకాలకూ,ప్రాణులకూ ఆశ్రయము ఇచ్చిన దాత. ఆ జగద్రక్షకుడూ,జగద్వ్యాపకుడూ విలాసము కొరకు సృజింపదలచాడు.తనకు ఎక్కడ,ఎలా సుఖంగా ఉంటుందో పరికించాడు.ముందర జలమును సృజించాడు.అది మహా సముద్రము రూపములో నున్న జలరాశి అయింది.ఆ జలరాశిలో అతను శయనించాడు.జలములకు నారములు అని ఇంకో పేరు ఉంది.ఆ నారములు పరమాత్మ వాసస్థాన మగుటచే అతనికి నారాయణుడు అనే పేరు వచ్చింది. అతని సృజన కారణంగానే ప్రాణాదులు,పంచభూతములు,ఇంద్రియములు,మనస్సు,బుద్ధి ఉద్భవించాయి.ఇంతే కాదు.అతను ప్రజాపతులు,ఋషులు,పితృదేవతలు,సుర,సిద్థ,విద్యాధరులు,మున్నగువారిని కూడా సృజించాడు.పక్షి,మృగ,వృక్ష సంతతిని కూడా సృజించాడు. ఇంత చేసినా అతను వీటన్నిటికీ కర్తృత్వము వహించడు.అంతా తన మాయాకల్పితంగానే తోచేటట్లు చేస్తాడు.ఆ మహామహడు,సర్వవ్యాపి నిరవద్యుడు,నిరంజనుడు,పరుడు,పరాత్పరుడు,నిష్కళంకుడు,నిత్యుడు మరియు సత్యుడు.

Saturday, 14 February 2026

సర్గ,విసర్గాదుల వివరణ

పరీక్షిత్తు మహారాజుకు శుక మహర్షి వివరం తెలుపుతున్నాడు.రాజా!మహత్తు,అహంకారము,పంచ తన్మాత్రలు,పంచ భూతములు,పంచేంద్రియములు....వీటన్నిటినీ సర్గము అని అంటారు. బ్రహ్మ విరాట్పురుషుని వలన జనించాడు కదా!అతను చరాచర సృష్టిని చేయడం వినర్గమని అంటారు. ఈ ప్రపంచమును హింసించే రాజులు ఉంటరు కదా!వారిని సంహరించడం,ధర్మ సంస్థాపన చేయడం,ఆ శ్రీమహా విష్ణువు యొక్క విజయ పరంపర తెల్పడం స్థానము అని అంటారు. శ్రీహరి సర్వేశ్వరుడు,అనంతుడు కదా!అతను భక్తులను ఉద్థరించే ప్రక్రియను పోషణము అని అంటారు. ఊతలు అనగా కర్మవాసనలు. ఆది శేషువు పైన కొలువు అయిన శ్రీమన్నారాయణుడు అనుగ్రహ కటాక్షము వలన విభూతిని పొందిన లోకపాలకులు ఉంటారు కదా!వారు అందరూ ధర్మమును వివరించడాన్ని మన్వంతరము అని అంటారు. శ్రీహరి యొక్క అవతారాలు ఒకటీ రెండు కాదు కదా!కోకొల్లలు.ఆ అవతారాలను సవివరంగా చెప్పడం,అతని చరిత్రను విస్తారంగా ప్రబోథించడాన్ని ఈశానుచరితం అని అంటారు. సర్వాంతర్యామి,సర్వరక్షకుడు అయిన గోవిందుడు తన ఉపాధి శక్తులతో కూడి శేషతల్పముపై సుఖంగా శయనించి ఉంటాడు.అతను యోగనిద్రలో ఉంటాడు.ఆ సమయంలో సమస్త ప్రాణికోటి కూడా తమ తమ వ్యాపారలని మర్చిపోతుంటారు.ఆ అవస్థా విశేషములను అన్నిటినీ స్పష్టంగా,సవివరంగా తెలియజెప్పేదే నిరోధము.

Friday, 13 February 2026

భాగవత మూలము

శ్రీహరి బ్రహ్మకు చెప్పాల్సిన సుద్దులు,బుద్ధులు చెప్పి అంతర్థానము అయిపోయడు.బ్రహ్మ ఆనందానికి అవథులు లేవు.భగవంతుడు చెప్పిన మాటలు మననం చేసుకుని,మనసులో నిక్షిప్తం చేసుకున్నాడు.సమస్త ప్రపంచాన్ని సృజించాడు.అతడు స్వలాభం చూసుకోలేదు.సకల లోక హితము కోరుకున్నాడు.దానికి తగిన విథంగానే ముందుకు అడుగులు వేసాడు.ఆయన సంకల్పం ధృఢమయినది. ఇట్లా ఉంటే ఒకరోజు బ్రహ్మ దగ్గరకు నారదుడు వచ్చాడు.ఆయనకు ఆదుర్దా ఎక్కువ కదా!రావటం రావటం నాకు భగవంతుని మాయా విలాసాలగురించి చెప్పు అని తొందర చేసాడు. బ్రహ్మ చిద్విలాసంగా,చిన్మయానందంతో భగవంతుడు వలన తెలుసుకున్న భాగవతాన్ని నారదునకు చెప్పాడు.నారదుడు ఆ తరువాత వ్యాసుడికి చెప్పాడు.వ్యాసుడు అటు పిమ్మట శుకుడికి బోధించాడు.ఆ వృత్తాంతము అంతా పరీక్షిత్తు కోరిక మేర శుకుడు చెప్పేదానికి ఒప్పుకున్నాడు. శుకుడు పరీక్షిత్తుతో అంటున్నాడు.రాజా!నీవు నన్ను అడిగావు కదా,విరాట్పురుషుని వలన ఈ లోకాలన్నీ ఎలా ఏర్పడ్డాయి అని.వాటన్నిటికీ సమాథానము భాగవతములో ఉంది.అది నీకు నేను నేర్పిస్తాను. అది సర్గము,విసర్గము,స్థానము,పోషణము,ఊతులు,మన్వంతరములు,ఈశానుచరితములు,నిరోథము,ముక్తి,ఆశ్రయము అను పది లక్షణములతో కలిసి ఉంటుంది.వీటిలో మొదటి తొమ్మిది లక్షణములు పదవ లక్షణమయిన ఆశ్రయము విశుద్థి కొరకే చెప్పబడినది. అంటే మనము స్థిరమైన ఆనందం కోసరము భగవంతుడిని నమ్ముకోవడంలో పవిత్రముగా తయారుకావడము.

Thursday, 12 February 2026

శ్రీహరి గురించి శ్రీహరి

శ్రీహరి బ్రహ్మ మాటలు విన్నాడు.అతను తన్మయత్వంలో ముణిగిపోవడం గమనించాడు.చిద్విలాసంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.ఓ కమలగర్భా!నీవేమీ ఆందోళన చెందనవసరం లేదు.నా స్వరూప స్వభావాలు నీకు తెలుస్తాయి.అలాగే నా మహిమావతారకర్మములు అన్నీ కూడా తెలుసుకునే ప్రక్రియ,విజ్ఞానము నా అనుగ్రహం వలన నీకు లభిస్తుంది. జాగ్రత్తగా విను.సృష్టికి పూర్వము నేను ఒక్కడినే కర్మ విహీనుడుగా ఉంటాను.కల్ప ప్రళయాంతరమున,ఆద్యంత విరహితమగు క్రియతో,పరిపూర్ణ నిత్య మహిమతో పరమాత్ముడునై ఉంటాను. మహాభూతములు భౌతికములు అయిన ఘటపటాదులు యందు ప్రవేశించి ఉంటాయి కదా!అచ్ఛంగా అలానే నేను భూత భౌతికములు అయిన సర్వకార్యములయందు,సత్త్వాది రూపములయందు ప్రవేశించి ఉంటాను.భూత భౌతికములు కారణావస్థను పొంది నాయందు అభివ్యక్తములు అయి ఉండవు.సర్వ దేశములందునూ,సర్వకాలములందునూ ఏది బోధితము అయి ఉంటుందో అదే పరబ్రహ్మ స్వరూపము.ఇది నా తత్త్వము.తత్త్వాత్మకమయిన ఈ అర్థమును నీ మనసు నందు గ్రహించుకో!అలా అయినప్పుడు నీవు సృష్టి కర్మములు చేసేటప్పుడు మోహమునకు గురి కావు.గర్వానికి పోవు.సమన్వయం పాటిస్తావు. ఇలా చెప్పి శ్రీహరి అంతర్ధానం అయిపోయాడు.

Monday, 9 February 2026

బ్రహ్మ భక్తి బహు బాగు

బ్రహ్మ తన నాలుగు శిరస్సులు వంచి శ్రీహరికి సాష్టాంగ నమస్కారాలు చేసాడు.శ్రీహరికి ఆ ఆత్మార్పణం నచ్చింది.సంతోషించాడు. బ్రహ్మతో ఇలా అన్నాడు.కుమారా!వత్సా!కపటముగా కొంత మంది మునులు ఉంటారు.వాళ్ళు జీవితకాలం అంతా తపస్సు చేసినా నాకు సంతోషము కలుగదు.నీవు నిష్కపటుడివి.అందువల్ల నీ మనస్సు నన్ను ఆకర్షించింది.నీ యెడల నేను ప్రసన్న చిత్తంతో ఉన్నాను.అందుకే నా లోకము నీకు చూపించాను.నీ తపస్సు కొక్కదానికే మటుకు కాదు.తప అని నేను అన్న మాటను బట్టే కదా నీవు ఇంత ఘోర తపస్సు చేసావు.ఆ తపస్సు చేయడం వల్లనే నీకు మోహము నశించింది.నీకు నా మీద అంతులేని భక్తి కలిగింది.నాకు చాలా తృప్తిగా ఉంది నీ విషయంలో.నీకు ఏ వరము కావాలో కోరుకో!ఏమీ మొహమాటం లేదు. శ్రీహరి మాటలకు బ్రహ్మ ఈ విథంగా జవాబు ఇచ్చాడు.హే దేవా!హే పరంథామా!ఈ సమస్త సృష్టిలో నీకు తెలియనిది అంటూ ఏమీ లేదు.ఎందుకంటే దీనికంతా కర్త,కర్మ,క్రియా నీవే గనుక.అలాంటిది నా మనసులో ఉండే కోరిక నీకు తెలియకుండా ఎలా ఉంటుంది?కానీ నీవు అడిగావు.కాబట్టి నేను చెప్తాను. ఓ దేవా!నీ స్థూల సూక్ష్మ రూపములు అవ్యక్తములు కదా!నీవే బ్రహ్మాదిరూపములను ధరిస్తావు.ఈ జగత్తు ఉత్పత్తి ,స్థితి,లయ కార్యములను చేపడతావు.నీవు అమోఘ సంకల్పుడివి.రకరకాల విభూతులతో ఆటలాడుకుంటావు.నిన్ను పూర్తిగా తెలుసుకోవడం చాలా కష్టము.నీ మహిమలను తెలుసుకోవడం ఇంకా క్లిష్టం.వాటన్నిటినీ తెలుసుకోగలిగే జ్ఞానము,పరిజ్ఞానము నాకు ప్రసాదించు. నీ ఆనతి మేర నేను సృష్టి చేస్తాను.కానీ నాకు తెలియకుండానే అహంకారానికి లోనవుతానేమో అని అనుమానంగా,భయంగా ఉంది.అందువలన ఎప్పుడూ అహంకారము అనేది నాకు కలుగకుండా చేయి స్వామీ!ఆ ఒక్క వరము ప్రసాదించి నన్ను ధన్యుడిని చేయి.

Monday, 2 February 2026

వైకుంఠ పురము వైభవోపేతము

బ్రహ్మదేవుడికి విష్ణువు కనిపించగానే మూడులోకాలు కనిపించినట్లు అయింది.అతనికి తత్ క్షణమ్ వైకుంఠ పురము కనిపించింది.అది దేదీప్యమానంగా,గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది.అంతే కాదు.ఆ విష్ణు విలాసము కేవల సత్త్వగుణమునకు ఆవాసము.అన్ని లోకాలకంటే ఉత్తమమయినది,ఉన్నతమయినది.దేవతలు నిరంతరము స్తుతిస్తూ ఉండే విష్ణు ఆవాసము.అది లోభము,మోహము,భయము అనే తుచ్ఛగుణాలు లేని ప్రదేశము.అది దివ్యమంగళ విలాస మహిమతో ఒప్పారుతున్నది.బ్రహ్మకు తన కళ్ళు చాలడం లేదు ఆ వైభవము చూసేదానికి.ఎంత చూసినా తనివి తీరడం లేదు. అక్కడి చిలుకలు సదా న దైవం కేశవాత్పరం అని పలుకుతున్నాయి.గోరువంకలు కూడా ఎందులోనూ తీసిపోవడం లేదు.అవి సర్వం విష్ణుమయం జగత్ అని అంటున్నాయి.కోకిలలు ఏమాత్రం వెనకబడటం లేదు.అందులో వాటి గాత్రం సుమథురం కదా!అవి మంగళం మధుసూదన అని రాగయుక్తంగా పిలుపునిస్తున్నాయి. ఆ నగర శోభ ఇంత అని చెప్పలేని విథంగా కాంతులు విరజిమ్ముతూ,శోభాయమానంగా,కన్నులకింపుగా కానవస్తుంది. మనకు ఇక్కడ ఏమో వీథి సర్పంచ్ కూడా రాజు వెడలె రవితేజము లలరగ అన్న పంథాన ఉంటుంది కదా!అక్కడ ఏమో విష్ణువుకు,విష్ణు పార్శ్వచరులకు భేదము అస్సలు తెలియడం లేదు. అందరూ శ్యామల దేహము కలిగి ఉన్నారు.అందరూ పీతాంబరాలు ధరించి ఉన్నారు.అందరి ముఖములు,కళ్ళు పద్మములలాగా అందముగా ఉన్నాయి.అందరూ రత్న ఖచిత ఆభరణాలు ధరించి ఉన్నారు.నిత్య యవ్వనంతో కళకళలాడుతున్నారు. సునందుడు,నందుడు,అర్హణుడు,ప్రబలుడు,మిగిలిన పార్శ్వచరులు శ్రీహరిని కొలుచుకుంటూ ఉన్నారు.లక్ష్మీ దేవి శ్రీహరి పాదాలు ఒత్తుతూ ప్రసన్నంగా ఉంది.ఆ దేవదేవుడు కానరాగానే బ్రహ్మ ఆనందానికి అవథులు లేవు.శరీరము జలదరించింది.పులకరించింది.విష్ణు సాక్షాత్కారము అంటే మాటలు కాదు కదా!ఆనందబాష్పాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు.తన నాలుగు శిరస్సులతో శ్రీహరి పాదపద్మాలకు వినమ్రంగా ప్రణమిల్లాడు.

Sunday, 1 February 2026

బ్రహ్మ తపస్సు ఫలదాయకం

బ్రహ్మ పద్మములో నుంచి ఆవిర్భవించాడు కదా!చటుక్కున ఒకసారి ఆయనకు అనిపించింది.నేను కూర్చుని ఉన్న ఈ పద్మము మూలస్థానము ఏది? అది తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువైంది.ఇంక ఉండబట్టలేక క్రిందికి పోయి చూడసాగాడు.ఎంత దూరము పోయినా మూలము కనిపించడం లేదు.ఆయనకు విసుగు వచ్చేసింది.ఏంది ఇదంతా అని.ఇది ఇంక అయ్యేపని కాదని తేల్చుకుని,తిరిగి వెనుకకు వచ్చేసాడు.తన ఆసనము అయిన పద్మములోకూర్చుని,సృష్టికార్యము సాగించాలని సంకల్పము చేసుకున్నాడు.కానీ ఏమీ అర్థం కాలేదు.ఏమీ తోచడం లేదు. ఇంతలో అతనికి రెండు సార్లు తప అనే శబ్దము వినిపించింది.ఆ శబ్దము ఎక్కడనుంచి వచ్చింది?అసలు ఎవరు పలికారు?ఈ అనుమానాలతో నాలుగు దిక్కులకూ పోయి వెదికాడు.ఏమీ తెలియలేదు. వెనకకు వచ్చి తన ఆసనముపైన కూర్చున్నాడు.ఆలోచించాడు.ఇంకా ఆలోచించాడు.తప అంటే ఏంది అర్థము? తపస్సు చేయమని కదా!ఎవరో దేవతా మూర్తి నన్ను తపస్సు చేయమని సలహా ఇస్తున్నాడు.కాదు,కాదు. ఆజ్ఞాపిస్తున్నాడు.కాబట్టి నేను తక్షణము తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంక ఏకాగ్ర చిత్తముతోటి వేయి దివ్య సంవత్సరములు ఘోర తపస్సు చేసాడు.అప్పుడు శ్రీమహా విష్ణువు కరుణించి,ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయినాడు.

Saturday, 31 January 2026

పరీక్షిత్తు శుకుని సంభాషణ

పరీక్షిత్తు శుక మహర్షిని ఇలా అడిగాడు.ఓ మునీశ్వరా!బ్రహ్మ నారదునికి భగవంతుడి దర్శనము ఎలా అయిందో ఎట్లా చెప్పాడు?సకల భూత సంసర్గము లేని ఆత్మకు సంసర్గము ఎలా కలిగింది?సంసర్గము అంటే కలయిక,సంపర్కం,సాంగత్యము అని అర్థము. శుకుడు జవాబు చెప్పాడు.ఓ రాజా!భగవంతుడు బ్రహ్మకల్పమున బ్రహ్మకు భాగవతము ఉపదేశించాడు అని చెప్పాను కదా!ఆ విషయం నీకు వివరంగా చెబుతాను.నీ కు అన్నీ మంచిగా అర్థం అవుతాయి. జ్ఞాన స్వరూపుడు అయిన జీవికి భగవంతుని మాయవలనే దేహసంబంధం కలుగుతుంది.ముక్తిని సంపాదించాలంటే జ్ఞానము అత్యవసరము.ఆ జ్ఞాన సముపార్జన కలగాలంటే భగవంతుని సేవలో తరించడమే ఏకైక మార్గము.అందుకే బ్రహ్మ చేసిన తపస్సుకు మెచ్చి శ్రీహరి కరుణించాడు.జీవుడికి భగవద్భక్తి వలనే మోక్షం సిద్ధిస్తుంది అని నొక్కి వక్కాణించాడు దీనికి ఒక ఇతిహాసము కూడా జోడు అయి ఉంది.

Tuesday, 27 January 2026

ఇతర అవతారములు

భగవద్గీతలోని పదవ అధ్యాయము,విభూతి యోగములో దేవదేవుని రూపాలు అర్థం అవుతాయి.ఇక్కడ ఇంకొన్ని అవతారాలు తెలుసుకుందాము. విష్ణువు పరాశరునికి పుత్రుడుగా జన్మించాడు.అతను వేదములను విభజించాడు.అందుకనే వేదవ్యాసుడనే నామము ఖాయమయినది.ఇద వ్యాసావతార కథ. పాషాండ మతావలంబకులు అధర్మముగా ప్రవర్తిస్తూ ఉండినారు.రాక్షసంగా కార్యాలు చేస్తూ వచ్చారు.అప్పుడు శ్రీహరి బుద్ధావతారము ఎత్తి వారిని నశింపజేసాడు.ఇది బుద్ధావతార కథ. ప్రజలు దైవ భక్తిని విడిచి పెట్టారు.యజ్ఞయాగాదుల ఊసే లేదు.నోరు తెరిస్తే అబద్థాలు చెప్పడానికి అలవాటు పడిపోయారు.పాషాండాలలాగా కఠినాత్ములు అయిపోయారు.అప్పుడు శ్రీమహా విష్ణువు కల్కి అవతారమెత్తాడు.అధర్మాన్ని వశింపజేసాడు.ధర్మ ప్రతిష్ఠాపన చేసాడు.ఇది కల్కి అవతార కథ. ఇంతటితో బ్రహ్మ ఆపేస్తూ ఈ మాటలు అన్నాడు.నారదా!భగవంతుని లీలావతారములు ఒకటా!రెండా!అనంతము!ఏదో నాకు తెలిసినవి నీకు చెప్పాను.అన్నీ వివరంగా చెప్పే శక్తిమంతుడిని కాను.అతను మాయా వినోదుడు.అతనిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎవరి వల్లా కాదు. ఈ విషయాలు అన్నీ పరీక్షిత్తు శుక మహర్షి ద్వారా తెలుసుకునినాడు.

Monday, 26 January 2026

కృష్ణావతారము

రాక్షస అంశతో పుట్టిన రాజులు ధర్మం తప్పారు.ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ,భూమిని అనేక రకాలుగా బాధ పెట్టసాగారు.ఆ పాపుల బరువు,ఆ పాపపు బరువు భూదేవి మోయలేక పోయింది.శ్రీమహా విష్ణువును వేడుకొంది.అప్పుడు శ్రీహరి ఆమె భారం తగ్గించే దానికి నడుము బిగించాడు.ఆ దుష్ట రాజులను సంహరించేదానికి బలరాముడు,శ్రీకృష్ణుడు రూపాలతో అవతరించెను. వసుదేవుని భార్యలలో రోహిణికి బలరాముడు పుత్రుడు.దేవకీదేవికి శ్రీకృష్ణుడు పుత్రుడు.శ్రీకృష్ణుడు పురిటిలో ఉండగానే పూతన అనే రాక్షసిని చంపాడు.మూడు నెలల వయసులో శకటాసురుని చంపాడు.పెంచిన తల్లి యశోద కృష్ణుని అల్లరి భరించలేక రోటికి కట్టింది.ఆ రోలును ఈడ్చుకుంటూ పోయి మద్ది చెట్లను నేలకొరిగేలా చేసాడు. మట్టి తింటున్నావా అని గదమాయించిన యశోదకు తన నోటిలో ముల్లోకాలు,చరాచర జగత్తు అంతా చూపించాడు.త్రాగునీటిని కలుషితం చేస్తున్న కాళియ నాగుని మర్దించాడు.కార్చిచ్చును ఆపి గోపబాలురను సంరక్షించాడు.ఒకసారి నందుడు యమునానదిలో స్నానం చేస్తున్నాడు.అప్పుడు వరుణుడు అతనిని బంధించాడు.కృష్ణుడు నందుని బంధ విముక్తుడిని చేసాడు. ఇంకొకసారి రాక్షస మాయవల్ల గుహలో గోపాలకులు చిక్కుకున్నారు.వాళ్ళందరినీ రక్షించి,ఆ రాక్షసుడిని దునుమాడాడు. ఇంద్రుడు తనకు పూజలు చేయలేదని జడివానలు కురిపించాడు.అపుడు కృష్ణుడు గోవర్థన గిరిని ఎత్తి గోపాలకులను కాపాడాడు.దుష్టుడు కంసుడు మేనమామ అయినా తన తల్లిదండ్రులను చెరలో పెట్టాడని చంపాడు. శంఖచూడుడు అనే రాక్షసుడు గోపికలను ఎత్తుకెళ్ళాడు.వాడికి గర్వభంగము చేసి వారిని విడిపించాడు.నరకుడు మొదలు చాలా మంది రాక్షసులను సంహరించాడు.దుష్టులైన రాజులను సంహరించి భూభారమును తగ్గించాడు.భగవద్గీతను మనకు అందించాడు.ధర్మం ప్రక్కన ఉన్న పాండవ పక్షానికి సహాయ సహకారాలు అందించి కురు వంశం నేలమట్టమయ్యేలా చేసాడు. ఇది కృష్ణావతార కథ.

Wednesday, 21 January 2026

పరశురామ,రామావతార కథలు

హైహయవంశ రాజులు చెలరేగిపోయి లోకములను బాధించడం మొదలుపెట్టారు.వాళ్ళ అకృత్యాలకూ,కృూరత్వాలకూ అడ్డూ ఆపూ లేకుండాపోయాయి. అప్పుడు విష్ణువు జమదగ్ని మహామునికి రాముడు అనే పేరుతో పుత్రుడుగా జన్మించాడు.పరశువును ధరించడం వలన పరశురాముడుగా ప్రసిద్ధికెక్కాడు.ఆ గండ్రగొడ్డలిని అతను శివుడునుంచి పొందాడు. పరశురాముడు లోకకంటకులైన రాజులను ఇరవై ఒక్క సార్లు దాడి చేసి చంపాడు.ఆ సంహారాల అనంతరం వారి భూములను బ్రాహ్మణులకు ఇచ్చాడు.ఇది పరశురామావతారము. శ్రీహరి దశరథునికి పుత్రునిగా జన్మించాడు. అతడు కోసల దేశ రాజు.శ్రీరాముడు అనే పేరుతో జన్మించాడు.భరత,లక్ష్మణ,శత్రుఘ్నులు అతని సోదరులు.శ్రీరాముడు శివధనుస్సును వించి జనక పుత్రిక అయిన సీతను వివాహము చేసుకున్నాడు.తండ్రి,పినతల్లి కోరిక మేర కానలకేగాడు.సీత,లక్ష్మణులు అతని వెంట వెళ్ళారు.ఆ అడవులలో క్రూరులైన రాక్షసులను చంపి,మునులకు అభయమిచ్చాడు. ఖరదూషణులు రావణుని తమ్ముళ్ళు.వారి చెల్లెలు శూర్పణఖ రాముడుని మోహించి పెళ్ళి చేసుకోవాలనుకుంది.అప్పుడు ఆమె ముక్కుచెవులు లక్ష్మణుడు కోసివేస్తాడు.ఆ అవమానానికి ప్రతీకగా ఆమె సోదరులు పదునాలుగు వేలమంది రాక్షసులతో యుద్ధానికి వస్తారు రాముడు పైకి.రాముడు వారందరిని సంహారం చేస్తాడు. సీతాన్వేషణలో భాగంగా సుగ్రీవుని మైత్రి అగ్ని సాక్షిగా కోరాడు.హనుమంతుడి సహాయంతో సీత జాడ కనుగొని,రావణ సంహారం చేసాడు.రావణుడి తమ్ముడు విభీషణుడిని లంకకు రాజును చేసాడు. అయోధ్యకు సతీసమేతంగా వచ్చి రాజ్యానికి సుపరిపాలన అందించాడు. ఇది శ్రీరామావతార కథ.

Sunday, 18 January 2026

వామన,హంస,మనువు,ధన్వంతరి అవతారములు

శ్రీహరి అదితి,కశ్యపులకు వామన రూపంలో జన్మించాడు.ఇంద్రుడికి తమ్ముడు అయినాడు.బలి చక్రవర్తి రాక్షస రాజు.అతనిని ఈ బ్రాహ్మణుడిగా వెళ్ళి మూడడుగులు దానం అడిగాడు.బలికి వచ్చింది శ్రీమహా విష్ణువే అని తెలుసు.కానీ ఒప్పుకున్నాడు.అంతలో వామనుడు ఇంతింతై వటుడింతై ముల్లోకాలనూ ఆక్రమించాడు.మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే తన శిరస్సు చూపిస్తాడు బలి చక్రవర్తి.రాక్షస గురువు చాలా వారిస్తాడు వద్దని,వచ్చింది ఆ పురుషోత్తముడని.కానీ బలి వినలేదు,వినిపించుకోలేదు. భగవంతుడికే దానమిచ్చిన ఘనత బలి చక్రవర్తిది.వామనుడు అంతట తన మూడో అడుగు బలి తల పైన ఉంచి అధః పాతాళానికి అణగద్రొక్కాడు.ఇంద్రునికి స్వర్గాన్ని అప్పగించాడు. ఇది వామన అవతారము. బ్రహ్మ నారదుడితోటి హంస అవతారము గురించి చెబుతున్నాడు.ఓ నారదా!ఆ విశ్వ వ్యాపకుడు నా దైవభక్తి యోగానికి చాలా సంతోషించాడు.అప్పుడు హంస రూపము దాల్చాడు.హంస అయి ఆత్మ తత్త్వాన్ని వివరించే భాగవత పురాణాన్ని నాకు బోధించాడు.ఇది హంసావతార కథ. ఆ దేవదేవుడు మనువుగా పుట్టాడు.గొప్ప తేజస్సుతో మెలిగాడు.అప్రతిహతమయిన చక్రాయుధాన్ని ధరించాడు.ఇక దుష్ట శిక్షణకు నడుము బిగించాడు.దుష్టులయిన రాజులనందరినీ దునుమాడుతూ శిష్టులను పాలించాడు.ఇది మనువు అవతారము. ఆ చక్రథారి,ఆ మహావిష్ణువు ధన్వంతరిగా అవతరించాడు.ఆయుర్వేదమును నిర్మించాడు,కనుగొన్నాడు.ఆయన తన నామము స్మరిస్తేనే జనుల రోగములు నశింపచేసేవాడు.ఇది ధన్వంతరి అవతార సారము.

Friday, 9 January 2026

నృసింహావతార,ఆది మూలావతార కథ

పూర్వము హిరణ్య కశిపుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు.రాక్షస ప్రవృత్తి అంటే ఇంక క్రూరత్వము కరడు గట్టి ఉంటుంది కదా!అతడు గదను ఆయుధముగా చేసుకుని దేవతలను చాలా ఇక్కట్లపాలు చేసాడు.చాలా బాధలు పెట్టాడు.స్వర్గము ఛిందరవందరమయింది.ఎక్కడ చూసినా కల్లోలమూ,భీభత్సమే!అప్పుడు అసుర సంహారము కోసము శ్రీమహా విష్ణువు నృసింహ రూపం ధరించాడు. ఇల్లూ వాకిలీ కాకుండా గడప పైన కూర్చుని,పగలూ రాత్రి కాకుండా అసుర సంధ్య వేళలో,ఏ అస్త్ర శస్త్రాలు వాడకుండా తన గోళ్ళతో ఆ దుష్టుడిని చీల్చి చంపాడు.ఈ కార్యంతో ముల్లోకాలకూ మేలు చేసాడు.అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేలా చేసాడు.ఇది నృసింహావతార కథ. గజేంద్రుడు ఒకసారి నీటికోసరం మడుగులోకి దిగాడు.అప్పుడు ఒక మొసలి దాని కాలును నోట పట్టుకుంది.అప్పుడు ఆ గజేంద్రుడు ఆ మొసలి తో వేయి ఏండ్లు పోరాడాడు దాని పట్టు నుంచి విడిపించుకునేదానికి.కానీ తన శక్తి యుక్తులు చాలలేదు.అప్పుడు గజేంద్రుడు శ్రీహరిని శరణు కోరాడు.లావొక్కింతయు లేదు,ధైర్యము విలోలంబయ్యే.....అంటూ. అప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీలక్ష్మిని వదలి,వైకుంఠపురాన్ని వదలి,పై పంచే జారి పోతున్నా పట్టించుకోకుండా పరుగులు తీసాడు భక్తుడిని రక్షించేదానికి.తన విష్ణు చక్రంతో మొసలిని తుదముట్టించి గజేంద్రుడిని కాపాడాడు. ఇది శ్రీమహా విష్ణువు యొక్క ఆదిమూలావతారము.

Wednesday, 7 January 2026

మత్స్య,కూర్మావతారాలు

బ్రహ్మ చెబుతున్నాడు నారదుడికి.నారదా!వైవస్వత మనువు కాలంలో యుగము అంతము అయింది.అప్పుడు జలప్రళయము సంభవించింది.అప్పుడు విష్ణువు విచిత్రమయిన మత్స్యరూపము ధరించాడు.ఆ చేప రోజు రోజుకు పెరుగుతూ,చాలా స్వల్ప వ్యవథిలో బ్రహ్మాండంగా పెరిగింది.ఆ చేప సృష్టి అంతరించకుండా కాపాడింది.సృష్టికి ఆధారములు అయిన వస్తువులు,జీవరాశులులో నిండి,ఆ మనువు ఎక్కి ఉండే నావ మునిగి పోకుండా కాపాడింది. ఆ సమయంలో నానుంచి వేదాలను రాక్షసులు అపహరించి ఉన్నారు.దేవతల ప్రార్థన మేరకు ఆ వేదములును తిరిగి నాకు అప్పగించింది. ఇది మత్స్యావతార కథ. ఒకానొకప్పుడు దేవతలు,దానవులు అమృతము కోసము కష్టపడ్డారు.మంధర పర్వతాన్ని కవ్వములాగా చేసుకున్నారు.వాసుకిని కవ్వము చిలికేదానికి వాడే త్రాడు లాగా కట్టారు.పాల సముద్రాన్ని ఏక బిగిన చిలకటం మొదలుపెట్టారు చెరొక ప్రక్కన నిలబడి.కొంచెం సేపటికి ఆ పర్వతము మునిగి పోబోయింది.అప్పుడు భగవంతుడు కూర్మరూపంలో సముద్రం అడుగుకు వెళ్ళి,కవ్వము మునిగిపోకుండా తన వీపుపై పెట్టుకున్నాడు.ఆ పట్టు ఇచ్చాడు కాబట్టే దానవులు,దేవతలు అమృతము చిలకగలిగారు. ఇది కూర్మావతార కథ.

Tuesday, 6 January 2026

వృషభుడు,హయగ్రీవుడు

అగ్నీధ్రుడు అనేవాని పుత్రుడు నాభి.ఆ నాభి భార్య మేరుదేవి.ఆమెకు సుదేవి అనే పేరు కూడా వాడుకలో ఉంది.ఆ దంపతులకు వృషభుడు అనే కొడుకు పుట్టాడు.వృషభుడు ఎవరో కాదు!విష్ణువే ఆ పేరుతో వారికి పుట్టాడు. వృషభుడు శాంతమూర్తి.సర్వసంగ పరిత్యాగి.ఆయన పరమ హంస అయి మునులందరి ప్రశంసలు పొందాడు.ఇది వృషభావతార కథ. హయగ్రీవుడు బంగారు మేని ఛాయ గలవాడు.భగవదంశ సంభూతుడు.అతడు బ్రహ్మ ముఖమునుండి పుట్టాడు.అతను వేదాలలో దిట్ట.ఒకరకంగా చెప్పాలంటే వేదమయుడు.యజ్ఞ పురుషుడు.హయగ్రీవుడు ఎంతటి మహానుభావుడు అంటే అతని నాసిక నుండి వెలువడే ఉచ్ఛ్వాస నిశ్వాసముల వల్లనే వేదములు పుట్టాయి.ఇది హయగ్రీవావతార వృత్తాంతము.

Sunday, 4 January 2026

ధృవుడు,పృథుడు

ధృవుడు ఉత్తానపాదుడు అనే రాజుకు పుత్రుడు.అతను విష్ణువు అంశతో జన్మించాడు.అతని చిన్న వయసులో తండ్రి ఒళ్ళోకూర్చోబోయాడు.సవతి తల్లికి ఒప్పలేదు.తండ్రి తొడపై కూర్చుని,మురిపాలు పోవాలి అనే ఆ చిన్న బాలుడి కోర్కె తీరని కోరికే అయింది.ఆ సవతి తల్లి మాటలు ఆ చిన్నారి గుండెల్లో గునపాల్లా గ్రుచ్చుకున్నాయి.మానవుల ప్రేమలు సమంగా ఉండవు.భగవంతుడే సర్వకాల సర్వావస్థలయందు అందరినీ సమంగా ప్రేమిస్తాడు అని కన్న తల్లి చెప్పింది.ఎవరైతే తనను తననుగా ప్రేమిస్తారో,వారి ప్రేమ పొందితే చాలు అని తల్లి చెప్పిన మాటలు తలకెక్కాయి.అంతట తక్షణం ఆ పరమాత్ముడిని అన్వేషిస్తూ కానలకెళ్ళాడు. అడవిలో విష్ణువు కోసం ఘోర తపస్సు చేసాడు.ఆ భగవంతుడు అతనికి అత్యున్నతమయిన ధృవ స్థానం కల్పించాడు.భృగువు,మిగిలిన మునులు అతనిని స్తుతించారు.ధృవ మండలము సప్తర్షి మండలానికి పైభాగాన ఉంటుంది.ఇది ధృవావతార కథ. మునుపు వేనుడు అని ఒక రాజు ఉన్నాడు.భలే కృూరుడు.దుష్ట ప్రవర్తనకు తగినట్లుగా అతనికి బ్రాహ్మణ శాపం తగిలింది.దాని దెబ్బకు భాగ్యము అంతా పోయింది.ధనంతోటే పౌరుషము కూడా కనుమరుగు అవుతుంది కదా! పృథువు ఆ వేనుని పుత్రుడు.తండ్రి దుష్ట బుద్ధి ఇసుమంతకూడా అంటలేదు.అతను లోకములకు హితము కూర్చిన మహనీయుడు.ఇతను కూడా విష్ణు అంశతో పుట్టాడు.చక్రవర్తి అయ్యాడు.ఇతను భూమిని గోవుగా చేసాడు.సమస్త వస్తువులను పిదికాడు.పుత్రుడుగా తన ధర్మం నిర్వర్తించాడు.తండ్రికి ఉత్తమ గతి కల్పించాడు. ఇది పృథువు అవతార కథ.

Friday, 2 January 2026

సనకాదులు,నరనారాయణులు

బ్రహ్మ ఇలా చెప్పసాగాడు.నేను ఒకానొకప్పుడు కల్పాదినీ,లోకాలనూ సృజింపదలచాను.అందుకని తపస్సు చేయఢం మొదలుపెట్టాను.అప్పుడు నా నోటి నుండి సన అనే శబ్దము వెలువడింది.అందువల్ల సన అనే పేరుగల నలుగురు మానస పుత్రులు కలిగారు నాకు.వారే సనకుడు,సనందనుడు,సనత్కుమారుడు మరియు సనత్సుజాతుడు.పోయిన కల్పాంతంలో వారే ఆత్మతత్త్వాన్ని తిరిగి నెలకొల్పారు.వారు వేరుగా కనిపించినా నలుగురూ విష్ణువు అంశమే.ఇది అందరూ గ్రహించాలి. ఇదే సనకాదుల వృత్తాంతము. ఇక నరనారాయణుల గురించి చెబుతాను.మూర్తి అనునామె దక్షపుత్రిక.ఆమెకు,ధర్మునికి ఇద్దరు కుమారులు పుట్టారు.వారే నరనారాయణులు.వారిరువురూ మంచి గుణములు కలవారు.పరమ పావన మూర్తులు.వారు మునులు అయినారు.బదరీ వనంలో ఘోరమయిన తపస్సు చేయసాగారు.దేవేంద్రుడికి భయం పట్టుకుంది.వారి తపోబలం వలన తన పదవికి భంగం కలుగుతుందేమో అని.ఆయనకు తెలిసిన విద్య ఒక్కటే గదా!వారి తపస్సు భగ్నం చేసేదానికి అప్సరసలను రంగంలోకి దించాడు. ఆ అప్సరసలు దేవేంద్రుడి ఆజ్ఞ మేరకు తమ తమ శక్తియుక్తులు అన్నీ ప్రదర్శించారు.కానీ నరనారాయణులు చలించలేదు.మామూలు మునులు అయి ఉంటే ఎప్పుడో వాళ్ళను భస్మంచేసి ఉండేవాళ్ళు.కానీ వీరిరువురూ సత్త్వగుణసంపన్నులు.కాబట్టి కోపం తెచ్చుకోలేదు.శాంతి మార్గాన్నే ఎంచుకున్నారు. నారాయణుడు తన యూరువును చీల్చగా,అందుండి ఒక సౌందర్యవతి ఉద్భవించినది.ఆమె అతిలోక సుందరి.ఆమె కాలి గోటికి కూడా సరికాదు ఈ అప్సరసల అందచందాలు.వారు సిగ్గుతో తల వంచుకున్నారు.ఊరువు వలన ఉద్భవించినది కావున ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చినది.అప్సరసలు అవమానభారంతో వెనుతిరిగారు.ఇది నర నారాయణావతార వృత్తాంతము.

Thursday, 1 January 2026

కపిలుడు,దత్తాత్రేయుడు

కర్దమ ప్రజాపతికి,దేవహూతికి తొమ్మిది మంది సోదరీమణులతో కలిపి కపిలుడు జన్మించాడు.సాంఖ్య యోగము అనేది భగవంతుడు అయిన శ్రీహరిని పొందేదానికి అనువైన మార్గము.ఆ సాంఖ్య యోగాన్ని తన తల్లికి ఉపదేశించాడు.పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలి విశదీకరించాడు.ఆ పై ముక్తిని పొందే మార్గము బోధించాడు.ఇది కపిలావతార కథ. అత్రి మహాముని తపస్వులలోకి ఉత్తముడు.అతను పుత్రుడు కావాలని శ్రీహరిని ప్రార్థించాడు.ఆ భగవంతుడు నేను నీకు దత్తుడను అంటూ అత్రి మహామునికి కొడుకుగా పుట్టాడు.అతడే దత్తాత్రేయుడు.దత్తుడు అయిన శ్రీహరి అత్రి మహామునికి పుత్రుడు అయినాడు కాబట్టి ఆత్రేయుడు అయినాడు.హరికి దత్తాత్రేయ నామము కలిగే దానికి ఇదే కారణము. దత్తాత్రేయుడి పాద ధూళితో హైహయ వంశీయులు,యాదవులు పవిత్రులు అయినారు.వారందరూ ఐహిక సుఖాలను అనుభవించారు.అలాగే పరలోక సుఖాలనూ ఆస్వాదించారు.ఇది దత్తాత్రేయావతార కథ.