Thursday, 23 October 2025

కుంతీదేవి ఆనంద పారవశ్యము

కుంతీదేవి ఆనందానికి అవథులు లేవు.శ్రీకృష్ణుని మనసారా స్తుతించింది.హే దేవా!నీవు అవ్యయుడవు.నీకు మించిన ప్రకృతి ఇంక వేరే ఏమీలేదు.నీకు ఇవే నా నమస్కారాలు.సభ ముందరకు రాకుండా,తెర వెనక ఉండి నాట్యము చేసే నటుడివి నీవు.ఎందుకంటావా?నీవు ఎప్పుడూ మాయా యవనికాంతరమున నిలిచి చిత్ర విచిత్రాలు ప్రదర్శిస్తూ ఉంటావు.నీ మహిమ మాలాంటి మామూలు మనుష్యులకు ఏమి అర్థమవుతుంది?ఎలా అర్థమవుతుంది?ఎంతని అర్థమవుతుంది? నన్నూ,నా బిడ్డలనూ లక్క గృహములో అగ్నికి ఆహుతి కాకుండా కాపాడావు.మాకు ప్రాణ భిక్ష పెట్టావు.దుర్యోధనుడు కుటిల బుద్థితో భీముడికి విషం కలిపిన ఆహారము పెడితే,దాని నుంచి కాపాడావు.ద్రౌపదికి నిండు సభలో అవమానము జరిగినప్పుడు,ఆమెకు వలువలు ఇచ్చి,విలువలు పెంచి మానసంరక్షణ చేసావు.పాండవ కౌరవ యుద్ధములో మా వెంట ఉండి,నా పుత్రులు విజయ పతాకం ఎగుర వేసేలాగా చేసావు.ఇప్పుడు ఉత్తర గర్భమును కాపాడావు. అలనాడు కంసుడు మీ అమ్మను బాథలు పెట్టాడు.ఆ ఇక్కట్లనుంచి మీ అమ్మను కాపాడుకునినట్లు,ఇప్పుడు కౌరవుల చేతిలో నేను కష్టాలు పడకుండా కాపాడావు. నీ మత్స్య,కూర్మ,వరాహావతారాలు అన్నీ మామూలు మనుష్యులను మాయ చేసేదానికే కదా!నీవు జన్మ కర్మ రహితుడవు.నీకు చావు పుట్టుకలు లేవు.దేవకీ వసుదేవులు తమ సంతానంగా నీవు పుట్టాలని ఎంతో తపస్సు చేసారు.వాళ్ళ కోరిక తీర్చడం కొరకే నీవు యాదవ కులములో పుట్టావు. సముద్రములో నావ బరువు ఎక్కువ అయితే ముణిగి పోతుంది.అలాగే పాపుల యొక్క పాప భారంతో బరువెక్కిన ఈ భూదేవిని ఉద్థరించేదానికే నీవు ఈ జన్మ ఎత్తావు. ఇలా కుంతి తన ఆనందానిని,కృష్ణుని పైన తనకు ఉండే నమ్మకాన్నీ వ్యక్త పరచింది.ధర్మరాజు ,కుంతీ దేవి కోరికమేరకు కృష్ణుడు వాళ్ళ దగ్గర ఇంకొన్ని రోజులు ఉండేదానికి ఒప్పుకున్నాడు.

Sunday, 19 October 2025

ఉత్తర గర్భమందలి బిడ్డ క్షేమం!

శ్రీకృష్ణుడు ద్వారకకు రథము ఎక్కి బయలు దేరబోతున్నాడు.ఇంతలో ఉత్తర అక్కడకు భయముతో వణికి పోతూ వచ్చింది.ఒళ్ళంతా భయంతో తడిసిపోతుంది.దీనంగా,పీల గొంతుతో,మాటకూడా సరిగా రావటం లేదు.అలానే శ్రీకృష్ణుడితో చెప్పింది.ఓ దేవదేవా!ప్రళయ కాలాగ్నితో సమానమై నిప్పులు గ్రక్కుతూ ఒక బాణం నా గర్భస్థ శిశువును దహించే దానికి వస్తుంది.నీవు తప్ప నన్ను రక్షించే వాళ్ళు వేరే ఇంకెవరూ లేకు.ఆ బాణం నా తట్టు రాకుండా,నా గర్భంలో ఉండే బిడ్డను ఏమీ చేయకుండా ఆగేలా చూడు స్వామీ!నా బిడ్డను రక్షించే భారము నీదేనయ్యా! శ్రీ కృష్ణుడికి అర్థం అయింది.అది లోకములో పాండవులు మిగిలి ఉండకుండా చేసేదానికి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము.దివ్యాస్త్రము బ్రహ్మశిరోనామకమైనది అని శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు.వెంటనే తన చక్రాయుధాన్ని పంపాడు దానిని అడ్డుకునేదానికి.ఆ బ్రహ్మాస్త్రమునకు అసలు తిరుగులేదు.కాని అది శ్రీకృష్ణుని చక్రాయుధము ముందర నిలువలేక పోయింది.ఒక్కసారిగా నిర్వీర్యమయిపోయింది. ఈ రకంగా శ్రీకృష్ణుడు ఉత్తర గర్భము లోని బిడ్డను ఆపద నుండి రక్షించాడు.కుంతీ దేవి చిన్నగా ఊపిరి పీల్చుకునింది,వంశము నిలబడినదానికి.ఆమె శ్రీకృష్ణుడిని స్తుతించింది.మాథవా!మథుసూదనా!నీవు సృష్ఠి స్థితి లయ కారుడవు.అలాంటప్పుడు అశ్వత్థామ సంధించిన అస్త్రము ఆపడం నీకు ఒక లెక్కా?చిన్న చిటికె వేసినంత సులభము.మా వంశము రక్షించినదానికి నీకు శత కోటి నమస్కారాలు.

Saturday, 18 October 2025

భీముడి కోపం నషాళానికి!

ధర్మరాజు శాంతి కాముకుడు.కాబట్టి ద్రౌపది మాటలు అతనికి నచ్చాయి.నకులుడు,సహదేవుడు,సాత్యకి,శ్రీకృష్ణార్జునులకు కూడా నచ్చాయి.అందరూ సరే అన్నారు.కానీ భీముడికి భలే కోపం వచ్చింది.మొదటి సారి ద్రౌపది మాటలు నచ్చలేదు. తన ఆక్రోశం ఇలా వెళ్ళగక్కాడు.ఈ ద్రౌపది ఒఠ్ఠి వెర్రిబాగులది.తన కొడుకులను పొట్టన పెట్టుకున్న దురాత్ముడిని విడిచి పెట్టమని చెబుతుంది.బుర్రుండి మాట్లాడుతుందా అసలు?బిడ్డలను చంపిన ఈ కర్కోటకుడు బ్రాహ్మణుడా?ఈ నీచుడిని వదలి పెట్టే మార్గమే లేదు.నరికి పోగులు పెట్టాల్సిందే!మీరు ఎవ్వరూ వీడిని చంపక పోతే,నేనే నా ఒకే ఒక్క పిడి గుద్దుతో వీడి తలను నుజ్జు నుజ్జు చేస్తాను. ఇలా అంటూ భీముడు అశ్వత్థామ పైకి ఉరికాడు.ద్రౌపది అడ్డు పడింది.ఆమె శక్తి చాలదని తలచి శ్రీకృష్ణుడు తన నాలుగు భుజాలలో రెండు భుజాలతో భీముడిని ఆపాడు.ఇంకో రెండు భుజాలతో ద్రౌపదిని భీముడు అశ్వత్థామల మథ్య నుంచి ప్రక్కకు లాగాడు. శ్రీకృష్ణుడు భీముడిని ఉద్దేశించి చిరునవ్వుతో ఇలా అన్నాడు.భీమా!నీవు అన్నది ముమ్మాటికీ నిజమే!ఈ నీచ నికృష్టుడిని శిక్షించాల్సిందే!కానీ బ్రాహ్మణో న హంతవ్యః అని వేద ధర్మము ఉంది కదా!అంటే బ్రాహ్మణుడిని చంపరాదు అని వేదాలు ఘోషిస్తున్నాయి.కాబట్టి అన్నిటినీ బేరీజు వేసుకుంటే వీడిని చంపకుండా వదలివేయటమే ఉత్తమము.చిన్నగా భీముడిని శాంతపరచారు. అందరూ కలసి బాగా ఆలోచించారు.ద్రౌపది,భీముడు ఒప్పుకోవాలి.అర్జునుడి ప్రతిజ్ఞ భంగము కాకూడదు.ధర్మబద్థంగా ఉండాలి.వాళ్ళకు ఒక ఉపాయము తట్టింది. అర్జునుడు అశ్వత్థామకు శిరోముండనం చేసాడు.అతని తలలో ఉండే చూడారత్నమును తీసేసుకున్నాడు.కట్లు విప్పి,అక్కడ నుంచి కుక్కను తరిమినట్లు తరిమేశాడు. చివరకు గురుపుత్రుడు,బాలహంతకుడు అనే మాయని మచ్చతో,తేజో విహీనుడు అయి,మణిని కోల్పోయి,కళావిహీనంగా,సిగ్గుతో,పాపపు భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాండవులు,పాంచాలి తమ విగత పుత్రులను తలచుకుని రోదించారు.మృతులు అయిన బంథువులకందరికీ దహన సంస్కారాలు చేసారు.అందరూ వారి స్త్రీలను తోడు తీసుకుని శ్రీకృష్ణునితో కలసి గంగా తీరానికి పోయారు.మృతి చెందిన వారందరికీ తిలోదకాలు సమర్పించి,గంగలో స్నానాలు చేసారు. శ్రీకృష్ణుడు పుత్రశోకముతో విలపిస్తున్న గాంథారి,ధృతరాష్ట్రుడు,కుంతీ దేవి,ద్రౌపది మున్నగువారిని మంచి మాటలతో శాంత బరచాడు.బంధు జన మరణము వలన కలిగిన దుఃఖము ఉపశమనము పొందేలా చేసాడు. అలా శ్రీకృష్ణుడు యుద్థములో పాండవులచేత కౌరవులను చంపించాడు.విజయలక్ష్మి పాండవులను వరించేలా చేసాడు.ధర్మరాజుకు రాజ్యము చేకూరేలా చేసాడు.ఇంక నిశ్చింతగా ద్వారకా నగరానికి పోయేదానికి సమాయత్తమయ్యాడు.

Friday, 17 October 2025

అశ్వత్థామను ద్రౌపది నిలదీయుట

అర్జునుడు అశ్వత్థామను ఈడ్చుకుని వచ్చి ద్రౌపది ముందర పడేశాడు.అశ్వత్థామకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు.సిగ్గుతో,తను చేసిన నీచ నికృష్ట పనికి,తల దించుకున్నాడు. ద్రౌపది అడిగింది.ఏమయ్యా!నీ తండ్రి ద్రోణాచార్యుడు.అతను పాండవులకు గురువు.గురు పుత్రుడు అయిన నీవు కూడా గురువు లాంటి వాడివే.ఆ లెక్కన పాండవులందరూ నీకు శిష్యులే!అట్లాంటిది,బ్రాహ్మణ పుటక పుట్టి కర్కశంగా శిష్యుల కుమారులను హతమార్చావు.గురువు అనే పదానికి నీ కృత్యం తలవంపులు కాదా!అసలు అది న్యాయబద్ధమా?నా బిడ్డలు నీ పై పైకి ఉద్రేకంతో వచ్చారా?నన్ను నేను కాపాడుకునేదానికి వాళ్ళను చంపాను అని సంజాయిషీ ఇచ్చుకునేదానికి!నీ కేమైనా ద్రోహము తల పెట్టారా?ద్రోహము తలపెట్టారు కాబట్టి మట్టు పెట్టాను అని సమర్థించుకునేదానికి!వాళ్ళు చిన్న పిల్లలు.చక్కని వారు.యుద్ధ విద్యలో నిష్ణాతులు కాదు.యుద్ధానికి సన్నద్ధులై లేరు.ఆదమరచి రాత్రిపూట నిద్ర పోతూ ఉండినారు.అట్లాంటి అమాయకులను పొట్టన పెట్టుకునేదానికి నీ మనసు ఎట్లా ఒప్పింది?ఎట్లా చేతులాడాయి?అంత కర్కోటకుడివిగా ఎలా మారావు?నీవు జన్మతః బ్రాహ్మణుడివి.దయా,కరుణా,జాలి ఉండే వాడివి.చిన్న బిడ్డలను చంపటం రాక్షసకృత్యమని తట్టలేదా?ఇది అధర్మమని అనిపించలేదా? ద్రౌపది ఇంకా ఇలా మాట్లాడింది.అర్జునుడు నిన్ను కాళ్ళూ చేతులూ కట్టి తెచ్చాడు.నిన్ను చంపేదానికి సిద్ధముగా ఉన్నాడని మీ తల్లి దండ్రులకు తెలిసి ఉంటుంది కదా ఇప్పటికే.వాళ్ళు ఎంత బాథ పడుతుంటారో ఆలోచించు. ఆమె శ్రీకృష్ణార్జునులను ఉద్దేశించి ఇలా అనింది.ద్రోణుడు యుద్థంలో మరణించినా ఆయన భార్య సతీ సహగమనము చేయలేదు.మీరు అశ్వత్థామను తాళ్ళతో కట్టి,బలి పశువును తెచ్చినట్లు లాక్కొచ్చారని తెలిసి ఎంత కుమిలి పోతూ ఉంటుంది?పుత్రశోకము ఎంత బాధకలిగిస్తుందో నాకు తెలుసు.మీరు ఇప్పుడు అశ్వత్థామను చంపి పాపము మూటకట్టుకోవద్దు.ఇతనిని హింసించ వద్దు.మీరిప్పుడు ఇతనిని చంపితే కృపికు కోపం వస్తుంది.బ్రాహ్మణులకు కోపం రావటం క్షత్రియులకు క్షేమదాయకం కాదు.హాని కలుగుతుంది కానీ మేలు జరగదు.కాబట్టి ఇతనిని వదిలి పెట్టండి. ద్రౌపది ఇలా గొప్పగా,ధర్మయుక్తంగా,శ్లాఘనీయంగా మాట్లాడింది.

Thursday, 16 October 2025

బ్రహ్మాస్త్రము ప్రయోగము

అర్జునుడు శ్రీకృష్ణుడు రథ సారథిగా బయలుదేరాడు.శస్త్రాస్త్రములు అన్నిటినీ తీసుకుని రథముపై అశ్వత్థామను వెంబడించాడు.అశ్వత్థామ తన పిక్కబలం అంతా చూపించి పరుగెత్తాడు.కానీ అర్జునుడిని తప్పించుకుని,పారిపోవటం చేతకాలేదు.ఇంక తనను తాను రక్షించుకునేదానికి,తనకు తెలిసిన మార్గం ఎన్నుకున్నాడు.అర్జునుడు పైకి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు.అశ్వత్థామకు అంతా సగం సగం జ్ఞానము.అతనికి బ్రహ్మాస్త్రం ఉపయోగించడం తెలుసుకానీ,ఉపసంహరించడం తెలియదు.అది నిప్పులు చిమ్ముతూ అర్జునుడి పైకి రాసాగింది.అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగించాడని అర్జునుడికి అర్థం కాలేదు.కానీ శ్రీకృష్ణుడికి అర్థం అయింది.వెంటనే అర్జునుడిని అప్రమత్తం చేసాడు.నీ పైకి వచ్చేది బ్రహ్మాస్త్రం.దానికి విరుగుడుగా నీవు కూడా బ్రహ్మాస్త్రాన్నే ఉపయోగించాలి.అప్పుడు అర్జునుడు మంత్రం చదివి బ్రహ్మాస్త్రం ఉపయోగించాడు.రెండూ ఢీకొన్నాయి.ఆ రాపిడికి పైకెగసిన మంటలు ముల్లోకాలూ భీతి చెందేలా చేసాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.అర్జునా!నీ బ్రహ్మాస్త్రంతో పాటు అశ్వత్థామ వదిలిన దానిని కూడా ఉపసంహరించు.ఎందుకంటే అతనికి ఉపసంహరించడం తెలియదు.అర్జునుడు అలాగే చేసాడు. అర్జునుడు మళ్ళీ అశ్వత్థామను వెంబడించాడు.పట్టుకుని,యాగపశువును తాళ్ళతో కట్టినట్లు కట్టి,బంథించి తమ శిబిరానికి తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు.శ్రీకృష్ణుడికి అశ్వత్థామను చూడగానే కోపం మిన్నంటింది.అర్జునుడితో ఇలా అన్నాడు.అర్జునా!ఈ క్రూరుడిని తప్పకుండా శిక్షించాలి.అసమర్థులను,అస్త్ర విద్య తెలియని వారును,ఎదిరించలేని వారును,బాలురను,నిద్రించుచున్న వారును అయిన ఉపపాండవులను అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నవాడు బ్రాహ్మణుడా?మహాపాపాత్ముడు!వీడికి పుట్టగతులు ఉండవు. ఇప్పుడేమో సిగ్గూ ఎగ్గూ లేకుండా,ప్రాణభీతితో వణుకుతూ,వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు,పరమ నీచుడు వీడు.వీడి పైన ఇసుమంతైనా దయా,జాలి చూపించాల్సిన అవసరము అస్సలు లేదు.అర్జునా!ఎవడైతే తన ప్రాణాలను రక్షించుకునేదానికోసం ఇతరుల ప్రాణాలు తీస్తాడో వాడు అత్యంత అథముడు.వాడు అథోలోకాలకు పోతాడు.వాడు చేసిన పాపాలు,అకృత్యాలకు రాజదండన అనుభవిస్తే కానీ ఉత్తమలోకాలు దక్కవు.ఇతనిని తక్షణమే శిక్షించు. అప్పుడు అర్జునుడు ధర్మం తెలిసినవాడుగా ఇలా అన్నాడు.బ్రాహ్మణుడు ఎంతటి మహాపాపాలు చేసినా,అతనిని చంపకూడదు కదా!అతనిని శిబిరానికి తీసుకుని వచ్చాడు.

Tuesday, 14 October 2025

అశ్వత్థామ ఘాతుకం

సూతుడు శౌనకాది మునులకు మాట ఇచ్చాడు.ఏమని?వారికి పరీక్షిత్తు మహారాజు వృత్తాంతము,పాండవుల మహా ప్రస్థానము మరియు శ్రీకృష్ణుని వృత్తాంతము చెబుతాను అని.ఇలా మొదలు పెట్టాడు అన్నట్టుగానే. మునులారా!కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధంలో కౌరవ వీరులు అందరూ గతించారు.పాండవుల పక్షంనుంచి కూడా చాలా మంది విగతజీవులు అయ్యారు.భీముడు గదాఘాతం వలన దుర్యోధనుడి తొడలు విరిగి పోయాయి.విజయలక్ష్మి పాండవులను వరించింది. దుర్యోధనుడి దీన స్ధితి చూసి అశ్వత్థామ చాలా బాథ పడ్డాడు.దుర్యోధనుడికి సంతోషం కలగాలంటే ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నాడు.అర్థరాత్రి వెళ్ళి,నిద్రలో ఉన్న ఉపపాండవులను దొంగచాటుగా చంపేసాడు.ఆ సమయంలో అందరూ నిద్రలు పోతున్నారు.అప్పుడు ఇలాంటి ఘాతుకం చేబట్టాడు ద్రోణ పుత్రుడు అయిన అశ్వత్థామ.విషయం అందరికీ తెలిసి పోయింది.ద్రౌపది దుంఖాన్ని ఆపేవారే లేకపోయారు.అంత హృదయవికారంగా రోదించింది. అప్పుడు అర్జునుడు ఆమె దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు.నీవు శోకించవద్దు.నీవు రాజపుత్రివి.నీకు తగదు.అశ్వత్థామ కరుణ అనే మాట లేకుండా,నిద్రలో ఉండే బాలురను చంపాడు.నేను వెళ్ళి అతనిని చంపి,అతని తలను నీకు కానుకగా ఇస్తాను.నీవు నీ కసి,కోపం పోయేదాకా కాళ్ళతో అతని తలను తన్ను. కృష్ణుడు కూడా అదే సరైనది అని అన్నాడు.

Sunday, 12 October 2025

నారదుడు అస్ఖలిత బ్రహ్మచారి

నారదుడు ఇంకా ఇలా కొనసాగించాడు ఆ మునికి చెప్పడము. ఓ మునివర్యా!ఆ అశరీరవాణి మాటలు నన్ను చాలా సంతృప్తి పరచాయి.నాకు చాలా సంతోషం వేసింది.నేను వినమ్రతతో శిరసు వంచి ఆ అశరీర వాణికి దండ ప్రమాణాలు సమర్పించుకున్నాను.ఇంక అప్పటి నుండి కామక్రోథాలను వదలి పెట్టేశాను.ఆ భగవంతుని నామ జపంతోటే కాలము వెళ్ళ బుచ్చాను.అతని చరిత్రనే మననం చేసుకుంటూ ఉన్నాను.నిర్మల మయిన మనసుతో,ప్రశాంత చిత్తముతో నిరంతరమూ ఆ దేవదేవుడిని మనోఫలకం మీద ఉంచుకున్నాను.అతని మీదే బుద్ధి నిలిపి,ఏకాగ్ర చిత్తంతో కాలం గడపసాగాను.ఇంతలో నాకు మరణం సంభవించింది.నేను నా శరీరాన్ని వీడి శుద్ధ సత్త్వమయమైన భాగవత శరీరాన్ని పొందాను.అంతలో ప్రళయము సంభవించింది. శ్రీమన్నారాయణుడు సముద్రము మథ్యలో శయనించి ఉన్నాడు.అతని నాభి నుండి వచ్చిన కమలంలో బ్రహ్మ కానవచ్చాడు.బ్రహ్మ విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించబోయాడు.అతని నిశ్వాసతో పాటే నేను కూడా అతనిలోకి వెళ్ళిపోయాను.ఇలా వేయి యుగములు గడచిపోయాయి.బ్రహ్మకు మెలకువ వచ్చింది.ఇంక సృష్టి కార్యము మొదలు పెట్టాడు.ఆ బ్రహ్మ వలన మరీచి,ఇంకా చాలా మంది మునులు,నేను కూడా పుట్టాము. నేను అస్ఖలిత బ్రహ్మచారిని అయినాను.మహావిష్ణువు కృపాకటాక్షము నా మీద ప్రసరించడం వలన ముల్లోకాలూ సంచరిస్తుంటాను.నన్ను ఎవరూ ఆపరు.ఎవరి ప్రమేయం లేకుండానే సప్త స్వరాలు పలికే మహతి వీణ ఈశ్వరుడు యొక్క అనుగ్రహము వలన నాకు దక్కింది.ఇంక ఆ వీణను మీటుతూ నారాయణుని కథలను గానం చేయటమే నా వృత్తి,ప్రవృత్తి. నేను ఈ గానం తన్మయత్వంతో చేస్తుంటే,నేను పిలిచినట్లుగా నా మనోఫలకం పైన ఆ భగవంతుడు కనిపిస్తాడు.నాకు విష్ణునామ సంకీర్తన వలన కలిగే మనశ్శాంతి,నాకు వేరే ఇంకేమి చేసినా దక్కదు.స్వయానా యముడుని నియంత్రించ గలిగే యోగము నేర్చుకుని ఉన్నా నాకు అంత మహదానందము దక్కదు.హే మునీంద్రా!ఇది స్వయానా నా అనుభవము.కాబట్టి నా ఈ రహస్యాన్ని నీకు చెబుతున్నాను. ఆ మాటలు చెప్పి నారదుడు తన మహతి వీణను మీటుకుంటూ విష్ణు నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళి పోయాడు.

Friday, 10 October 2025

భగవంతుడి అనుగ్రహం

నారదుడు ఇలా కొనసాగించాడు.వ్యాసా!నేను అప్పుడు ఒక ఘోరారణ్యము మధ్యలో ఉన్నాను.అది అన్ని రకాల కృూరమృగాలకు పుట్టినిల్లు.అయినా నేను ఏ మాత్రమూ భయపడలేదు.నా ప్రయాణము సాగించాను.ఒకచోట వెదురు పొదలు,పూలతీగెలు కనిపించాయి.దగ్గరలో ఒక గుహ కూడా కానవచ్చింది.అక్కడే ఉన్న రావి చెట్టు దగ్గరకు పోయాను.అక్కడ పద్మాసనం వేసుకుని నా హృదయగతుడు,పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీహరి గురించి తపస్సు చేసాను.అలా దైవధ్యానంలో ఉన్న నా కళ్ళ వెంబడి నీరు కారాయి.అవి ఆనందాశ్రువులు.శరీరము జలదరించింది.ఆ భగవంతుడి పాదపద్మాలను ధ్యానించే క్రమంలో ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపము కనిపించింది.నేను ఆనందసాగరంలో ఓలలాడాను.ఆ తన్మయత్వం నేను వివరించనలవికాదు.నేను చూసింది అతనినే అనే స్పృహ లేదు.తటాలున లేచేసాను.మళ్ళీ మళ్ళీ ఆ దివ్యస్వరూపాన్ని చూడాలని తహ తహలాడాను.పిచ్చివాడిలాగా ఆ అడవి అంతా తిరిగాను.అప్పుడు నాకు ఈ మాటలు వినిపించాయి. నాయనా!ఎందుకు అంత దిగులు పడుతున్నావు?ఎందుకు తిండీ తిప్పలు లేకుండా శరీరాన్ని శుష్కింప చేస్తున్నావు?నీవు ఎంత విచారించినా,ఎంత ఏడ్చి గీ పెట్టినా ఈ జన్మకు ఇంక నన్ను చూడలేవు.ఎందుకంటే చెపుతాను,విను. కామ,క్రోధ,లోభ,మద,మోహ,మాత్సర్యము అనే అంతశ్శత్రువులు ఆరు ఉన్నాయి.వాటిని అన్నిటినీ జయించాలి.కర్మములను అన్నిటినీ నిర్మూలనము చేసుకోవాలి.అలాంటి పరిశుద్ధుడు అయిన యోగి తప్ప వేరే ఇంకెవరూ నన్ను చూడదాలరు.నీకోరిక తీర్చాలని నీకు నా నిజస్వరూపము చూపించాను.నీ కోరిక వృథా కాదు.అది నీహృదయములోని దోషాలను అన్నిటినీ పటాపంచలు చేస్తుంది.కానీ నీ కోరిక ఈ జన్మలో నెరవేరదు.నా సేవ చేసుకుంటూ ఉండు.నీ భక్తి వృద్ధి అవుతుంది.నీ మనస్సు నా మీదే లగ్నము అయి ఉంటుంది సర్వదా.నీవు ఈ శరీరం విడిచి వేరే జన్మ ఎత్తుతావు.అప్పుడు నా భక్తులు అందరిలోకి గొప్పవాడివి అవుతావు.నాయనా!వత్సా!ఈ సృష్టి లయము పొంది వేయి యుగాలు గడుస్తాయి.తరువాత లోకమంతా అంధకార బంధుర మవుతుంది.మళ్ళీ సృష్టి మొదలు అవుతుంది.అప్పుడు నీవు ఎలాంటి దోషాలు లేకుండా జన్మాంతర స్మృతితో పుడతావు.నా దయాదృష్టి వలన బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తావు.సాత్త్వికులలో అగ్రగణ్యుడువు అవుతావు.

Thursday, 9 October 2025

నారదుడి తల్లి మృతి

నారదుడిని వ్యాసుడు ఇంకా ఇంకా తన జన్మ వృత్తాంతము,విశేషాలు తెలుపమని ఇలా అడిగాడు.ఓ నారద మహర్షీ!నీకు ఆ మహనీయులు నారాయణ మంత్రము ఉపదేశించారు అని అన్నావు.దాని సహాయంతో విజ్ఞాన సముపార్జన చేసాను అన్నావు.బాగానే ఉంది.అసలు నీవు బాల్యము నుండి వృద్ధాప్యము వరకు ఏమేమి చేసావు.నీవు దాసీ పుతృడవు కదా!ఆ దాస్యము ఎట్లా పోయింది?పూర్వజ్ఞానము అనేది అందరికీ అంత సులువుగా దక్కదు కదా!నీకెట్లా అబ్బింది?ఈ విషయాలు అన్నీ వివరంగా విశద పరిచేది. నారదుడు వ్యాసుడి తపనను అర్థం చేసుకున్నాడు.ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.వ్యాసా!నీకు చెప్పినట్లుగా నాకు యోగుల దయ వల్ల జ్ఞానము లభించింది.మా అమ్మకూడా మంచి జ్ఞానము గల శాంత మూర్తి.ఆమె తన యజమానుల ఇంటి పనులను శ్రద్ధగా చేస్తూ ఉండేది.భక్తి భావంతో ఒక యజ్ఞంలాగా నిష్టగా,నియమ బద్థంగా చేసేది.ఇంక ఆ పనిలో పడితే రాత్రి లేదు,పగలు లేదు.అయ్యో అలసిపోయాను,కొంచెం సేద దీరుతామనే స్పృహ ఉండేది కాదు.విసుగు,చీదర,చిరాకు అనేవి ఆమెకు అస్సలు తెలియదు.అలాగే ఒకరోజు రాత్రిపూట చీకటిలో పాలు పితికేదానికి పోయి,పామును తొక్కింది.పాముకు తన,మన అని ఉండగు కదా!అది దాని సహజగుణంతో కాటేసింది.పాము కాటుకు ఆమె మరణించింది.నాకు దిగులు,విచారము అనిపించలేదు.ఒకరకమైన నిర్వికారము,నిర్విచారములకు లోనైనాను.మాఅమ్మ ఆఇంట్లో పని చేసేది కాబట్టి అక్కడ ఇన్ని రోజులు ఉన్నాను.ఆమే లేనప్పుడు ఆ ఇంటితో నాకు ఇంక ఏ సంబంధం లేదు కదా!అందుకని ఆ ఇల్లు విడిచి ఉత్రదిక్కుగా నడచి వెళ్ళిపోయాను.ఎన్నో ఊళ్ళూ,ఇంకెన్నో పట్టణాలూ,గ్రామాలూ,ప్రాంతాలూ దాటుకుంటూ వెళ్ళాను.ఆకలి,దాహం పీడిస్తున్నాయి.దారిలో మంచి నీటితో ఉన్న నది కనిపించింది.అక్కడే స్నానము చేసి,దాహము తీర్చుకున్నాను.నా అలుపు,అలసట,ఆకలిదప్పులూ అన్నీ మాయమైపోయాయి.

Monday, 6 October 2025

నారదుడి పూర్వ జన్మ

నారదుడు ఇలా చెప్పసాగాడు.ఓ వ్యాస మునిపుంగవా!సంసారము అనేది మహా సముద్రం లాంటిది.కర్మవాంఛలు అనేవి అలలూ,ఆటూపోట్లు లాంటివి.మనిషి ఆ అల్లకల్లోలంతో వేదన చెందుతాడు.ఆ కష్టాలనుంచి విముక్తిని ఇచ్చే నావ ఈ విష్ణు గుణవర్ణనము.నేను నీకు నా పూర్వ జన్మ వృత్తాంతము గురించి చెబుతాను.నీకు బాగా అర్థం అవుతుంది ఈ విషయము.పూర్వ జన్మలో నేను ఒక దాసి కి పుట్టాను.ఆమె వేదాధ్యయనము చేసే సంపన్నుల ఇంట్లో పనులు చేసేది.ఒకసారి వాళ్ళు నన్ను వానాకాలము నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్షలో ఉండే ఋషులకు సేవచేయమని పంపారు.నేను వారికి సేవలు చేసుకుంటూ ఉన్నాను.నేను వయసుకి బాలుడు అయినా తోటి పిల్లలతో ఆడుకునేదానికి పోకుండా ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ సేవలు చేసేవాడిని.వారు నన్ను,నా పనితనాన్ని చూసి ముచ్చట పడ్డారు. ఆ మునులు ఎప్పుడూ శ్రీమన్నారాయణుని చరిత్ర పారాయణం చేస్తూ ఉండేవారు.ఆ హరి సంకీర్తన నాచెవులకు చాలా ఇంపుగా ఉండేది.నేను కూడా వారితో కలసి ఎప్పడూ హరినామస్మరణచేస్తూ ఉండేవాడిని.వారు సంవాదనల సారము గ్రహించాను.శరీరము మాయా కల్పితము.సంసారము నిస్సారము. చాతుర్మాస దీక్షఅయిపోయింది.వారంతా తీర్థయాత్రలకు బయలుదేరారు.నా నడవడిక,హరిపై నా అనురక్తి గమనించారు.నాకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు.నేను భక్తి పారవశ్యముతో వాసుదేవ,ప్రద్యుమ్న,సంకర్షణ,అనిరుద్ధ అని జపించేవాడిని.భగవంతుడి దయవలన నాకు విజ్ఞానము సంప్రాప్తించింది.

Sunday, 5 October 2025

వ్యాస నారదుల సంవాదం

నారదుడికి వ్యాసుడు ఇలా సమాధానం ఇస్తున్నాడు.ఓ నారద మహర్షీ!నీవు బ్రహ్మ దేవుడి కుమారుడివి.మీ తండ్రి సమస్త సృష్టికి కర్త.నీవు ఎప్పుడూ నారాయణుని స్మరిస్తూ,ఆయన సన్నిథిలో కాలం వెళ్ళబుచ్చుతుంటావు.నీ ప్రబోధం అన్ని మూలలూ,దిక్కులూ వ్యాపించి ఉంది.సూర్యుడి గమనంతో సమానంగా నీవు కూడా మూడు లోకాలూ తిరుగుతుంటావు అలుపూ సొలుపూ లేకుండా!నీవు సర్వజ్ఞుడివి.కాబట్టి అందరి మనసులలో మెలగుతూ ఉంటావు.నీకు అన్ని ధర్మాలూ తెలుసు.నా అసంతృప్తి ఏందో,ఎందుకో నిజంగా నీకు తెలియదా?నా ఈ కలవరము,కలత చెప్పి,నా దిగులు,విచారము,మనస్తాపమూ అన్నీ తగ్గేలా చేసేది. వ్యాసుడికి నారదుడు ఇలా ఉత్తరము ఇచ్చాడు.ఓ మునిసత్తమా!నీవు మహాభారతాన్ని రచించావు.అది సర్వ ధర్మాలనూ వివరించింది.కానీ అందులో శ్రీ మహా విష్ణువు యొక్క కధలను చెప్పలేదు.ధర్మాలు,ధర్మసూక్ష్మాలు ఎన్ని చెప్పినా అది అసంపూర్ణమే.ఎందుకంటావా?విష్ణుమూర్తి గుణగణాలను కూడా కీర్తించాలి.ఆ మహావిష్ణువు యొక్క వర్ణనలు,ఆ మహానుభావుడి గుణగానాలు చేయలేదు కాబట్టే నీకు ఆ అసంతృప్తి కలుగుతున్నది.ఆయనను స్తుతించే కావ్యము,రచన బంగారు పద్మాలతో విరాజిల్లే మానస సరోవరం లాగా కళకళలాడుతూ శోభాయమానంగా విరాజిల్లుతుంది.శ్రీహరి నామాల స్తుతి,వర్ణనలు లేని కావ్యము ఎంత ఛందోబద్ధంగా,సుందరంగా ఉన్నా శోభావిహీనంగా ఉంటుంది.పేలవంగా,హృదయంలేని దానిలాగా తేలిపోతుంది.ఒక రకంగా చెప్పాలంటే బురదతో నిండిన నరకకూపంలాగా ఉంటుంది.ఊపిరి ఆడనట్లు ఉంటుంది.పదాలు,పదప్రయోగాలు దోషంతో ఉన్నా విష్ణువు కథలతో ఉంటేచాలు.మనసు,హృదయం ఉన్నట్లు కళకళలాడుతూ ఉంటుంది.అది సర్వ పాపాలను హరిస్తుంది.అంతర్గత శోభతో నిండి ఉంటుంది.ఎందుకంటే హరి భక్తి లేని చోట జ్ఞానవికాసానికి ఆస్కారం లేదు.ప్రతిఫలాక్ష లేకుండా చేసే ప్రతి పనిని ఈశ్వరుడికి సమర్పణ చేసుకోవాలి.అలా చేయకపోతే దానికి విలువ ఉండదు.భక్తి లేని కర్మ,జ్ఞానములకు అర్థము లేదు.అవి ముమ్మాటికీ నిరర్థకాలే.వ్యాస మహర్షీ!నీవు మహానుభావుడివి.గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాడివి.సత్య సంధుడివి.నీవు అన్ని బంధాలనుంచి విముక్తి పొందాలంటే వాసుదేవుని లీలామానుష విశేషాల గురించి ఏకరువు పెట్టు.భక్తి ప్రపత్తులతో ఆ దైవకార్యం నిర్వర్తించు.అన్నీ తెలిసిన వాడు హరి సేవకు నడుము బిగించాలి.కష్టాలు,నష్టాలు,సుఖదుఃఖాలు అనేవి వస్తుంటాయి,పోతుంటాయి.వాటిని చూసి భయపడకూడదు.ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా హరిని,హరి సేవను వదలకూడదు.హరి సేవ చేసుకునేవాడు సంసారము చేస్తున్నా,మానసికంగా ఆ జంఝాటంలో పడడు.తామరాకు మీద నీటి బొట్టు చందాన అంటీ అంటనట్లు ఉండగలడు.హరినామ స్మరణ జీవిత పరమావధిగా పెట్టుకుంటాడు.అతనికి అంతా విష్ణుమయంగానే ఉంటుంది.హరి అనేవాడు పుణ్యమూర్తి.అతని ఆశ్రయంలో,ఆధీనంలో అంతా మంచే జరుగుతుంది.కోరినవన్నీ దక్కుతాయి.

గీతా గంగా చ గాయత్రీ…గీత పేర్లు

గీతా గంగా చ గాయత్రీ సీతా సత్యా సరస్వతీ। బ్రహ్మవిద్యా బ్రహ్మవల్లీ త్రిసంధ్యా ముక్తిగేహినీ॥ అర్థమాత్రా చిదానందా భవఘ్నీ భ్రాంతినాశినీ। వేదత్రయీ పరాఽనంతా తత్వార్థ జ్ఞానమంజరీ॥ ఇత్యేతాని జపేన్నిత్యం నరో నిశ్చల మానసః। జ్ఞానసిద్ధిం లభేచ్ఛీఘ్రం తథాన్తే పరమం పదమ్॥ గీతకు మొత్తం పద్దెనిమిది పేర్లు ఉన్నాయి.అవి.... గీత గంగ గాయత్రీ సీత సత్య సరస్వతి బ్రహ్మవిద్య బ్రహ్మవల్లి త్రిసంధ్య ముక్తిగేహిని అర్థమాత్ర చిదానంద భవఘ్ని భ్రాంతినాశిని వేదత్రయి పర అనంత తత్త్వార్థ జ్ఞానమంజరి. ఈ పేర్లను,ఈ గీత యొక్క నామాలను ఎవరు నిశ్చలమయిన మనసుతో సతతం జపిస్తూ ఉంటాడో,అతనికి త్వరితగతిని జ్ఞానము సమకూరుతుంది.జ్ఞానసముపార్జన వలన సునాయాసంగా పరమాత్మ యొక్క సన్నిధానము,ఆ పరమ పవిత్రమయిన పరమ పదము దక్కుతుంది.

Wednesday, 1 October 2025

నారదుడు అక్కడకు వచ్చాడు

వ్యాసుడు దిగులు పడుతున్నాడు.అక్కడకు నారదుడు వచ్చాడు.ఆయన ఎప్పుడూ మహతీ వీణను వాయించికుంటూ,నారాయణ స్మరణ అనునిత్యం చేసుకుంటూ తిరుగుతుంటాడు కదా!నిజంగా మహానుభావుడు!వ్యాసుడు నారదుడి రాకను దూరంనుంచి చూసాడు.ఆనందంగా,ఆదరంగా ఆయనకు ఎదురు వెళ్ళాడు.సంతోషంగా ఆయనను తీసుకుని వచ్చి,అర్ఘ్యపాద్యాలతో సత్కరించుకున్నాడు.నారదుడికి వ్యాసుడిని చూడగానే అర్థమయిపోయింది ఎందుకో ఎడతెరిపి లేకుండా దిగులు పడుతున్నాడని.నారదుడు ఆప్యాయంగా,అనునయంగా వ్యాసుడితో ఇలా మాటలాడటం మొదలు పెట్టాడు.ఓ మహర్షీ!నువ్వు చిన్నా చితకా వాడివి కాదు.వేదాలను విభజించిన ప్రతిభాపాటవాలు ఉన్న వాడివి.భారతము అంటే పంచమ వేదము అంటారు.ఆ మహాకావ్యాన్నే రచించావు.కామ క్రోథ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలనే సునాయాసంగా జయించావు.నీకు బ్రహ్మతత్త్వము తెలుసు.మునులుకు,యోగులకు,సాథువులకు నాయకుడివి.ఇన్ని గొప్ప గుణాలు ఉన్న నీకు దిగులుకు కారణం ఏంది?ఎందుకు అంత బేలగా,పిరికివాడిలాగా దిగులు విచారంలో మునిగి ఉన్నావు?

Monday, 29 September 2025

వ్యాసుడి పుట్టుక…వేదముల విభజన

సూతుడికి భలే సంతోషంఅయింది,శౌనకాది మునులు అట్లా అడిగేటప్పటికి.ఊపూ ఉత్సాహంతో చెప్పడం మొదలు పెట్టాడు.మూడవ ద్వాపర యుగము ముగిసింది.ఉపరిచర వసువుల వలన వాసవి పుట్టింది.ఆమెకు సత్యవతి అని ఇంకో పేరు కూడా ఉంది.ఆమె యందు పరాశర మునికి వ్యాసుడు పుట్టాడు.వ్యాసుడు విష్ణువు అంశతో పుట్టాడు.అతను మహా జ్ఞాని.అతను బదరికాశ్రమములో ఉండేవాడు.ఒకరోజు దగ్గరలోనే ఉండే సరస్వతీ నదీ తీరంలో స్నానపానాదులు ముగించుకుని వచ్చాడు.ప్రశాంతంగా ఎవరూలేని ఏకాంత ప్రదేశంలో,సూర్యోదయ సమయంలో యుగధర్మాల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అతని మనసుకి ఇలా అనిపించింది.లోకంలో మానవులకు ఆయుష్షు తక్కువ.బలహీనంగా ఉంటారు.జవసత్త్వాలు తొందరగా నశిస్తాయి.దాని కారణంగా ధైర్యము ఉండదు.కాబట్టి సర్వ మానవకోటికి హితవుగా ఏమైనా చేయాలని కంకణం కట్టుకున్నాడు. అతడు నలుగురు హోతలచేత అనుష్టింపదగినవి,ప్రజలకు మంచి చేసే యజ్ఞాలు నిరంతరం చేయించాలనుకున్నాడు.నాలుగు వేదాలు అన్నీ కలగాపులగం అయిపోయి ఉన్నాయి.వాటిని మంచిగా నాలుగు వేదాలుగా విభజించాడు.అవి ఋగ్వేదము,సామవేదము,యజుర్వేదము మరియు అధర్వణ వేదము.విభజించడంతో ఊరుకోలేదు.అతను ఓపికగా ఋగ్వేదాన్ని పైలునకు,సామవేదం జైమినికి,యజుర్వేదం వైశంపాయునికి అధర్వణ వేదం సుమంతునికి బోధించాడు.తాను చెప్పిన పురాణాలు,ఇతిహాసాలను రోమహర్షణ మహామునికి బోధించాడు.రోమహర్షణుడు ఇంకెవరోకాదు,స్వయానా సూతుడి తండ్రి.పైలుడు,జైమిని,వైశంపాయనుడు,సుమంతుడు వాళ్ళకు చెప్పబడిన వేదాలను విభజించి వారి వారి శిష్యులకు చెప్పారు.ఈ రకంగా వేదాలను చిన్న చిన్న భాగాలు చేసారు.కాలక్రమేణా ఆ వేదాలు అజ్ఞానుల నోళ్ళలో కూడా పడ్డాయి.వ్యాస మహర్షి ఈ విషయం గమనించాడు.అందుకని పామరులకు,స్త్రీలకు,మందబుద్ధి గల వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా మహాభారతం రచించాడు.మహా భారతానికి పంచమ వేదము అనే పేరు కూడా వచ్చింది.ఇంత చేసినా వ్యాసుడికి వ్యాకులత పోలేదు.ఏదో అసంతృప్తి.ఇంకేదో దిగులు,విచారమూ పట్టుకున్నాయి.మనసును లాగేసే ఈ కలత,కలవరపాటుకు కారణం ఏంది అని సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఆలోచించటం మొదలుపెట్టాడు.అప్పుడు తోచింది.ఏమని అంటే ...శ్రీహరికి,యోగులకు,మునులకు ఇష్టము అయిన భాగవతము చెప్పాలనే ఆలోచన ఇన్ని రోజులు రాక పోవటమే అని.నా దిగులు,విచారం,మనోవ్యాకులతకు కారణం ఖచ్చితంగా ఇదే అని నిర్ధారణకు వచ్చాడు.

Thursday, 25 September 2025

శుక మహర్షి గొప్పదనం

శౌనకాది మహా మునులు సూతుడు చెప్పిన మాటలు విన్నారు.వాళ్ళందరూ ముక్త కంఠంతో ఇలా అడిగారు. ఓ సూత మునీంద్రా!అసలు దీనికి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి?ఈ భాగవతాన్ని రచించమని ఏయుగంలో ఎవ్వరు అడిగారు?ఎక్కడ అడిగారు?ఎందుకు అడిగారు? శుక మహర్షి వ్యాసుని కొడుకు.అతడు మాయా మోహాన్ని అతిక్రమించిన వాడు.స్వపర భేదం లేకుండా సమస్తాన్ని సమానంగా చూడగలుగుతాడు.చూస్తాడు.పరబ్రహ్మను కనుగొన్నాడు.ఎప్పుడూ ఏకాంతవాసం కోరుకుంటాడు.అతడికి అందరూ సమానమే!ఎంతలా అంటే స్త్రీ పురుష విచక్షణ కూడా కనబరచడు.అసలు లేదు.దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది.అది ఇలా సాగుతుంది. ఒకరోజు శుక మహర్షి దిగంబరంగా దారిలో వెళుతున్నాడు.ఆ ప్రక్కనే దేవతా స్త్రీలు వివస్త్రలయి జలక్రీడలు ఆడుకుంటూ ఉన్నారు.వారు ఈయనని చూడగానే అలాగే బయటకి వచ్చి ఆయనను పిలుస్తూ ఆయన వెనక వెళ్ళారు.శుక మహర్షి వారిని గమనించకుండా,తన దారిన తాను వెళ్ళిపోయాడు.ఇంకొంత దూరంలో వ్యాస మహర్షి వస్తూ వాళ్ళకి కనిపించాడు.వాళ్ళందరూ సిగ్గు పడిపోయి,మెలికలు తిరుగుతూ,గబగబా వస్త్రాలు ధరించారు. వ్యాసుడికి అర్థంకాలేదు.తన కొడుకు వెనక వివస్త్రలయి పరిగెత్తారు.వార్థక్యంలో ఉన్న తనను చూసి వారందరూ సిగ్గు పడుతున్నారు.ఉండ బట్టలేక అడిగేసాడు.ఓ దేవతా యువతులారా!నా కుమారుడు యువకుడు.యవ్వనంలో ఉన్నాడు.అందులోనూ బట్టలు లేకుండా వెళుతున్నాడు.మీరు ఏమో సిగ్గు విడిచి,వస్త్రములు ఒంటి పైన లేక పోయినా,అతనిని పిలుస్తూ,అతని వెంట పడ్డారు.నా విషయానికి వస్తే,నేను ముసలి వాడను.జవసత్త్వాలు ఉడిగిన వాడిని.దానికి తోడు శుభ్రంగా,మర్యాదపూర్వకంగా బట్టలు ధరించాను.ఎందుకు నన్ను చూడగానే మీరందరూ సిగ్గు పడ్డారు?ఎందుకు వస్త్రములను ధరించారు? దానికి ఆ యువతులు ఇలా జవాబు చెప్పారు.ఓ మహర్షీ!నీ కుమారుడు అన్నిటికీ అతీతుడు.అతనికి స్వపర భేదం లేదు,స్త్రీ పురుష భేదం అసలే లేదు.అతడు నిర్వికల్పుడు.అతను నిశ్చలమయిన మనసు కలవాడు.నీకు,అతనికి పోటీ ఏంది?నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అట్లాంటి శుక యోగి కురు జాంగల దేశాలను ఎందుకు ప్రవేశించాడు?హస్తినాపురానికి ఎందుకు వెళ్ళాడు?పరీక్షిత్తు మహారాజుకు ఎందుకు భాగవతం చెప్పాడు?భాగవతము అంటే కాకమ్మ పిచుకమ్మ కథ కాదు కదా!అది పూర్తిగా చె ప్పాలంటే చాలా కాలం పడుతుంది కదా!శుక మహర్షి ఎక్కడా,ఎప్పుడూ,ఎక్కువ సేపు ఉండడు. ఆఖరికి మనము ఇండ్లలో ఆవుకు పాలు పితికినంత సేపు కూడా ఉండలేడు.అట్లాంటి ఆయన ఎంతో కాలము ఒకే చోట ఉండి,ఎట్లా భాగవతము చెప్పాడు?అసలు పరీక్షిత్తు మహారాజుకు ఏమైంది? ఆయనకు విరక్తి ఎందుకు కలిగింది?అసలు గంగ నడుమ ఉండే దానికి కారణం ఏంది? స్వామీ!మా మనసుల నిండా ప్రశ్నలే!వాటన్నిటికీ మాకందరికీ సమాథానం కావాలి.కాబట్టి దయచేసి మా విన్నపాలు మన్నించి,మాకు అన్నీ వివరణగా చెప్పండి.

Wednesday, 24 September 2025

నారాయణుని చరిత్రే భాగవతమంటే!

ఆ తరువాత సూతుడు శౌనకాది మహామునులతో భాగవతము,దాని గొప్పదనం గురించి ఇలా చెప్పాడు.ఓ మహామునులారా!నారాయణుడు భగవంతుడు.భాగవతము అనేది ఆ భగవంతుని చరిత్ర.ఇది అన్ని పురాణాల సారము.దీనికి మించిన పుణ్య కావ్యము,గ్రంథము మరొకటి లేదు.వ్యాస మహర్షి భగవంతుని అవతారము.కాకపోతే ఇంత ప్రముఖమయిన గ్రంథాన్ని రచించగలుగుతాడా?ఆయన తన ఈ రచనను తన కొడుకు అయిన శుక మహర్షికి చెప్పాడు.పరీక్షిత్తు మహారాజు విరక్తి,వైరాగ్యముతో ఉన్న సమయంలో మునులతో ఉన్నాడు.అప్పుడు ఆయన కోరిక మేర శుక మహర్షి భాగవతమును వారందరికీ చెప్పాడు.శ్రీకృష్ణుని నిర్యాణము అందరికీ శరాఘాతం లాంటిది.ఆ మహానుభావుడితోటే ధర్మజ్ఞానము కూడా అంతరించింది.కలియుగము తన తొలి అడుగు పెట్టింది.ఇంకేముంది?దోషములు అనే చీకట్లు,అజ్ఞానము అనే సుడిగాలులు లోకమంతా విస్తరించాయి.జనులకు ఏది ఒప్పు,ఏది తప్పు,ఇంకేది సరి అయిన మార్గం?అనే మీమాంస అడుగడుగునా తలెత్తింది.వారికి దారి తెన్ను లేకుండా,అనాథలు అయిపోయారు.వారందరికీ ముఖ్యమయిన ఈ భాగవతాన్ని నాకు తెలిసిన విథంగా మీకు చెబుతాను.శ్రద్థగా వినండి.

Tuesday, 23 September 2025

భగవంతుని అవతారాలు ఇంకొన్ని

దేవతలు,దానవులు ఒకసారి పాలసముద్రాన్ని అమృతం కోసరము చిలికారు.అప్పుడు శ్రీహరి కూర్మరూపంలో మంథర పర్వతాన్ని తన వీపు పైన నిలిపి ఉంచాడు.ఈ కూర్మరూపము పదకొండవ అవతారము.పాల సముద్రాన్ని మథించిన తరువాత ధన్వంతరి అయి అమృత కలశం ను తీసుకుని వచ్చాడు.భగవంతుని పండ్రెండవ అవతారము ధన్వంతరి అవతారము.అమృతాన్ని దేవతలకు,దానవులకు సమముగా పంచాలి అని అన్నారు. అప్పుడు మోహినీ రూపంలో దానవుల కళ్ళు గప్పి మోసం చేసి అమృతం అంతా దేవతలకు పంచి పెట్టాడు.ఈ మోహినీ రూపమే ఆయన పదమూడవ అవతారము.ఆ తరువాత కాలంలో హిరణ్య కశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు.ప్రహ్లాదుడు,హరి భక్తుడు అతని కొడుకు.ప్రహ్లాదుడిని రక్షించేదానికి నరసింహావతారము ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరించాడు తన గోళ్ళు,కోరలతో!ఈ నరసింహావతారమే ఆయన పదునాల్గవ అవతారము.బలి చక్రవర్తిని మూడడుగుల స్థలం అడిగాడు వామనావతారములో వచ్చి.ఆయన ఒప్పుకోగానే,ఇంతింతై వటుడింతై మూడు లోకాలనూ ఆక్రమించాడు.ఈ వామనావతారమే పదహైదవ అవతారము.జమదగ్నికి భార్గవరాముడుగా పుట్టడం ఆయన పదహారవ అవతారము.ఈ అవతారములో క్రోధమూర్తిగా ఉంటూ బ్రాహ్మణులకు ద్రోహము తలపెట్టిన క్షత్రియులను తుద ముట్టించాడు.పదహేడవ అవతారములో బాదరాయణుడిగా పుట్టాడు.ఈ అవతారములో కలసిపోయి ఉన్న వేదాలను విభజించాడు.పదునెనిమిదవ అవతారములో శ్రీరాముడిగా జన్మించాడు.ఈ అవతారములో దశరథుడికి పుత్రుడు అయ్యాడు.సముద్రమును దాటి రాక్షస రాజు అయిన రావణాసురుడుని హతమార్చాడు.మునులను కాపాడాడు.పందొమ్మిదో అవతారములో శ్రీకృష్ణుడు,బలరాముడుగా పుట్టాడు.ఈ జన్మలో దుష్టులు అయిన రాక్షసులను,రాజులను తుద ముట్టించారు.అలా భూభారాన్ని తగ్గించారు.కలియుగములో బుద్ధుడి అవతారము ఎత్తుతాడు.మధ్య గయా ప్రదేశమున పుడతాడు.యుగసంధి సమయములో రాజులు చోరప్రాయులు అవుతారు.అప్పుడు విష్ణుయశుడు అనే బ్రాహ్మణునికి కల్కిరూపంతో పుట్టి జనులను ఉద్ధరిస్తాడు. ఇలా భగవంతుడి లీలల గురించి తెలిపే గ్రంథమే భాగవతము.

Sunday, 21 September 2025

భగవంతుని అవతారాలు

భగవంతుని అవతారాల గురించి చెప్పుకుందాము.అన్ని అవతారాలకంటే మొదటి అవతారము నారాయణుడిదే.అతడి నాభి,అనగా బొడ్డు నుంచి వచ్చిన కమలములో బ్రహ్మ పుట్టాడు.అతడి అవయవములనుండి సకల లోకాలు ఉద్భవించాయి.అతడు కౌమారావస్థలో బ్రహ్మణ్యుడు అయి ఘోరమయిన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు. ఇప్పుడు అతని రెండవ అవతారము గురించి చెప్పుకుందాము.భూమి క్రుంగి పోతుంటే,అది ఆపేదానికి వరాహ అవతారము ఎత్తాడు.నారదుడుగా మూడవ అవతారము ఎత్తాడు.ఈ రూపంలో కర్మల నుండి విముక్తి ప్రసాదించే వైష్ణవ తంత్రాన్ని ఉపదేశించాడు.నాలుగో అవతారములో నరనారాయణుల రూపము ధరించి ఘోరమయిన తపస్సు చేసాడు.అయిదవ అవతారములో కపిల మహర్షిగా పుట్టాడు.ఈ రూపంలో ఆసురి అనే బ్రాహ్మణుడికి తత్త్వమును నిర్ణయించే సాంఖ్యమును ఉపదేశించాడు.ఆరవ అవతారములో అత్రిమహామునికి,అనసూయాదేవికి దత్తాత్రేయుడుగా జన్మించాడు.ఈ రూపంలో అలర్కునికి,ప్రహ్లాదుడు మున్నగువారికి తత్త్వబోధ చేసాడు.ఏడవ అవతారంలో రుచికి ఆకూతి యందు యజ్ఞుడు అనే పేరుతో కుమారుడుగా పుట్టాడు.ఈ రూపంలో యముడు,ఇతర దేవతలతో కలసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.అష్టమ అవతారంలో మేరుదేవి యందు నాభికి ఉరుక్రముడు అనే పేరుతో పుత్రుడుగా జన్మించాడు.ఈ జన్మలో విద్వాంసులకు పరమహంస మార్గమును బోధించాడు.ఋషులు అందరూ ప్రార్థించగా తొమ్మిదో జన్మలో పృధు చక్రవర్తిగా పుట్టాడు.ఈ జన్మలో భూమిని గోవుగా చేసి సమస్త వస్తువులను పిదికాడు.చాక్షుష మన్వంతరములో పదవ అవతారంగా మత్స్య రూపం ధరించాడు.ఈ రూపంలో భూరూప మయిన నావను ఎక్కించి వైవస్వతమనువును ఉద్ధరించాడు.

Friday, 19 September 2025

హరి సత్త్వగుణ సంపన్నుడు

ఇప్పుడు ఇక్కడ ఇంకో విశేషము ఉంది.కట్టెకంటే పొగ మేలు.పొగ కంటే అగ్ని మేలు.అచ్చం అలాగే తామస గుణము కంటే రజోగుణము మంచిది.రజోగుణము కంటే సత్త్వ గుణము విశిష్టమయినది.ఎందుకంటే సత్త్వగుణము బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది.కాబట్టి మునులు అందరూ సత్త్వ గుణ సంపన్నుడు అయిన హరినే సదా సేవిస్తారు.అందరికీ మేలు కలగాలి అని భావించేవారు భగవంతుడిని సేవిస్తారు.మోక్షము కావాలి అనుకునేవారు ఎవరినీ నిందించరు.శాంత చిత్తంతో నారాయణుని కథలు వింటుంటారు.ఎందుకంటే మనకు మోక్షము ఇచ్చేది ఆ నారాయణుడే కదా!అన్ని ధర్మాలు అతనినే మోక్షానికి మార్గం అని చూపెడతాయి.ఆ పరబ్రహ్మ సత్త్వ రజస్తమో గుణములచే యుక్తమయిన లోకాన్ని సృజిస్తాడు.చెడు పెరిగి నప్పుడు,లోక కళ్యాణం కొరకు వివిధరూపాలలో పుడతాడు.అతడు పురుష రూపములో సముద్రం మధ్యలో యోగనిద్రలో ఉంటాడు.

Thursday, 18 September 2025

సూతుడి పలుకులు

సూతమహర్షిని శౌనకాది మునులు అలా కోరారు.అప్పుడు ఆయన శుకయోగికి,నరనారాయణులకు,సరస్వతీదేవికి,వ్యాస మహర్షికి నమస్కరించాడు. శుకయోగి అంతటినీ,అందరినీ సమానంగా చూసేవాడు.సమస్త కర్మలను విడనాడి,సన్న్యాసి అయిన వాడు.సూతమహర్షి ఇలా అన్నాడు.మునీంద్రులారా!హరిభక్తి మానవులకు పరమధర్మము.ఆ హరి భక్తి ఎలాంటి ఆటంకాలు,అవరోధాలు లేకుండా సాగాలి.ఎందుకు,ఏమిటి,ఎలా,ఎక్కడ,ఎప్పుడు అని కారణాలు,సాకులు లేకుండా నిర్హేతుకంగా,నిరాటంకంగా సర్వకాల సర్వావస్థలయందు కొనసాగాలి.అది ఒక యోగము,యాగము,యజ్ఞము కావాలి.అప్పుడు మనకు వైరాగ్యము,విజ్ఞానము,విజ్ఞత ప్రాప్తిస్తాయి.నారాయణుని గురించి కథలు,విషయాలు చెప్పని ధర్మాలకు అర్థం,పరమార్థం ఉండదు.వాటి వల్ల లాభం లేదు.సారం లేని చెరకు పిప్పిలాంటివి అలాంటి ధర్మాలు.జ్ఞానము,వైరాగ్యముతో కలిసిన భక్తియోగమే మానవుడికి పరమాత్మను చూపిస్తుంది.నిశ్చలమయిన మనసుతో,నిరంతరం గోవిందుని వినినా,వర్ణించినా,ధ్యానించినా ముక్తి,మోక్షం లభిస్తాయి.మనకు భగవంతుడి మీద శ్రద్ధ,ఆసక్తి ఉండాలి.మోక్షానికి తలుపులు తెరిచే భగవంతుడి కథలు వినాలనే ఆసక్తి మెండుగా ఉండాలి.ఇలా చేస్తే పుణ్య తీర్థాలలో స్నానం చేస్తే,పెద్దలకు సేవ చేస్తే వచ్చే పుణ్యము దక్కుతుంది.శ్రీకృష్ణుని కథల యందు ఆసక్తి ఉండే వారికి ఇంకేదీ రుచించదు.తేనెను జుర్రుకున్నట్లు జుర్రుకోవాలి అనిపిస్తుంది.చెవులలో అమృతము పోసినట్లు ఉంటుంది కృష్ణలీలలు వింటుంటే.శ్రీకృష్ణుడు తన కథలు వినేవారి మనసులలో నిలిచి ఉంటాడు.వారికి ఎప్పుడూ శుభములు చేకూరేలా చేస్తుంటాడు.ఎలాంటి చెడూ జరగకుండా చూసుకుంటాడు.అశుభములు నశిస్తే నిశ్చలమయిన భక్తి కలుగుతుంది.మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది.మనసు రజోగుణము,తమోగుణముల వలన కలిగే కామక్రోథమదలోభాలకు బలికాదు.సత్త్వగుణము పెంపొందుతుంది.దాని వలన ప్రసన్న మనస్కుడు అవుతాడు.ప్రసన్నంగా ఉండేవాడు ముక్తసంగుడు అవుతాడు.ముక్తసంగుడు అంటే అహం లేనివాడు.ప్రాపంచిక విషయాలకు అతీతంగా ఉండేవాడు.భవబంథాలకు దూరంగా ఉండేవాడు.అంతా నాదీ,నేనే అనే అజ్ఞానం నుంచి బయట పడినవాడు.కాబట్టి భగవంతుడు యొక్క తత్త్వం,జ్ఞానం తెలుసుకుంటాడు.అహంకారము నశిస్తుంది.అహంకారము నశిస్తే అనుమానాలు,గిలులు పోతాయి.దాని ప్రభావంగా కర్మలు నశిస్తాయి.

Wednesday, 17 September 2025

నారాయణుని నామ మహిమ

కలి దోషములు అన్నీ నారాయణుని కీర్తన వలననే నశిస్తాయి.అందుకే ఉత్తములు ఆయనను నిత్యమూ స్తుతిస్తూ ఉంటారు.విష్ణునామ సంకీర్తన అనేది దావానలంలాంటిది.దాని సెగకు,పొగకూ,మంటలకు కీకారణ్యాలు లాంటి పాపాల పుట్టలు చిటెకలో భస్మమయిపోతాయి.సూర్యుని కిరణాలతో చీకటి ఎలా పటాపంచలు అవుతుంది?అచ్చం అలాగే నారాయణుని స్మరిస్తే కామము,క్రోధము,లోభము,మోహము,మదము,మాత్సర్యము అనేవి కంటికి కనిపించకుండా మాయమయిపోతాయి.నరహరి బలరాముడుతో కలసి ఎన్నేసి గొప్ప పనులు చేసాడు.మానవాళి అంతా అచ్చెరువు అయేలా చేసాడు కదా!ఆ మహానుభావుని చరిత్ర వినాలని మాకంతా కుతూహలముగా ఉంది.మా చెవులకు ఉండే తుప్పు అంతా పోయేలా ఆ మహావిష్ణువు కథలు వినాలని ఉంది.ఈ భవసాగరము ఈదాలంటే సామాన్య మానవుడికి వల్ల కాదు.ఎవరిదైనా ఆపన్నహస్తంకావాలి.కలి దోషములు పోగొట్టుకోవాలనే తపనలో మేమందరమూ ఉన్నాము.మా అదృష్టం కొద్దీ నీవు మాకు కనిపించావు.శ్రీకృష్ణుడు ధర్మస్థాపనకు పెట్టనికోట.అతడు ఇప్పుడు పరమపదించాడు.ఇంక ఈ లోకంలో ధర్మాన్ని నిలిపేదెవరు?

Tuesday, 16 September 2025

విష్ణు కథలు ఎందుకు వినాలి?

అక్కడ గుమి గూడిన మునులు అందరూ సూతుడితో ఇలా మొర పెట్టుకున్నారు.ఓ మహామునీ!మీకు తెలియనిది ఏముంది?ఈ కలియుగంలో మనుష్యులు అందరూ స్వతహాగా మంద బుద్ధులు.వారి జీవితకాలము చాలా తక్కువ.దానికి తోడు ఏదో ఒక రోగముతో బాథ పడుతుంటారు.కాబట్టి వారికి మంచి పనులు చేసి పుణ్యము సంపాదించే అంత సమయము,సందర్భము,ఇచ్ఛ ఉండవు.ఒక రకంగా చెప్పాలంటే ఉత్తమగతి పొందటం,దక్కించుకోవటం వారివల్ల కానేకాదు.కానీ వారందరూ సులభంగా ఉత్తమగతిని పొంది,ఉత్తమలోకాలకు పోవాలంటే మంచి ఉపాయము చెప్పండి.మనుష్యులకు మనశ్శాంతి ఏమి చేస్తే దక్కుతుందో సెలవీయండి. మాకందరికీ విష్ణువు కథలు వినాలని చాలా తపనగా ఉంది.ఎందుకంటారా?ఎవరి రూపం చూడగానే భయంతో రాక్షసులు ప్రాణభయంతో పరుగులు పెడతారు?శ్రీమహా విష్ణువు కదా!ఏ దేవుడి నామ జపం వల్ల లోకంలో ఉండే అన్ని పాపాలు పటాపంచలు అవుతాయి? శ్రీహరి నామమే కదా!ఎవరి చరిత్ర మనసులో తలచుకోగానే మృత్యువు కూడా ఆసాంతం భయపడి దరిదాపుల్లోకూడా ఉండకుండా పారిపోతుంది?ఆ విష్ణు దేవుని చరిత్రే కదా!ఏ మహామహుని పాదపద్మాలకు పూజలు చేసి మునులు మనశ్శాంతినీ,ముక్తినీ పొందారు?ఆ శేషశయనుడి కరచరణాలే కదా! కాబట్టి ఓ మునీంద్రా!మాకు విష్ణు కథలు చెప్పి,మమ్ములని చరితార్థులను చేయండి.

Monday, 15 September 2025

సూత మహర్షి గురించి…

రోమహర్షణుడు అని ఒక మహాముని ఉండేవాడు.అతని కుమారుడే సూత మహర్షి.ఇతనికి ఉగ్రశ్రవసుడు అని ఇంకో పేరుకూడా ఉంది.ఇతడు పురాణములకు దిట్ట.ఇతిహాసములకు గని.ధర్మశాస్త్రములకు గొప్ప నిధి.అతను తనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికీ పంచాలి అనే తపన ఉన్నవాడు.కాబట్టి అతను సరళంగా,సామరస్యంగా,సర్వజనామోదముగా,సామాన్యులకు కూడా అర్థము అయ్యేలా వివరించి చెప్పేవాడు.కాబట్టి అందరి మన్ననలకు పాత్రుడు అయ్యేవాడు.కాబట్టి అక్కడ ఉండే మునులందరూ సూతుని చూసి మహదానందపడిపోయారు.సహజమే కదా! అందరూ ఆయన చుట్టూ గుమిగూడారు.ఇలా అడిగారు.ఓ పౌరాణికా!నీవు పురాణాలను అన్నింటినీ ఔపాసన పట్టిన వాడివి.వ్యాస మహాముని కరుణ వలన సమస్త విషయాలు ఎరిగిన వాడవు.నీకు తెలియని ధర్మము,జ్ఞానము అంటూ ఏమీ లేదు.అనుభవజ్ఞులు అయిన పెద్దలకు తెలిసిన అన్ని విషయాలు నీకు తెలుసు.నీవు ఎంతో కాలము నుండి జ్ఞానోఽపాసనలో ఉన్నావు.నీకు అనేక గ్రంథాలలోని రహస్యార్థము,మర్మము తెలుసు.ఇందులో వింత,ఆశ్చర్య పడే విషయము ఏమీ లేదు.నీవు ఇక్కడ ఉన్న మాకందరికీ గురువు లాంటి వాడివి.గురువులు సహజంగా తమ శిష్యులకు ధర్మసూక్ష్మాలూ,మంచి నీతులు బోధిస్తారు కదా!అనేకానేక రహస్యాలను వివరించి,అనుమానాలు తీరుస్తారు కదా!కాబట్టి నీవు మాకు సుస్థిరము అయిన సుఖము ఎలా సంపాదించాలో,కలుగుతుందో చెప్పాలి.

Sunday, 14 September 2025

సత్త్రయాగము ప్రారంభం

ఒకసారి అక్కడ ఋషులు అందరూ కలసి మాటలాడుకున్నారు.ఏమని?వేయి ఏండ్ల కాల పరిమితి గల సత్త్రయాగము చేయాలని.మంచి ముహూర్తం చూసి మొదలు పెట్టారు.ఆ విషయం ముల్లోకాలలోనూ తెలిసింది.ఆ యాగము చూస్తే జన్మ తరిస్తుందని రావటం మొదలుపెట్టారు.అలా వచ్చేవారిలో చాలా మంది దేవతలు,మునులు,రాజులు,పండితులు,సామాన్యప్రజానీకం ఉన్నారు. ఒకసారి అక్కడకు సూతమహర్షి వచ్చాడు.ఆయన ఋషులందరిలోకి ఉత్తమోత్తముడు.ఎల్లప్పుడూ ఈశ్వర ధ్యానం లోనే ఉంటాడు.బహు పురాణవేత్త.అక్కడ ఉండే మునులు అందరూ ఆనందంతో ఆయనకు ఎదురేగారు.గౌరవ మర్యాదలతో తీసుకుని వచ్చారు.అర్ఘ్యపాద్యములు ఇచ్చారు.సముచిత ఆసనం మీద కూర్చోబెట్టారు.

Saturday, 13 September 2025

నైమిశారణ్యంలో గురుశిష్యులు

ఆ నైమిశారణ్యంలో ఉండే మునులు గొప్ప విద్వాంసులు.వారికి సమస్త శాస్త్రాలూ క్షుణ్ణంగా తెలుసు.కాబట్టి వారికి శుశ్రూష చేసుకోవాలి అనే ఇచ్ఛతో నలుమూలల నుంచి,అనేక ప్రాంతాల నుండి వేల సంఖ్యలో శిష్యులు వస్తూ ఉంటారు.వారి ఆశ ఏందంటే ఆ మునులు వీరిని మెచ్చి,వారికి తెలిసిన సమస్త శాస్త్రాలు,పురాణాలు వీరికి నేర్పిస్తారని!ఆ మునులు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా,శిష్యులు కోరిన అన్ని విద్యలూ నేర్పిస్తుంటారు.అక్కడ అందరూ సఖ్యంగా,సామరస్యంగా ఉంటూ భగవద్థ్యానము చేసుకుంటూ ఉంటారు.ఎప్పుడూ ఏదో ఒక యజ్ఞమో,యాగమో చేసుకుంటూ ఉంటారు.ఇలా నైమిశారణ్యము ఎప్పుడూ కళ కళలాడుతూ ఉంటుంది.

Friday, 12 September 2025

కథ మొదలు పెడదామా ఇంక

లోకములోని అన్ని అరణ్యాయలలోకీ నైమిశారణ్యము చాలా ప్రముఖమైనది.ప్రాశస్త్యము కలది.ఉత్తమమైనది కూడా!అక్కడ ఉండే అన్ని వృక్షాలు ఎప్పుడూ కళకళలాడుతుంటాయి.ఎప్పుడూ పూలతోను,రసభరిత పళ్ళతోనూ నిండి ఉంటాయి.రకరకాల హరిత వర్ణాలతో అక్కడ ఉండే చెట్లు అన్నీ శోభాయమానంగా కనువిందులు చేస్తుంటాయి.అక్కడ చాలా మంది మునులు తమ తమ స్థిర నివాసాలు ఏర్పరుచుకుని ఉంటారు.కాబట్టి జనులు,పురప్రజలు సంతోషంగా వారిని చూసి తరించేదానికి వస్తుంటారు. అక్కడ ఇంకో తమాషాకూడా మనం చూడగలతాము.మామూలుగా కృూరమృగాలు సాథుజంతువులను వేటాడుతుంటాయి కదా!కానీ ఇక్కడ అన్నీ ఆలాజాలంగా,సఖ్యంగా,సామరస్యంగా కలసిమెలసి ఉంటుంటాయి.వాటి మధ్య విరోథభావాలు మచ్చుకికి కూడా కనిపించవు.ఐక్యమత్యంగా,హాయిగా,చెట్టాపట్చాలేసుకుని తిరుగుతుంటాయి.దీనికంతటికీ కారణం ఏమనుకుంటున్నారు మీరు?నేను చెప్పనా!ఇంగిత జ్ఞానము లేని జంతువులు కూడా మహామునుల ప్రభావం చేత జాతివైరం మాని,సాథ్యమైనంతగా సాధుజీవితానికి,సఖ్యతకి,సామరస్యానికీ పెద్ద పీట వేసాయి.ఇంతేనా!కాదు,కాదు.ఆ మునులు లాగా ఈశ్వర ధ్యానం చేసుకుంటూ కానవస్తాయి.ఎంత గొప్ప కదా!

Thursday, 11 September 2025

భాగవతము చదివితే…

భాగవతము చదివి,అర్థం చేసుకుంటే సర్వ పాపాలు నశిస్తాయి అని అంటారు.సమస్త సంపదలు దక్కుతాయి.అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞాన సంపద దక్కుతుంది.భాగవతము మనకు ముక్తిని ప్రసాదిస్తుంది.దానిని చదివినా,వ్రాసినా,విన్నా సర్వ పాపాలు నశిస్తాయి.నిత్యమూ ధర్మమార్గంలో నడిచేవారికి శ్రీహరి సులభంగా దక్కుతాడు.ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో,ఆనందంగా విరాట్ స్వరూపుడు అయిన ఆ దేవదేవుని కొలిస్తే కష్టాలు,కలతలు ఉండనే ఉండవు.ఎందుకంటే అన్నిటినీ సమంగా స్వీకరించ గలిగే స్థితప్రజ్ఞత అలవరుతుంది.ఈ విషయం స్వయంగా ఆ పరమేశ్వరుడే వివరించాడు.అందరికీ ధర్మం అర్థం అయి,ఆ దిశగా ప్రయాణం చేయగలిగే వెసులుబాటుకోసం వేదవ్యాసుడు భాగవతాన్ని రచించాడు. భాగవతము అనేది నిజానికి ఒక కావ్యము కాదు.వేదమనే చెట్టుకి కాసి,రసమయమయిన పండుగా మారిన జ్ఞానము.దానిని శుక మహర్షి అనే చిలుక చిరు పంటితో కొరకగా,దానినుంచి కారిన అమృత రసగుళిక ఈ మహిమాన్వితమయిన భాగవత గ్రంథము.దీని నుంచి ఎవరెవరికి ఎంతెంత కావాలో అంతంత ఆస్వాదించ వచ్చు.అది మనతృష్ణను పట్టి ఉంటుంది.ఆ రసాస్వాదనకు అంతం ఉండదు.ఎంత జుర్రుకోవాలంటే అంత జుర్రుకోవచ్చు.ఎలాంటి ఆంక్షలు,ప్రతిబంధకాలు ఉండవు.

Wednesday, 10 September 2025

శ్రీ మహా భాగవతము….।

శ్రీ మహా భాగవతము మనకు చాలా ముఖ్యమైన పురాణ గ్రంథము.వేదవ్యాసుడు ఈ గ్రంథాన్నిరచించాడు.శ్రీహరి గురించి ప్రముఖంగా ప్రస్తావన ఉంటుంది.ఇది చదివినా,విన్నా చాలా మంచిది. భాగవతము స్కంధాలుగా విభజించ బడింది.ఇందులో పన్నెండు స్కంధాలు ఉన్నాయి. విష్ణువు భగవంతుడు.అతని గురించి తెలియ చెప్పేదే భాగవతము.విష్ణువు సమస్తలోకాలనూ పాలిస్తాడు,పరిపాలిస్తాడు.అందరినీ రక్షించేదీ అతనే!అందరినీ పుట్టించేదీ,లాలించేదీ,చివరకు గట్టెక్కించేదీ అతనే!దుష్ట శిక్షణార్థం,శిష్ట రక్షణార్థం ప్రతి యుగంలో ఏదో ఒక రూపంలో ఆవిర్భవించేదీ అతనే!సామాన్యమైన మనకే కాదు,త్రిమూర్తులకు కూడా మూల కారణం అతడు.